దశాబ్దం దాటినా ఆరని కన్నీటి మంట... అయేషా మీరా హంతకులకు పాలకుల అండ
(అయేషా మీరా న్యాయపోరాటకమిటీ కరపత్రం పూర్తి పాఠం)
బహిరంగ సభ తేది: 31.03.2017 శనివారం
ఉదయం 10.00 గంటలకు వేదిక : ప్రెసక్లబ్, దుర్గా కళామందిరం ఎదుట, విజయవాడ
మిత్రులారా !
పదేళ్ళక్రితం డిసెంబరు 27, 2007న జరిగిన ఓ సంఘటన, ముక్కుపచ్చలారని ఓ పదహారేళ్ళ అయేషామీరా విజయవాడ దుర్గాలేడీస్ హాస్టల్లో అత్యంత పాశవికంగా చంపబడినది. పైగా ఆత్యాచారంచేసి చంపి ఉంటారని అనుకోవడానికి, తప్పుదోవ పట్టించడానికి నగ్నంగాచేసి శరీరంపై స్కెచ్ పెన్లతో పిచ్చివ్రాతలు రాశారు. చుట్టులా విద్యార్థినులు, క్రింద కాపలాకుక్క, కాపలాకు హాస్టల్ వార్డెన్, ఆమె భర్త. కానీ ఆయేషా ఎలా చంపబడిందీ నోరు విప్పలేదు. " విజయవాడ నగరారణ్యంలో జరిగిన ఈ ఘాతుకం కూతవేటు దూరంలో ఉన్న ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో ఆలస్యంగా మర్నాడు ఉదయం 8 గంటలకు రిజిస్టరు అయింది,
తెల్లవారేసరికి ఈ దారుణం తెలుసుకొని యావత్తు రాష్ట్రంలోని ప్రజలు చలించిపోయారు. హాస్టల్ కు పరుగులు తీశారు. హంతకులను విచారణలేకుండా కాల్చిపారేస్తే బాగుండునని నినాదాలు ఇచ్చారు. ఇదే అదనుగా విజయవాడ పోలీస్ కమీషనర్ ఆనంద్ పౌరహక్కుల సంఘాలపై బురదచల్లే ప్రయత్నం చేశాడు. ఆయేషామీరా తల్లిదండ్రులు షంషాద్ బేగం, సయ్యద్ భాషా గుండెలవిసేలా ఏడ్చారు. పోలీసులు న్యాయం చేస్తారని నమ్మారు. కనుపించని దేవుడికల్లా మొక్కారు. కనిపించిన రాజకీయ నాయకుల కాళ్ళు మొక్కారు. నేరపరిశోధనలో ఆయేషామీరా బంధువులు, లేడీస్ హాస్టల్ వంటవాడు, చుట్టుపక్కల 25సంవత్సరాల నుండి 30 సంవత్సరాల యువకులు, లడ్డు, ఉపేంద్ర సీంగ్ లను హంతకులని నమ్మించడానికి రాష్ట్ర పోలీసులు తీవ్రంగా కృషిచేశారు. వేలాదిమంది ప్రజలు ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కాని ఆయేషామీరా తల్లి షంషాద్ బేగం ప్రకటించిన ముద్దాయిల జోలికి మాత్రం వెళ్ళలేదు. తల్లి షంషాద్ బేగం ఏడుస్తూనే ఉంది. పసిబిడ్డ ఏడిస్తే తల్లి చందమామకథలు చెప్పి మాన్పిస్తుంది. అలాగే పోలీసులు రోజుకొక చందమామ కథ చెపుతూ అసలు హంతకులను కాపాడుతూ వచ్చారు. పోలీసులు చెప్పిన చివరి చందమామకథ అనాసాగరానికి చెందిన దళితుడు, పేదవాడు మరియమ్మ కొడుకు ʹసత్యంబాబుʹ, ఆ వూరుకాని ఆ వాడకాని ఏసంబంధంలేని సత్యంబాబు ʹఐ లవ్ యుʹ చెప్పి పక్కింట్లో ఉన్న రోకలిబండతో కొట్టి చంపివేసినట్లు, పైగా ఓ ఉత్తరం కూడా వ్రాసినట్లు, ఆయేషాను ఎలా చంపింది, మా దర్యాప్తులో తేలనివి నేరస్థుడు స్వయంగా మీడియాముందు చెపుతాడని, ఇదే మా ఆఖరి చందమామకథ
అని ప్రకటించి చేతులు దులుపుకొన్నారు. ప్రజలు, ఆయేషామీరా తల్లిదండ్రులు ఆ కథను నమ్మలేదు. నేరస్థులకు ప్రభుత్వ అండదండలు ఉన్నాయని విమర్శించారు. ప్రజాసంఘాలు, ప్రతిపక్షంలో ఉన్న తెలుగుదేశం అసలు నేరస్తులపై కేసు నమోదుచేసి న్యాయంచెయ్యాలని డిమాండ్ చేశారు. న్యాయంకోసం కొవ్వొత్తుల ప్రదర్శనచేస్తే ప్రభుత్వం ఆగ్రహించి న్యాయవాదులను, హక్కులసంఘాల, విద్యార్థి, మహిళా, దళితసంఘాల నాయకులపై కేసులు పెట్టి కోర్టులో ఏళ్ళతరబడి విచారించారు. ప్రజాస్వామ్యం నోరునొక్కి సత్యంబాబుపై కేసు విచారణ త్వరితంగా జరిపించి, యావజ్జీవశిక్ష వేయించారు. హాస్టలువార్డెన్ కు, విద్యార్థినులకు కోర్టు అనుమతి ఇచ్చినా నార్కో ఎనాలిసిస్ పరీక్షలు చేయకుండా లంచం తీసుకొని రిపోర్టులు ఇచ్చే ఫోరెన్సిక్ లాబ్ ప్రొఫెసరుతో కుమ్మక్కయి తప్పుడు DNA రిపోర్టులు కోర్టు ముందు పెట్టి సత్యంబాబుకు యావజ్జీవ శిక్షవేయించారు.
సంవత్సరాలు గడిచిపోయాయి, సత్యంబాబు తల్లి మరియమ్మ రోదిస్తూనే ఉంది. ఆయేషామీరాతల్లి షంషాదాబేగం వ్యవస్థపైనే నమ్మకం పోయి నిశ్చేష్టురాలయింది. హైకోర్టులో జరిపిన న్యాయపోరాటంతో 2017 ఏప్రియల్ 30వ తేదీన సత్యంబాబు నిర్దోషి అని హైకోర్టు తీర్పు ఇచ్చింది. అదే తీర్పులో ఆయేషామీరా హత్యకేసు విచారణకు తప్పుదోవ పట్టించిన ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్లపై చర్యలు తీసుకోవాలని, సత్యంబాబుకు నష్టపరిహారం చెల్లించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
ఎన్ని సంవత్సరాలకైనా న్యాయం జరుగుతుందని నమ్మిన ఆయేషా మీరా తల్లి షంషాద్ బేగం న్యాయపోరాటం మొదలు పెట్టింది. అసలు నేరస్థులపై విచారణ చేయించాలని హైకోర్టును ఆశ్రయించింది. మహిళాహక్కుల కోసం పనిచేస్తున్న ప్రొఫెసర్ రమామెల్కేటే, సంధ్య, సజయ పిటిషనర్లుగా హైకోర్టులో ప్రజావాజ్యం (PIL)వేసి అయేషామీరా కేసులో న్యాయవిచారణ జరిపించాలన్నారు.
అప్పుడు ఉమ్మడి రాష్ట్రాల అత్యున్నత న్యాయస్థానం తన పర్యవేక్షణలో ప్రత్యేక పరిశోధన బృందాన్ని ఏర్పాటుచేసింది. అయేషా మీరా అసలు హంతకుల్ని పట్టుకోండి అని వారికి పని అప్పచెప్పింది.
మన ఉమ్మడి రాష్ట్రం అత్యున్నత న్యాయస్థానం రెండు సంచలనాత్మక తీర్పులనిచ్చింది. రెండూ ఆయేషా మీరా సంచలాత్మక కేసు గురించే. అయితే ఆ తీర్పులు సవ్యంగా అమలు జరిగేదెలా? అన్నదే ప్రశ్న అపలు జరుగుతుందా? అని గుండెలవిసేలారోదిస్తున్న ʹఆయేషామీరాʹ తల్లిదండ్రులకు అండగా నిలబడదాం ! నిమ్రా కాలేజీ బి ఫార్మసీ విద్యార్థిని ఆయేషా హత్యకేసు దశాబ్దం దాటినా ఆరని కన్నీటి మంట ఏడాది దాటినా సత్యంబాబు కేసులో అమలు జరగని తీర్పు..
బహిరంగ సభ తేది: 31.03.2017 శనివారం
ఉదయం 10.00 గంటలకు వేదిక : ప్రెసక్లబ్, దుర్గా కళామందిరం ఎదుట, విజయవాడ..
అధ్యక్షులు : గంగాభవాని (ఆయేషామీరా న్యాయ పోరాట కమిటీ కన్వీనర్)
ప్రధానవక్తలు : దేవి (సామాజిక కార్యకర్త)
వసుధ నాగరాజ్ (హైకోర్టు న్యాయవాది) పిడతల మరియమ్మ (సత్యంబాబు తల్లి) ప్రజా సంఘాల బాధ్యులు ప్రసంగిస్తారు
- ఆయేషా మీరా న్యాయపోరాట కమిటి (భాగస్వామ్య సంఘాలు : పౌరహక్కుల సంఘం, Pow, CMs, ఐద్వా, NFIW, ముస్లిం యునైటెడ్ ఫ్రంట్, HRF, బెణవాడ బార్ అసోసియేషన్ మానవహక్కుల కమిటీ, AIRWO, KNPS, విరసం
| తదితర ప్రజాసంఘాలు)
Keywords : ayeshameera, vijayawada, satyambabu, mother, congress party, tdp, CMS, CLC, VIRASAM,
(2024-03-09 10:18:23)
No. of visitors : 1936
Suggested Posts
0 results