మార్క్స్ నుంచి నేర్చుకుందాం - సి. కాశీం
(నడుస్తున్న తెలంగాణ మాస పత్రిక మే 2018 సంచికలో ప్రచురించబడినది)
యువ హెగెలియన్లలో ఒకరైన మోజెస్ హెన్ 1841లో తన మిత్రునికి లేఖ రాస్తూ ʹʹప్రస్తుతం జీవించి ఉన్న వారిలో బహుశా ఒకే ఒక నిజమైన తత్త్వవేత్త, మహా మహుడు అయిన వ్యక్తిని కలుసుకునేందుకు నీవు సిద్ధం కావాలి. త్వరలోనే అతడు ఎక్కడైనా కనిపించవచ్చు. ఉపన్యాసకుడుగా, రచయితగా ఎలా కనిపించినా జర్మని దృష్టినంతా ఆకర్షిస్తాడు. డాక్టర్ మార్క్స్ ఇప్పటికింకా చిన్నవాడే(24 ఏండ్లు). మధ్యయుగాల నాటి మతాన్ని, రాజకీయాలను ఆయన చివరి దెబ్బకొడతాడు. సునిసితమైన తాత్త్విక చిత్తశుద్ధిని, పదునైన వాక్చాతుర్యాన్ని ఆయన ఏకకాలంలో ప్రయోగిస్తాడు. రూసో, వాల్టెర్, హాల్చక్, లెసింగ్, హైనే, హెగెల్ వీరంతా ఒకే వ్యక్తిలో ఉన్నారనుకో. అందర్నీ ఒకే చోట చేర్చితే అని నేను అనటం లేదు. అందరూ కలిసి ఒకే వ్యక్తిగా రూపుదాలిస్తే - ఆ వ్యక్తి డాక్టర్ మార్క్స్ అవుతాడు.ʹʹ మార్క్స్ గురించి రాసిన ఈ మాటలు ఏ మాత్రం అతిశయోక్తి కాదు. కానీ, మార్క్స్ వీటినంగీకరించక పోవచ్చు. ఎందుకంటే మార్క్స్ వైయుక్తిక జ్ఞానానికంటే సామూహిక జ్ఞానానికి విలువనిచ్చే వ్యక్తి. చరిత్రలో మొదటిసారి ప్రజలే చరిత్ర నిర్మాతలని ఎలుగెత్తిచాటినవాడు. వ్యక్తులకుండే జ్ఞానం ప్రజలిచ్చిందేనని నమ్మేవాడు. ప్రతి మనిషి చైతన్యాన్ని వారి సామాజిక అస్తిత్వమే నిర్ణయిస్తుందని చెప్పినవాడు. ప్రతి సమాజానికి ఒక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రకొక గమనం ఉంటుంది. ఆ గమనంలో నిలబడిన స్థానాన్ని బట్టి వ్యక్తుల చరిత్ర నిర్మించబడుతుందని నమ్మిన సోషల్ సైంటిస్ట్ మార్క్స్.
మార్క్స్ శతజయంతి, ద్విశత జయంతులు జరుపుకోవడమంటే కేవలం ఆయన గురించి మాట్లాడుకోవటమే కాదు. ఆయన జీవితం నుంచి, అధ్యయన కృషి నుంచి, ఆచరణ నుంచి మనం నేర్చుకోవటమని అర్థం. వాళ్లు వదిలివెళ్లిన ఆశయాలను సాధించే క్రమంలో మన ప్రతి వ్యక్తీకరణలో వాళ్లు భాగంగా ఉండాలి.
మార్క్స్ 1818 మే 5న జర్మనిలోని ట్రయర్ నగరంలో జన్మించాడు. తల్లి హెన్రెట్టా. తండ్రి హెన్రిచ్ మార్క్స్. తొమ్మిది మంది సంతానంలో మార్క్స్ మూడవవాడు. మార్క్స్ తండ్రి ఒక న్యాయవాది. దుర్భర దారిద్య్రాన్ని అనుభవించి స్వయంకృషితో పైకొచ్చాడు. యూదుడైనందున అనేక అవమానాలకు గురై క్రైస్తవ మతాన్ని స్వీకరించాడు. ఈ మొత్తం క్రమంలో మార్క్స్పై తండ్రి ప్రభావం విశేషంగానే ఉండింది. మార్క్స్కు తండ్రంటే ఎనలేని ప్రేమ. మార్క్స్ తన పన్నెండవ ఏట ట్రయర్లోని హైస్కూల్లో చేరాడు. అక్కడ ప్రముఖ శాస్త్రజ్ఞులు టీచర్లుగా ఉండేవారు. చురుకైన మార్క్స్ను ఆ టీచర్లు అమితంగా ప్రేమించి జ్ఞానాన్నిచ్చారు. 17 ఏళ్లకు పాఠశాల విద్యను పూర్తిచేసుకున్నాడు. ప్రాచీన సాహిత్యంలో, జర్మన్ భాషలోనూ, చరిత్ర పాఠాలలోనూ మార్క్స్కు ఎనలేని ప్రతిభ ఉందని గణితంలో అతడు ప్రజ్ఞావంతుడని టీచర్లు మార్క్స్ ప్రోగ్రెస్ కార్డులో రాసారు. చదువుచెప్పిన టీచర్ల చేత ఈ విధంగా మెప్పుపొందిన వ్యక్తులలో అరుదైన వ్యక్తి మార్క్స్.
కార్ల్ మార్క్స్ విద్యార్థి జీవితం నేటితరం విద్యార్థులందరికీ ఆదర్శం. పాఠశాల విద్య చదువుతుండిన రోజుల్లోనే ʹవృత్తి ఎంపికలో ఒక యువకుని భావాలుʹ అనే వ్యాసంలో మార్క్స్ అద్భుతమైన విషయాలు చెప్పాడు. ప్రజలందరి మేలుకోరి పనిచేస్తూ ఆ క్రమంలో అభివృద్ధి చెందిన వారినే చరిత్ర మహానుభావులగా పేర్కొంటున్నది. ప్రజలందరికీ సంతోషం చేకూర్చే వాళ్లే నిజమైన మనుషులని అతడు ఆ వ్యాసంలో రాసాడు.
మార్క్స్ 1835లో బాన్ యూనివర్సిటీలో చేరాడు. ఆ యూనివర్సిటీలో 700 మంది విద్యార్థులుండేవారు. అది రైన్ రాష్ట్రంలో ఉండేది. అదొక మేధావుల కేంద్రం. మార్క్స్ను ఆ యూనివర్సిటి ఎంతగానో ప్రభావితం చేసింది. అక్కడ మార్క్స్ జీవితం రొమాంటిక్గా, ఆకర్షణీయంగా గడిచింది. చాలా అల్లరిగా గడిపాడు. ఓ రాత్రి మార్క్స్ చేసిన అల్లరికి యూనివర్సిటీ అధికారులు అతన్ని నిర్బంధంలో ఉంచారు. మార్క్స్ ఎప్పుడూ ఒక విద్యార్థి బృందాన్ని తనతో తిప్పుకునేవాడు. ఆ బృందం పోలీసులకు, రాజవంశీకులకు ఎన్నడూ తనవంచలేదు. ఓ రాజ కుటుంబీకునితో మార్క్స్ ద్వంద యుద్ధమే చేసాడు. ఈ క్రమంలో యుద్ధ కవుల సంఘంలో చేరాడు.
మార్క్స్ అద్భుతమైన ప్రేమికుడు. సున్నితమైనవాడు. కవి.
ప్రష్యన్ ప్రభుత్వ కౌన్సిలర్ లుడ్విగ్ కూతురైన జెన్నివన్ వెస్ట్ ఫాలెన్ను ప్రేమించాడు. ట్రయర్ ప్రాంతానికే పేరు మోసిన అందగత్తె అయిన జెన్నీ సంపన్న కుటుంబ యువకులను కాదని మార్క్స్ ప్రేమ కోసం తపించింది. తనకంటే రెండేళ్లు చిన్నవాడైన ఒక సాధారణ లాయర్ కొడుకు మార్క్స్ను కోరుకున్నది. అతడి జీవితంలో భాగమైన నిర్బంధాన్ని, ప్రవాసాన్ని, అక్షరాలను, ఆశయాలను ఆమె ప్రేమించింది.
