వాకపల్లి నెత్తిటి గాయానికి పదేళ్ళు
(ఆదివాసి రచయితల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి రామారావుదొర రాసిన ఈ వ్యాసం ఆగస్ట్ 2017 వీక్షణం పత్రికలో ప్రచురించబడినది)
మన దేశంలో మహిళలు తమ ప్రతిభతో రాణిస్తుంటే ప్రభుత్వాలు మాత్రం మా ఉదారత వల్లే సాధించినట్టు చెప్పుకొంటున్నాయి. అదే ఆదివాసీలో, దళితులో అయితే తామిచ్చిన రిజర్వేషన్లుగా గొప్పలు చెప్పుకొంటాయి. కాని తమను అత్యాచారం చేసి అపకీర్తి తలపెట్టిన పోలీసులను శిక్షించాలంటూ గత పదేళ్లుగా న్యాయం కోసం పోరాడుతున్న వాకపల్లి మహిళలను మాత్రం విద్రోహ శక్తులుగా ముద్రవేసి దోషులుగా నిలబెట్టింది మన సర్వసత్తాక గణతంత్ర దేశం.
2007 ఆగస్టు 20న విశాఖపట్నం జిల్లా జి. మాడుగుల మండలం నుర్మతి పంచాయితీ వాకపల్లి గ్రామనికి కూంబింగ్ పేరుతో గ్రేహౌండ్స్ దళాలు చొరబడ్డాయి. గ్రేహౌండ్స్ దళాలు పదకొండు మంది ఆదివాసీ కోందు మహిళలపై అత్యాచారానికి ఒడిగట్టిన అనైతిక సంఘటన గురించి అందరికి తెలిసిందే! ఈ ఆగస్టు 20తో ఆ అమానవీయ గాయానికి దశాబ్ద కాలం పూర్తవుతుంది. రాజ్యహింసను ఎదుర్కొంటూ, పోలీసుల బెదిరింపులకు లొంగకుండా, ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ పథకాలను, పోలీసులు ఇవ్వజూపిన డబ్బును నిర్మొహమాటంగా తిరస్కరించి, నిందితులైన పోలీసులను శిక్షించాలని దశాబ్దకాలంగా పోరాడుతూనే ఉన్నారు. ఆత్మ విశ్వాసం కోల్పోకుండా న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. ఇప్పటికే అందులోని ఇద్దరు మహిళలు మరణించారు కూడా. అయినా నేటికి మానని గాయంగా రగులుతూనే ఉంది. కాదు! కాదు! రగిలిస్తూనే ఉన్నారు. బాధిత కుటుంబాలే కాదు! ఆ గ్రామంలో నివసిస్తున్న అన్ని కోందు కుటుంబాలు నేటికి పోలీసుల వేధింపులకు గురికాబడు తున్నామని వాపోతున్నారు.
వాకపల్లి ఘటనకు సంబంధించి నేర నిర్ధారణ సరిగా జరగలేదని, సిబిఐతో విచారణ జరిపించి నిజాలు రాబట్టాలని మొదటి నుండీ ఆదివాసిలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తునే ఉన్నారు. అయినా ఈ దుర్మార్గానికి ఒడిగట్టింది ప్రభుత్వ బలగాలే గనుక, పైరెండు డిమాండ్లకు ప్రభుత్వం ఎక్కడ తావివ్వకుండా తన పని తాను కానిచ్చుకొంటు పోయింది. అది ప్రభుత్వాల సహజ వైఖరికి నిదర్శనం. హైకోర్టు 21 మంది నిందితుల్లో 13 మందిపై విచారణ కొనసాగిస్తూ, 8 మందికి మినహాయింపు ఇచ్చింది. ఆ 13 మంది నిందితులు (పోలీసులు) తమపై మోపిన కేసు ఎత్తి వేయాలంటూ పైకోర్టును ఆశ్రయించారు. ఇప్పుడు నిందితులపై సుప్రీంకోర్టు స్టే కొనసాగుతుంది. పోలీసు బలగాలు చేసిన దుర్మార్గానికి ఊరుదాటి బయటకు రాలేని స్థితి మహిళలదైతే! కాయ కష్టంతో పొట్ట పోసుకునే శ్రమ జీవులు తమ దైనందిన అవసరాల కోసం వారపు సంతలకనో, ఆఫీసు పనుల కోసమనో, అసుపత్రులకనో ఊరు దాటి బయటకు వచ్చిన గ్రామస్తులు సైతం పోలీసుల వేధింపులకు గురవుతున్నామని ఆవేదన చెందుతున్నారు.
ఘటన జరిగిన నాటి నుంచి ఆదివాసి ఐక్య పోరాట సమితి (ఎఐపిఎస్), మహిళా సంఘాలు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపట్టగా, ఆ రోజు వాకపల్లికి గ్రేహౌండ్స్ దళాలు వెళ్లినట్టు ఒప్పుకోవడమే కాకుండా, వారి వివరాలతో కూడిన జాబితా విడుదల చేసింది. కాని తగిన సమయంలో తగిన విధంగా వైద్య పరీక్షలు నిర్వహించలేదని నిరసనలు వెల్లువెత్తుతున్నా, ఈ కేసును అణగదొక్కడానికి వైద్య నివేదికల చుట్టూ తిప్పడానికే చూశారు. ఆ నివేదికను అడ్డుపెట్టుకుని రాష్ట్ర హోంశాఖ అత్యాచారం జరగలేదని నమ్మబలికింది.
గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి నాగిరెడ్డి విచారణ జరిపి వాంగ్మూలాలను రికార్డు చేశారు. ప్రజా సంఘాలు కోరినట్టు సి.బి.ఐ. లేదా ఎస్.ఆర్. శంకరన్ వంటి వారితో స్వతంత్ర విచారణ జరిపితే మరికొన్ని నిజాలు బయటకు వచ్చే అవకాశం ఉంది అనే సూచనను పట్టించుకోలేదు.
2007 డిసెంబర్ 14న సిఐడి ఎస్పి శివానంద రెడ్డి తన తుది నివేదికలో సంఘటనకు సంబంధించి పరిస్థితుల సాక్ష్యంపై ఆధార పడవచ్చు. సాక్ష్యం చెప్పేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు దొరలవచ్చు. అందులో తప్పు లేదు. కాని ఈ కేసులో వైద్య నివేదిక, పరిస్థితులు అన్నిటిని పరిగణనలోకి తీసుకొంటే అత్యాచారం జరిగిందనేది నమ్మశక్యంగా లేదు అని పేర్కొంటూ, ఆ స్త్రీలు ప్రతిఘటించకపోవడం అసహజంగా ఉందనే అంశం ప్రస్తావించారు. ఆ గ్రామానికి వెళ్లింది సామాన్య ప్రజలు కాదు. దొంగలు కాదు. ప్రతిఘటించడానికి! సాయుధులైన గ్రేహౌండ్స్ పోలీసు బలగాలు. అయినా రాష్ట్ర ప్రభుత్వం కనుసన్నల్లో పనిచేస్తూ, పోలీసు శాఖలో భాగమైన సిఐడి బాధితుల పక్షాన నిలబడి ప్రభుత్వానికి మచ్చ తెచ్చే నివేదిక పారదర్శకంగా ఇస్తుందనే నమ్మకం లేకే గదా! సి.బి.ఐ. లేదా ఎస్.ఆర్. శంకరన్ (అప్పటికి బతికే ఉన్నారు) గారిచే విచారణకు హక్కుల సంఘాలు డిమాండ్ చేశాయి.
సిబిసిఐడి ఎస్పి ఇచ్చిన తుది నివేదికతో అసంతృప్తి చెందిన వాకపల్లి మహిళలు 2008 ఏప్రిల్ 16న పాడేరు ప్రథమ శ్రేణి జుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో నిరసన ఫిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్పై విచారణ జరిపిన మేజిస్ట్రేట్ ఎ1 నుండి ఎ21 వరకు నిందితులపై 376(ఐఐ)(జి) ఆర్/డబ్ల్యు 149 ఐపిసి, ఎస్సి, ఎస్టి అత్యాచారాల నిరోధక చట్టం 3(ఎల్)(ఎక్స్) కింద కేసు నమోదు చేయాలనీ ఆదేశించారు. అయితే పాడేరు మేజిస్ట్రేట్ పిఆర్సి నెం.19 ఆఫ్ 2008లో చేపట్టిన ప్రొసీడింగ్స్ను కొట్టివేయాలని 2008 సెప్టెంబర్ 2న నిందితులు (పోలీసులు) హైకోర్టులో సిఆర్ఎల్. పి.నెం. 5598/2008 న దాఖలు చేశారు.
2008 సెప్టెంబర్ 4న హైకోర్టు పాడేరు మేజిస్ట్రేట్ కోర్టులో జరుగుతున్న ప్రొసీడింగ్స్ పై స్టే విదించింది. స్టే ఎత్తివేసి కేసు నమోదు చేసి విచారణ కొనసాగించాలని బాధిత మహిళలు సుప్రీంకోర్టుకు అప్పీలు చేయడం జరిగింది. నిందితులపై కేసు నమోదు చేయడానికే పదేళ్లుగా పోరాటం కొనసాగించవలసి వచ్చింది. బాధితుల వాంగ్మూలాల్లో లోపాలు, తేడాలు హైకోర్టు నిర్ణయించడం సరైనది కాదనే సూత్రం చట్టపరమైన ఆనవాయితీగా కొనసాగుతుంది.
దానిని అనుసరించి రేపో మాపో భారత అత్యున్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు అవుననో... కాదనో... తీర్పు వెలువరించనుంది. అది సమ్మతమో! ఆ సమ్మతమో! అదలా ఉంచితే సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా బాధిత కుటుంబాలతో సహా వాకపల్లి ఆదివాసిలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాంగి ముసలయ్య ఆ గ్రామ పెద్ద. మహిళలకు ఆ సమయంలో పెద్ద దిక్కుగా నిలిచిన వ్యక్తి. ముసలయ్య కుమారుడు పాంగి వెంకటరావు గ్రామస్థులతో కలసి 2012 ఏప్రిల్ 12న బ్యాంకు పనినిమిత్తం జి మాడుగుల వచ్చాడు. వెంకటరావు యూనియన్ బ్యాంక్ వద్ద ఉన్నట్టు తెలుసుకొన్న అప్పటి జి మాడుగుల సబ్ ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) శ్రీనివాసరావు కానిస్టేబుల్తో వచ్చి పోలీస్ స్టేషన్కు ఈడ్చుకెల్లి నిర్బంధించారు. సాయంత్రానికి పంచాయితీ సర్పంచ్, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు స్టేషన్కు వెళ్లి వెంకటరావుని విడిచిపెట్టాలని ప్రాధేయపడగా, మాకు ఇన్పార్మర్గా పనిచేయాలనీ ఎస్ఐ శ్రీనివాసరావు ఒత్తిడి చేశాడు. చేసేది లేక పోలీసుల అధీనంలో ఉన్న వెంకటరావును విడిచిపెట్టాలని రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయించారు. ఎచ్ఆర్సి పోలీసులకు నోటీసులు జారీ చేయడంతో వెంకటరావును పది రోజుల తరువాత విడిచిపెట్టారు. ఏ విచారణ లేకుండానే వాకపల్లిలో అత్యాచారమే జరగలేదని మొదటి నుంచి బుకాయిస్తున్న పోలీసులు ఘటన జరిగి పదేళ్లైనా ఆ గ్రామంపై ఇంత నిర్బంధం దేనికి ప్రయోగిస్తున్నట్టు? కేసు మానాన కేసు నడుస్తుంది. ఈ కేసును ఎక్కడో ఒక చోట తప్పుదారి పట్టించి నిందితులను కాపాడే ప్రయత్నంగా కనపడుతుంది.
-రామారావుదొర
ఆదివాసి రచయితల సంఘం ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రధాన కార్యదర్శి
Keywords : vakapally, visakhapatnam, police, maoists, adivasi
(2024-04-01 23:30:11)
No. of visitors : 4284
Suggested Posts
| Abduction and Wrongful Incarceration of Adivasi-Dalit activists by PoliceIntimidation, Abduction and Wrongful Incarceration of Adivasi-Dalit leaders, activists and members of Niyamgiri Suraksha Samiti by Odisha Police to further the interests of Vedanta |
| భారతదేశ జైళ్ళలో 50 శాతం దళితులు, ఆదివాసీలు, మైనారిటీలే ఎందుకున్నట్టు ?నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో (ఎన్సిఆర్బి) భారతదేశ జైళ్లలో నమోదైన వ్యక్తుల గణాంకాలను ʹ2019 ఎన్సిఆర్బి జైలు నివేదికʹ విడుదల చేసింది. |