గౌరీ లంకేష్ వాదన ఇంకా ముగియలేదు ...మానష్ ఫిరాక్ భట్టాచార్జీ
(మానష్ ఫిరాక్ భట్టాచార్జీ రాసిన ఈ వ్యాసం వీక్షణం అక్టోబర్ సంచికలో ప్రచురించబడినది)
హత్యకు గురైన జర్నలిస్టు, సామాజిక కార్యకర్త గౌరి లంకేశ్కు బెంగళూరులో ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు జరిగాయి. అది ఒక రాజకీయ హత్య. ఆ హత్య చేసిన కిరాయి గూండాలకు ఆమె గురించి ఏమీ తెలిసి ఉండకపోవచ్చు. తాము చంపవలసిన మనిషి అని తప్ప. అధికార అహంకారంతో తప్పుడు పనులు చేసే రాజకీయ నాయకులు తమ తప్పుడు పనుల గురించి మాట్లాడేవాళ్ల నోరు నొక్కడానికి ఈ కిరాయి హంతకులను ఉపయోగించుకుంటారు. రాజకీయ నాయకులు తమ పదవిని అడ్డం పెట్టుకుని ఏమైనా చేయవచ్చునని, పౌరులకు మాత్రం హద్దుదాటి వారిని ప్రశ్నించే హక్కులేదని వాళ్ల తర్కం.
కాని ప్రజాస్వామ్యంలో ఆ అనుమతించే హద్దు ఏమిటో ఎవరు నిర్ణయిస్తారు? రాజకీయ నాయకులా, పౌరులా, పౌరుల హక్కులకు హామీ ఇచ్చే చట్టాలా? అధికారానికీ ప్రజలకూ మధ్య ఒక కనిపించని ముళ్లతీగ వ్యాపించి ఉంది. మీరు ఆ తీగను దాటడానికి ప్రయత్నిస్తే, నెత్తురు ఓడడానికి సిద్ధపడి ఉండాలి.
ప్రజాస్వామ్యాన్ని విశ్వసించిన గౌరి లంకేశ్ నెత్తురోడడానికి భయపడలేదు. తనకు ప్రమాదం వచ్చినా సరే ఆ ముళ్ల కంచెను దాటాలని నిశ్చయించుకుంది. ప్రజాస్వామ్యంలో మీరు గొంతు విప్పడానికి హామీ ఉందేమో గాని మీరు ప్రాణాలతో బతికి ఉంటారనడానికి హామీ లేదు. ప్రజాస్వామ్యం అనేది రాజకీయాల కుతంత్రాలకు అడ్డుకట్ట వేసేది కాదు. గాంధీకి ముందూ తర్వాతా కూడ ఏ రాజకీయాలైనా ముతక హింసా తర్కాన్ని ఓడించలేకపోయాయి.
ఇద్దరు భారతీయ జనతా పార్టీ సభ్యులు వేసిన ఒక పరువు నష్టం దావాలో 2016 డిసెంబర్లో గౌరి లంకేశ్కు శిక్ష పడింది. ఆరునెలల జైలు శిక్ష, జరిమానా. తాను నడుపుతుండిన ʹగౌరి లంకేశ్ పత్రికెʹలో గౌరి ఈ ఇద్దరు రాజకీయవేత్తలకు వ్యతిరేకంగా కొన్ని ఆరోపణలు ప్రచురించింది. అయితే శిక్ష విధించిన న్యాయస్థానమే ఆమెకు బెయిల్ ఇచ్చింది. ఆ తీర్పు మీద పునర్విచారణకు పై కోర్టుకు వెళ్లవచ్చునని అనుమతించింది. ఈ అనుమతి కూడ ఆమెకు ప్రాణాంతకంగానే మారింది. న్యాయస్థానాలు మీ చట్టపరమైన హక్కునూ స్వాతంత్య్రాన్నీ హామీ ఇస్తాయి గాని, మీ ప్రాణాలకు హామీ ఇవ్వజాలవు. భారత ప్రజాస్వామ్యాన్ని ఆక్రమించడానికి ఫాసిస్టులు చేస్తున్న ప్రయత్నాలను నిరంతరాయంగా వ్యతిరేకించడమే తన కర్తవ్యం అన్నట్టు గౌరి లంకేశ్ పరిశోధనాత్మక జర్నలిస్టుగా చేసిన కృషి, అభిప్రాయాలు కూడ ఉండేవి. ప్రతి విషయంలోనూ ఆమె రాజకీయ వాదనల శక్తి ఆమె ఇచ్చే వివరాలతో బలోపేతమయ్యేది.
ఈ సంవత్సరం మార్చ్లో ఢిల్లీలో జరిగిన మానవ హక్కుల పరిరక్షకుల జాతీయ సదస్సులో ఆమె తన మనసులోని భావాలనూ ఆందోళనలనూ బహిరంగంగానే ప్రకటించారు: ʹఒక ప్రగతిశీల, లౌకిక రాష్ట్రంగా ఉండిన కర్ణాటక ప్రయాణం మతోన్మాద రాష్ట్రంగా మారేవైపు సాగుతుండడం ఆందోళనకరంగా, నిరాశాజనకంగా ఉంది...ʹ అని ఆమె అన్నారు. కర్ణాటకలో పన్నెండో శతాబ్దిలో ఉండిన సామాజిక సంస్కర్త బసవన్న గురించి ఆమె మాట్లాడారు. ఆ బసవన్న ʹమార్క్స్ కన్న చాల ముందే శ్రమకు దక్కవలసిన గౌరవం గురించి, సమానత్వం గురించి, హేతవాదం గురించి, మరీ ప్రత్యేకంగా బ్రాహ్మణ ఆధిపత్యం గురించి మాట్లాడాడుʹ అని ఆమె అన్నారు. ఆ బసవన్నను ఇవాళ హిందూ అభివృద్ధి నిరోధకులు సొంతం చేసుకోవడానికి అక్రమంగా ప్రయత్నిస్తు న్నారని ఆమె అన్నారు. అలాగే ఆమె పందొమ్మిదో శతాబ్ది ముస్లిం మత ప్రచారకుడు - కవి శిశునాల షరీఫా గురించి కూడ చెప్పారు. ఆయనను కర్ణాటక కబీర్ అని పిలుస్తారు. ఆయన గురువు గోవింద భట్ట అనే బ్రాహ్మణ సన్యాసి.
ఈ సాంస్కృతిక నేపథ్యంలో వర్తమాన కర్ణాటక రాజకీయాలు పూర్తిగా మతోన్మాదంతో, హత్య చేస్తామనే బెదిరింపులతో, అన్ని రకాల వేధింపుల తో నిండిపోవడం గురించి సభ దృష్టికి తెచ్చారు. ఆమె ఏదో ఒక విషయం వాదిస్తున్నట్టుగా కాక, తన సొంత ఉద్వేగాలు చెపుతున్నట్టుగా ఆవేదనతో మాట్లాడారు. ఇప్పటికైనా కళ్లు తెరిచి చూడండి అని శ్రోతలను కోరారు. ఇప్పుడు ఆమె హత్య వార్త తర్వాత ఆ వాదనలూ విన్నపాలు మరింత తీవ్రంగా ప్రతిధ్వనిస్తున్నాయి. సత్యాలను వినదలచుకోని వారూ, ఇతరులు కూడ వాటిని మరచిపోవాలని కోరుకునేవారూ ఆమె చెపుతున్నదంతా నిజం కాదేమో అన్నట్టుగా, నిజమైనా మరచిపోదగినదన్నట్టుగా ప్రవర్తించారు. ఆమె వాదనల నిరంతర పునరుక్తిని హత్య చేయడానికి జరిగిన ప్రయత్నమే ఆమె హత్య. కాని మౌనంలోకి నెట్టబడిన ఆమె గళం ఎంత ఎక్కువగా, ఎన్ని ఎక్కువసార్లు మాట్లాడుతున్నదంటే, వాటిని వినకుండా ఉండడం చివరికి గోడలకైనా అసాధ్యమవుతుంది.
గౌరి లంకేశ్, ఆమె మిత్రులు 2015లో సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ వేశారు. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లాలో గురు దత్తాత్రేయ బాబా బుడన్ స్వామి దర్గా లౌకిక స్వభావాన్ని వక్రీకరించడానికి జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకోవలసిందిగా ఆ పిటిషన్ కోరింది. హిందువులు, ముస్లింలు ఉమ్మడిగా ప్రార్థనలు, పూజలు జరిపే ఆ పవిత్ర స్థలాన్ని దక్షిణ భారతపు అయోధ్యగా మార్చడానికి, దాన్ని దేవాలయంగా మార్చి పూజారిని నియమించడానికి జరుగుతున్న ప్రయత్నాలను గురించి ఆమె ఫిర్యాదు చేశారు. సంపన్నమైన సాంస్కృతిక చిహ్నాన్ని, పురాజ్ఞాపకాన్ని ధ్వంసం చేయడానికి జరుగుతున్న ప్రయత్నాల పట్ల ఆమె తీవ్రంగా స్పందించారు.
అన్నిటికన్న మిన్నగా ఒక ప్రజాస్వామికవాదిగా ఆమె స్పందించారు. ఒక భారత పౌరురాలిగా భారతీయ జనతాపార్టీ ఫాసిస్టు, మతోన్మాద రాజకీయాలను నేను వ్యతిరేకిస్తున్నాను అని ఆమె ప్రకటించారు. ఆమె తనను తాను హిందువునని కూడ గాఢంగానే ప్రకటించుకున్నారు. హిందూ ధర్మపు ఆదర్శాలకు భారతీయ జనతా పార్టీ చేస్తున్న తప్పుడు వ్యాఖ్యానాలను నేను ఖండిస్తున్నాను అన్నారు.
అదే సమయంలో హిందువుగా ఉండడంలోని అన్యాయం గురించి కూడ ఆమె మాట్లాడారు. హిందూ ధర్మంలోని కులవ్యవస్థను నేను వ్యతిరేకిస్తాను. అది అన్యాయమైనది, అక్రమమైనది, పురుషాధిపత్యంతో కూడినది అని అన్నారామె. ఆమెను చంపడానికి కిరాయి కుదుర్చుకుని వచ్చిన హంతకులకు ప్రజాస్వామ్యం గురించీ, హిందూ తత్వం గురించీ, కుల వ్యవస్థ గురించీ ఏవైనా అభిప్రాయాలు ఉన్నాయో లేవో తెలియదు. అసలు ఆమాటకొస్తే ఏ విషయమైనా తెలుసో లేదో తెలియదు. అర్థాలనూ, ప్రాణాలనూ చిదిమేయడం ఎట్లా అనేది మాత్రమే తెలుసు.
ఇవాళ ప్రతి ఒక్కరూ తన గురించి అడుగుతున్న ప్రశ్ననే గౌరి లంకేశ్ గతంలో ఒక ఇంటర్వ్యూలో అడిగింది. ʹఎవరైనా ఒక స్త్రీని కేవలం ఆమె తన అభిప్రాయాలు ప్రకటిస్తున్నదనే కారణంతో అవమానించగలవా?ʹ అని. ప్రజాస్వామ్యంలో రాజకీయాలకూ, సంస్కృతికీ సంబంధించిన కీలకమైన ప్రశ్న ఇది.
గౌరి లంకేశ్ హత్య వార్త సోషల్ మీడియాలో ప్రచారంలోకి వచ్చిన తర్వాత, హిందూ అభివృద్ధి నిరోధక పక్షాల కార్యకర్తలు, వారిలో చాలమంది ట్విట్టర్ ఖాతాల్లో భారతీయ జనతా పార్టీ నాయకుల సహచరులు, తమ విషపూరిత ద్వేషాన్ని కుమ్మరించారు. తీవ్రమైన రాజకీయ భిన్నాభిప్రాయాలు ఉండడమే ఆమె హత్యకు తార్కిక, నైతిక సమర్థన అయినట్టుగా వ్యక్తీకరించారు.
ద్వేషం కళ్ల మీద ఎటువంటి పొరలు కప్పుతుందంటే, ద్వేషంతో సానుభూతీ, పశ్చాత్తాపమూ కూడ మాయమవుతాయి. పశ్చాత్తాపం లేని జాతీయవాదం తన తప్పుల గురించి ఒక్క క్షణం ఆగి ఆలోచించలేని జాతీయవాదమే అవుతుంది. తన తప్పులకు పశ్చాత్తాపం ప్రకటించని జాతీయవాదం తన పాత నేరాలనే అడ్డూ ఆపూ లేకుండా కొనసాగిస్తుంది. బహుశా జాతీయవాదం తరువాతనే ప్రపంచంలో హృదయాలలోని అస్థిపంజరా లను అంతిమంగా ఖననం చేయడం జరుగుతుందేమో.
2015 ఆగస్టులో జరిగిన విద్యావేత్త ఎం.ఎం. కల్బుర్గి హత్యతో కొట్టవచ్చినట్టుగా కనబడే పోలికలు ఉండడం మాత్రమే కాదు, గౌరి లంకేశ్ హత్య అదే 2015 ఆగస్టులో కరాచీలో కాల్చి చంపబడిన పాకిస్తానీ మానవ హక్కుల కార్యకర్త, సామాజిక కార్యకర్త సబీన్ మహ్మూద్ హత్యను కూడ గుర్తు తెస్తున్నది. వారి బహిరంగ వ్యక్తీకరణ నచ్చని శక్తిమంతులైన పురుషులు హత్య చేసిన ్పుస్తీలు కావడం వల్ల మాత్రమే కాదు.
రాజకీయ చరిత్రలు వేరువేరు అయినప్పటికీ ఈ రెండు విభజిత దేశాలలోనూ ఉదార గళాల స్థలం అంతకంతకూ ఎలా కుంచించుకు పోతున్నదో ఈ ఘటనలు చూపుతున్నాయి. కాని ఆ ఇద్దరి వాదనలూ ఇంకా మరింత బిగ్గరగా, మరింత స్పష్టంగా మార్మోగుతూ ఇతరులకు ప్రేరణనిస్తూనే ఉన్నాయి. ఏ విధంగా చూసినా ఫాసిజానికి వ్యతిరేకంగా గౌరి లంకేశ్ చేసిన వాదన ఇంకా ముగియలేదు.
-మానష్ ఫిరాక్ భట్టాచార్జీ
ఈ వ్యాసంhttps://thewire.in/175027/gauri-lankeshs-argument-not-laid-rest/నుంచి అనువాదం
(రచయిత న్యూఢిల్లీలోని అంబేద్కర్ విశ్వవిద్యాలయంలో అధ్యాపకులు)
Keywords : gauri lankesh, karnataka, bengaluru, hindutva, the wire
(2024-03-19 00:16:38)
No. of visitors : 1119
Suggested Posts
| గౌరీ లంకేష్ హత్యకు వ్యతిరేకంగా పోరాటాన్ని తీవ్రం చేద్దాం-మావోయిస్టు పార్టీ కేంధ్ర కమిటీ పిలుపు సీనియర్ జర్నలిస్టు, హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడిన గౌరీ లంకేష్ ను మావోయిస్టులు హత్య చేశారని కుట్రపూరితంగా జరుగుతున్న ప్రచారాన్ని సీపీఐ మావోయిస్టు పార్టీ తీవ్రంగా ఖండించింది. గౌరీ లంకేష్ ప్రజల పక్షాన హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా గొంతు విప్పడాన్ని సహించలేని సంఘ్ పరివార్ శక్తులే ఆమెను హత్య చేశాయని.... |
| ʹఅబద్దాల ఫ్యాక్టరీ ఆర్ఎస్ఎస్...ʹ- గౌరీ లంకేశ్ చివరి సంపాదకీయంఈ వారం సంచికలో భారత్లోని నకిలీ వార్తల ఫ్యాక్టరీల గురించి నా స్నేహితుడు వాసు ఓ వ్యాసం రాశారు. గోబెల్స్ దారిలో వెళ్తున్న ఆ అబద్దాల పత్రికల్లో ఎక్కువ భాగం మోడీ భక్తులు నడిపిస్తున్నవే. వాటి వల్ల జరిగే నష్టం గురించి నా సంపాదకీయంలో వివరించేందుకు ప్రయత్నిస్తాను. |
| సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ ను కాల్చి చంపిన మతోన్మాదులు !గౌరీ లంకేష్ ʹలంకేష్ పత్రికʹకు ఎడిటర్. ఆమె పత్రిక ద్వారా రాజకీయ నాయకుల అనేక అక్రమాలను బహిర్గతపర్చారు. మతోన్మాదానికి వ్యతిరేకంగా అనేక వ్యాసాలు రాశారు. గౌరీ లంకేష్ మతోన్మాదానికి వ్యతిరేకంగా రచనలు చేయడమే కాక అనేక ఆందోళనలో పాల్గొన్నారు. గతంలో ఓ బీజేపీ నేత అక్రమాలపై ఈమె పత్రికలో వ్యాసాలు రాశారు..... |
| జీనాహైతో మర్నా సీకో కదం కదం పర్ లడ్నా సీకో...గౌరీ లంకేష్ స్పూర్తిని కొనసాగిస్తాం...ఢిల్లీ నుండి కన్యాకుమారి దాకా మతోన్మాద హత్యారాజకీయాలను వ్యతిరేకిస్తూ నిరసన ప్రదర్శనలు జరిగాయి. బెంగళూరులో నిన్న మొదలైన ప్రదర్శనలు ఇవ్వాళ్ళ కూడా కొనసాగాయి. ఢిల్లీ, ముంబయ్, చెన్నై, కోయంబత్తూరు, లక్నో, అహ్మదాబాద్, జైపూర్ ,గుజరాత్, చండీగడ్, హైదరాబాద్ తో సహా అనేక చోట్ల ప్రదర్శకులు.... |
| నేను కూడ గౌరీ.. మేము కూడా గౌరీ... గౌరీ నీకు లాల్ సలామ్.. నినధించిన బెంగళూరుసీనియర్ జర్నలిస్టు, హిందుత్వ వ్యతిరేక పోరాట కార్యకర్త గౌరీ లంకేశ్ దారుణ హత్యకు నిరసనగా మంగళవారం చేపట్టిన ర్యాలీతో బెంగుళూరు వీధులు జనసంద్రంగా మారాయి. నేను కూడ గౌరీ, మేము కూడ గౌరీ అనే నినాదాలతో బెంగళూరు దద్దరిల్లింది. గౌరి హత్య విరోధి వేదిక ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు దేశవ్యాప్తంగా తరలి వచ్చిన .... |
| బీజేపీవి సిగ్గులేని రాజకీయాలు - హిందుత్వ , జాతీయత ఒక్కటేనన్న మాటలపై ప్రకాశ్ రాజ్ ఆగ్రహం!నాలాగా మతాన్ని కాకుండా మానవత్వాన్ని నమ్మేవారి పరిస్థితి ఏంటి? మేం ఈ దేశానికి చెందిన వాళ్లం కాదా? అసలు మీ ఏజెండా ఏంటి? పునర్జన్మను బలంగా నమ్మే మీరంతా నియంత హిట్లర్కు ప్రతీకలా? |
| Maoists condemn Gauri Lankesh murder, ask people to hit streets for ʹdetermined fightʹThe Communist Party of India (Maoist) has rejected the ʹpropaganda by Hindu fascist forcesʹ that Kannada journalist Gauri Lankesh was killed by Maoists. It said that the ʹSangh Parivarʹ killed Lankesh to muzzle the voice of pro-people forces.
In a release issued by Abhay, spokesman for Central Committee of CPI (Maoist).... |
| మనువాద శవపేటికకు దిగ్గొట్టిన నాలుగు మేకులు - ఎన్. నారాయణ రావు2013 ఆగస్టు 20 నుండి నరేంద్ర దభోల్కర్ హత్యతో మొదలై, 2015లో గోవింద్ పన్సారే, ప్రొఫెసర్ కల్బుర్గి, 2017 సెప్టెంబరు గౌరీ లంకేశ్ (జర్నలిస్టు) హత్యతో హిందూ మనువాద ఫాసిస్టుల అరాచకాలు తారాస్థాయికి చేరుకున్నాయి. నాలుగు హత్యలు.... హంతకుడు ఒక్కరే... అవే తుపాకీ గుళ్లు. ఈ దేశంలో మేధావులు తుపాకీ గుండ్లకు పిట్టల్లా రాలిపోతుంటే ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వాలకు .... |
| హిందుత్వ శక్తులనుండి ప్రాణహాని ఉన్నగిరీష్ కర్నాడ్ సహా 25 మందికి ప్రభుత్వ భద్రతహిందుత్వ శక్తుల నుంచి హాని కలిగే అవకాశం ఉన్న గిరీష్ కర్నాడ్, బార్గుర్ రమాచంద్రప్ప, కేఎస్ భగవాన్, యోగేష్ మాస్టర్, బెనర్జీ జయప్రకాష్, చెన్నవీర కన్నావి, నటరాజ్ హులియార్, చంద్రశేఖర్ తదితరులకు పోలసుల రక్షణ కల్పించారు. ప్రత్యేక లింగాయత్ కమ్యూనిటీ ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్న మాజీ ఐఏఎస్ ఎస్ఎమ్ జమ్దార్కు ప్రత్యేక రక్షణ కల్పించాలని.... |
| గ్రేట్ మార్చ్ ఫర్ డెమోక్రసి... హైదరాబాద్ లో భారీ ర్యాలీబెంగుళూరు లో హత్యకు గురైన సీనియర్ జర్నలిస్టు గౌరీ లంకేష్ హత్యకు నిరసనగా ఇవ్వాళ్ళ హైదరాబాద్ లో ʹగ్రేట్ మార్చ్ ఫర్ డెమోక్రసిʹ పేరుతో భారీ ర్యాలీ జరిగింది. టాంక్ బండ్ పైనున్న ముఖ్దుం మొయినుద్దీన్ విగ్రహం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు వందలాదిమంది కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు.... |