ఒక పద్మ తల్లి - వరవరరావు

ఒక

పద్మ తల్లి చనిపోయింది. ఏప్రిల్‌ 29 ఉదయం బాత్‌రూంలోకి వెళ్లి పడిపోయింది. ఏమైందో తెలియదు. మెదడులో నరాలు చిట్లి చనిపోయినట్లు ఆ తరువాత వైద్యుడు చెప్పాడు. అప్పటికామె వారం రోజులుగా నలతగా ఉన్నదని, ఇంక తన పని అయిపోయిందని అంటూ ఉండేదని ఆమె కూతుళ్లు చెప్పారు. పెద్ద కూతురు బాత్‌రూం నుంచి బయటికి తెచ్చి పనిమీద వెళ్లి వచ్చి చాయ్‌ ఇచ్చే వరకే చాయ్‌ నోట్లోకి వెళ్లలేదు. నాలుక బయటికి వచ్చింది.

నలభై ఏళ్లు ఏడుగురు సంతానానికి సేవలు చేసి ఎవరితో చేయించుకోకుండా వెళ్లిపోయింది. యాభై ఏళ్ల నుంచి మానసికంగా ఎదగని కూతురును దగ్గర పెట్టుకొని ఆమె కోసమే ఒక గది, తనదైన ఒక సంసారం ఏర్పాటు చేసుకొని హైదరాబాద్‌లో ఎక్కడో మారుమూలలో ఉంటున్నది. ఆ కూతురును చంటిపాపలా చూసుకుంటున్నది. నిజానికి ఆమెను చంటిపాపలా చూసుకొనే మానసిక వయసు.

పద్మ కోసం ఆమె పదేళ్ల నిరీక్షణ ముగిసింది. బహుశా శనివారం ఏప్రిల్‌ 29 నుంచే ఆమె మట్టిపొరల్లో శాశ్వతంగా నిద్రపోతుంటుంది. ఈ పదేళ్లూ ఎప్పుడూ కంటి మీద కునుకు లేకుండా ఆ కూతురు కోసం నిరీక్షణ.

జీవితంతో నలభై ఏళ్ల పోరు కూడా ముగిసింది. ముగ్గురు ఆడపిల్లలు, నలుగురు మగపిల్లలు కలిగాక చివరి పాప పుట్టిన ఏడాదికి భర్త చనిపోయాడు. అప్పటికి రెక్కల కష్టం మీద బతికిన వాళ్లే. రెండే రెక్కలు మిగిలాయి. అందులోను రెండు ఆడరెక్కలకు పనుల విషయంలో పరిమితులుంటాయి. అప్పడాలు చేసి, అప్పాలు చేసి ఇంటింటికీ తిరిగి అమ్మి పొట్టపోసుకున్నది. తన ఒక్కర్తి పొట్ట మాత్రమే కాదు. ఎనిమిది మందివి. ఆ ఊళ్లో ఉపాధ్యాయులు ఆమె స్వాభిమానాన్ని చూసి ఆమె దగ్గరే ఇటువంటి అవసరాలు కొనేవాళ్లు. పిల్లలకు చదువు ఈడు వచ్చాక వాళ్లే సహాయం చేసారు. ముఖ్యంగా పెద్దవానికి విద్యాబుద్ధులు వచ్చాయి. కాని వాళ్లకు రెక్కలొచ్చాయి. వాళ్లంతా ఎగిరి హైదరాబాద్‌ వచ్చారు.

హైదరాబాద్‌లో 1990ల ఆరంభంలో ఆమె మూడో కూతురు పద్మకు విప్లవ రాజకీయాలు అబ్బాయి. చైతన్య మహిళా సంఘంలో తొలి నాయకత్వంలో ఆమె ఉన్నారు. వాళ్లు హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతి పోరాటంలో ఆమె ఉన్నది. ఎంతో మెత్తటి స్వభావం. ఎంతో కలివిడి స్వభావం. పద్మ తల్లి చనిపోయిందని తెలిసి పద్మ స్నేహితులు హైదరాబాద్‌లో అన్ని మూలల నుంచి వచ్చి అక్కడ ఆమె గది ముందు వాలారు. కొందరు చూసుకోగలిగారు. కొందరు చూసుకోలేకపోయారు. వాళ్లందరిలో ఆమె పద్మను చూసుకుంటున్నది. ఆ విషయం వాళ్లకు తెలుసు. అంతకన్నా వాళ్లు పద్మను తీసుకువచ్చి ఆమెకు చూపలేరు. వాళ్లలో పట్టణాలు, ఊళ్లు, రాష్ట్రాలు దాటి, వాగులు, వంకలు దాటి, అన్నిటికంటే మించి పారా మిలిటరీ క్యాంపులు దాటి జైలులో పద్మను చూసివచ్చి తమ కళ్లల్లో పద్మను చూపిన వాళ్లు ఉన్నారు. ఆమె ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎప్పుడో ఐదారేళ్ల కింద తాను వెళ్లి వచ్చి చూసిన ఆమె కళ్లల్లో తన సహచరిని చూసుకున్న వాళ్లు ఉన్నారు.

రెండు రోజుల క్రితమే ఏప్రిల్‌ 27న పద్మ తల్లి ఫోన్‌ చేసింది. ʹʹపద్మను ఈరోజు కోర్టుకు తీసుకు వచ్చారట. ఆమె లాయర్‌ ఫోన్‌ చేసి పద్మ విడుదలవుతుంది, ఎవరినైనా పంపించి తీసుకువెళ్లండిʹʹ అని. తన చిన్న కూతురు, మనమడు వెళ్తారని, ఎక్కడైనా తల తాకట్టు పెట్టయినా కారు ఏర్పాటు చేస్తానని, వెంట ఎవరైనా లాయరు వెళ్తారా అని అడిగింది. మాకు ఆశ్చర్యం అయింది.

మాకు ఎవరికీ తెలియని సమాచారం. ఇంకా రెండు కేసులున్నాయి. ఒక కేసులో వాదనలు ముగిసి మే 15న తీర్పు ఉంది. మరో కేసు ట్రయల్‌కు ఎంత సమయం పడుతుందో తెలియదు. కాకపోతే కొన్నాళ్లుగా జడ్జ్‌ బంధువులు వచ్చి బెయిల్‌ పెట్టి, జమానత్‌ పెట్టి బంధువులే తీసుకుపోతే బెయిల్‌ ఇస్తానని అంటున్నాడట. కొన్నేళ్ల క్రితం తల్లి తప్ప బంధువులు ఎవరూ ఆమెను చూడ్డానికి రాలేదని అతనికి తెలుసు. ఇటీవల కాలంలోనైతే ఆమె లాయర్లు కూడా ఆమెను చాలా అరుదుగా కలుస్తున్నారు.

అయితే ఇది కేవలం ఆమె కోరిక. హలూసినేషన్స్‌ అంటారే అటువంటిది. పైగా వారం రోజులుగా నలతగా ఉంటున్నదని అంటున్నారు కదా, అటువంటి పైత్య స్థితిలో ఒక పలవరింత, ఒక కలవరింత. పద్మ రాదు, రాలేదు. ఆ తల్లి ఇంక ఎదురు చూడలేక వెళ్లిపోయింది.

ఇది ఒక్క పద్మ విషయం కాదు. ఇది ఒక్క పద్మ తల్లి విషయం కాదు. దేశ వ్యాప్తంగా ఉన్న జైళ్లలో వేల, లక్షల సంఖ్యలో ఉన్న రాజకీయ ఖైదీల స్థితి. ముఖ్యంగా మహిళా ఖైదీల, ఆదివాసి ఖైదీల స్థితి. మాకు తెలిసిన పద్మలో, ఆమె తల్లిలో వీళ్లందరి గురించి ఊహించుకోవలసిందే తప్ప ఇది ఒక ప్రత్యేకమైన సమస్య కాదు.

ఈ పదేళ్లలో పద్మ రెండుసార్లు విడుదలైంది. పొరుగు రాష్ట్రం ఛత్తీస్‌ఘడ్‌ రాజధాని రాయ్‌పూర్‌ నగరంలో విడుదలై తీసుకువెళ్లడానికి వచ్చిన న్యాయవాది అసహాయంగా చూస్తూండగానే మళ్లీ పోలీసుల కిడ్నాప్‌కు గురైంది.

ఆ తరువాత మరో హైసెక్యూరిటీ జైలు జగదల్‌పూర్‌కు పంపబడింది. అక్కడ సుదీర్ఘ కాలపు విచారణ తరువాత కేసులన్నీ కొట్టేసి విడుదలవుతాననుకున్న రోజు. తెలంగాణ నుంచి ఇద్దరు న్యాయవాదులు వెళ్లారు. అక్కడ న్యాయవాదులు ఉన్నారు. కోర్టులో కేసు కొట్టేసి, విడుదల ఉత్తర్వులు ఇచ్చి అందుకోసం జైలుకు తిరిగి తీసుకువెళ్లే సమయానికి మరో రెండు కొత్త కేసుల్లో రెండు వారెంట్లు. ఆమె లోపలికి. కోర్టులో నోరు నొచ్చేలా వాదించిన న్యాయవాదులు అసహాయంగా బయటికి. ఈ తంతు నడుస్తూనే ఉంది. ఇది ఒక్క పద్మ విషయంలోనే కాదు. ఇది గోపన్నగా పిలుచుకునే నల్గొండకు చెందిన సత్తిరెడ్డి విషయంలోనూ జరిగింది.

ఈ ఇద్దరికన్నా దారుణమైంది నల్లా భిక్షపతి నిర్బంధం. ఈయన పదేళ్లుగా జార్ఖండ్‌లోని చైబాసా జైలులో మగ్గుతున్నాడు. ఎన్నో కేసులు. ఆయన, ఆయన సహచరి లక్ష్మి జార్ఖండ్‌లోనే ఎంతో కాలంగా విప్లవోద్యమంలో పనిచేస్తున్నారు. ఆమె ప్రసవానికి ఆస్పత్రిలో చేరినప్పుడు భిక్షపతి చూడడానికి వెళ్లి అరెస్టయ్యాడు. ఆమెనూ అరెస్టు చేశారు. కొన్నాళ్ల తరువాత ఆమెను విడుదల చేశారు. ఇంక జార్ఖండ్‌లో ఉంటే బతకడమే కష్టమని హైదరాబాద్‌ వచ్చి ఆమె కష్టం చేసుకొని బతుకుతున్నది. భర్తను చూడడానికి వెళ్లినా అరెస్టు చేస్తారని ఒకటి రెండు ప్రయత్నాల్లో అర్థమైపోయింది. అక్కడ ఒక్కొక్క కేసే కొట్టేయబడుతున్నది, విడుదలవుతున్నాడు. మళ్లీ అరెస్టవుతున్నాడు. అరెస్టయ్యాక చేసిన అన్ని నేరారోపణలు అబద్ధం అని రుజువయ్యాయి.

ఇంక అరెస్టు కేసు ఒక్కటే మిగిలింది. ఆస్పత్రిలో ప్రసవించిన భార్యను చూడడానికి వెళ్లాడని, ఆస్పత్రి వాళ్లు చెపుతారు కదా, కనుక అరెస్టు సందర్భంగా ఒక దాడి చేసో, ఒక హత్య చేసో, ఒక ఆయుధం తోటో దొరకలేదు కనుక విడుదలవుతాడని అందరూ ఆశించారు. అది జరగలేదు. ఏప్రిల్‌ 28న హజారీబాగ్‌ సెషన్స్‌ కోర్టు ఆయనకు యావజ్జీవ శిక్ష విధించింది. నలభై ఐదేళ్ల వయసు. జి.ఎన్‌. సాయిబాబా కన్నా బహుశా ఐదేళ్లు చిన్న. హేమ్‌ మిశ్రా వంటి యువ విద్యార్థి, భిక్షపతి వంటి వాళ్లు జీవితమంతా జైళ్లలోనే గడపాలి. నల్లా భిక్షపతి తెలంగాణ వరంగల్‌ జిల్లా తాటికాయల గ్రామం నుంచి చాలా చిన్న వయసులోనే విప్లవోద్యమంలోకి వచ్చిన మాదిగ యువకుడు. చిన్నతనంలోనే ఈ కుటుంబం వచ్చి అల్వాల్‌లో కష్టం చేసుకొని బతుకుతున్నారు. ఆ కుటుంబం నుంచే విద్యావంతులైన వాళ్లలో భిక్షపతి విప్లవ మార్గాన్ని ఎంచుకున్నాడు. సోదరుడు నల్లా రాధాకృష్ణ దళిత ఉద్యమంలో పనిచేస్తున్నాడు.

ఇవి మనకు తెలిసిన పేర్లు. ఈ తెలిసిన చీకటిలోని మసక వెలుగు నుంచి తెలియని గాఢాంధకారాన్ని పోల్చుకోవాలి. పోల్చుకొని ఏం ప్రయోజనం? ఆ చీకట్లను తొలగించగలగాలి. చీకట్లు తొలుగుతాయి. కాని ఇది ప్రకృతి నియమ సూత్రాల వలె ఒక నిర్దిష్ట కాలంలో వాటంతట అవి జరిగేవి కావు. మనం ఎన్నో చేతులు వేసి ఆ చీకట్లను పారదోలాలి.

ఇంతకూ ఈ పద్మ ఎవరు? నక్సల్బరీ రైతాంగ పోరాటం ప్రారంభమైన కాలం నుంచి పద్మ అనే పేరు వింటూనే ఉన్నాం. అది ఇవాళ ఒక సర్వనామం అయిపోయింది. ఆ పేరుతోటే విప్లవోద్యమంలోకి వెళ్లి అజ్ఞాతంలో వేరే పేర్లు పెట్టుకున్న వాళ్లున్నారు. విప్లవోద్యమంలోకి 80ల ఆరంభంలో వచ్చి లింగమూర్తితో పాటు రాయలసీమ ప్రాంతంలో విప్లవోద్యమ నిర్మాణం చేసిన పద్మ పేరు ఆమె అమరత్వం తరువాత అజ్ఞాతంలోకి వెళ్లిన ఎందరో మహిళలు పెట్టుకున్నారు. కనుక మనకు తల్లిదండ్రులు పేరు ఇచ్చిన పద్మలు, విప్లవం కన్నతల్లి ఇచ్చిన పద్మలు ఉన్నారు.

ఈ పద్మ తల్లి పెట్టిన పేరు. ఆమె ఎక్కువ కాలం బహిరంగ ప్రజా ఉద్యమాల్లోనే పనిచేసింది. హైదరాబాద్‌లో బస్తీల్లో గాని, విద్యార్థుల్లో గాని, హాస్టల్స్‌లో గాని ఆమె మహిళల్లో పనిచేసిన మేర తలలో నాలుకగా పనిచేసింది. తన మెత్తటి నవ్వుతో మృదువైన మాటలతో ఎందరి స్నేహాలనో పొందింది. ఎందరికో సేవలు చేసింది.

చంద్రబాబు నాయుడు 1995 ఆగస్ట్‌లో అధికారానికి వచ్చి సబ్సిడీలు రద్దు చేసినప్పుడు, సారా నిషేధం ఎత్తివేసినప్పుడు అన్ని ప్రజాసంఘాలకు నాయకత్వం వహించి పోరాడింది చైతన్య మహిళా సంఘమే. 2000లో వరదలు వచ్చినప్పుడు బస్తీల్లో ప్రజలకు సహకరించింది చైతన్య మహిళా సంఘమే. 1994 డిసెంబర్‌ నుంచి 1995 మార్చ్‌ వరకు జైలులో ఉన్న నక్సలైటు ఖైదీల, జీవిత ఖైదీల విడుదల కోసం చేసిన పోరాటానికి బయట వెల్లువెత్తిన సంఘీభావంలో చైతన్య మహిళా కెరటం కూడా ఉన్నది.

1999 సెప్టెంబర్‌లో ఈ జైలు పోరాటానికి నాయకత్వం వహించిన రాజకీయ ఖైదీ మోడెం బాలకృష్ణ విడుదలయ్యాడు. బహుశా 2000లో పద్మ బాలకృష్ణ సాహచర్యాన్ని ఎంచుకోవడమే ఆమె చేసిన పెద్ద నేరం అయింది. ఆ సహచర్యంలో ఆమె కొద్ది రోజులైనా గడిపిందో తెలియదు. అప్పటికామె విశాఖపట్నంలో మహిళా ఉద్యమంలో పనిచేస్తున్నది.

పదేళ్ల క్రితం భిలాయిలో ఒక సహచరితో పాటు ఆమె ఒక ఇంటి నుంచి బయటికి వెళ్లింది. తనను ఎందుకో విశాఖపట్నం నుంచే ఎపిఎస్‌ఐబి వాళ్లు వెంటాడుతున్నట్టు ఆమెకు అనుమానంగా ఉన్నది. ఆ ఉదయం మరింత స్పష్టమైంది. వెనుక తరుముతున్నట్లుగా వాళ్లు వస్తున్నారు. నయం, ఇంకా అప్పటికి పబ్లిక్‌ టెలిఫోన్‌ బూత్‌లు ఉన్నాయి. ఆమె బూత్‌లోకి దూరింది. ఆమె ప్రెసెన్స్‌ ఆఫ్‌ మైండ్‌ పనిచేసింది. ఆ బూత్‌ అద్దాల తలుపులు వేసుకొని అక్కడ నుంచే పియుసిఎల్‌ ఉపాధ్యక్షుడు రాజు సాయెల్‌కు, మీడియాకు ఫోన్‌లు చేసింది. అక్కడ్నించే తనకు తెలిసిన నంబర్లందరికీ, ఆంధ్రప్రదేశ్‌లో హక్కుల సంఘాల నాయకులకూ ఫోన్‌లు చేస్తూ ఉన్నది. కొన్ని మీడియా ఛానెల్స్‌ చేరుకునే దాకా ఆమె ఆ బూత్‌ నుంచి బయటికి రాలేదు. అట్లా ఆమె తన ప్రాణాలు కాపాడుకున్నది. పోలీసులకు ఆ కక్ష ఉన్నది.

ఇంతకూ ఈ పద్మ పదేళ్లుగా ఎదుర్కుంటున్న కేసులు తన మీదివి కావు. ఆమె రాయ్‌పూర్‌ జైలు నుంచి విడుదలైనప్పుడు మిగిలిన కేసులు చూసినప్పుడు అర్థమైంది ఏమిటంటే ఈమె మొదటి అరెస్టు కన్నా ఎంతో ముందే ఆదిలాబాద్‌ అడవుల్లో ఎన్‌కౌంటర్‌లో అమరురాలైన ఒక పద్మ మీద నమోదయి ఉన్న ఎఫ్‌ఐఆర్‌ను ఈ పద్మ మీద చూపుతున్నారు. వయస్సు, తల్లిదండ్రుల పేర్లు ఏవీ కుదరవు. కాని అడిగేవాళ్లు ఎవరు?

ఛత్తీస్‌ఘడ్‌లో ప్రాసిక్యూషన్‌ ఏది చెపితే అదే కోర్టు కూడా వింటుంది అనడానికి ఏడుగురు తెలంగాణ ప్రజాస్వామిక నాయకత్వం అరెస్టు, ఉన్నత న్యాయస్థానం దాకా బెయిల్‌ నిరాకరణ, మెజిస్ట్రేట్‌ హడావుడిగా ప్రారంభిస్తున్న నేరవిచారణతో మనకెంతో సన్నిహితంగా అర్థమవుతూనే ఉంది కదా.

