నక్సల్బరీ రాజకీయాల్ని ఎత్తిపడదాం...విప్లవానికి ప్రత్యామ్నాయం లేదని చాటుదాం - గణపతి
(నక్సల్బరీ వసంత మేఘ గర్జనకు యాబై వసంతాలు. అశేష ప్రజానికాన్ని ప్రభావితం చేసిన ఓ చారిత్రక పోరాటం అర్థ శతాబ్ధపు మైలురాయిని చేరుకుంది. నక్సల్బరీ భారతదేశ చరిత్రలో ఒక టర్నింగ్ పాయింట్. ఒక మారుమూల పల్లెలో పెల్లుబికి దావాలా దేశమంతా వ్యాపించిన ఉద్యమం అది. ఎన్నో ఆటుపోట్ల నడుమ రాటుదేలుతూ ప్రపంచానికే కొత్త ఆశను అందిస్తున్న ఉద్యమం. నక్సల్బరీ 50వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారు విప్లవాభిమానులు. ఆయా దేశాల్లోని మావోయిస్టు పార్టీలు నక్సల్బరీ పోరాటాన్ని ఎత్తిపడుతూ సమావేశాలు నిర్వహించనున్నాయి. దేశంలోనూ వేరు వేరు ఎంల్ ఎల్ పార్టీలు నక్సల్బరీ వేడుకలు జరుపనున్నాయి. కాగా నక్సల్బరీ 50 వార్సికోత్సవంతో పాటు, చైనా సాంస్కృతిక విప్లవ 50వ వార్షికోత్సవాన్ని, బోల్షివిక్ విప్లవ శత వార్షికోత్సవాన్ని, మార్క్స్ కార్ల్ మార్క్స్ ద్వి శతాబ్ది జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని మావోయిస్టు కేంద్ర కమిటీ పిలుపునిచ్చింది. గత సంవత్సరం మార్చిలో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి గణపతి విడుదల చేసిన ప్రకటనలో ఈ నాలుగు ఉత్సవాలను విప్లవ స్ఫూర్తితో జరుపుకోవాలని పార్టీ శ్రేణులు, విప్లవాభిమానులు, ప్రజలకు పిలుపునిచ్చారు. గణపతి ప్రకటనలో ముఖ్యాంశాలు పాఠకుల కోసం.... )
___________________
మహత్తర సాంస్కృతిక విప్లవం మరియు చారిత్రాత్మక నక్సల్బరి సాయుధ తిరుగుబాటుకు చెందిన 50వ వార్షికోత్సవాలను, ప్రపంచాన్ని కుదిపివేసిన రష్యన్ సోషలిస్టు విప్లవ శతాబ్ది వార్షికోత్సవాలను, అంతర్జాతీయ కార్మిక వర్గ మార్క్సిస్టు మహోపాధ్యాయులు కార్ల్ మార్క్స్ ద్వి శతాబ్ది జయంతి ఉత్సవాలను గొప్ప విప్లవోత్సాహంతో, విప్లవ స్ఫూర్తితో నిర్వహించండి!
___________________
మహత్తర శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవం మావో, చైనా కమ్యూనిస్టు పార్టీల నాయకత్వంలో సోషలిస్టు చైనాలో ఎగిసిపడిన అపూర్వమైన విప్లవ ప్రజా ప్రభంజనం. అది సాంస్కృతిక ఉపరితలం లోని ప్రతియొక్క రంగాన్ని ఆ దేశపు సోషలిస్టు ఆర్థిక పునాదికి అనుగుణంగా మలచటానికి సకల బూర్జువా తదితర ప్రతిక్రియావాద సంస్కృతికి వ్యతిరేకంగా విశాల శ్రామిక జన బాహుళ్యాన్ని కదిలించింది. తిష్ట వేసుకుని కూర్చున్న పెట్టుబడిదారీ మార్గీయులపై అది తీవ్ర పోరాటం చేసింది. గ్రేట్ డిబేట్ కాలంలో జరిగిన రివిజనిస్టు వ్యతిరేక పోరాటానికి అది కొనసాగింపు. చైనా విప్లవ అభివృద్ధిలో అది ఒక నూతన దశ.సోషలిజాన్ని నిర్మించి, సుదృఢం గావించి పటిష్ఠపరచడం ద్వారా కమ్యూనిజానికి చేరుకునే మార్గంలో ఎన్నో సాంస్కృతిక విప్లవాలు అవసరమౌతాయనే మావో బోధనను అది బలపరిచింది.అంతర్జాతీయంగా చూస్తే, ఎన్నో దేశాల్లోని కమ్యూనిస్టు ఉద్యమాల్లో రివిజనిజంతో నిర్ణయాత్మకంగా తెగతెంపులు చేసుకోవటానికి పరిస్థితులను, సందర్భాన్ని అది కలుగజేసింది. ఎన్నో దేశాల్లో ఎంఎల్ పార్టీలు ఏర్పాటు కావటానికి, సాయుధ రైతాంగ విప్లవ పోరాటాల వెల్లువ తలెత్తడానికి దారితీసింది. భారత దేశంలో యాభై వసంతాలు జరుపుకోబోతున్న గొప్ప నక్సల్బరి రైతాంగ విప్లవ సాయుధ తిరుగుబాటు శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవంతోనే ప్రభావితమైంది, ప్రేరణ పొందింది. సిపిఐ (మావోయిస్టు) సంస్థాపకులు, గొప్ప నాయకులైన కా. సిఎం, కేసి లలో ఒకరైన కా. చారు మజుందార్ నాయకత్వంలో నూతన దారులు వేసిన ఉద్యమంనక్సల్బరి ఉద్యమం. మన దేశపు ప్రజాస్వామిక విప్లవ చరిత్రలో అది ఒక నూతన అధ్యాయానికి నాంది.
రష్యా సోషలిస్టు విప్లవం కా. లెనిన్, స్టాలిన్ ల నాయకత్వంలోరష్యన్ పెట్టుబడిదారీ వర్గం, భూస్వామ్య వర్గాల రాజకీయ అధికారాన్ని సాయిధ తిరుగుబాటు ద్వారా కూలదోసి మొట్ట మొదటి సారిగా కార్మికుల, శ్రమజీవుల నూతన రాజ్యాన్ని ఏర్పాటు చేసింది. అది సోషలిజాన్ని నిర్మించే కర్తవ్యాన్ని చేపట్టి, సోషలిస్టు వ్యవస్థ కోసం పునాదులు వేసి, కమ్యూనిజం వైపు పయనించడానికి మార్గం వేసింది. సరియైన కార్మిక వర్గ సిద్ధాంతమైన మార్క్సిజం, సరియైన కార్మిక వర్గ పార్టీలు బొల్షివిక్ విప్లవానికి మార్గ నిర్దేశనం చేశాయి. అది సరియైన వ్యూహం, ఎత్తుగడలను అనుసరిస్తూ దేశంలోనూ, పార్టీలోనూ అతివాదానికి, మితవాదానికి వ్యతిరేకంగా నిరంతరం పోరాటం చేసింది. సోషలిజపు నిర్మాణంలోనూ, దేశంలో అంతర్గతంగానూ, అంతర్జాతీయంగానూ, మార్క్సిజం ఒక నూతన, ఉన్నత దశకు, అంటే లెనినిజానికి లేదా మార్క్సిజం-లెనినిజానికి చేరుకున్నది.
కార్మిక వర్గ సిద్ధాంతం, రాజకీయాలు, శాస్త్రీయ సోషలిజాల రూపకర్త, పూర్తిగా నూతనమైనది, సంపూర్ణంగా శాస్త్రీయమైనది అయిన సిద్ధాంతాన్ని, పద్ధతినీ ఆవిష్కరించిన గొప్ప విప్లవ తత్వవేత్త అయిన కార్ల్ మార్క్స్ ద్విశతాబ్ది జన్మదినం కూడా సమీపిస్తున్నది. మానవ జాతికి మార్క్స్ ఒక నూతన మార్గాన్ని చూపించాడు. అది కఠినమైన వర్గ పోరాటంలో, బూర్జువా, పెట్టి-బూర్జువా సిద్ధాంతం, ఆర్థికం, రాజకీయాలు, సంస్కృతి కి వ్యతిరేకంగా, కార్మిక వర్గ ఉద్యమంలో అతి, మిత వాదాలకు వ్యతిరేకంగా చేసిన పోరాటంలో వికసించింది, అభివృద్ధి చెందింది. వేలాది సంవత్సరాల పాటు వర్గ దోపిడీ, పీడనలకు గురవుతున్న మానవ సమాజానికి ఒక నూతన యుగారంభం అయ్యింది. ఒక వర్గ రహిత సమాజానికి, అంటే స్వేచ్చతో కూడిన సమాజానికి పరిణామం చెందే ఒక వాస్తవ అవకాశం కలిగింది.
పెట్టుబడిదారీ విధానం వల్ల జనించిన వేతన బానిసత్వానికీ, దోపిడీకి, అణచివేతకు, ఆధిపత్యానికి, పేదరికానికి, వివక్షకు, అసమానతలకు, సంక్షోభాలకు, యుద్ధాలకు ఏకైక ప్రత్యామ్నాయం సోషలిజం, కమ్యూనిజమేననే నిర్వివాదమైన సత్యాన్ని ఎలుగెత్తి చాటడానికి ఈ ఉత్సవాలు ముఖ్యమైన సందర్భాలు. పెట్టుబడికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో పెట్టుబడికి పాతరపెట్టే కార్మిక వర్గం వర్గరహిత సమాజం వైపు చేసే పయనంలో సోషలిజాన్ని నిర్మించే క్రమంలో పాత కుళ్ళిపోయిన సామాజిక సంబంధాలను పాతి పెట్టి వాటి స్థానంలో కొత్త సంబంధాలను నెలకొల్పుతాయని, ఆ రకంగా మానవ జాతి చరిత్ర పూర్వ దశను అంతం చేసి నిజమైన చరిత్ర మొదలయ్యేలా చేస్తుందని మళ్ళీ ఒక సారి ప్రకటించడానికి ఇవి సందర్భాలు. పెట్టుబడిదారీ విధానం శాశ్వతమైనదనీ, కమ్యూనిజానికి కాలం చెల్లిందనీ అనేవాళ్ళు మానవాళి తన ఉనికిలోని అత్యంత సుదీర్ఘ కాలం వర్గ రహిత సమాజం లోనే గడిపిందనీ, వర్గ రహిత సమాజం నుంచే బయటకు వచ్చిందనీ, మళ్ళీ ఒక సారి చరిత్రలో అతి నూతనమైనదీ, చివరిదీ, విప్లవకరమైనదీ అయిన కార్మిక వర్గ నాయకత్వంలో వరుసగా ఉన్నత దశల ద్వారా వర్గ రహిత సమాజం లోకి ప్రవేశిస్తుందని మరిచిపోతారు. సోవియట్, చైనా సోషలిస్టు సమాజాలు పడిపోవడాన్ని మాత్రమే చూపించే వారు బూర్జువాజీ కూడా భూస్వామ్య వర్గం పై అంతిమ విజయం సాధించే ముందు ఎన్నో శతాబ్దాల పాటు ఎన్నో అపజయాలను చవిచూడ వలసి వచ్చిందని మరిచిపోతారు. తప్పులనుండి నేర్చుకుంటూ, ఓటముల నుండి గుణపాఠాలు గ్రహించుకుంటూ కార్మిక వర్గం, దాని పార్టీ నిరంతరాయంగా, దృఢచిత్తంతో, మొండి పట్టుదలతో అణచివేతకు గురవుతున్న అన్ని సామాజిక వర్గాలకు, సెక్షన్లకు అగ్రగామిగా నిలబడి బూర్జువాజీ కు వ్యతిరేకంగా పోరాటం చేసి మొదట ఒక దేశం లోనూ, అటు పిమ్మట పలు దేశాల్లోనూ సోషలిజాన్ని నిర్మిస్తుంది. అంతిమంగా పెట్టుబడిదారీ విధానాన్ని, సామ్రాజ్యవాదాన్ని, అన్ని రకాల ప్రతిక్రియవాదాన్ని ఓడించి ప్రపంచవ్యాపితంగా సామ్యవాదాన్ని స్థాపిస్తుంది.అంతిమంగా అన్ని ఆవశ్యక పరిస్థితులు పరిపక్వమైనప్పుడు, సమాజం ఎట్టకేలకు తన పతాకంపై ʹప్రతి ఒక్కరూ తమ శక్తి, సామర్థ్యాలకు అనుగుణంగా, ప్రతి ఒక్కరికీ వారి అవసరాలకు అనురూపంగాʹ అని రాసుకోవచ్చు. కాబట్టి ఈ వార్షికోత్సవాలను జరుపుకునే సందర్భంలో మార్క్సిజం/ఎంఎల్ఎం లకు ప్రత్యామ్నాయం లేదని మరొక్క సారి ఎలుగెత్తి చాటుదాం. కార్మిక వర్గ పార్టీకి/నాయకత్వానికి ప్రత్యామ్నాయం లేదు! విప్లవానికి ప్రత్యామ్నాయం లేదు! సోషలిజం, కమ్యూనిజాలకు ప్రత్యామ్నాయం లేదు!
వీటిలో మూడు వార్షికోత్సవాలను-అంటే శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవపు అర్ధశతాబ్ధి ఉత్సవాలు,బోల్షివిక్ విప్లవపు శతాబ్ధి ఉత్సవాలు, కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి ఉత్సవాలను ప్రపంచ వ్యాపితంగా అన్ని దేశాల కార్మిక వర్గం జరుపుకుంటుంది. భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు) అంతర్జాతీయ శ్రామిక వర్గపు దిటాచ్ మెంట్. అది మార్క్సిజం-లెనినిజం-మావోయిజం మార్గదర్శకత్వంలో పని చేస్తుంది. ఈ సిద్ధాంతాన్ని నిర్దిష్ట విప్లవ ఆచరణకు సృజనాత్మకంగా అన్వయిస్తుంది. అది మితవాద అవకాశవాదం, అతివాద ఒంటెత్తుపోకడలతో సహా అన్ని రకాల రివిజనిజానికి వ్యతిరేకంగా నిర్విరామంగా పోరాటం చేస్తుంది. ప్రపంచ సోషలిస్టు విప్లవంలో అవిభాజ్యమైన భాగంగా ఉన్న భారత దేశపు నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతంగా పరిపూర్తి చేయడానికి దీర్ఘకాలిక యుద్ధంలో నిమగ్నమై ఉంది. ఈ ఉత్సవాలను జరుపుకోవటంలో సిపిఐ(మావోయిస్టు) అంతర్జాతీయ కార్మిక వర్గంతో చేతులు కలుపుతుంది .ఎంఎల్ఎం ను ఎత్తిపట్టి, కాపాడి, అనుసరించి, దానిని అన్వయించి మన దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడమ్ కోసంఇతర అన్ని నిజమైన మావోయిస్టు పార్టీలు, సంస్థలు, వ్యక్తులతో కలిసి ఈ మూడు గొప్ప ప్రపంచ స్థాయి విప్లవాత్మక కార్మికవర్గ దినాలను జరుపుకోవడం మన కర్తవ్యం.ఈ విప్లవదినాలను జరుపుకోవడం అంటే, మార్క్సిజపు విప్లవ సారాన్ని గ్రహించడం, గత కాలపు విజయవంతమైన కార్మిక వర్గ విప్లవాల స్ఫూర్తిని అనుకరించడం, అంతర్జాతీయ కార్మిక వర్గపు పాజిటివ్, నెగెటివ్ అనుభవాల నుండి నేర్చుకోవడం,మన ఓటములు, తప్పుల నుండి గుణపాఠాలు తీసుకోవడం, కొత్త సామాజిక, విప్లవకర పరిస్థితులలో సామ్రాజ్యవాదానికి, సకల ప్రతిక్రియావాదానికి వ్యతిరేకంగా పోరాడుతూ, మన దేశంలో నూతన ప్రజాస్వామిక విప్లవాన్ని విజయవంతం చేయడంకోసం మన శక్తి సామర్థ్యాలపై ఆధారపడి సాహసోపేతంగా ముందుకు సాగడం.
శ్రామిక వర్గ సాంస్కృతిక విప్లవ దినోత్సవాన్ని 2016 నుండి మే 2017 వరకు జరుపుకోవాలని, నక్సల్బరి సాయుధ తిరుగుబాటుకు చెందిన 50వ వార్షికోత్సవాలను 2017 మే23 నుండి 29 వరకు, బోల్షివిక్ విప్లవ శతాబ్ది వార్షికోత్సవాలను 2017లో 7 నుండి 13 మే వరకు , అంతర్జాతీయ కార్మిక వర్గ మార్క్సిస్టు మహోపాధ్యాయులు కార్ల్ మార్క్స్ ద్వి శతాబ్ది జయంతి ఉత్సవాలను 2018 లో 5 నుండి 11 మేవరకు గొప్ప విప్లవోత్సాహంతో, విప్లవ స్ఫూర్తితో నిర్వహించాలని పిలుపునిస్తున్నాం! ఏదేని కారణం వల్ల ఈ దినాలను పైన పేర్కొన్న తేదీలలో జరుపుకోవడం సాధ్యం కాకపోతే ఆయా సంవత్సరాలలో ఎప్పుడైనా జరుపుకోవలసిందిగా పిలుపునిస్తున్నాం. ఈ ఉత్సవాలను క్యాంపెయిన్ల రూపంలోనూ, వార్షికోత్సవ వారాలుగానూ జరుపుకోవాలి.
ప్రపంచ పెట్టుబడిదారీ విధానం అతి తీవ్రమైన ఆర్థిక, రాజకీయ సంక్షోభాలకు, ఉత్పత్తి శక్తుల వినాశనానికి, దోపిడీ, అణచివేతలు తీవ్రతరం కావడానికి, ప్రపంచవ్యాప్తంగా పరాన్నభుక్కు యుద్ధాలు చెలరేగడానికి కారణమవుతున్నది. సామ్రాజ్యవాదపు ఉక్కు కౌగిలిలో అత్యధిక దేశాలు, జాతులు, ప్రజలు నలిగిపోతుండడంతో ప్రజలలో తీవ్ర నిరసన, ప్రతిఘటన పెరుగుతున్నాయి. రాబోయే సామాజిక తిరుగుబాట్లను తలుచుకొని ప్రపంచ వ్యాప్తంగా ప్రతిక్రియావాదులు, వారి సంస్థలు భయభీతులకు లోనవుతున్నాయి. అందువల్ల కుతకుతలాడుతున్న సామాజిక అసంతృప్తిని చల్లార్చి, వాటిని తప్పు తోవ పట్టించడానికి ఎంఎల్ఎంకు, సామ్యవాద విప్లవాలకు, నూతన ప్రజాస్వామిక విప్లవాలకు, జాతి విముక్తి పోరాటాలకు, అన్ని రకాల ప్రజా పోరాటాలకు వ్యతిరేకంగా విభిన్న అణచివేత చర్యలు, మోసపూరిత చర్యలు చేపడుతున్నారు. అటువంటి స్థితిలో శత్రువును సైద్ధాంతిక, రాజకీయ, సైనిక తదితర అన్ని రంగాలలో ఎదుర్కోవడం మన లక్ష్యంగా ఉండాలి. రాబోయే నాలుగు వార్షికోత్సవాలను ఇందుకై వినియోగించుకోవాలి. ఈ సందర్భాలను మనం మన దేశపు కార్మికులను, రైతాంగాన్ని, విద్యార్థులను, యువకులను, మేధావులను, దళితులు, ఆదివాసీలు,అణచవేతకు గురవుతున్న జాతులు, మతపరమైన మైనారిటీలను, శ్రమజీవులలోని ఇతర సెక్షన్లను సైద్ధాంతికంగా, రాజకీయంగా ఎడ్యుకేట్ చేయడానికి ఉపయోగించుకోవాలి. సమయానికి అనుగుణంగా లేచి నిలబడాలని, ఏకమయ్యి బలంగా సంఘటితమై పాలక వర్గాల దాడిని అన్ని విధాలుగా తిప్పికొట్టాలని పిలుపునివ్వాలి. నూతన ప్రజాస్వామిక విప్లవంలో పాలు పంచుకోవాలనీ, కొనసాగుతున్న ప్రజాయుద్ధంలో పెద్ద యెత్తున మిలిటెంట్ గా పాల్గొనాలని ప్రజలకు పిలుపునివ్వాలి. శ్రమజీవుల విముక్తికై నూతన ప్రజాస్వామిక విప్లవం ఒక్కటే మార్గమనే సందేశం వారిలో విస్తృతంగా ప్రచారం చేయాలి. బ్రాహ్మణవాద హిందూ ఫాసిజం భారత పాలకవర్గాల, సామ్రాజ్యవాదుల ప్రయోజనాలను పెద్ద ఎత్తున నెరవేరుస్తూ కమ్యూనిజం పైన,అన్ని ప్రజాస్వామిక సిద్ధాంతాలు, ఉద్యమాలు, సంస్కృతులు, విలువలు, ఆకాంక్షలు, ఆచరణలపైనా, బహిరంగంగా, పార్లమెంటరీ ముసుగులో దాడిచేస్తున్న ప్రస్తుత తరుణంలో దీనికి మరింత ప్రాముఖ్యత ఉంది.
నక్సల్బరీ తిరుగుబాటు యాభయ్యవ వార్షికోత్సవానికి అంతర్జాతీయ ప్రాముఖ్యత ఉన్నప్పటికీ అది ప్రధానంగా మనదేశంలో కొనసాగుతున్న దీర్ఘకాలిక ప్రజాయుద్ధానికి సంబంధించినది. విభిన్నదేశాల్లో ఉన్న నిజమైన కార్మికవర్గ పార్టీలు, సంస్థలు, వ్యక్తులు, భారత విప్లవపు మిత్రులు, శ్రేయోభిలాషులు, మద్ధతుదారులు భారతదేశంలో కొనసాగుతున్న దీర్ఘకాలిక ప్రజాయుద్ధ నేపథ్యంలో నక్సల్బరి యాభయ్యవ వార్షికోత్సవాన్ని జరపవలిసిందిగా మా కేంద్ర కమిటీ పిలుపునిస్తోంది. ఈ వార్షికోత్సవాలను పార్టీ, పిఎల్జిఏ, విప్లవ ప్రజాకమిటీలు, ప్రజా సంఘాలతో పాటు విప్లవ ప్రజాస్వామిక సంస్థలు, వ్యక్తులుపట్టణాల్లో నిర్వహించాలని పిలుపునిస్తున్నాం.
కామ్రేడ్స్,
వర్గరహిత సమాజాన్ని స్థాపించడం కోసం కష్టభూయిష్టమైన మార్గం గుండా శత్రువుకు వ్యతిరేకంగా వేలాది యుద్ధాల్లో అసంఖ్యాక జన బాహుళ్యాన్ని నడిపించే చారిత్రక బాధ్యత అంతర్జాతీయ కార్మిక వర్గ భుజస్కంధాలపై ఉంది. అజేయమైన నేటి మార్క్సిజం- ఎంఎల్ఎంను- ధరించి అది తన చారిత్రక కర్తవ్యాన్ని పరిపూర్తి చేసేందుకు ముందుకు సాగుతుంది. అంతర్జాతీయ కార్మిక వర్గపు డిటాచ్ మెంట్ గా మన పార్టీ మహత్తర నక్సల్బరి సాయుధ రైతాంగ తిరుగుబాటు కాలం నుండి గత యాభై ఏళ్ళుగా దీర్ఘకాలిక సాయుధ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లను, ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ముళ్ళ దారిగుండా సాగుతూనే ఎన్నో గణనీయమైన విజయాలను సాధించింది. ఎంఎల్ఎంను మన దేశ నిర్దిష్ట పరిస్థితులకు సృజనాత్మకంగా అన్వయించడం ద్వారా సామ్రాజ్యవాదులతో కుమ్మక్కై పాలక వర్గాలు నెరపుతున్న ఫాసిస్టు నిర్బంధాన్ని తిప్పికొడుతూ వేలాది అమరుల రక్త తర్పణం ద్వారానే ఈ విజయాలు సాధించాము. సాధించిన ఈ విజయాలను ఎత్తిపట్టి, కాపాడేందుకు, వాటి నుండి ప్రేరణ పొంది ప్రజాయుద్ధంలో మరింత పురోగతి సాధించేందుకు రాబోయే ఉత్సవాలను ఉపయోగించుకోవాలి. పార్టీని, ప్రజలను ఎంఎల్ఎంతో సుసజ్జితులను చేసి, ఎడ్యుకేట్ చేసి మలచటానికి ఈ సందర్భాలను ఉపయోగించుకోవాలి. సకారాత్మక, నకారాత్మక అనుభవాలను, మన ఆచరణలో జరిగిన తప్పులనుండి నేర్చుకున్న పాఠాలను ప్రజల ముందు ఉంచాలి. ఈ వార్షికోత్సవాల ద్వారా పార్టీ, పిఎల్జిఏ, విప్లవ ప్రజా కమిటీలు, ప్రజా సంఘాలు, మిత్ర శక్తులు ప్రజల ఉత్సాహాన్ని, పోరాట స్ఫూర్తిని పెంపొందించడానికి కృషి చేయాలి. మనం మిత్ర శక్తుల, ప్రజల విశ్వాసాన్ని చూరగొనడానికి, వారిని మన వైపు గెలుచుకోవడానికి ప్రయత్నించాలి. తద్వారా ఉమ్మడి శత్రువుకు వ్యతిరేకంగా బలంగా, మరింత విశాల ప్రాతిపదికన ఐక్య పరచవచ్చు. దోపిడి, అణచివేత, వెట్టి, బానిసత్వాల సంకెళ్ళ నుండి విముక్తి పొందడానికి నూతన ప్రజాస్వామ్యం, సోషలిజం, కమ్యూనిజం మాత్రమే ఏకైక ప్రత్యామ్నాయమని ప్రచారం చేయడానికి సకల ప్రయత్నాలు చెయ్యాలి. గొప్ప అంతర్జాతీయ కార్మిక వర్గ నాయకులైన మార్క్స్, ఎంగెల్స్, లెనిన్, స్టాలిన్,మావో లు మనకు చూపిన మార్గం ఇదే. బోల్షివిక్ విప్లవం, చైనా విప్లవం, నక్సల్బరీలు మన ముందు పరచిన మార్గం ఇదే. ఈ పథాన ముందుకు సాగుతూ ఉంటామని మనం ఈ నాలుగు ఉత్సవాల సందర్భంలో పునశ్శపథం చేద్దాము. ఈ పిలుపును ప్రజలలో విస్తృతంగా ప్రచారం చేయాలనీ, ప్రజల క్రియాశీలక భాగస్వామ్యంతో ఈ వార్షికోత్సవాలను విజయవంతంగా జరపాలని మేము అన్ని పార్టీ యూనిట్లకు, సభ్యులకు పిలుపునిస్తున్నాం.
గణపతి
కేంద్రకమిటీ కార్యదర్శి
సిపిఐ(మావోయిస్టు)
Keywords : ganapati, maoists, naxalbari, world revelution
(2024-03-24 20:06:45)
No. of visitors : 3677
Suggested Posts
| శృతిని అత్యాచారం చేసి, హింసలు పెట్టి చంపారు - వరవరరావువరంగల్ జిల్లాలో మంగళవారంనాడు ఎన్ కౌంటర్ జరిగినట్టు పోలీసులు చెబుతున్నది అబద్దమని శృతిని విద్యాసాగర్ లను పోలీసులు పట్టుకొని చిత్రహింసలు పెట్టి చంపారని విప్లవ రచయిత వరవరరావు ఆరోపించారు.... |
| అది ఎన్కౌంటర్ కాదు - అత్యాచారం చేసి చంపేశారు : నిజనిర్థారణ బృందంహిడ్మే ఒంటిపై దుస్తులను తొలగించి... సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. శరీర భాగాలన్నింటినీ కత్తులతో కోశారు. ఆ తరువాత చాతీపై, కడుపులో తూటాల వర్షం కురిపించారు. మృతదేహాన్ని సుక్మా పట్టణానికి తరలించారు. 14వ తేది విషయం తెలుసుకున్న గ్రామస్తులు.... |
| శ్రుతి పాడిన పాట దోపిడి గుండెల్లో తూట !శ్రుతి.... చిన్నప్పటినుండే విప్లవ భావాలతో పెరిగింది. సమాజాన్ని నిశితంగా గమనిస్తూ, సమాజాన్ని చదువుతూ పెరిగింది. వేదికలెక్కి సమాజాన్ని చైతన్య పరిచే పాటలు పాడింది. ఎమ్ టెక్ చదివిన శ్రుతి తన తండ్రి సుదర్శన్ చెప్పినట్టు అమెరికాకు కాకుండా అడవిలోకి.... |
| రాజ్యం పెంచి పోషించిన ప్రజా హంతకుడు నయీం - మావోయిస్టు పార్టీ హంతక ప్రభుత్వాల పోలీసు యంత్రాంగం ఎస్ఐబి డైరెక్షన్లో ఎంతో మంది ప్రజలను, పౌరహక్కుల నేతలను, ఉద్యమకారులను కిరాతకంగా చంపిన ప్రజా హంతకుడు నయీం చావు వార్త పీడిత ప్రజలకు పండుగ వంటిదే కాకుంటే తనను పెంచి, పోషించి ఎన్నో చీకటి హత్యలకు ఆయుధంగా వాడుకున్న దోపిడీ పాలక వర్గం చేతిలో కన్నా ప్రజల చేతిలో నయినాం ఖతం అయితే ప్రజలు ఎక్కువగా సంతోషపడేవాళ్ళు... |
| చీప్ లిక్కర్ తో గ్రామజ్యోతిని వెలిగిస్తారా - మావోయిస్టు జగన్ ప్రశ్నప్రభుత్వం హరితహారం లో మొక్కలు నాటడం కోసం ఆదివాసులను భూముల్లోంచి వెళ్ళగొడతోందని జగన్ మండి పడ్డారు. ఒక వైపు ప్రజలను చీప్ లిక్కర్ లో ముంచి తేల్చే కుట్రలు చేస్తూ మరో వైపు గ్రామ జ్యోతి కార్యక్రమాన్ని మొదలు పెట్టడం పై జగన్ మండి పడ్డారు. చీప్ లిక్కర్ తో గ్రామ జ్యోతిని వెలిగిస్తారా |
| ఫేస్ బుక్ మిత్రుడి ఎన్ కౌంటర్ !సార్ మీరు నాకు తెలుసు... మీరు నాఫేస్ బుక్ ఫ్రెండ్ సార్..... దండకారణ్యంలో భుజానికి తుపాకీ వేసుకొని తీక్షణంగా పరిసరాలను పరీక్షిస్తూనే మరో చేత్తో వంట చేస్తున్న.. ప్రతిక్షణం యుద్దం మధ్యలో జీవిస్తున్న ఓ మావోయిస్టు గెరిల్లా ఆమాట అనడంతో నేను షాక్ తిన్నాను..... |
| నక్సల్బరీ రాజకీయాలను ఎత్తి పట్టండి - మావోయిస్టు పార్టీ నేత గణపతి పిలుపునేడు దేశంలో బ్రాహ్మణవాద శక్తులు ప్రభుత్వాన్ని పాలిస్తున్న నేపథ్యంలో దేశంలో అసహన పరిస్థితులు నెలకొన్నాయని, వాటికి వ్యతిరేకంగా మేథావులను, కార్మిక, శ్రామిక, ప్రజాస్వామ్య వర్గాలను, దళితులను, మైనారిటీ మతాలను, విద్యార్థులను సంఘటితం చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గణపతి చెప్పారు..... |
| ఈ విప్లవ యోధుడి అమరత్వానికి 21 యేండ్లు !అది 1996 జూన్ 23 ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాల దగ్గర నస్పూర్ కాలానిలో ఓ ఇల్లు.... ఆ ఇంటిని 500 మంది పోలీసులు చుట్టుముట్టారు. ఎలాంటి హెచ్చరికలు లేవు... లొంగి పొమ్మన్న మాటలు లేవు. ఏక పక్షంగా తూటాల వర్షం కురిపించిడం.... |
| జనతన రాజ్యంలో నక్సల్బరీ వేడుకలు... 80 వేల మందితో సభ (వీడియో) మావోయిస్టు పార్టీ దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన నక్సల్బరీ వేడుకలు ప్రపంచానికి ఇప్పడు కొత్త ఆశనిస్తున్నాయి. ఒక్కరిద్దరు కాదు.. దాదాపు 80 వేల మంది ఆదివాసీలు. సుశిక్షితులైన ప్రజా విముక్తి గెరిల్లాలతో కలిసి కదంతొక్కారు. |
| ఈ నెల 26 న తెలంగాణ బంద్ కు మావోయిస్టు పార్టీ పిలుపుగొల్లగూడెం ఎన్ కౌంటర్ కు నిరసనగా ఈ నెల 26 న తెలంగాణ బంద్ ను జయప్రదం చేయాలని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి జగన్ పిలుపునిచ్చారు.
మహారాష్ట్రా గడ్చిరోలి జిల్లా, వెంకటాపురం పోలీస్ స్టేషన్ పరిధి గొల్లగూడెం అడవుల్లో... |