రాజకీయ నాయకులా..? వీధి రౌడీలా..?
మన దేశంలో ప్రజాస్వామ్యం అంటే ఒక పెద్ద జోక్. రాజకీయ నాయకులు తమ గూండాగిరితో రాజ్యాన్ని ఏలుతున్నట్లే ఉంటుంది. ఇక ప్రజాస్వామ్యానికి చోటెక్కడ. కడప జిల్లా జమ్మలమడుగు ప్రాంతానికి వెళ్తే అసలు మనం ప్రజాస్వామ్య దేశంలో బతుకుతున్నామా అని అనిపిస్తుంది. ఏపీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, అతని భార్య అరుణ కలసి సృష్టించిన బీభత్సం గ్రామాల్లో అశాంతిని నెలకొల్పింది. జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు, దేవగుడి గ్రామాల్లోని దళితులను మంత్రి భార్య అరుణ ఆదేశంతో అనుచరులు చితకబాదారు. పెళ్లికి వైసీపీ నాయకులను ఆహ్వానించారనే నెపంతో పెండ్లింట వినాశనం సృష్టించారు. కత్తులతో, మారణాయుధాలతో బీభత్సం సృష్టించి దొరికిన వారిని దొరికి నట్లు చితక్కొట్టారు. ఇంత జరిగినా ఏపీ ప్రభుత్వం సదరు మంత్రిపై కనీసం ఎలాంటి చర్య తీసుకోలేదు. దీనిపై పలు ప్రజా సంఘాలు, హక్కుల సంఘాలు నిరసన తెలిపాయి. మానవహక్కుల వేదిక, విరసం, సీపీఐ, రాయలసీమ విద్యార్థి వేదిక సభ్యులు ఆ గ్రామాల్లో పర్యటించారు. అక్కడ జరిగిన అరాచకంపై వారు ఉమ్మడిగా ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. ఆ ప్రకటన యాధాతథంగా..
పత్రికా ప్రకటన
07.06.2018
ఇక్కడ ప్రజాస్వామ్యం పెద్ద అబద్ధం. ముఠానాయకుల నియంతృత్వమే నిజం.
ముఖ్యమంత్రి అండతో మంత్రి ఆదినారాయణరెడ్డి తన ప్రత్యర్థులపై దండయాత్ర.
మే 3వ తేదీన కడప జిల్లా జమ్మలమడుగు మండలం పెద్దదండ్లూరు, దేవగుడి గ్రామాల్లో మంత్రి ఆదినారాయణ రెడ్డి అనుచరులు తమ ప్రత్యర్థి వర్గాలపై దాడి చేసి పలువురిని కొట్టి భీభత్సం సృష్టించారు. తమ అదుపాజ్ఞల్లో లేకపోతే పుట్టగతులుండవు అని హెచ్చరించడానికి స్వయంగా మంత్రి భార్య అరుణ నేతృత్వంలో (?) జరిగిన ఈ దాడులు గ్రామ ప్రజల్ని టెర్రరైజ్ చేశాయి. పోలీసులు చేతులెత్తేసి ప్రేక్షకులుగా మిగిలిపోగా వంద మందికి పైగా మంత్రి అనుచరులు బైటి ఊర్ల నుండి వచ్చి ఆ ఊర్లలోని అదేవర్గం వారితో కలిసి కర్రలు, ఇనుప రాడ్లతో దాడులు చేశారు. ఈ గొడవకు కారణం ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుల్ని ఆ ఊరి వ్యక్తులు ఆహ్వానించడం. ఆహ్వానించిన దళిత కుటుంబంపై, సదరు వై.సి.పి కి చెందిన నాయకులను కలిసిన వారి ఇళ్లపై పడి విలువైన వస్తువులను ధ్వంసం చేసి, మనుషుల్ని కర్రలతో రాడ్లతో కొట్టారు. అడ్డు వచ్చిన మహిళల్ని కూడా కొట్టారు. ఈ గోడవతో సంబంధం లేని టీడీపీ పార్టీకే చెందిన రామసుబ్బారెడ్డి వర్గీయులపై దాడి చేసి కొట్టారు. పై రెండు గ్రామాలకు మానవ హక్కుల వేదిక, విరసం, సి.పి.ఐ, రాయలసీమ విద్యార్థి వేదిక ప్రతినిధులం ఈ రోజు నిజనిర్ధారణకు వెళ్లాము.