మధ్యతరగతి నుంచో, దిగువ మధ్యతరగతి నుంచో కొంత చదువు, కొంత జీవించగలిగే స్థితి, సమాజంలో నలుగురిలో గుర్తింపు, ఒక చిరునామా ఉన్న ఇటువంటి వాళ్ల విషయంలోనే ఇవాళ రాజ్యం ఇంత అమానుషంగా ప్రవరిస్తున్నదంటే ఆదివాసులు, ముస్లింలు, దళితులు, మహిళలు, భూమిహీనులు, ఏ ఆస్తులు లేనివాళ్లు, రెక్కల కష్టం మాత్రమే మిగిలిన వాళ్లు, ఎందరో అభాగ్యులు ఈ దేశంలో ఎన్ని ఎన్‌కౌంటర్‌లకు గురవుతున్నారో? ఎన్ని అసహజ మరణాలకు గురవుతున్నారో? వేల లక్షల సంఖ్యలో జైళ్లలో ఎన్నాళ్లుగా మగ్గుతున్నారో? మన చుట్టూ ఉండే అనుభవాలే మనకు కొంత ఎరుకనైనా కలిగించడం లేదా?

రాస్తున్నంత సేపూ నా భయ సందేహాలు ఏమిటంటే చైతన్య మహిళా సంఘం పది మంది నాయకత్వాన్ని మావోయిస్టులని రుజువు చేయడానికి పోస్టర్లు వేసినట్లుగా ఇప్పుడు వాటికి పద్మ ఫొటో కూడా జోడిస్తారేమోనని!

అంతకన్నా తన కష్టాల నుంచి, నిరీక్షణ నుంచి విముక్తమైన ఆ తల్లి గురించి కాదు, థైరాయిడ్‌తో, అనారోగ్యంతో జైలే చిరునామాగా మారిన పద్మ గురించీ కాదు. ఆ తల్లి వదిలి వెళ్లిన ఆ మానసికంగా ఎదగని మధ్యవయస్కురాలైన కూతురు శేషజీవితానికి ఆలనా, పాలనా ఏమిటి?

తన చైతన్యంతో పద్మ ఒక జీవితాన్ని ఎంచుకున్నది. న్యాయమో అన్యాయమో ఈ దోపిడీ వ్యవస్థ వేసే సవాళ్లను, శిక్షలను ఆమె స్వీకరించాలి. స్వీకరిస్తుంది. ఆమె రాజకీయాలను, ఆమె విశ్వాసాలను ప్రేమించే వాళ్లు, గౌరవించే వాళ్లు ఆమెకు అండగా ఉన్నారు. ఉంటారని ఆశిద్దాం.

మరి ఆ తల్లి మరణానికి, ఆ అక్క జీవితానికి ఈ సమాజం బాధ్యత పడవద్దా?!

ఇంతకూ ఆ తల్లి పేరేమిటి?

నాకు తెలుసు, మనకు తెలుసు కనుక నేను పద్మ పేరు రాసాను కాని, జగదల్‌పూర్‌ జైలులో ఆమెను మావోయిస్టు ఖైదీ నెంబర్‌ పలానా అని చెపితే తప్ప జైలు అధికారులకు తెలియదు. వాళ్లు పిలువరు.

1084 మృతదేహం తల్లి పేరేమిటి?!

- వరవరరావు

Keywords : padma, maoists, jail, chattisgarh, arrest, mother death
(2024-03-23 19:55:12)



No. of visitors : 1714

Suggested Posts


కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్

నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ‌ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్.

ఆదివాసి.. లంబాడా వివాదం ‍- ఎం.రత్నమాల

మహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్‌ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి.....

మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావు

మన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే....

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు....

అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావు

గోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం....

ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతు

అట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు....

ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹ

అందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు.

కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామి

ఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది....

ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల‌

అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు.

ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం

తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన......

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


ఒక