ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 3... "వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"
ఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు ఫక్తు వ్యక్తిగతం అనిపించవచ్చుకానీ అవికూడా వర్తమానానికి అవసరమే... కొన్ని అనుభవాలు ఇప్పడు మనముందున్న సమస్యను కొత్తరకంగా చూడటం నేర్పిస్తాయి... కొన్ని అనుభవాలు వర్తమానాన్ని అద్భుతమైన భవిశ్యత్తుగా మార్చేందుకు దోహదపడతాయి... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే సీనియర్ జర్నలిస్టు పీవీ కొండల్ రావు గ్రౌండ్ రిపోర్ట్ "మునివేళ్ల కంటిన చరిత్ర" ... ఉద్యమ జిల్లాల్లో గ్రామీణ స్ట్రింగర్ స్థాయి నుంచి నేటి వరకూ కొనసాగిన ప్రస్థానం ధారావాహికంగా.. మీకోసం...
"వార్తలు-ఫాలో అప్ లు-బీర్పూర్-రంగరాయగూడెం"
ప్రధాన దినపత్రికల్లో ఒకటిగా కొనసాగిన ఆంధ్ర ప్రభ లో రాజకీయ వార్తలు, విశ్లేషణలు, ప్రజా సమస్యల వార్తలు ప్రముఖం గా ప్రచురిత మయ్యేది. ఆ కారణం గా మేం రాజకీయ విశ్లేషణలు మా వృత్తి ఆరంగేట్ర దశలోనే నేర్చుకోగలిగాం.అందువల్ల ఎప్పుడూ రాజకీయ సంబంధిత విశ్లేషణ చేయడం కోసం ప్రయత్నించేది. స్థానిక రాజకీయాల పైనే అయినా మొత్తానికి రాజకీయ వార్తలు రాయడం అలవాటయిపోయింది. అప్పుడే కరీంనగర్ జిల్లా తాడిచర్ల మండలాధ్యక్షుడు బెల్లంకొండ మలహర్ రావు ను అప్పటి పీపుల్స్ వార్ నక్సలైట్లు కిడ్నాప్ చేసారు. వాళ్ల డిమాండ్ కు అనుగుణం గా ప్రభుత్వం స్పందించలేదని మలహర్ రావు ను నక్సలైట్లు హత్య చేసారు.
అలాగే వరంగల్ జిల్లా నర్మెట్ట మండలాధ్యక్షుడు రాజి రెడ్డిని , జఫర్ గఢ్ మండలాధ్యక్షుడు నల్లా సంజీవ రెడ్డిని కూడా నక్సలైట్లు కిడ్నాప్ చేసారు. పీపుల్స్ వార్ నక్సలైట్లు అప్పుడప్పుడే వివిధ రకాల యుధ్ధ తంత్రాలను అమలుపరుస్తున్న తరుణమది. నల్లా సంజీవ రెడ్డి నేను వార్తలు రాసే జఫర్ గఢ్ పరిధి వ్యక్తి కావడం తో ఆయన వార్త రాయాలని నాకు కుతూహలం గా ఉండేది. అయితే రాష్ట్ర ప్రాధాన్యత ఉన్న వార్త కావడం వల్ల ఆ వార్తను వీ ఎల్ సార్ రాసేవారు. దాని ఫాలో అప్ వార్తలు కూడా జిల్లాల ప్రతినిధులు రాయడం , అవి ప్రచురితమవడం ఆనవాయితీ.
సంజీవ రెడ్డి కిడ్నాప్ జరిగి నాలుగైదు రోజులయింది. ఆయన కుటుంబం ఆందోళన పథం లో వున్నది. ఇదే దశ లో కరీం నగర్ లో సారంగాపూర్ ప్రాంతం లోని భీర్పూర్ గ్రామ సమీపం లో మందు పాతర తో ఓ జీపును పేల్చివేసారు. ఈ ఘటన కొత్త యుద్ధ వ్యూహాలకు తెర తీసింది అని అప్పట్లో ప్రచారమయింది గానీ ఘటన లో నక్సలైట్ల టార్గెట్ తప్పిందనే వాదన కారణం గానక్సలైట్లు డిఫెన్స్ లో పడిపోయారు. ఆ వెంటనే సంజీవరెడ్డినివిడుదల చేసారు. నేను కవర్ చేసే ప్రాంత వార్త కావడం వల్ల సంజీవ విడుదల ఫాలో అప్ వార్తను నేను డైరెక్ట్ గా గౌలిగూడ బాక్సుకు పంపాను. ఆ వార్త ఏడవ పేజీ లో టాప్ హెడ్ లైన్ గా "బీర్పూర్ ఘటన సంజీవ విడుదలకు కారణమా" అనే స్లగ్ తో ప్రచురితమైంది. ఈ వార్త చూసిన తర్వాత వీ ఎల్ సార్ మొదటి సారి నన్ను కోప్పడ్డారు.
ఆ తర్వాత అప్పుడున్న పరిస్థితుల నేపధ్యం లో నక్సలైట్లు వివిధ ఘటనలకు పాల్పడడం, నర్మెట్ట పోలీసు కాల్పుల వరకు దారి తీసింది. అనంతర కాలం లో యాజమాన్య నిర్ణయాల వల్ల సార్ ఆదిలాబాద్ కు బదిలీ అయ్యారు. రుద్రాభట్ల కిషన్ సార్ వరంగల్ కు వచ్చారు. నేనింకా ఘన్ పూర్ డేట్ లైన్ తోనే వార్తలు రాస్తున్న తరుణమది. ఈ సందర్భం లో నే మొట్ట మొదటి సారి ఒక ఇంటర్వ్యూకు పిలుపొచ్చింది. బీర్పుర్ వార్త అనుభవం దృష్ట్యా నేను కిషన్ సార్ కు విషయం చెప్పి బయలుదేరాను. ఇంటర్వ్యూ మా ప్రాంతం లోనే. నాతో పాటు ఈనాడుకు వార్తలు రాస్తున్న నరేందర్ , జ్యోతి కి వార్తలు రాస్తున్న రమేశ్, ఆ ఇంటర్వ్యూ కవర్ చేస్తారని చెప్పారు. నేను ఇంటినుంచి మమ్మల్ని తీసుకెళ్ళే మిత్రుడితో కలిసి బయలుదేరాను.
ఘన్ పూర్ లో రమేశ్ ఇంటికి వెళ్ళే సరికి ఆయన అందుబాటులో లేడు. నరేందర్ కు అప్పటికి వారం రోజుల క్రితమే పెళ్లయింది. ఆయన కూడా వస్తాడో రాడో అనుకుని ఆయన దగ్గరకు వెళ్లాం. రాత్రికల్లా మళ్ళీ ఇంటికి తిరిగి రావచ్చని, ఇబ్బందేమీ ఉండదని నచ్చజెప్పి మమ్మల్ని తీసుకెళ్లిన మిత్రుడు స్కూటర్ పై మా ఇద్దరినీ బయలుదేర దీశాడు.చీకటి పడుతున్నది. ఇప్పగూడెం గ్రామానికి చేరుకున్నాం. మా స్కూటర్ పంక్చర్ అయింది. మేం వెళ్ళాల్సిన ప్లేస్ కూడా దగ్గరలోనే వుండడం తో మా స్కూటర్ అక్కడే పెట్టి నడిచి వెళుతున్నాం . నరేందర్ ఇంట్లో రాత్రికి తప్పకుండా తిరిగి వస్తామనే హామీ తీసుకుని బయలుదేరిన విషయం ఆయన గుర్తుచేస్తూ వస్తున్నాడు. ఇప్పగూడెం శివారు రంగరాయగుడెం చేరుకున్నాం.
అక్కడ ఒక చెలుకలో ఆ గ్రామస్తులను అందరినీ ఒక చోట చేర్చి నాగన్న దళం సమావేశం నిర్వహిస్తున్నది.మొదటిసారి ఇలాంటి వార్త రాయబోతున్నామనే ఉత్సాహం ఉన్నప్పటికి రాత్రి వరకూ ఇల్లు చేరుతామా లేదా అనే భయం ఆవరించుకున్నది. అక్కడ మాట్లాడుతున్న తీరును బట్టి జిల్లా జననాట్యమండలి కన్వీనర్ సాంబన్న తో మా ఇంటర్వ్యూ అని అర్థమయింది. నేనూ , నరేందర్ పక్క పక్కన కూర్చున్నాం. నాగన్న గ్రామస్తులతో సమావేశం లో మాట్లాడుతున్నాడు. నరేందర్ నా చెవిలో మనం ఇంటికి ఎప్పుడు బయలుదేరగలం అని అడుగుతున్నాడు. మమ్మల్ని అక్కడికి తీసుకెళ్లిన మిత్రుడు దళసభ్యులతో పిచ్చా పాటీ మాట్లాడుకుంటూ సమావేశం లో లీనమయ్యాడు.
మేమిద్దరమూ మాట్లాడుకోవడం నాగన్న చూసాడు. అన్నా ఏందే ఏమో గుసగుసలు మాట్లాడుకుంటాండ్లు అని అడిగిండు. నరేందర్ బెరుకుగానే "అన్నా మేమిగ పోతం " అని అన్నాడు. దానికి నాగన్న ఇచ్చిన సమాధానం తో మేమిద్దరం గతుక్కుమన్నాం. "ఎట్ల బోతరన్నా చుట్టు మందు పాతరలున్నయి. మేము ఇక్కడినుంచి సేఫ్ ప్లేసుకు వెళ్లినంక మిమ్ములను దిగబెడుతరని నాగన్న అన్నడు. నరేందర్ , నేను ఇద్దరమూ నోరు మూసుకొని సెటిలయ్యాం. ఆ రాత్రి పక్కనే ఉన్న ఒక గూడెం లో ఓ అరుగు మీద నేను, ఒకరి ఇంటిముందు నులుక మంచం మీద నరేందర్ కలత నిద్ర పోయాం.
తెల్లవారి రఘునాధపల్లి మీదుగా ఘన్ పూర్ చేరుకునే వరకు నరేందర్ ముగ్గురు తమ్ముళ్ళూ అన్న కోసం మూడు చోట్ల ఎదురుచూస్తూ కనిపించారు. నరేందర్ కు గుర్తుందో లేదో కానీ ఈ అనుభవం ఎన్నటికీ మరిచిపోలేనిది.
ముందుగా ఇక్కడ రాయొద్దనుకున్నాగానీ , వెంకటాద్రిపేట భూ పోరాటం కూడా ఇక్కడే రాయాలనిపిస్తున్నది. స్టేషన్ ఘన్ పూర్ డేట్ లైన్ నుంచి ఇంకా వరంగల్ కు వెళ్ళక ముందే వరంగల్ లో రైతుకూలీ మహాసభలు జరిగాయి. ఆ సభ స్ఫూర్తి తో అనేక గ్రామాల్లో భూ ఆక్రమణలు జరిగాయి. ఇప్పుడైతే లైవ్ కవరేజి లు, స్క్రోలింగులు బ్రేకింగులు ఉంటున్నాయి గానీ అప్పుడు లైవ్ గా భూ పోరాటాలు కవర్ చేసినా పత్రికల్లో వార్తలు రాయడం మినహా వేరే మార్గం లేదు.
ఘన్ పూర్ ప్రాంతం లో అప్పుడు కడారి రాములు దళం ఉండేది. ఆ దళం వెంకటాద్రిపేట గ్రామం లో భూ పోరాటం లో భాగం గా గ్రామ భూస్వామి వెంకటరామి రెడ్డి భూమిని ఆక్రమించేందుకు గ్రామ రైతు కూలీలను సమాయత్తం చేస్తున్నది. ఘన్ పూర్ విలేఖరులకు సమాచారం అందింది. ఈ విషయాన్ని నేను కవర్ చేయాల్సి ఉంది. అప్పుడే బాంబే నుంచి సన్ డే అబ్జర్వర్ పత్రిక కోసం భూపోరాటం కవరేజీ కి వరంగల్ వచ్చిన చిదానంద్ రాజ్ ఘట్టా అనే రిపోర్టర్ బాబాయి ఇంటికి వచ్చాడు. కాకతీయ యునివర్సిటీ కి కూడా వచ్చి అక్కడ విద్యార్థి ఉద్యమాల గురించి తెలుసుకుని వెంకటాద్రిపేట కు వచ్చారు. యునివర్సిటీ లో రాజ్ ఘట్టా కు తోడుగా సీతారామా రావు సార్ వెంకటాద్రిపేట్ భూ ఆక్రమణ కవరేజి ని చూసేందుకు వచ్చారు. ఆ రోజు ఘటనను సన్ డే అబ్జర్వర్ లో "మాదిగ మల్లయ్యా ఇన్ హెరిట్స్ ద ఎర్త్" పేరిట రాసిన వార్త ఇంకా గుర్తు. ఇలా ఘన్ పూర్ లో వార్తల కవరేజీ కొనసాగింది.
-పీవీ కొండల్ రావు
Keywords : journalism, naxals, warangal, pv kondal rao, latest news
(2024-03-24 13:52:20)
No. of visitors : 2366
Suggested Posts
|
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 4... స్ట్రింగర్ జీవితం...గ్రామీణ జర్నలిస్టులు విభిన్నమైన అనుభవాలు, విలక్షణమైన అనుభూతులు కలిగి వుంటారు. పల్లెలే ప్రధానం గా గల మన దగ్గర చాలా మంది గ్రామీణ నేపధ్యం నుంచి వచ్చిన పాత్రికేయులే ఉంటారు. అందువల్ల వాళ్ల విశ్లేషణ తీరు ప్రజలకు, వాళ్ల జీవితాలకు చేరువలో ఉంటాయి. అలా ఉండడం వల్లనే పాత్రికేయులు సమాజ పునర్నిర్మాణ క్రమం లో వస్తున్న వుద్యమాలకు చాలా సార్లు బావుటాలుగా నిలిచారు... |
| ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 8..." వార్తా రచన... పఠనాసక్తి"...పీవీ కొండల్ రావుమహదేవ్ పూర్ ప్రాంతం లో పంజాబ్ కమాండోలను రంగం లోకి దించింది. పంజాబ్ కమాండోలు అక్కడి గూడాలు, పల్లెల్లో అరాచకాలు సృష్టించారు. అక్కడి గూడాల్లో మహిళల పై అఘాయిత్యాలకు పాల్పడ్డారు. ఆ ప్రాంతం లో పని చేసే దళాలకు ఈ అఘాయిత్యాలు సహజం గానే తీవ్ర ఆగ్రహం తెప్పించాయి. దాంతో అదే కమాండొలను టర్గెట్ చేస్తూ మందు పాతర పేల్చారు..... |
|
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 10... "అమాయకత్వం.. నిజాయితీ.. నిక్కచ్చితనం"నా ప్రి పీ హెచ్ డి పరీక్ష రోజు ఓ ఎన్ కౌంటర్ జరిగింది. మా ఊరికి పదిహేను కిలో మీటర్ల దూరం లో ఉండే మీదికొండ నెమిళ్ల బోడు లో దళ సభ్యుల వివాహ సందర్భ కార్యక్రమ క్యాంప్ పై పోలీస్ దాడి జరిగింది. ఆ ఘటన లో అయిదుగురు దళ సభ్యులు మృతి చెందారు. ఆ ఘటన సమాచారం జిల్లా కేంద్రం లో తెలుసుకున్న.... |
|
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 7...లీడ్స్..సూపర్ లీడ్స్... పీవీ కొండల్ రావుకిడ్నాప్ ఘటన పై ప్రభుత్వం ఇంక తెగే దాకా లాగొద్దని నిర్ణయించుకున్నది. నక్సలైట్ల డిమాండ్ మేరకు వాళ్ల నాయకుడు రణదేవ్ ను విడుదల చేసేందుకు అన్ని చర్యలూ తీసుకుంటున్నారు. ఆ రోజు కిషన్ సార్ యధావిధిగా భిన్న కోణాల్లో తన దైన శైలి లో వార్తలు టెలి ప్రింటర్ ద్వారా పంపారు. నేను కూడా ఇంగ్లీష్ పేపర్ లో ప్రచురణర్హమైన.... |
| ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 9...ʹరోజూ బై లైన్ లు రావు గదా...ʹ పీవీ కొండల్ రావుఊరుగొండ మందు పాతర ఘటన వరంగల్ నగరానికి దాదాపు కూత వేటు దూరం లోనే సంభవించిన ఘటన. ఆ ఘటన తో హనుమకొండ, వరంగల్ లు కూడా ఒక రకంగా వణికాయి. ఆ వెంటనే కరీం నగర్ లోని లెంకల గడ్డ ఘటన. ఆ ఘటన జరిగిన సందర్భం లో వరంగల్ ఎం జీ ఎం ఆసుపత్రి మార్చురీ దగ్గర పోలీసు బలగాలు పత్రికా ఫోటోగ్రాఫర్ల పై విరుచుకు పడ్డారు. దాంతో ఫోటోలు తీసుకునే అవకాశం లభించలేదు..... |
| ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 6...ఉద్యమం లాగే వార్తల్లో పోటీ... పీవీ కొండల్ రావువరంగల్ రైతుకూలీ సంఘం మహాసభలు ఒక చారిత్రక సత్యం. ఆ సభల అనంతరం అవి ఇచ్చిన స్ఫూర్తి తో గ్రామాలలో భూపోరాటాలు, భూ ఆక్రమణలు జరిగాయి. ఇవి జరుగుతున్న క్రమం లో ఆ వార్తలే పత్రిక లకు, పాత్రికేయులకు ప్రధాన వార్తలయ్యాయి. సహజం గానే ఈ వార్తలు రాయడం లో ధిట్ట అయిన... |
|
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹలో "మొదటి వార్త.. " - పీవీ కొండల్ రావుమా ప్రాంతానికి చెందిన రాజి రెడ్డి అనే నాయకుడు ఓ ప్రభుత్వ పథకాన్ని దుర్వినియోగం చేస్తున్నాడని ఆరోపిస్తూ ఇంకో పార్టీ ప్రతినిధి జారీ చేసిన ప్రకటనను నేను వార్త రూపంలో రాసాను. ఆ వార్త ప్రచురితమయింది. తెల్లారే సరికి నేనే ఆ వార్త రాసానని తెలుసుకున్న రాజి రెడ్డి మా ఇంటికి వచ్చాడు.... |
|
ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 12..."కిరికిరి"..."వార్నింగ్".. పీవీ కొండల్ రావు హైదరాబాద్ కు అప్పుడు కెన్యాకు చెందిన రచయిత గూగి వాతియోంగో వచ్చారు. ఆయన హైదరాబాద్ లో వేర్వేరు కార్యక్రమాలు, సాహితీ సభలు, ప్రజాసంఘాల నిరసనల్లో పాల్గొన్నారు. ఆయన ను హుస్నాబాద్ లోని చారిత్రక స్థూపం వద్దకు తీసుకెళ్లడానికి నేను గైడ్ గా వెళ్ళాను. కాకతీయ విశ్వవిద్యాయంలో కామన్వెల్త్ లిటరేచర్ లో భాగం గా ఇంగ్లీష్ విద్యార్థులు గూగి సాహిత్యాన్ని చదువుతారు..... |
| ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ 13..."వార్తలు.. విశ్వసనీయత" - పీవీ కొండల్ రావుఅప్పటి స్లగ్ "మర్ల బడ్డ మొగిలిచెర్ల" ఇప్పటికీ చరిత్రే. మొన్న జకీర్ సార్ తన పుస్తకానికి ʹమర్లబడ్డ మొగిలిచెర్లʹ అని టైటిల్ పెట్టుకున్నప్పుడు ఈ విషయాన్ని.... |
| ʹమునివేళ్ల కంటిన చరిత్రʹ - ఉద్యమాల జిల్లా సీనియర్ జర్నలిస్టు అనుభవాలుఒక జర్నలిస్టు అనుభవాలంటే చరిత్రను మన కండ్లముందు నిలపడమే... వర్తమానంలో నిలబడి నడిచివచ్చిన కాలాన్ని తోవను అంచనావేయడమే... కొన్ని అనుభవాలు మనను ఉత్తేజపర్చి సమాజాన్ని మనకు మరింత పరిచయంచేస్తాయి. అలాంటి అనేకనేక అనుభవాల కలబోతే "మునివేళ్ల కంటిన చరిత్ర"... |