రిషితేశ్వరి హత్యకు అగ్ర కుల ఆధిపత్య,అరాచకమే కారణమా ?

రిషితేశ్వరి

ఆచార్య నాగార్జున యూనివర్శిటీలో ర్యాగింగ్ వేధింపులను భరించలేక రిషితేశ్వరి అనే విద్యార్ధిని బలవన్మరణానికి పాల్పడింది. కోటి ఆశలతో యూనివర్శిటీలో అడుగుపెట్టిన ఆడపిల్ల సహ విద్యార్ధుల లైంగిక వేదింపులను సహించలేక ఉరి బిగించుకుంది. అసలు ఆమెది ఆత్మహత్యేనా లేక హత్యా? నేనైతే ముమ్మాటికీ హత్యే అంటాను. టిడిపి అధికారంలోకి వచ్చాక ఇక రాష్ట్రం మొత్తం తమదేనని విర్రవీగుతున్న కమ్మ కుల ఆధిపత్య ధోరణే హత్యకు మూల కారణం. తమ కుల పార్టీ అధికారంలో ఉండగా తామేం చేసినా చెల్లుతుందనే అహంకారమే ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రత్యేక పరిస్థితులలో ఆంధ్ర ప్రదేశ్-తెలంగాణ విడిపోవటంతో అవశేషాంద్రకి గుంటూరు జిల్లాలో కొంత భాగం రాజధాని ఖరారు కావటం, స్థానికంగా నాగార్జున యూనివర్శిటీకి చాలా ప్రాధాన్యత వచ్చింది. టిడిపి ఈ యూనివర్శిటీలోని విద్యార్థులలో రాజకీయంగా తమ బలం పెంచుకోవటం కోసం తమ కులాన్ని పెంచి పోషిస్తుంది. గతేడాది కాలంగా అసలు వర్శిటీలో ఏం జరుగుతుంది???

వర్శిటీలోని MBA డిపార్ట్ మెంట్ విద్యార్దులందరూ కలసి సోషల్ మీడియాలో ఒక గ్రూప్ ఏర్పాటు చేసుకున్నారు. డిపార్ట్ మెంట్ కి సంభందించినవి, అకడమిక్ అంశాలు, వర్శిటీ/కాలేజి లో ఉన్న సమస్యలను పంచుకోవటానికి అదొక వేదికలా ఉండాలనేది విద్యార్దులందరి అభిమతం. ఇదే గ్రూపులో ఉన్న టిడిపి అనుకూల విద్యార్దులు టిడిపి కార్యక్రమాలను, పార్టీ కి సంభందించిన పోస్టులను అందులో షేర్ చేయటంతో మిగిలిన విద్యార్దులు వారిని ప్రశ్నించారు. తమ ఆధిపత్యాన్ని నిలేయటాన్ని సహించలేని TNSF జిల్లా నాయకులు, ప్రశ్నించిన విద్యార్దులను క్లాస్ రూములో ప్రొఫెసర్ల కళ్ళ ముందే కొట్టి ఇప్పుడున్నది తమ ప్రభుత్వమని యూనివర్శిటీలో ఉండాలంటే తమని ఎదిరించకూడదని ఇష్టం లేకుంటే గ్రూప్ నుండి కాలేజి నుండి కూడా బయటకు పోవాలని హెచ్చరించారు. యూనివర్శిటీ ఆ విద్యార్దులపై ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇది మెదటి సంఘటన.

ఇక రెండవది... IMBA విభాగంలో గత మార్చి నెలలో భాగ్యలక్ష్మి అనే దళిత విద్యార్దిని పై సీనియర్ విద్యార్దులను(కమ్మ) ప్రేమించమని సన్నిహితంగా ఉండాలనీ సీనియర్ విద్యార్దినులు తీవ్రస్థాయిలో ఒత్తిడి తేవటం జరిగింది. పేద కుటుంబం నుండి వచ్చిన తనని ప్రేమించమని వేధిస్తున్నారని ఆమె తన తల్లితండ్రులకి చెప్పటంతో వారు వర్శిటీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఆ కేసులో నిందితులుగా ఉన్న వారు సైతం తమకు స్థానిక టిడిపి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అండ ఉందని తమనేం చేయలేరనీ తాము చెప్పిందే వర్శిటీలో చెలామణి అవుతుందని భాగ్యలక్ష్మిని బెదిరించటం జరిగింది. సంఘటన జరిగినప్పుడు ఎటువంటి చర్యలు తీసుకోని అధికారులు తాజాగా రిషితేశ్వరి ఉదంతంతో ఉలిక్కిపడి భాగ్యలక్ష్మిని వేధించిన విద్యార్దినులను గతంలోనే హాస్టల్ నుండి బయటకు పంపివేసినట్టు చెపుతున్నారు. అయితే ఆ ముగ్గురు వర్శిటీ గెస్ట్ హౌస్ లో ఉండి తరగతులకు హాజరవుతున్నారు. గెస్ట్ హౌస్ లో ఉండటానికి రిజిస్ట్రార్ అనుమతి తప్పనిసరి. మరి వారికెలా అనుమతినిచ్చారు? తప్పు చేసినా ఒక కులానికి చెందిన వారైతే వారిపై కంటితుడుపు చర్యలేనా? ఇలా తప్పు చేసిన వారిని ప్రోత్సహించి ఈ రోజు రిషితేశ్వరి ప్రాణం పోవటానికి ప్రత్యక్షంగా కారణమైంది ఎవరు???

అసలు రిషితేశ్వరి కేసుకి ప్రిన్సిపాల్ బాబూరావుకి సంభందమేంటి? బాబూరావునే ప్రధాన నిందితుడిగా చేర్చాలి ఈ కేసులో... బాబూరావు ఆర్కిటెక్చర్ కాలేజీని తన కార్యకలాపాలకు, అవినీతికి, కులగజ్జికి, మహిళలపై లైంగిక వేధింపులకు అడ్డాగా మార్చుకున్నాడు. కాలేజీకి కేటాయించిన నిధులలో అవకతవకలరు పాల్పడి ఆర్ధిక ఆరోపణలతో అతని చెక్ పవర్ ను గతంలో తీసివేసినప్పటికీ తనకున్న కుల/పార్టీ పరపతితో మరలా చెక్ పవర్ తెచ్చుకున్నాడు. క్లాస్ రూమ్ లో కానీ క్యాంపస్ లో కానీ ఒంటరిగా ఆడపిల్ల కనపడితే వాళ్ళ మీద చేతులేసి లైంగిక వేధింపులకు పాల్పడతాడన్నది కాలేజీలో ఓపెన్ సీక్రెట్. గతేడాది సహ ఉపాధాయినితో సైతం అసభ్యంగా ప్రవర్తించటంతో ఆమె పై అధికారులకు ఫిర్యాదు చేయటం జరిగింది. అతనికి వ్యతిరేకంగా పోతే అడ్మినిస్ట్రేటివ్ సమస్యలు కొని తెచ్చుకోవటమే అవుతుందని ఆ మహిళా లెక్చరర్ ను వారించి ఫిర్యాదుపై ఎటువంటి చర్యలూ తీసుకోకుండా ఆమెను వెనక్కు పంపటం వర్శిటీలో బాబూరావుకు గల పట్టుకి ఒక రుజువు. బాబూరావు కాంట్రాక్ట్ ప్రాతిపదికన నియామకమైన ప్రొఫెసర్, వర్శిటీ కాలేజీలు/విభాగాలకు కనీసం HOD గా నియమింపబడాలన్నా అతనొక పర్మినెంట్/రెగ్యులర్ ఉద్యోగి అయి ఉండాలి. కానీ బాబూరావు విషయంలో నిభందనలు వర్తించవు. ఎందుకంటే అతని కులమే అతని అర్హత. విమానయాన ప్రయాణ ఖర్చులను ఉప కులపతి కి సైతం అనుమతించని ప్రభుత్వం బాబూరావు కి అనుమతులను ఇస్తుంది. సదరు బాబూరావు గారు సేవించిన మద్యపాన బిల్లులను సైతం చెల్లించిన ఘనత యూనివర్శిటీకే దక్కింది. ఫైనలియర్ లో ఉన్న కమ్మ విద్యార్దులతో సన్నిహితంగా ఉంటూ వారితో తాగి తందనాలాడే ఆచార్యుడు ఆ పిల్లలకు ఏ పాఠాలు నేర్పించి ఉంటాడో ఊహించగలం.

రిషితేశ్వరి మరణానికి కారణాలేంటి? చరణ్, శ్రీనివాస్ లు ఇద్దరూ ఫైనలియర్ విద్యార్దులు మరియు బాబూరావు అనుంగు శిష్యులు. గురువు గారిని స్పూర్తిగా తీసుకున్న వాళ్ళిద్దరూ కులం తెచ్చి పెట్టిన బలుపుతో రిషితేశ్వరిని తమను ప్రేమించాలని వేధించేవారు. తాము చెప్పినట్టు చేయాలని ఒత్తిడి చేస్తున్న క్రమంలో జూన్ 13 సినిమాకు వెళ్ళిన రిషితేశ్వరిని హాలులో కూడా వేధింపులకు గురి చేశారు. సినిమా సగం నుండి వచ్చేసినందుకు పనిష్మెంటుగా హాస్టల్ లో సీనియర్ విద్యార్దినులతో తీవ్రంగా ర్యాగింగ్ చేయించారు. ర్యాగింగ్ చేసినట్లు నిర్దారణ కోసం చేస్తున్న సమయంలో మొబైల్ ఫోన్లలో వీడియో తీసి తమకు చూపాలని చెప్పటంతో వారు చెప్పినట్టే రిషితేశ్వరిని లైంగికంగా వేధిస్తూ దాన్ని వీడియో తీసి చరణ్, శ్రీనివాస్లకు చూపించింది హనీషా. ఆ వీడియోని కొంత మంది అగ్రకుల విద్యార్దులతో షేర్ చేశారనే భాదతో అవమానంతో ఆవేదనతో కాలేజి నుండి వెనుదిరిగిన రిషితేశ్వరి హాస్టల్ గదిలో ఉరి వేసుకుని చనిపోయిందనేది విద్యార్దులలో బలంగా వినపడుతున్న వాదన. అయితే ఆమె తల్లితండ్రులు మాత్రం తమ బిడ్డ అంత అధైర్యవంతురాలు కాదనీ గతంలో విజయవాడలోని ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతుండగా ఇలా లైంగిక వేదింపులకు గురిచేస్తూ తనతో అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఒక ఉపాధ్యాయుడి చెంప ఛెళ్ళుమనిపించి కాలేజీ మానేసి ఇంటికి వచ్చిందనీ దాంతో తాము ఆమె చదువును హన్మకొండలో కొనసాగింపజేశామని చెప్తున్నారు. తమ బిడ్డ అంతటి మనోనిబ్బరం గలదని ఆత్మహత్య తేసుకోదనీ పోవీసులు దీన్ని హత్య కోణంలో దర్యాప్తు చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

రిషితేశ్వరి కేసులో చీకటి కోణాలు... ఉరి వేసుకుని వేలాడుతున్న ఆమెను దించిందెవరు? హాస్టల్ లో ఉన్న తోటి విద్యార్దినుల కంటే ముందు ఆమె మరణ వార్త బాయ్స్ హాస్టల్ కు ఎలా చేరింది? ఉరి తాడు బిగించుకున్నప్పుడు ఆమెను మొదట చూసింది ఎవరు? బాబూరావుకు ఎందుకు ఫోన్ చేశారు? హాస్టల్ వార్డెన్ కు ఎందుకు సమాచారమివ్వలేదు? ఉరి వేసుకుని చనిపోయినట్టు నిరూపితమవ్వటానికి కనీసం ఒక్క ఫోటో కూడా ఆధారం లేదు, ఎందుకని? బాబూరావు సస్పెన్షన్ కు ముందుగానే నాటకీయంగా రాజీనామా ఎందుకిచ్చాడు? హైదరాబాద్ లో ఏం పైరవీలు నడుపుతున్నాడు? బాబూరావును కాపాడే ప్రయత్నం ఎవరు చేస్తున్నారు? కాలేజీలో సుప్రీం ఆదేశాల మేరకు ఏర్పాటు చేయాల్సిన యాంటీ ర్యాగింగ్ కమిటీని ఎందుకు ఏర్పాటు చేయలేదు? ముందు రోజు సినిమా హాల్లో ఏం జరిగింది? ఆమెను వేదిస్తూ తీసిన వీడియో ఏమయింది? రిషితేశ్వరిని వేదిస్తున్నారంటూ ఆమె చనిపోవటానికి పది రోజుల ముందు ఆమె పేరెంట్స్ ప్రిన్సిపాల్ కు కంప్లైంట్ ఇచ్చినా ఎందుకు చర్యలు తీసుకోలేదు? విద్యార్ది సంఘాల ఐక్యకార్యాచరణ కమిటీ నిన్న వినతి పత్రాన్నిచ్చి తాత్కాలికంగా ఆందోళనను విరమించుకున్నాక హడావిడిగా వర్శిటీకి ఇప్పుడెందుకు 10 రోజులు సెలవులిచ్చారు?

నిజ నిర్ధారణ కమిటీ సమావేశమయిన రోజు ఏం జరిగింది? కమిటీ ముందు తమ వాదనలు వినిపించటానికి విద్యార్దులు/విద్యార్ది సంఘాలు/తల్లితండ్రులు హాజరయ్యారు. కాలేజీలో జరుగుతున్న ర్యాగింగ్ కు, వేధింపులకు తన కులాన్ని సమర్ధిస్తూ చర్యలు తీసుకోకుండా అటువంటి వారిని ప్రోత్సహిస్తున్న ప్రిన్సిపాల్ ప్రవర్తనే కారణమని విద్యార్ది సంఘాలు ఆరోపణలు చేశాయి. గతంలో ఫ్రెషర్స్ పార్టీ ని యూనివర్శిటీలో కాకుండా హాయ్ ల్యాండ్ రిసార్ట్స్ లో నిర్వహించినప్పుడు ప్రిన్సిపాల్ బాబూరావు మద్యం తాగి స్టేజీ మీద ఆడపిల్లలతో డాన్స్ చేస్తూ వృత్తికి కళంకం తెచ్చే విదంగా ప్రవర్తించిన తీరుని నిరసిస్తూ విద్యార్ది సంఘాలు ఆ దృశ్యాలున్న సిడిని కమిటీకి అందజేసి దానిని అందరికీ చూపించాలని విజ్ఞప్తి చేయటంతో ఆ సిడిని వేసి చూపించారు. దీనితో ప్రిన్సిపాల్ తీసేయాలనే డిమాండ్ పెరగటంతో ప్రిన్సిపాల్ అనుకూల వర్గంగా ఉన్న ఫైనలియర్ కమ్మ విద్యార్దులు బాబూరావు లాంటి అనుభవమున్న ప్రిన్సిపాల్ తీయకూడదని అసలిది తమ కాలేజీ స్వవిషయమని యూనివర్శిటీకీ తల్లి తండ్రులకు సంభందం లేదంటూ అరుస్తూ గోల చేసి సమావేశాన్ని రసాభసా చేసి విద్యార్ది సంఘాల నాయకులపై దాడికి దిగారు.

సమావేశాన్ని వాయిదా వేసిన తర్వాత మీడియా ముందుకొచ్చిన ప్రొఫెసర్ శంకర్ పిచ్చయ్య(కమిటీ సభ్యుడు) మీడియాతో మాట్లాడుతూ అసలు తాగి డాన్సులాడితే తప్పేమిటి అంటూ నిస్సిగ్గుగా తన కులగజ్జిని ప్రదర్శించాడు. వర్శిటీలో కులం ఏ విధంగా రాజ్యమేలుతుందనటానికి శంకర్ పిచ్చయ్య మరో ఉదాహరణ. గతేడాది టిడిపి ప్రభుత్వంలోకి రావటానికి ముందు ఏ మూలనున్నాడో కూడా తెలియని ఆ ప్రొఫెసర్ ఈ రోజు యూనివర్శిటీకి సంభందించిన అన్ని కీలకమైన కమిటీలలోనూ కార్యక్రమాలలోనూ భాగస్వామి. ఇంత బహిరంగంగా కులాన్ని వెనకేసుకు రావటం చూస్తుంటే రిషితేశ్వరి కేసులో నిందుతులకు వారిని అడుగడుగునా ప్రోత్సహిస్తున్న బాబూరావు లాంటి ఆచార్యులకు శిక్ష పడదనే అనుమానాలు కలగక మానవు. రెండు వేల మంది సాక్షిగా, నిజ నిర్ధారణ కమిటీ సమావేశం జరుగుతుండగా విద్యార్గుల మీద కొంతమంది కమ్మ కుల గజ్జి పట్టిన విద్యార్దులు దాడి చేసినా ఉపకులపతుల వారికి చీమ కుట్టినట్టైనా లేదు. ఇదేమటని అడిగితే తాను ఘటనను ఖండించానని ప్రభుత్వం ఆదేశాల మేరకే నడుచుకుంటానని తన విధేయతను చాటుకున్నారు. సమావేశంలో జరిగిన దాడిని నిరసిస్తూ 24 తేదీన విద్యార్ది సంఘాల JAC నిరసన లేవదీసి విద్యార్దులందరితో కలిసి ర్యాలీగా విసి ఆఫీసుకు వినతి పత్రం ఇవ్వటానికి వెళ్ళారు. హాస్టల్స్ లో భద్రతా ప్రమాణాలను పెంచాలనీ, ర్యాగింగ్ కు పాల్పడిన విద్యార్దులను కఠినంగా శిక్షించాలనీ, ర్యాగింగ్ చట్ట ప్రకారం కాలేజి ప్రిన్సిపాల్ ను భాద్యుడిగా చేసి యూనివర్శిటీ నుండి బహిష్కరించాలనీ డిమాండ్ చేశారు. రిషితేశ్వరి కేసుని పరిష్కరించటానికి జ్యుడీషియల్ ఎంక్వయిరీని సిట్టింగ్ జడ్జితో వర్శిటీ క్యాంపస్ లోనే ఏర్పాటు చేయాలని విద్యార్దులందరూ కోరుకుంటున్నారు.

అసలు ర్యాగింగ్ పట్ల విద్యార్దినులపై జరుగుతున్న లైంగిక వేధింపుల పట్ల ప్రభుత్వాలెందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. సుప్రీం కోర్ట్ ఆదేశాల మేరకు ప్రతి కాలేజీలోనూ విభాగంలోనూ యాంటీ ర్యాగింగ్ కమిటీని ఏర్పాటు చేయాల్సిన భాద్యత కాలేజీ యాజమాన్యాల మీద ఉంది. కానీ ANU ఆర్కిటెక్చర్ కాలేజీ ఆ కమిటీలను వేయలేదు. అసలు అక్కడి విద్యార్దుల పోకడ చూస్తే అది కాలేజీయేనా లేక కులసంఘపు అడ్డానా అనే అనుమానం కలుగక మానదు.

పుష్కరాలలో 27 మంది చావుకి కారణమైన చంద్రబాబు రిషితేశ్వరి కేసుపై వ్యూహాత్మకంగా మౌనం వహిస్తున్నాడు. మంత్రి గంటా శ్రీనివాసరావు సమస్య సద్దుమణగటానికి వర్శిటీకి పది రోజులు సెలవులు ప్రకటించమంటూ విసి కి ఆదేశాలనిచ్చారు. ప్రతిపక్ష నేత జగన్ కు ఈ విషయం పై మాట్లాడితే అధికార పక్ష నాయకులు ఆయేషా కేసు గురించి లేవనెత్తుతారని నోరు మెదపడం లేదు. అయిన దానికీ కాని దానికీ ఆంధ్రోళ్ళ మీద విరుచుకు పడే తెలంగాణ ముఖ్యమంత్రి కేసిఆర్ తెలంగాణ ఆడబిడ్డ చనిపోతే ఎందుకు నోరు తెరవడం లేదు. పుష్కరాల మొదటి రోజు కావటం ఆ రోజు జరిగిన తొక్కిసలాటతో టిఆర్పీలు పెంచుకునే పనిలో ఉన్న మీడియా రిషితేశ్వరి అంశానికి ప్రాధాన్యతనివ్వలేదు. 23 న జరిగిన సమావేశంలో విద్యార్దుల మద్య జరిగిన ఘర్షణ తర్వాత మేల్కొన్న మీడియా ఆమె మరణాన్ని ర్యాగింగ్ కేసుగా మాత్రమే చూపించే ప్రయత్నాలు చేస్తుంది. జరిగిన వాస్తవాలను కప్పిపుచ్చుతూ బాబూరావుతో టివి ఇంటర్వ్యూలను ప్రసారం చేస్తూ నేరంలో తమ వంతు పాత్రను రక్తి కట్టిస్తున్నాయి.
- హర్ష వడ్లమూడి

Keywords : Rishitheshvari, Nagarjuna University, Andhrapradesh, Sue side, Murder, kamma Cast,
(2024-04-17 01:32:44)



No. of visitors : 34271

Suggested Posts


0 results

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


రిషితేశ్వరి