ఈ ప్రపంచంలో తత్వశాస్త్రం గురించి మాట్లాడుకోవల్సి వస్తే మార్క్స్కు ముందు, మార్క్స్కు తర్వాత అని ఒక విభజన రేఖ గీయవల్సిందే. తనకు ముందు తలకిందులుగా ఉన్న తత్వశాస్త్రాన్ని నిటారుగా నిలబెట్టిన సామాజిక శాస్త్రవేత్త మార్క్స్. తండ్రి కోరిక మేరకు న్యాయశాస్త్రాన్ని చదువుతుండిన మార్క్స్కు ప్రాకృతిక న్యాయసూత్రాలను అర్థం చేసుకోవాలంటే తత్వశాస్త్ర అధ్యయనం అనివార్యమైంది. ఈ ప్రయాణంలో న్యాయశాస్త్రాన్ని మధ్యలో వదిలేసి తత్వశాస్త్రం వైపు తన ఆసక్తిని మళ్లించాడు. అలేఖ్య ప్రజ్ఞావంతుడైన మార్క్స్ అహోరాత్రులు కష్టపడి చదివాడు. మొదటి నుంచీ ఆయనది స్వయంకృషి. ప్రామాణిక సారస్వతాన్ని మూలాధారాలను చూసి వాటిని ధృవపరుచుకునే ప్రయత్నంలో తత్వశాస్త్రంలో అనేక ప్రయోగాలు చేసాడు.
భావాల అభివృద్ధి గురించి ఆలోచించే క్రమంలో తత్వశాస్త్రంలోకి శాస్త్రీయ దృక్పథాన్ని ప్రవేశపెట్టినవాడు మార్క్స్. మనిషి, ప్రకృతి, సమాజం, ఆలోచనల అభివృద్ధి క్రమానికి సంబంధించిన సాధారణ నియమాలను రూపొందించాడు. వీటి వ్యక్తీకరణనే తత్వశాస్త్రంగా నిర్ధారించాడు. ప్రతి భావానికి ఆధారభూతం పదార్థమేనని, పదార్థం నుంచే చైతన్యం వస్తుందని నిరూపించాడు. తనకు గురు సమానుడైన హెగెల్లోని భావవాదాన్ని విసర్జించి, అతని నుంచే గతితర్కాన్ని స్వీకరించి, ఫ్యూర్బాలోని యాంత్రికవాదాన్ని వదిలేసి భౌతికవాదాన్ని గ్రహించి ʹʹగతితార్కిక చారిత్రక భౌతికవాదాన్నిʹʹ రూపొందించాడు. దీని పునాది మీదే ప్రపంచ కార్మిక వర్గానికి వర్గ పోరాట సిద్ధాంతాన్ని అందించాడు.
విస్తృత అధ్యయనం చేయటంలో ఎవరైనా మార్క్స్ తర్వాతనే. చదవటాన్ని, రాయటాన్ని ఆయన ప్రేమించినంతగా మరెవ్వరూ అభిమానించి ఉండకపోవచ్చు. జీవితంలోని ప్రతి కష్టాన్ని ఇష్టంగా కొనసాగించాడు. ఈ తరం అతని నుంచి నేర్చుకోవల్సిన గొప్ప లక్షణమిది. ʹపుస్తకాలు నాకు బానిసలు. అవి నాకు సేవ చేసి తీరాలʹని మార్క్స్ అన్నాడు. పుస్తకాలు చదువుతూ ఉన్నప్పుడు ముఖ్యాంశాల కింద గీతలు గీసి అవసరమైనప్పుడు కావల్సిన పేజీని తీసే అమోఘమైన జ్ఞాపకశక్తి మార్క్స్ స్వంతం. పుస్తకం మార్జిన్లో రచయిత చెప్పదల్చుకున్న భావాన్ని రాసిపెట్టుకునేవాడు. చదివి తానర్థం చేసుకున్న ముఖ్య గ్రంథాలన్నింటిలో నుంచి సినాప్సిస్ తయారుచేసుకునేవాడు.
ఈ అధ్యయన కృషే అతన్ని క్యాపిటల్ రచన వైపు మళ్లించింది. 1850లో మొదలుపెట్టి 1865 వరకు క్యాపిటల్ను పూర్తిచేసాడు. అనేక ఆర్థిక బాధలను అనుభవించి, ప్రపంచంలోని ఆర్థిక బాధలను మనముందుంచాడు. పూర్తిగా తాకట్టు కొట్టుపై ఆధారపడి బతుకుతున్నానని 1865 జూలైలో ఏంగెల్స్కు లేఖ రాసాడు. ʹʹనా దగ్గర కనుక కుటుంబ పోషణకు తగినంత డబ్బే
ఉంటే, ఈ పుస్తకం పూర్తయితే నేడో, రేపో శ్మశానంలోకి వెళ్లేందుకు వెనుకాడను.ʹʹ అని కూడా లేఖలో పేర్కొన్నాడు. ఆర్థిక సమస్యల నుంచి గట్టెక్కడానికి మార్క్స్ రైల్వేలో ఉద్యోగానికి దరఖాస్తు చేసాడు. కానీ చేతిరాత గుండ్రంగా లేదని ఉద్యోగం ఇవ్వలేదు. అయినా స్థైర్యాన్ని కోల్పోలేదు. దీక్ష సడలలేదు. పట్టుదల వదలలేదు. కుప్పకూలడానికి సిద్ధంగా ఉన్నా శక్తిని కోల్పోని ధీరుడు.
1760లో పారిశ్రామిక విప్లవం ప్రారంభమై ప్రపంచగతిని మార్చింది. పెట్టుబడి ప్రాధాన్యత పెరిగింది. శ్రమ సరుకుగా మారింది. పెట్టుబడిదారి ఆర్థిక విధానం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుండిన సందర్భంలో మార్క్స్ తన ఆలోచనలను, ఆచరణను కార్మిక వర్గం ముందు పెట్టాడు. అసమానతలు సహజం. అది తలరాత అనే భావాన్ని పటాపంచలు చేసాడు. పెట్టుబడిదారుడి గర్భంలో పుట్టిన శ్రామికవర్గం ఈ ప్రపంచానికి సోషలిజాన్ని సాధించి పెట్టే వెలుగుదివ్వె అని మార్క్స్ నమ్మాడు. అందుకే కార్మిక వర్గం చేతిలో కమ్యూనిస్టు మేనిఫెస్టోను(1848), కమ్యూనిస్టు పార్టీని, ప్రజా సైన్యాన్ని పెట్టాడు. మార్క్స్, ఏంగెల్స్ కలిసి విడుదల చేసిన 23 పేజీల కమ్యూనిస్టు మేనిఫెస్టో ఈ ప్రపంచాన్ని మార్చివేసింది. బైబిల్ తర్వాత ఎక్కువగా ప్రచురించిన, చదివిన గ్రంథం కమ్యూనిస్టు మేనిఫెస్టోనే. దీనిని విడుదల చేసే నాటికి మార్క్స్ వయస్సు 30 ఏళ్లు, ఏంగెల్స్ వయస్సు 32 ఏళ్లు. జీసస్, మహమ్మద్ ప్రవక్త వలెనే కార్ల్ మార్క్స్ ప్రపంచాన్ని ప్రభావితం చేసాడని ఆయన సిద్ధాంతం గిట్టనివారు కూడా రాస్తారు. కానీ ఈ రెండు మతాలు లేని దేశాలలో కూడా మార్క్సిజం ఉంది.
మార్క్సిజానికి కాలం చెల్లిందని రాసేవాళ్లు కూడా ఇవ్వాళ అనివార్యంగా దాని ప్రాధాన్యతను, ప్రాసంగికతను అంగీకరిస్తున్నారు. సామాజిక శాస్త్రాల అధ్యయనానికి సౌందర్యాత్మకతను జోడించిన ఏకైక శాస్త్రం మార్క్సిజమని వ్యాఖ్యానిస్తున్నారు. పెట్టుబడిదారీ విధానంలో లాభాల కోసం మనిషి అవసరాలను అణగదొక్కే లక్షణం ఉంటుంది. కనుక దానికది సంక్షోభంలోకి నెట్టబడుతుంది. క్యాపిటలిజం పునరుత్పత్తి అవకాశాలకు పరిమితులు విధిస్తుంది. దోపిడివర్గాలకు ఎర్రతివాచీ పరుస్తుంది. కనుక ప్రపంచంలో దోపిడి ఉన్నంత కాలం మార్క్సిజం ఉంటుంది. ఓటమే లేని అజేయ శక్తి ఇప్పటికైతే మార్క్సిజమే. అది మనందరికీ ఆచరణీయ శాస్త్రం.
- సి. కాశీం
Keywords : marx, marxism, virasam, nadusthunna telangana, leninism, maoism
(2024-02-01 17:50:30)
No. of visitors : 1341
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |