ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరిద్దాం - విప్లవ రచయితల సంఘం
(ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరిద్దామంటూ విప్లవరచయితల సంఘం ఇచ్చిన పిలుపు పూర్తి పాఠం)
ప్రపంచ తెలుగు మహా సభలను బహిష్కరిద్దాం
కష్టజీవికి ఇరువైపుల ఉండేవాళ్ళే కవులని చాటుదాం
తెలుగు ప్రజలారా, కవులారా, రచయితలారా, కళాకారులారా
తెలుగు నేల మీద ప్రపంచ తెలుగు మహాసభలు ఈ నలభై రెండేళ్లలో మూడోసారి జరగబోతున్నాయి. జరిగిన ప్రతీసారి ప్రభుత్వమే నిర్వహిస్తున్నది. అగ్రకుల, దోపిడీ, భూస్వామ్య పాలకులు బ్రాహ్మణీయ సంస్కృతిని, భాషను, భావజాలాన్ని ప్రచారం చేయడానికి ఈ సభలను ఉపయోగించుకుంటున్నారు. పాలకుల మీద వ్యక్తమవుతున్న ప్రజల నిరసనను దారి మళ్లించడం కోసం పాలకులు ప్రపంచ తెలుగు మహాసభలను వాడుకుంటున్నారు. కనుక గత రెండు సందర్భాలలోనూ, ఇప్పుడూ విప్లవ రచయితల సంఘం ఈ సభలను బహిష్కరిస్తున్నది. ఈ పిలుపులో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నది.
మార్చి 1975లో అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జలగం వెంగళరావు హైదరాబాద్లో మొదటిసారి తెలుగు మహాసభలను నిర్వహించాడు. తెలంగాణ రక్షణల కోసం 1969లో రవీంద్రనాథ్ అనే విద్యార్థిని ఖమ్మంలో నిరాహారదీక్షకు కూర్చోబెట్టిన వెంగళరావు తెలంగాణ ఉద్యమ ప్రభావంతో హెూం శాఖా మంత్రి అయి, అదే తెలంగాణ ఉద్యమాన్ని రక్తపుటేరుల్లో మంచాడు. శ్రీకాకుళ పోరాటాన్నిఎన్కౌంటర్ చేశాడు. రెండు ప్రజా పోరాటాలను అణచివేసి విశాలాంధ్ర పాలకుడిగా ప్రపంచ తెలుగు మహాసభల పేరు మీద ʹసమైక్యత ఉత్సవాలుʹ నిర్వహించాడు. విప్లవ కవి సుబ్బారావు పాణిగ్రాహి, చినబాబు, పంచాది ನಿర్మಲ, స్నేహలత, వెంపటాపు సత్యం మాస్టారును చంపిన వెంగళరావు ప్రభుత్వం ప్రజల వ్యతిరేకత నుంచి తప్పించుకోవడానికి ప్రపంచ తెలుగు మహాసభలను ముందుకు తెచ్చింది. ʹభూస్వామ్య, బూర్జువా సంస్కృతికి కైవారాలు ఈ సభలనిʹశ్రీశ్రీ బహిష్కరించాడు. ప్రజల జీవన్మరణ పోరాటాన్ని గానం చేస్తున్న విరసం కూడా ఈ సభల్ని బహిష్కరించింది.
2012 డిసెంబర్ 27 - 29 తేదీల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి రెండోసారి ఎత్తైన తిరుమల కొండమీద ప్రపంచ తెలుగు మహాసభలు నిర్వహించాడు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం తెలుగు రాష్ట్రంలో పాలక వర్గాలను భయానికి గురి చేసిన సందర్భం. యావత్ తెలంగాణ సమాజం ఏక నినాదం పలుకుతున్న కాలం. విద్యార్థి యువత నిరసన రూపంగా ఆత్మ బలిదానాలు చేసుకుంటూ ప్రాణాల్ని గడ్డిపోచతో సమానంగా చూస్తున్న సమయం. ఆ విధంగా పోరాట సంస్కృతిని ప్రజలు తెరమీదికి తెచ్చారు. ఇంకే మాత్రం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకోలేని స్థితిలో కోస్తా పాలకులు తెలుగు భాష పేరుమీద ప్రపంచ తెలుగు మహాసభలను ప్రారంభించారు. పోరాడే ప్రజల ఆలోచనలను మళ్లించే ప్రయత్నం చేశారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే ఈ సభలను బహిష్కరిస్తూ ఆనాడు విరసం నాయకత్వం తిరుపతిలో అరెస్టయ్యింది.
ఇప్పుడు హైదరాబాద్లో డిసెంబర్ 15 - 19, 2017 తేదీల్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహిస్తున్నాడు. తెలుగు ప్రజల మాతృభాష తెలుగును ఒకటో తరగతి నుంచి పన్నెండో తరగతి వరకు అమలు చేస్తామని, తెలంగాణ భాషా, సంస్కృతి, చారిత్రక ఔన్నత్యాన్ని ప్రతిబింబిస్తూ విస్మరణకు గురైన తెలంగాణ సాహితీ ప్రముఖులను బయటికి తీస్తామనే నినాదంతో ఈ సభలు జరుగుతున్నాయి. చూసే వాళ్లకు, వినే వాళ్లకు మంచిదే కదా! తెలుగు మహాసభలు జరగటమని అనిపిస్తుంది. కానీ ఇదొక నెపం మాత్రమే. నిజానికి మాతృభాషగా తెలుగును అమలు చేయాలనుకుంటే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే ప్రారంభించవచ్చు. అది జరగలేదు. కనీసం ప్రభుత్వ జీవోలన్నీ తెలుగులోనే ఉండాలని ఇప్పటికే అనేక జీవోలున్నాయి. కానీ తెలంగాణ ప్రభుత్వం పట్టించుకున్న సందర్భం లేదు. తెలంగాణ చరిత్రను, సాహిత్యాన్ని బయటికి తీయాలంటే ప్రభుత్వమే దానికోసం కొన్ని సెంటర్లను ప్రారంభించవచ్చు. తెలంగాణలోని ఆరు విశ్వవిద్యాలయాల్లోని చరిత్ర, తెలుగు శాఖలను బలోపేతం చేయడానికి ఖాళీ పోస్టులను నింపి, నిధులు కేటాయించి, పరిశోధనలు చేయించి ఈ మూడున్నర ఏళ్లలోనే ఎంతో కృషి చేసి ఉండవచ్చు. ఫలితాలు కూడా సమజానికి అందివచ్చేవి. విశ్వవిద్యాలయాల్లోని తెలుగు, చరిత్ర శాఖలు ప్రొఫెసర్లు లేక, పరిశోధనలకు నిధులు లేక నిస్సారంగా ఉన్నాయి. అన్ని విశ్వవిద్యాలయాలలో చరిత్ర, భాష కోసం ప్రత్యేక సెంటర్లును ప్రారంభించి పరిశోధనలు చేయించవచ్చు కదా. కానీ నిర్మాణాత్మకమైన ఇలాంటి కృషి ఏది జరగకుండా కేవలం ఆడంబరాల కోసం ఎన్నికల ముందు ప్రజల ఆలోచనలను ప్రభావితం చేయడానికి ప్రపంచ తెలుగు మహాసభలు జరుపుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పడిన మూడేళ్ల తర్వాత సాహిత్య అకాడమీని ఏర్పాటు చేయడం, ఉన్న తెలుగు అకాడమీకి సరైన నిధులు అందించక పోవటం చూస్తేనే భాషాసాహిత్యాల పట్ల కేసీఆర్ చిత్తశుద్ధిని మనం అర్థం చేసుకోవచ్చు
మావోయిస్టు ఎజెండానే నా ఎజెండా అంటూ ఎన్నికలలోకి పోయిన కేసీఆర్ అధికారంలోకి రాగానే శృతి, సాగర్లను బూటకపు ఎన్కౌంటర్లో చంపేశాడు. తెలంగాణ రాష్టం ఏర్పడితే ఎన్కౌంటర్లే ఉండవని చెప్పిన ఆయన వెంగళరావు వలెనే ఈ నేల మీద నెత్తురుటేరులు పారించాడు. అంతకు మునుపే రచయితలు, మేధావులు కలిసి జరపాలనుకున్న ప్రత్యామ్నాయ రాజకీయ వేదిక సభను అడ్డుకొని పౌర ప్రజాస్వామిక హక్కులను కాలరాశాడు. మలిదశ తెలంగాణ ఉద్యమం (1996 నుంచి)లో విద్యార్థిగా, అధ్యాపకుడిగా, వక్తగా, కవిగా, రచయితగా బహుముఖ పాత్ర వహించిన విరసం సభ్యుడు డా||సి.కాశీంపై తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం మొదటి రాజద్రోహం కేసును బనాయించింది. అదే విధంగా అరుణోదయ నాయకురాలు విమల మీద కేసును పెట్టి, వాళ్ల కార్యాలయాన్ని సీజ్ చేసింది. మల్లన్న సాగర్ రైతులను నీట ముంచారు. నేరెళ్ల దళితులను అరెస్టు చేసి చిత్రహింసలు పెట్టి, మానేరు ఇసుక మాఫియాకు దన్నుగా నిలిచారు. ధర్నాచౌక్ను ఎత్తేసి హైదరాబాద్ నగరంలో బహిరంగ సభలు పెట్టుకునే అవకాశం లేకుండా చేశారు. జేఏసీ నాయకుడు కోదండరాం సహాయంతో అధికారంలోకి వచ్చి ఆయన ఇంటి మీదే దాడిచేశారు. మూడున్నరేళ్ల కాలంలో పౌర, ప్రజాస్వామిక హక్కులను అణచివేసి, ప్రజలను నిరాశ్రయులను చేసి ప్రజా వ్యతిరేక పాలనను కొనసాగిస్తున్నకేసీఆర్ తనకు వ్యతిరేకంగా కవులు, కళాకారులు, రచయితలు మాట్లాడకుండా ఉండటానికి వారిలో భ్రమలు కల్పించడానికి ప్రపంచ తెలుగు మహాసభలను జరుపుతున్నాడు.
సమాజంలో హక్కుల హననం జరిగిన ప్రతీసారి కవి, రచయిత, కళాకారుడు ప్రజల పక్షం వహించటమే చరిత్ర పొడగున ఉన్న సంప్రదాయం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం యజ్ఞాలకు, గుడులకు, పండుగలకు ఇచ్చిన ప్రాధాన్యత విద్యా, వైద్యం, ఉపాధికి ఇవ్వక పోవడం వలన పోరాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో విద్యార్ధులు, నిరుద్యోగులు, ప్రజలు నిరాశలో ఉన్నారు. అగ్రకుల బ్రాహ్మణీయ సంస్కృతిని వ్యాపింపజేస్తూ దళిత, ఉత్పత్తికులాల ప్రజా సంస్కృతిని కనుమరుగు చేసే కుట్రను కేసీఆర్ ప్రభుత్వం చేస్తున్నది. ఇట్లాంటి సందర్భంలో ప్రాణమైనా పోనీ ప్రజలను మరువద్దని త్యాగపూరిత విలువలకు ప్రాణం పోసిన తెలంగాణ నేలలో రచయితలు, కవులు, కళాకారులు ప్రపంచ తెలుగు మహాసభలను బహిష్కరించవల్సిందిగా విరసం పిలుపునిస్తోంది.
రచనకు, కళారూపానికి పాలకులు ఇచ్చే గుర్తింపును ఏనాడో అధిగమించిన తెలంగాణ సృజనశీలురు మా పిలుపును ఆహ్వానిస్తారనే నమ్మకం విరసానికి ఉంది. శ్రమజీవుల ఆరాట పోరాటాలే మన రచనలకు వస్తువైనప్పుడు వారే మన రచనను గుండెల్లో దాచుకొని ప్రేమతో గౌరవించుకోవటంలోనే మన రచనకు గుర్తింపు ఉంటుంది. అందుకే. పెట్టుబడిదారుల డబ్బుతో, పాలకుల ఆదేశాలతో, బ్రాహ్మణీయ విలువలతో జరిగే ప్రపంచ తెలుగు మహాసభలకు హాజరుకావద్దని ప్రజాపక్షం వహించే రచయితలను కోరుతున్నాం. తెలంగాణ చరిత్ర, సంస్మృతి, భాషా సాహిత్యాలను మనమే తవ్వితీసి వాటికి సమున్నత గౌరవాన్ని ఇచ్చుకుందాం.
- విప్లవ రచయితల సంఘం
Keywords : world telugu conference, telangana, virasam
(2024-04-18 23:37:03)
No. of visitors : 1130
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |