ఎవరి కోసం... అసలు కథేంటి -ఎన్. వేణుగోపాల్ (2)
(part 2)
జిఎస్టి ప్రతిపాదనల చరిత్ర
ఇంతకూ ఈ కొత్త పన్నుల వ్యవస్థను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు ప్రపంచీకరణ ఆర్థిక విధానాలలో భాగంగా మొదలయ్యాయి. దేశమంతా ఒకే మార్కెట్గా మార్చదలచిన బహుళజాతిసంస్థల, దళారీ పెట్టుబడిదారుల కోరికల్లో పన్నుల విధానాన్ని మార్చడం ఒక ముఖ్య అంశం. అందువల్లనే 1990లలోనే అమ్మకపు పన్ను నుంచి విలువ ఆధారిత పన్నుకు మారడానికి ప్రయత్నాలు మొదలై, 2005లో ముగిశాయి. పరోక్షపన్నుల పద్ధతిలో సంస్కరణలు సూచించడానికి పాత ఎన్డిఎ ప్రభుత్వం నియమించిన కేల్కర్ టాస్క్ఫోర్స్ 2003లో ఇచ్చిన నివేదికలో ఇన్నిరకాల పరోక్ష పన్నులను రద్దు చేసి విలువ ఆధారిత పన్ను (ఏ మజిలీలో ఎంత విలువ సమకూరిందో ఆ విలువ మీద మాత్రమే పన్ను) వేసే సమగ్ర జిఎస్టి రూపొందించాలని సూచించింది. యుపిఎ పాలనలో 2006-07 బడ్జెట్లో 2010 ఏప్రిల్ నాటికి జాతీయ స్థాయి జిఎస్టి ప్రవేశపెట్టాలని అప్పటి ఆర్థికమంత్రి చిదంబరం ప్రతిపాదించాడు. ఆ కొత్త పన్ను నమూనాను, దాని మార్గదర్శక సూత్రాలను రూపొందించడానికి రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఉన్నతస్థాయి కమిటీని నియమించారు. అ కమిటీ 2009 నవంబర్లో తన తొలి చర్చా పత్రాన్ని విడుదల చేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సలహాలు, సూచనలు కోరింది. పన్నుల విధింపులో, వసూళ్లలో రాజ్యాంగం రాష్ట్ర ప్రభుత్వాలకు కూడ అధికారం ఇచ్చింది గనుక రాజ్యాంగ సవరణ బిల్లును 2011 మార్చ్లో లోకసభలో ప్రవేశపెట్టారు. ఈ బిల్లును పరిశీలన కోసం ఆర్థిక వ్యవహారాల స్థాయీ సంఘానికి పంపించారు.
మరొకపక్క కేంద్ర ఆర్థికమంత్రి, రాష్ట్రాల ఆర్థిక మంత్రుల ఉన్నతాధికార సంఘం నిర్ణయం మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారులతో జిఎస్టి నమూనా రూపొందించడానికి ఒక కమిటీని 2012 నవంబర్లో నియమించారు. ఆ కమిటీ తన నివేదికను 2013 జనవరిలో సమర్పించగా, రాజ్యాంగ సవరణ బిల్లులో మార్పులు చేయాలని రాష్ట్ర ఆర్థిక మంత్రుల బృందం నిర్ణయించింది. జిఎస్టి గురించి మరింత వివరమైన అధ్యయనం జరిపి, ఆచరణయోగ్యమైన సూచనలు చేసేందుకు మరో మూడు అధికారుల కమిటీలను నియమించారు. ఈలోగా పార్లమెంటు స్థాయీ సంఘం తన మార్పులు, చేర్పుల సూచనలతో 2013 ఆగస్టులో నివేదిక సమర్పించగా రాజ్యాంగ సవరణ బిల్లు కొత్త ముసాయిదా తయారయింది. ఆ బిల్లు ముసాయిదా మీద కూడ ఎన్నో చర్చలు జరిగి, మార్పులు చేర్పులు జరుగుతూ 2015 మే వరకూ ఆ బిల్లుకు తుది మెరుగులు దిద్దుతూనే ఉన్నారు. చివరికి ఆ బిల్లు 2015 మే 6న లోకసభలో ఆమోదం పొందింది. కాని రాజ్యసభలో ఆ బిల్లుకు ఆటంకాలు వచ్చాయి. అక్కడ కూడ ఒక పరిశీలనా బృందాన్ని నియమించగా అది 2015 జూలై 22న తన నివేదిక ఇచ్చింది. చివరికి 2016 ఆగస్ట్ 3న ఆ బిల్లు రాజ్యసభలో కూడ ఆమోదం పొందింది. అలా రాజ్యాంగ సవరణ జరిగి, పన్ను విధింపు మీద రాష్ట్రాల హక్కు తొలగించిన తర్వాత కేంద్ర జిఎస్టి, సమీకృత జిఎస్టి, కేంద్రపాలిత ప్రాంతాల జిఎస్టి, కొత్త పన్ను వల్ల రాష్ట్రాలకు జరిగే నష్టానికి పరిహారం అనే నాలుగు బిల్లులను 2017 ఏప్రిల్ 5న లోకసభ ఆమోదించడంతో జిఎస్టి చట్టబద్ధంగా మారింది. ఈలోగా ఏర్పడిన జిఎస్టి కౌన్సిల్ పది నెలల్లో పదిహేనుసార్లు సమావేశం కావలసి వచ్చింది. ఇవన్నీ ముగిసి జూలై 1 నుంచి ఇది అమలులోకి వస్తుందని కేంద్ర ప్రభుత్వ ప్రకటించింది.
ఇంత గందరగోళం, పద్నాలుగు సంవత్సరాల వెనుకాముందులు, చర్చోపచర్చలు, వివాదాలు, అభ్యంతరాలు ఎందుకు వెల్లువెత్తాయో అర్థం చేసుకోవాలంటే భారత పాలకవర్గాల ముఠాతగాదాలు అర్థం చేసుకోవాలి. బహుళ జాతి సంస్థల ఆదేశాలు, దళారీ బూర్జువా వర్గపు బేరసారాలు, వ్యాపార ప్రయోజనాలకు అనుగుణంగా రాజకీయ వాదనలు ఈ గందరగోళానికి కారణం. ఈ వ్యవహారంలో ప్రజా ప్రయోజనాలు అనేవేమీ లేవని, కేవలం భారత మార్కెట్ను పంచుకోవడానికి, మార్కెట్ నుంచి రాగల లాభాలను పంచుకోవడానికి బహుళజాతి సంస్థలు, వారి దళారీలు ఆడుకున్న బేరసారాల వల్లనే, ఎత్తులు పై ఎత్తుల వల్లనే ఈ రచ్చ అంతా జరిగింది.
భారత పాలకుల అసలు ప్రయోజనాలు
జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి సువిశాల మార్కెట్ మీద గుత్తాదిపత్యం సంపాదించుకోవడానికీ ఉవ్విళ్లూరుతున్న బహుళజాతి సంస్థలకు, వారి దళారులకు మేలు చేకూర్చేటందుకే జిఎస్టి అమలులోకి వస్తున్నది. వారి ఆర్థిక ప్రయోజనాలూ, సంఘ్పరివార్ సామాజిక, సాంస్కృతిక ప్రయోజనాలూ కలిసి మార్కెట్ ఏకీకరణ - ఒకే జాతి, ఒకే పన్ను అనే లక్ష్యాలు తీర్చడానికే జిఎస్టి.
భారతదేశంలో 6 కోట్ల 30 లక్షల వ్యాపార సంస్థలున్నాయని, దానికి భిన్నంగా భారత ఆర్థిక వ్యవస్థతో తొమ్మిది రెట్లు పెద్దదయిన అమెరికన్ ఆర్థిక వ్యవస్థలో మాత్రం మొత్తం వ్యాపార సంస్థల సంఖ్య రెండు కోట్ల ఇరవై లక్షలు మాత్రమేనని సచిన్ బన్సల్ ఇంతకు ముందు ప్రస్తావించిన వ్యాసంలో రాశాడు. అంటే ఆ మేరకు భారత దేశంలో ముప్పై లక్షల వ్యాపార సంస్థలు ఉంటే సరిపోతుందని, మిగిలిన ఆరు కోట్ల సంస్థలు మూతబడడమో, పెద్దవాటిలో కలిసిపోవడమో జరగాలని ఆ బడా దళారీ గుత్త పెట్టుబడి ప్రతినిధి కోరుకుంటున్నాడన్నమాట.
రాష్ట్ర ప్రభుత్వాలకు ఇప్పుడున్న అధికారాలన్నిటినీ తొక్కివేసి, కేవలం కేంద్ర ప్రభుత్వపు బొటనవేలి కింద పనిచేసేలా, కేంద్ర ప్రభుత్వ దయా దాక్షిణ్యాలకు లొంగిపోయేలా చేయడానికి జిఎస్టి ఉపయోగపడుతుంది. ఇరవై తొమ్మిది రాష్ట్రాల అధినేతలతో బేరసారాలు జరిపి, ఒక్కొక్కరినీ సంతృప్తి పరిచే బదులు ఒకే గుత్తాధిపత్య కేంద్ర ప్రభుత్వ అధినేతలను తమ గుప్పిట్లో పెట్టుకోవడం సులభమని బహుళ జాతి సంస్థలు చేసిన దురాలోచన ఫలితమే జిఎస్టి. దేశపు వైవిధ్యాన్ని, ఆయా రాష్ట్రాల వనరులను, అవసరాలను బట్టి తన ప్రత్యేక పన్నుల విధానాన్ని రూపొందించుకునే అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వకుండా దేశపు సమాఖ్య స్వభావాన్ని దెబ్బ తీస్తుంది జిఎస్టి. కొత్త పన్నుల విధానపు భారంతో, ప్రత్యేకించి ప్రతి అంశమూ ఆన్లైన్, కంప్యూటర్ పరిజ్ఞానంతో చేయవలసి రావడంతో దేశవ్యాప్తంగా లక్షలాది చిన్న ఉత్పత్తిదారులు, చిన్న వర్తకులు చితికిపోయి, కేవలం బహుళజాతి సంస్థల, దళారీల ఉత్పత్తులు, వ్యాపార శాఖలే దేశమంతా రాజ్యం చేసే పరిస్థితి తీసుకు రావడానికే జిఎస్టి. పన్నుల భారం తగ్గుతుందనీ, కొన్ని వస్తువులు చౌకగా మారుతాయనీ ప్రభుత్వం చెపుతున్నవి పచ్చి అబద్ధాలని గతంలో ఎన్నో బడ్జెట్లలో పన్నులు తగ్గినప్పుడు ప్రజలు గుర్తించారు. పన్నులు తగ్గినప్పటికీ, తగ్గిన పన్నుల లాభాన్ని ఉత్పత్తిదారులు, వ్యాపారులు పంచుకున్నారు గాని ప్రజలకు బదిలీ చేయలేదు. దేశవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే బీడీలు, వస్త్రాలు, స్త్రీలకు అత్యవసరమైన సానిటరీ నాప్కిన్స్ వంటి సరుకుల మీద, ఎన్నో అత్యవసరమైన సేవల మీద 18 శాతం, 28 శాతం గరిష్ట పన్నులు విధిస్తున్న కొత్త పన్నుల విధానం బంగారం వంటి విలాస సరుకుల మీద అతి తక్కువగా 3 శాతం పన్ను విధించింది. అంటే పన్నుల విధింపులో ఎంత మాత్రం హేతుబద్ధత లేని, ప్రజా ప్రయోజనాల దృష్టిలేని పన్నుల విధానం ఇది. సరిగ్గా పెద్దనోట్ల రద్దు నిర్ణయం లాగనే సామ్రాజ్యవాద యజమానులకు జీ హుజూర్ జో హుకుం అని తీసుకున్న నిర్ణయమే తప్ప ఇది మరేమీ కాదు. సరిగ్గా పెద్దనోట్ల రద్దు లాగనే దేశ ఆర్థిక వ్యవస్థను, ప్రజా జీవనాన్ని మరింత సంక్షోభంలోకి నెట్టే చర్య ఇది.
-ఎన్. వేణుగోపాల్
(రచయిత వీక్షణం సంపాదకులు)
Keywords : gst, modi, market, bjp. congress
(2024-04-18 23:36:46)
No. of visitors : 1528
Suggested Posts
| ఆర్థిక మాంద్యం అంటే ఏమిటి ? ఆర్థిక మాంద్యాన్ని ఎదుర్కోవడం ఎలా ? - ఎన్.వేణుగోపాల్దేశం ఆర్థిక మాంద్యంలో ఉన్నదని కొంత కాలంగా వస్తున్న వార్తలు.. విశ్లేషణలు... నిజాలు.. అబద్దాలు... ప్రజలను గందరగోళ పరుస్తున్నాయి. ప్రభుత్వం ఎన్ని మాటలు చెప్పినా దేశంలో ఆర్థిక మాంద్యం ఉన్నదన్నది నిజం. |
| మనలో మనిషి మహాశ్వేత - ఎన్.వేణుగోపాల్ గిరిజనులు, గిరిజన సంస్కృతి, గిరిజనులతో మమేకత్వం ఆమెను ఒక చిన్నా పాపలా మార్చేస్తాయి. చాలా అమాయకంగా "మంచి వాళ్లందరూ గిరిజనులు, చెడ్డ వాళ్లందరూ గిరిజనేతరులు" అని, వెంటనే "నువ్వు గిరిజనుడివా కాదా" అని అడిగింది.... |
| మే 4 ఉద్యమం - ఒక విద్యార్థి సంచలనానికి వందేళ్లు
అది జాతికి విద్రోహం చేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. సామ్రాజ్యవాదంతో కలిసి కుట్ర చేసి దేశ ప్రయోజనాలను అమ్మివేసిన ప్రభుత్వంపై తిరుగుబాటు. అది ఒక విప్లవోద్యమం |
| GST ఎవరి కోసం... అసలు కథేంటి - ఎన్. వేణుగోపాల్ (1)జిఎస్టి వల్ల నెరవేరే అసలు మేలు భారత ప్రజలకూ కాదు, భారత ఆర్థిక వ్యవస్థకూ కాదు. దేశవ్యాప్తంగా ఒకే రకమైన పన్నుల విధానంతో ఏకీకృత మార్కెట్ ఏర్పాటు చేసుకుని, దానిమీద తిరుగులేని అధికారం సంపాదించడానికీ, ఆయా రాష్ట్రాలలో బలంగా ఉన్న చిన్న ఉత్పత్తిదారు లను, వ్యాపారులను దెబ్బతీసి.... |
| తెలంగాణలో భూకుంభకోణాలు...పాలకుల నాటకాలు - ఎన్.వేణుగోపాల్హైదరాబాద్లోని మియాపూర్, హఫీజ్పేట ప్రాంతంలో వందలాది ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములు అన్యాక్రాంత మయ్యాయని, అక్రమ రిజిస్ట్రేషన్ల పాలయ్యాయని, రాష్ట్ర ప్రభుత్వం వేలాది కోట్ల రూపాయలు నష్టపోయిందని జూన్ మొదటి వారంలో వార్తలు గుప్పుమన్నాయి. దాదాపు మూడువారాల పాటు ప్రచార సాధనాలన్నీ ఆ వార్తలతో మార్మోగి పోయాయి..... |
| విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్సెప్టెంబర్ 17 న హైదరాబాద్ రాజ్య (తెలంగాణ) విమోచన జరిగిందనే ఒక కట్టుకథ కొంతకాలంగా ప్రచారంలో ఉంది. తమ మతవిద్వేషాలు రెచ్చగొట్టే కార్యక్రమంలో భాగంగా సంఘ పరివారం, భారతీయ జనతాపార్టీ ఈ కట్టుకథను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. |
| క్రీడా మైదానంలో10 మంది చిన్నారుల నెత్తురు ఏరులై పారించిన పోలీసులు...జర్నలిస్టు సీ.వనజ గ్రౌండ్ రిపోర్ట్కాల్పులు జరిగినప్పుడు తాము, తమ స్నేహితులు ఎలా పరిగెత్తారో, ఎలా తుపాకిగుండ్లకు దొరక్కుండా తప్పించుకున్నారో చెప్పారు. అయితే తమ స్నేహితుల్లో కొందరు తప్పించుకోలేక పోయారని కూడా చెప్పారు. కాల్పులు మొదలు కాగానే ఖోఖో ఆడుతున్న ఉత్కల్ గ్రామానికి చెందిన సుక్కి, అదే గ్రామానికి చెందిన తన స్నేహితురాలితో కలిసి పరిగెత్తింది. |
| పదహారంటె సగమాయె, బిడ్డోడిపాయె, ఎందుకైనట్లిట్ల? ఇగ ఈ రాజ్జెం కొడుకు చేతుల బెట్టి, నేన్ ఢిల్లి పోత, ఆడ చక్రం తిప్పెదున్నది. ఆడ చక్రాలన్ని నాకోసమే ఎదురు చూస్తానయి అని ఒక్కతీర్గ జెప్పె. గాలి మోటరేస్కోని ఆడంగ ఈడంగ చెంగడ బింగడ ఎగిరె. కొసాకరికి ఏమయింది? ఇంటి మాలచ్చిమి ఓడిపాయె. రెక్కల్ల బొక్కల్ల అరుసుకున్న మేనల్లుడు ఓడిపాయె.... |
| మళ్ల గదే ప్రశ్న: తెలంగాణొస్తే ఏమొచ్చింది?...ఎన్.వేణుగోపాల్తెలంగాణ ఎందుకు రావాల్నంటిమంటె నీళ్లనిరి, పైసలనిరి, కొలువులనిరి. నీళ్లు ఇగొ వచ్చె అగొ వచ్చె అని పెగ్గెలే గాని యాడిదాక ఒచ్చినయి? నూరు పైసల పనిల ముప్పై పైసలు గుడ కాకమునుపె దొర అయిపాయె అయిపాయె అని పండుగ జేసిండట గద. ఎనబై వేల కోట్ల రూపాయల పనిల అరవై వేల కోట్లు ఒక్క గుత్తెదారుకె ఇచ్చిండట గద. ఎంత దండి గొట్టిండొ మారాజు. అయినా మా ఊళ్లె నూటికి ముప్పై మందికి భూమే లేక |
| ముక్కుపచ్చలారని పిల్లలను పిడాత చంపిందెవరు? - ఎన్.వేణుగోపాల్
ఇరువై మంది చిన్న పిల్లలు, గలగలలాడే కళకళలాడే పడుచుపిల్లలు, ఇప్పుడిప్పుడే బతుకంటె ఏందో నేర్చుకుంటున్న పిల్లలు, రెండేండ్లు కోళ్ల ఫారాల్ల కోళ్ల తీర్గ చదువుల మునిగిపోయిన పిల్లలు ఉరి పోసుకోని చచ్చిరి, మందు దాగి చచ్చిరి, రైలు కింద పడి చచ్చిరి. |