ఉద్యమాల ఉనికిపట్టు ఉస్మానియా విశ్వవిద్యాలయం - ఎన్ వేణుగోపాల్
(సీనియర్ జర్నలిస్టు,వీక్షణం ఎడిటర్, రచయిత ఎన్.వేణుగోపాల్ రాసిన ఈ వ్యాసం ʹనడుస్తున్న తెలంగాణʹ మాసపత్రిక ఏప్రెల్ 2017 సంచికలో ప్రచురించబడినది)
ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని చివరి అసఫ్ జాహీ ప్రభువు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్ ప్రారంభించాడేమో, తన పేరే పెట్టుకున్నాడేమో గాని, అది ఎప్పుడూ రాజుల సంస్కృతిని ఔదలదాల్చినది కాదు. ఎల్లవేళలా సామాజిక చలనాలకు స్పందించిన విద్యార్థి ఉద్యమ కెరటాల మీదనే ఉస్మానియా వంద సంవత్సరాల జీవితం గడిచింది. ఆ అలలు అప్పుడప్పుడు తీవ్రంగా ఎగిసిపడి ఉండవచ్చు, అపుడప్పుడు మౌనంగా ఆటుపోట్లు సాగించి ఉండవచ్చు. కాని ఉస్మానియా సముద్రం సంచలన రహితంగా ఎప్పుడూ లేదు. వంద సంవత్సరాల ఉస్మానియా చరిత్రను సింహావలోకనం చేస్తే దాని ఆవిర్భావ వికాసాల పరిణామాలన్నీ సామాజిక సంచలనాల, విద్యావంతుల ఆలోచనల, విద్యార్థి ఉద్యమాల ఉధృతిలో సాగినవేనని అర్థమవుతుంది.
అసలు ఈ విశ్వవిద్యాలయాన్ని స్థాపించాలనే ఆలోచన 1915లో అక్బర్ హైదరీ అధ్యక్షుడుగా ఏర్పడిన హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ అనే ప్రజాసంస్థది. అయితే బ్రిటిష్ ప్రభుత్వ ఉన్నతోద్యోగిగా 1905లో నిజాం ప్రభుత్వ అకౌంటెంట్ జనరల్ గా వచ్చి, ఆ తర్వాత ఆర్థిక కార్యదర్శిగా, హోం కార్యదర్శిగా, పరిశ్రమల కార్యదర్శిగా ఎన్నో ఉన్నత పదవులు చేపట్టిన, బొంబాయికి చెందిన అక్బర్ హైదరీ ఈ సంస్థకు గౌరవాధ్యక్షుడే గాని, సంస్థ నిజంగా అప్పుడప్పుడే మేల్కొంటున్న హైదరాబాద్ సమాజానిది. అంతకు రెండుమూడు దశాబ్దాల ముందు నుంచి ప్రారంభమైన కళాశాల విద్యారంగంలో అప్పుడప్పుడే విద్యావంతులైన ఒక యువకుల బృందం ఈ సంస్థను స్థాపించి, నిర్వహించింది. దారుల్ ఉలూమ్ ఓరియెంటల్ కాలేజిలో చదువుకున్న మహమ్మద్ ముర్తుజా, టర్కిష్ సహాయ నిధితో ప్రఖ్యాతుడైన అబ్దుల్ బాసిత్, స్థానిక ఉర్దూ దినపత్రిక నిర్వాహకుడు మీర్ అక్బర్ అలీ, ప్రభుత్వ రెవెన్యూ శాఖలో తహసీల్దార్ గా పనిచేస్తుండిన మిర్జా మహమ్మద్ బేగ్ వంటి విద్యావంతుల బృందం 1915లో హైదరాబాదులో తొలి హైదరాబాద్ ఎడ్యుకేషనల్ కాన్ఫరెన్స్ నిర్వహించింది. రాజ్యమంతటా విద్యావ్యాప్తికి ప్రయత్నించడం, ప్రత్యేకంగా కళల్లో, విజ్ఞానశాస్త్రాలలో, సాంకేతిక పరిజ్ఞానంలో ఉర్దూ మాధ్యమంగా ఉన్నత విద్య సాధించడం, ఉర్దూలో ఉన్నత విద్య కోసం ఒక విశ్వవిద్యాలయం స్థాపించాలని ప్రభుత్వాన్ని కోరడం ఈ సంస్థ లక్ష్యాలు. ఈ సంస్థ సమావేశాలు వరుసగా 1916లో ఔరంగాబాద్ లో, 1917, 1918లలో హైదరాబాదులో, 1919లో లాతూరులో జరిగాయి. ఈ అన్ని సమావేశాల్లోనూ విశ్వవిద్యాలయం స్థాపించాలనీ, అవసరమైన, పేద విద్యార్థులకు ఉపకారవేతనాలు ఇవ్వాలనీ, శాస్త్రీయ విజ్ఞానాన్ని భారతీయ భాషలలో ప్రచురించాలనీ, విశ్వవిద్యాలయంలో ఇంగ్లిష్ ను ద్వితీయ భాషగా నేర్పాలనీ విజ్ఞప్తులు తయారుచేసి ఉస్మాన్ అలీ ఖాన్ కు సమర్పించారు. ఈ సామాజిక ఒత్తిడి మేరకే ప్రభుత్వం ఉస్మానియా విశ్వవిద్యాలయ స్థాపన ప్రయత్నాలు ప్రారంభించి, 1917 ఏప్రిల్ 26న ఫర్మాన్ విడుదల చేసింది. ఏర్పాటు చేయనున్న విశ్వవిద్యాలయానికి పాఠ్యాంశాలు రూపొందించడానికి 1917 నవంబర్ 4న ఒక ఉపసంఘాన్ని నియమించింది. 1918 మార్చ్ లో ఒక సాంకేతిక పదాల నిర్ణయ కమిటీని, ఒక అనువాద మండలిని నియమించింది. అలా రాజు తలచుకున్నదానికన్న ఎక్కువగా ఒక ప్రజా బృందం కోరిక మీద, ఒత్తిడి మీద ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రారంభమయింది. అలా సమాజం కోరిక మీద ఏర్పడి, సమాజంతో ఆ అవిభాజ్యమైన సంబంధాన్ని వంద సంవత్సరాలుగా నిరంతరాయంగా కొనసాగించడమే ఉస్మానియా విశ్వవిద్యాలయ విశిష్టత.
ఆ సంబంధం మొదట ఆనాటి సమాజపు ఉన్నతవర్గీయులతో, ప్రభువంశీకులతో, విద్యావంతులతో, పాలకుల భాషతో మాత్రమే కావచ్చుగాని, క్రమంగా అది ఇతర వర్గాలకూ, భాషలకూ విస్తరించింది. బహుశా ఉస్మానియా విశ్వవిద్యాలయపు తొలి దశకం ముగిసే సమయానికి దానికి ఒక విశాలమైన ప్రాంగణం, తగినన్ని భవనాలతో మౌలిక సౌకర్యాలు కావలసిన అవసరం తెలిసి వచ్చింది. అలా ఉస్మానియా ప్రస్తుత ఆవరణకు చేరడం కూడ ఒక సామాజిక పరిణామమే. పందొమ్మిదో శతాబ్దపు హైదరాబాద్ రాజ్యంలో కవి, వేశ్య, రెండో, మూడో నిజాంల ఆస్థానంలో సంగీత, సాహిత్య, నృత్య విదుషీమణి, సైనిక, రాజకీయ రంగాలలోను ప్రముఖురాలు మహ్లఖా బాయి చందా ఎన్నో జాగీర్లు సంపాదించింది. తన అనంతరం తన ఆస్తిని నిస్సహాయ స్త్రీల సహాయార్థం ఉపయోగించాలని వీలునామా రాసి 1824లో మరణించింది. ఆమెకు చెందిన అడిక్ మెట్ ఆస్తి లోనుంచి రెండున్నరవేల ఎకరాలు తీసుకుని 1928లో ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఇచ్చాడు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. అలా వేశ్యగా పేరు పొందిన స్త్రీకి చెందిన భూమి మీద, నిస్సహాయ స్త్రీలకు హక్కు ఉన్న భూమి మీద ఉస్మానియా విశ్వవిద్యాలయానికి శాశ్వత స్థావరం దొరికింది. యూరప్, అమెరికా, జపాన్, టర్కీ, ఈజిప్ట్ లలో విశ్వవిద్యాలయ భవనాలనూ, అజంతా-ఎల్లోరా గుహలతో సహా భారత ఉపఖండపు నిర్మాణాలనూ పరిశీలించిన బెల్జియన్ భవన నిర్మాణ శిల్పి జాస్పర్ విశ్వవిద్యాలయ భవనాల రూపకల్పన చేశాడు. మొఘల్, హిందూ, బౌద్ధ, యూరపియన్ నిర్మాణ శైలుల మేలు కలయికగా, నవాబ్ జైన్ యార్ జంగ్ నిర్వహణలో నిర్మించిన ఈ భవనాలు, ప్రధానంగా ఆర్ట్స్ కాలేజి భవనం తెలంగాణ వడ్డెరల నెత్తుటితో చెమటతో రూపొంది, 1939కల్లా పూర్తయ్యాయి. అలా ఉస్మానియా నిర్మాణానికి రాళ్లెత్తిన కూలీలలో, ఆకృతిని ఊహించిన రూపకర్తలలో దేశదేశాల కళానైపుణ్యం కలగలిసింది. ఆర్ట్స్ కాలేజి భవనం నిర్మిస్తూ ఆ వడ్డెరలు పొరుగున నిర్మించుకున్న గుడిసెలు వడ్డెర బస్తీగా, మాణికేశ్వరీ నగర్ గా 1940ల నుంచీ ఇవాళ్టిదాకా ఉస్మానియా విద్యార్థులకు ఆశ్రయమూ ఇస్తున్నాయి, విద్యార్థుల సామాజిక అవగాహనకూ చైతన్యానికీ ప్రశ్నలూ సంధిస్తున్నాయి, పదునూ పెడుతున్నాయి.
ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రస్తుత ఆవరణలోకి రాకముందే కనీసం రెండు విద్యార్థి సంచలనాలకు వేదిక అయింది. అది అప్పటి మొత్తం భారత ఉపఖండంలోనే ఒక భారతీయ భాష బోధనా మాధ్యమంగా ఉన్న ఏకైక విశ్వవిద్యాలయం కావడం, దక్షిణ భారతంలోని మూడు విశ్వవిద్యాలయాల్లో ఒకటి కావడం దాని ప్రాధాన్యతకు పునాది కాగా, ఎన్నో రాజకీయ, ఆర్థిక, సామాజిక సంచలనాలకు భూమిక అయిన హైదరాబాద్ రాజ్యపు ఇరవయో శతాబ్ది తొలి అర్ధభాగపు వాతావరణం దాని చైతన్యానికీ, ఆందోళనాచరణలకూ ప్రేరణనిచ్చింది. ఉస్మానియా పుట్టుకే స్థానిక వనరుల మీద, విద్యా, ఉద్యోగావకాశాల మీద స్థానికేతర శక్తుల ఆధిపత్యం ఉండగూడదనే ఆందోళనతో, ఆ ఆందోళనకు స్పందనగా నిజాం ప్రభుత్వం వెలువరించిన ముల్కీ నిబంధనలతో (1919) కలగలిసి సాగింది. ఆ ముల్కీ నిబంధనలు కూడ సక్రమంగా అమలు కావడం లేదని, స్థానికేతర అధికారులు, ఉన్నతోద్యోగులు ముల్కీ నిబంధనలను ఉల్లంఘిస్తున్నారని, పంజాబ్, యునైటెడ్ ప్రావిన్సెస్ ల నుంచి వచ్చినవారినే ఉద్యోగాలలో నింపుతున్నారని అసంతృప్తులతో 1935లో హైదరాబాద్ ఫర్ హైదరాబాదీస్ అనే ఉద్యమం ప్రారంభమయింది. ముఖ్యంగా హైదరాబాద్ రాజ్య ప్రభుత్వోద్యోగాలలో పంజాబ్, అలీఘడ్ ముస్లిం విశ్వవిద్యాలయ పట్టభద్రులకు ఉద్యోగాలు ఇస్తూ, ఉస్మానియా పట్టభద్రులను నిర్లక్ష్యం చేయడానికి వ్యతిరేకంగా ఈ ఉద్యమం ప్రారంభమైంది. అసలు ఈ ఉద్యమాన్ని నడిపిన హైదరాబాద్ సబ్జెక్ట్స్ లీగ్ అనే సంస్థ నిజాం రాష్ట్రంలో కుల మత సామరస్యం సాధించడ కోసం, ప్రాథమిక హక్కులు, బాధ్యతాయుత ప్రభుత్వం ఇవ్వాలని పాలకుడిని కోరడం కోసం ఏర్పడింది.
అప్పటిదాకా ఉద్యోగాల కోసం, స్థానికత కోసం, ఒకరకంగా ఆర్థిక, సాంస్కృతిక నినాదాలతో ఉద్యమించిన ఉస్మానియా, కొత్త భవనాలలో ప్రవేశించాక 1938లో నేరుగా రాజకీయ ఆకాంక్షల ఉద్యమాల యుగంలోకి ప్రవేశించింది. ఆ సంవత్సరమే హైదరాబాద్ లో తొట్టతొలి రాజకీయ సంస్థగా స్టేట్ కాంగ్రెస్ ఆవిర్భావ ప్రయత్నాలు, అప్పటికి ఎనిమిది సంవత్సరాలుగా పనిచేస్తున్న సాంఘిక సంస్థ ఆంధ్ర మహాసభ క్రమంగా రాజకీయాలలోకి ప్రవేశించక తప్పని స్థితి, ప్రభుత్వం కూడ అంగీకరించక తప్పని రాజ్యాంగ సంస్కరణలు వంటి ఉద్వేగభరిత వాతావరణంలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రత్యక్ష రాజకీయ కార్యాచరణలోకి దిగింది. అప్పటివరకూ విద్యార్థులందరూ తప్పనిసరిగా చదవవలసిన, నిజాంను కీర్తించే ప్రార్థనా గీతం ʹతా అబద్ ఖాలిఖే ఆలంʹ బదులు ఉస్మానియా విశ్వవిద్యాలయ హాస్టళ్ల విద్యార్థులు ʹవందేమాతరంʹ గీతం పాడాలని నిర్ణయించుకున్నారు. (స్థలకాలాల పరిమితులను గుర్తించకుండా, వందేమాతరం గీతం పాడడం అభివృద్ధి నిరోధకమని ఇవాళ అనుకోవచ్చు గాని, 1930ల హైదరాబాద్ రాజ్యంలో రాజ్య ధిక్కార వ్యక్తీకరణల్లో అది ఒకటి). ఆ గీతం పాడగూడదని అధికారులు అడ్డుకోవడం, విద్యార్థులు నిరసన తెల్పడం కొంతకాలం సాగిన తర్వాత, చివరికి 1938 నవంబర్ 28న విశ్వవిద్యాలయ అధికారులు వందేమాతరం ఆలపించగూడదని ఉత్తర్వులు జారీచేశారు. విద్యార్థులు ఈ ఉత్తర్వులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, తమ ఇష్టం వచ్చిన ప్రార్థనా గీతం పాడుకునే హక్కు తమకు ఉందనీ, ఏదో ఒకటే పాడమని నిర్బంధించగూడదనీ వాదించారు. ఇదివరకు పాడినందుకు క్షమాపణలు కోరకపోతే, పాడినవారందరినీ హాస్టళ్లనుంచి బహిష్కరిస్తామనీ, హాస్టల్ బకాయిలు వెంటనే చెల్లించి ఖాళీ చేయాలనీ ప్రొవైస్ చాన్సలర్ అన్నాడు. క్రమశిక్షణా రాహిత్యాన్ని అంగీకరించబోమనీ, విద్యార్థులు బుద్ధిగా ఉండకపోతే కఠినమైన చర్యలు తీసుకుంటామనీ స్వయంగా ప్రభుత్వం ఫర్మానా జారీ చేసింది. విద్యార్థులకూ ప్రభుత్వ రాజ్యాంగ వ్యవహారాల కార్యదర్శికీ చర్చలు జరిగాయి. కార్యదర్శి ప్రభుత్వానికి కొన్ని మధ్యేమార్గ సూచనలు చేశాడు. కాని నిజాం ఆ రాజీ సూచనలను కూడ కొట్టివేశాడు. దానితో హాస్టళ్ల విద్యార్థులకు సంఘీభావంగా విశ్వవిద్యాలయ విద్యార్థులందరూ కూడ సమ్మెకు దిగారు. నగరంలోని ఇతర కళాశాలలూ, క్రమంగా రాజ్యంలోని అన్ని కళాశాలలూ, పాఠశాలలూ కూడ సమ్మెలో పాల్గొన్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులకు వ్యతిరేకంగా ఆ ఆందోళన రాష్ట్రవ్యాపిత విద్యార్థి మహా ఉద్యమంగా విస్తరించింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి 350 మందిని, గుల్బర్గా కాలేజి నుంచి. పాఠశాలల నుంచి 200 మందిని, ఔరంగాబాద్, వరంగల్ కాలేజిల నుంచి, పాఠశాలల నుంచి 500 మందిని బహిష్కరించారు. వారిలో చాలమందిని నాగపూర్, జబల్పూర్ కళాశాలు పిలిచి చేర్చుకున్నాయి. చివరికి ఉస్మానియా విశ్వవిద్యాలయ అధికారులు విద్యార్థుల కోరికను అంగీకరించి, వందేమాతరం గీతం మీద నిషేధాన్ని ఎత్తివేసి, విద్యార్థులను వెనక్కి తీసుకోక తప్పలేదు.
ఈ సందర్భంగానే హైదరాబాద్ రాష్ట్రంలోకి ప్రవేశించిన కమ్యూనిస్టు భావాల వ్యాప్తిలో, హైదరాబాద్ రాజ్యంలో తొట్టతొలి కమ్యూనిస్టు సంస్థ అయిన కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపనలో కూడ ఉస్మానియా విద్యార్థుల పాత్ర ఎంతో ఉంది. ఆ తర్వాతి దశకంలో గుణాత్మక దశకు ఎదిగిన ఆంధ్ర మహాసభలో, తెలంగాణ రైతాంగ సాయుధపోరాటంలో ఉస్మానియా విద్యార్థులెందరో పాల్గొన్నారు. ఉస్మానియా విద్యార్థులలో కొందరు చదువులు వదిలేసి సాయుధ దళాల్లో, సాంకేతిక సేవలు అందించడంలో నిమగ్నమయ్యారు. సాయుధపోరాటం రోజుల్లోనే ఏర్పడిన ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఉస్మానియాలో బలమైన సంస్థగా ఉండింది.
సాయుధపోరాటం మీద తీవ్రమైన నిర్బంధం, బ్రిటిష్ ఇండియాలో అధికార మార్పిడి, హైదరాబాద్ రాజ్యంపై సైనిక చర్య, హైదరాబాద్ రాజ్యాన్ని భారత యూనియన్ లో విలీనం చేసుకోవడం, 1952 దాకా సైనిక పాలన, పౌర అధికారుల పాలన ముగిసి, 1952లో హైదరాబాద్ లో మొదటి ఎన్నికైన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఉస్మానియా విశ్వవిద్యాలయాన్ని హిందీ విశ్వవిద్యాలయంగా మార్చడానికి నెహ్రూ ప్రభుత్వం ప్రయత్నాలు ప్రారంభించింది. హైదరాబాద్ పౌర సమాజమూ ఉస్మానియా అధ్యాపక, విద్యార్థి లోకమూ ఈ ప్రయత్నాలను తీవ్రంగా ప్రతిఘటించడంతో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గక తప్పలేదు.
సైనిక, పౌర పాలనల సమయంలో పాత నిజాం ప్రభుత్వ అధికారులను, ఉద్యోగులను తొలగించడమనే పేరుతో ఇతర ప్రాంతాలవారిని, ముఖ్యంగా మద్రాసు రాష్ట్ర అధికారులను, ఉద్యోగులను హైదరాబాద్ రాజ్యంలో నింపడంతో మళ్లీ ఒకసారి 1952లో ముల్కీ ఉద్యమం చెలరేగింది. అప్పుడు కూడ ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులే ఆ ఉద్యమానికి నాయకత్వం వహించారు. హైదరాబాద్ రాష్ట్ర ముఖ్యమంత్రి వాహనాన్ని తగులబెట్టడం వంటి క్రియాశీల చర్యలనూ, 1947 తర్వాతి భారతదేశంలో విద్యార్థుల మీద తొలి పోలీసు కాల్పులలో ఐదుగురు విద్యార్థుల మరణాన్నీ చూసింది ఉస్మానియా విశ్వవిద్యాలయం.
ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 1950 దశకంలో ప్రారంభమైన ఈ విద్యార్థి ఉద్యమాల ధార ఆ తర్వాత ప్రతి దశాబ్దంలోనూ కనీసం ఒక ఉధృతమైన వెల్లువను చూసింది. ఆ ఆరు దశాబ్దాల ఉస్మానియా విద్యార్థి ఉద్యమ చరిత్ర దానికదే ప్రత్యేకంగా రాయదగినంత విశిష్టమైనది. ఒక వ్యాసంలో వివరించడానికి వీలు లేనంత విస్తారమైనది.
అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానంద రెడ్డికి అప్పటి ఉస్మానియా వైస్ చాన్సలర్ ప్రొ. డి ఎస్ రెడ్డితో 1966లో అభిప్రాయభేదాలు వచ్చాయి. దానితో ప్రభుత్వం హఠాత్తుగా చట్ట నిబంధనలు మార్చి, వైస్ చాన్సలర్ పదవీకాలాన్ని తగ్గించి, సెనేట్ లో ప్రొఫెసర్ల ప్రాతినిధ్యాన్ని రద్దుచేసి ప్రొ. డి ఎస్ రెడ్డిని తొలగించింది. ఆ స్థానంలో గుంటూరు మెడికల్ కాలేజి ప్రిన్సిపల్ డా. పి నరసింహారావును వైస్ చాన్సలర్ గా నియమించింది. ఒకవైపు విశ్వవిద్యాలయ వ్యవహారాలలో రాజకీయ జోక్యాన్ని నిరసిస్తూ, చట్టం మార్పులను సవాలు చేస్తూ, విశ్వవిద్యాలయ స్వతంత్ర ప్రతిపత్తిని పరిరక్షించాలని కోరుతూ ప్రొ. డి ఎస్ రెడ్డి న్యాయస్థానానికి వెళ్లారు. రాష్ట్ర హైకోర్టు ఆయన వాదనలను కొట్టేసింది గాని సుప్రీం కోర్టు ఆయన వాదనలను అంగీకరించి, నరసింహా రావు నియామకాన్ని రద్దు చేసింది. ఈ న్యాయ పోరాటం కన్న మిన్నగా విద్యార్థులూ, అధ్యాపకులూ విశ్వవిద్యాలయంలో రాజకీయ జోక్యాన్ని ప్రతిఘటించడానికి చేసిన పోరాటం విలువైనది, వీరోచితమైనది. ప్రభుత్వం నియమించిన వైస్ చాన్సలర్ ను విద్యార్థులు క్యాంపస్ లోకి అడుగు పెట్టనివ్వలేదు. చివరికి ఆయన పదవీ స్వీకార కార్యక్రమం రాజ్ భవన్ లో ఏర్పాటు చేస్తే, ఆ కాగితాలు తీసుకువెళ్లవలసిన రిజిస్ట్రార్ ను అక్కడికి వెళ్లకుండా విద్యార్థులు అడ్డుకున్నారు. కొత్త నియామకాన్ని వ్యతిరేకిస్తూ సెనేట్ ఏకగ్రీవంగా తీర్మానించింది. ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా) ʹఉపాధ్యాయుల అభిమతానికి వ్యతిరేకంగా జరిగిన వైస్ చాన్సలర్ నియామకాన్ని ఉపాధ్యాయులు గుర్తించడం లేదుʹ అని తీర్మానించింది. ప్రొఫెసర్ల కార్యాచరణ సమితి అంతర్ విశ్వవిద్యాలయ బోర్డు చైర్మన్ ను కలిసి తమ వాదనలు వినిపించింది. చిట్టచివరికి, రాష్ట్ర ప్రభుత్వం నియమించిన, రాజ్ భవన్ లో గంటలకొద్దీ వేచి చూసిన డా. పి నరసింహా రావు ఉస్మానియా విశ్వవిద్యాలయ వైస్ చాన్సలర్ పదవి చేపట్టకుండానే వెనక్కి తిరిగిపోవలసి వచ్చింది. ఆనాటి ఘటనల గురించి ఆంధ్రపత్రిక 1966 అక్టోబర్ 20 సంచిక ʹఉస్మానియా వివాదంలో కొత్త ఘట్టం: రాజధానిలో అల్లర్లు, పలు చోట్ల బస్సులపై రాళ్లు, విద్యుద్దీపాల విచ్ఛిత్తి, అధికారులచే ఆర్ టి సి బస్సుల ఉపసంహరణʹ అని పతాక శీర్షిక పెట్టింది.
నిజానికి ఈ ఆందోళన విద్యార్థిలోకంలో రాజుకుంటున్న మరింత లోతైన అసంతృప్తికి సూచిక. ఆ మహా అసంతృప్తి మరి రెండు సంవత్సరాలలో జై తెలంగాణ ఉద్యమంగా మారింది. కొత్తగూడెంలో నిరాహార దీక్ష ప్రారంభమైన రెండు వారాల లోపే ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి కార్యాచరణ సమితి ఏర్పడింది. అప్పటి నుంచి దాదాపు ఏడాది పాటు సాగిన ఉద్యమానికి, ఆ తర్వాత 1973లో జరిగిన ఉద్యమానికి కూడ ఆనాటి తెలంగాణలో ఉండిన ఏకైక విశ్వవిద్యాలయంగా ఉస్మానియా విశ్వవిద్యాలయమే నాయకత్వాన్ని అందించింది. ఒక విద్యాసంవత్సరం నష్టపోయినా సరే, ప్రతి ఉస్మానియా విద్యార్థీ శక్తిమేరకు పాల్గొన్న ఉద్యమం అది. రహదారుల మీద బారికేడ్లు నిర్మించి, మాల్టవ్ కాక్ టెయిల్స్ విసిరి, ప్రభుత్వాన్ని స్తంభింపజేసి, ప్రాంతేతరుల రాజకీయార్థిక ప్రయోజనాల మీద, ఆస్తుల మీద దాడులు చేసి సమరశీల పోరాట రూపాలను చేపట్టిన ఉద్యమం అది. మూడువందల డెబ్బైమంది విద్యార్థి యువజనులు పోలీసు కాల్పుల్లో ప్రాణాలు అర్పించిన వీరోచితమైన ఉద్యమం అది.
మొదటి దశ జై తెలంగాణ ఉద్యమం, నక్సల్బరీ శ్రీకాకుళ విప్లవోద్యమాల ప్రభావం ఉస్మానియాను ఏకకాలంలో ముంచెత్తాయి. తెలంగాణ ప్రజాసమితి విద్రోహం వల్ల జైతెలంగాణ ఉద్యమం అపజయం పాలైనప్పుడు విప్లవోద్యమమే మిగిలిన పరిష్కారమనే ఆలోచన విద్యార్థులలో పెరిగింది. ఆ ఆలోచనల ఫలితమే ఉస్మానియాలో విస్తరించిన ప్రగతిశీల విద్యార్థి ఉద్యమం. అప్పటికి సంఘపరివారానికి పట్టు ఉన్న విశ్వవిద్యాలయంలోకి ప్రగతిశీల శక్తులు రాగూడదని, ఆ ఉద్యమం మొగ్గగా ఉండగానే చిదిమివెయ్యాలని సంఘ్ పరివార్ కుట్రలు ప్రారంభించింది. 1972 జూలై 14న ఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రాంగణంలోనే జార్జిరెడ్డిని హత్య చేసి, హత్యా రాజకీయాలు ప్రారంభించింది. ʹనీ చిందిన నెత్తురులో ప్రళాయాగ్నులు ప్రజ్వరిల్లుʹ అన్నట్టుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ప్రగతిశీల ఆలోచనలను రద్దు చేయడానికి, భయపెట్టడానికి సంఘ్ పరివార్ నెత్తురు చిందిస్తే, విద్యార్థి ఉద్యమ ప్రళయాగ్నులు ప్రజ్వరిల్లాయి.
1974లో ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, రాడికల్ విద్యార్థి సంఘం ఏర్పడినప్పుడు ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులే ప్రధాన పాత్ర వహించారు. అతి త్వరలోనే ఎమర్జెన్సీ విధించబడి, విద్యార్థి ఉద్యమకారుల మీద తీవ్ర నిర్బంధం అమలయినప్పుడు, ఉస్మానియా విశ్వవిద్యాలయపు రాడికల్ విద్యార్థులే గ్రామీణ ప్రాంతాల అధ్యయనానికీ, జన సమీకరణకూ పూనుకున్నారు. ఎమర్జెన్సీ అనంతర ప్రజావెల్లువలో రాడికల్ విద్యార్థి సంఘం ఇచ్చిన చరిత్రాత్మక గ్రామాలకు తరలండి పిలుపులోనూ అతి ఎక్కువగా పాల్గొన్నది ఉస్మానియా విద్యార్థులే (అప్పటికి తెలంగాణలో ఉస్మానియా కాక అదనంగా మరొక విశ్వవిద్యాలయం – కాకతీయ మాత్రమే ఏర్పడి ఉంది). రమీజా బీ పై పోలీసుల అత్యాచారానికి నిరసనగా రాష్ట్రం ఆగ్రహం ప్రకటించినప్పుడు కొన్ని వారాల పాటు ఉద్యమాన్ని నిర్వహించినది ఉస్మానియా విద్యార్థులే. ʹ గ్రామాలకు తరలండిʹ కార్యక్రమ ఫలితంగా ఎన్నో ప్రజాసంఘాలు ఏర్పడి, అవన్నీ విద్యార్థి సంఘాలతో సమన్వయంలో ఉండడంతో దాదాపు ఏడెనిమిది సంవత్సరాలు ఉస్మానియా విశ్వవిద్యాలయం విద్యార్థి ఉదద్యమాల వేదికగా, సామాజిక ఉద్యమాల సంఘీభావ వేదికగా ఎదిగింది. 1980ల తర్వాత రాష్ట్రంలో అన్ని విప్లవ పార్టీల నాయకత్వాలలోనూ గణనీయమైన సంఖ్యలో ఉస్మానియా విద్యార్థులున్నారు.
ʹఆట పాట మాట బంద్ʹ అని ఎన్ టి రామారావు ప్రభుత్వం ప్రజా కార్యక్రమాల మీద అప్రకటిత నిషేధం విధించిన తర్వాత, 1989లో విద్యార్థి సంఘాల ఎన్నికల మీద నిషేధం విధించిన తర్వాత, 1992లో రాడికల్ విద్యార్థి సంఘాన్ని నిషేధించిన తర్వాత ఉస్మానియాలో విద్యార్థి ఉద్యమాల ప్రభావం గణనీయంగా తగ్గింది. కొన్ని పార్లమెంటరీ వామపక్షాలకూ, విప్లవ పార్టీలకూ చెందిన విద్యార్థి సంఘాలు ఉనికిలో ఉండినప్పటికీ విద్యార్థి సంఘాల ఎన్నికలు రద్దు కావడంతో ఉస్మానియాలో కూడ విద్యార్థి ఉద్యమం ఉండవలసిన స్థాయిలో లేకుండా పోయింది. ఉస్మానియాలో విద్యార్థి ఉద్యమాల వాతావరణం అదృశ్యమయిందనీ, మళ్లీ అటువంటి వాతావరణం రాదనీ, విద్యార్థులు సమాజం గురించి ఆలోచించకుండా తమ సొంత భవిష్యత్తును మాత్రమే చూసుకునే కెరీరిజంలో పడిపోయారనీ వ్యాఖ్యాతలు అనడం ప్రారంభించారు. ఉస్మానియాకు ఉండిన ఉజ్వలమైన విద్యార్థి ఉద్యమాల చరిత్ర ముగింపుకు వచ్చినట్టుగా భావించడం ఒక ఆనవాయితీ అయింది.
కాని ఆ స్తబ్దత ఐదారేళ్లు కూడ కాకుండానే బద్దలయింది. 1995-96 నాటికి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలగాణకు జరిగిన అన్యాయం గురించి ఉస్మానియా విద్యార్థులు ఆలోచించడం ప్రారంభించారు. మళ్లీ ఒకసారి 1980ల తొలిరోజుల ఉద్వేగభరిత, విద్యార్థి ఉద్యమ వాతావరణం ఉస్మానియా క్యాంపస్ లో ప్రవేశించింది. సభలు, సమావేశాలు, చర్చలు, నిరసనలు, ప్రశ్నలు ఉస్మానియాలో మళ్లీ ఒకసారి ప్రతిధ్వనించాయి. ఆ విద్యార్థి చైతన్యాన్ని మొద్దుబార్చడానికి పాలకవర్గాలు ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, విద్యార్థులను చీల్చడానికి ప్రయత్నించినప్పటికీ గత ఇరవై సంవత్సరాలుగా ఉస్మానియా మళ్లీ ఆరని జ్వాలగా ఉన్నది. 1996 నుంచీ అటు తెలంగాణ ఆకాంక్షలోను, ఇటు విప్లవ విద్యార్థి ఉద్యమంలోను, 2009-2014 ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలోను ఉస్మానియా విశ్వవిద్యాలయం తన అద్భుతమైన చారిత్రక వారసత్వానికి ఘనమైన వారసురాలిగా కొనసాగుతున్నది.
-ఎన్.వేణుగోపాల్, సీనియర్ జర్నలిస్టు, వీక్షణం ఎడిటర్, రచయిత
(నడుస్తున్న తెలంగాణ మాసపత్రిక ఏప్రెల్ 2017 సంచికలో ప్రచురించబడినది)
Keywords : osmania university, student movement, rss, abvp, pdsu, rsu
(2024-03-22 06:43:10)
No. of visitors : 2447
Suggested Posts
0 results