రెండు ముఠాలు మధ్య గొడవగా కనిపిస్తున్న ఈ సంఘటన రాయలసీమ సమాజంలో సాధారణ ప్రజల కనీస హక్కుల గురించి చాలా ప్రశ్నలు వేస్తుంది. చాలా ఏళ్లుగా జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆ ఊర్లతో పాటు మరిన్ని ఆదినారాయణ రెడ్డి ఊర్లగా ప్రసిద్ధి. ఇది చాలా సాధారణంగా మాట్లాడుకునే పరిస్థితి. ఆయన తన స్వప్రయోజనం కోసం ఈరోజొక పార్టీ, రేపొక పార్టీ మారతాడు. ఆయన ఏ పార్టీలో ఉంటే జనం ఆ పార్టీతోనే ఉండాలి. పార్టీ మారనందుకు దేవగుడిలో సుబ్బరామిరెడ్డి అనే వ్యక్తిని కిడ్నాప్ చేసి కొట్టి బెదిరించి, ఇంటి మీద పడి విధ్వంసం సృష్టించారు. ఆయన వదిలేసి వచ్చిన పార్టీ నాయకుల్ని ఒక దళితుడు కేవలం అభిమానంతో పెళ్ళికి పిలిస్తే ఆ కుటుంబంపై దాడి చేశారు. ఆడినారాయణరెడ్డి ఇలాకాలో దళితులకు ఓటు వేసే స్వేచ్ఛ ఎలాగూ లేదు. కనీసం తమకు అభిమానం ఉన్న నాయకుణ్ణి పెళ్ళికి పిలుచుకనే స్వేచ్ఛ కూడా లేదన్న మాట. ఒక దళిత కుటుంబం ప్రత్యర్థి పార్టీకి చెందిన నాయకుణ్ణి తమ ఇంట్లో పెళ్ళికి పిలవడం పట్ల మంత్రికి ఎంతటి అక్కసు ఉందో అర్థమవుతోంది. ఈయనేగా ఆ మధ్య దళితుల గురించి అవమానకరంగా మాట్లాడింది. ఇక తన అడ్డాలో దళితుల పరిస్థితి ఇంతకన్నా మెరుగ్గా ఎలా ఉంటుంది?
వంద మంది మూక వచ్చి పడి వీరంగం ఆడితే పోలీసులు చేవ చచ్చిపోయి ఉంటారు. లా అండ్ ఆర్డర్, ప్రజాస్వామ్యం స్వయంగా మంత్రిగారి ఊరిలో పెద్ద జోక్. కేసులు నమోదు చేయడంలోనూ పోలీసులు మంత్రికి విధేయులుగా పనిచేశారు.
ఫ్యాక్షనిజాన్ని సహించేది లేదు అని మాట్లాడే చంద్రబాబు తమ పార్టీ కార్యకర్తలనే ముఠా కక్షలతో తన మంత్రే కొట్టించినపుడు ఏం చెబుతాడు? వై.యస్ హయాంలో ఇటు వంటి సంఘటన పులివెందులలో జరిగితే తెలుగుదేశం పార్టీ ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతుంది. ఇప్పుడు వై.సి.పి ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతోంది. అంటే రాజకీయ పార్టీలకు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం కావాలి.అధికారంలో ఉన్నప్పుడు తమ నియంతృత్వానికి ఎదురు ఉండకూడదు.
నిన్నటిదాకా చంద్రబాబును తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టిన ఆదినారాయణ రెడ్డి ఆయన కేబినెట్లోనే మంత్రి అయితే, ఎప్పటి నుండో తన పార్టీలో కార్యకర్తలుగా పనిచేస్తున్న వారు ఆ మంత్రి చేతిలో తన్నులు తింటారు. ఈ ముఠా నాయకుల కోసం దొమ్మీలు చేసి కేసులు పెట్టించుకొని కార్యకర్తలు వారి జీవితాలను నాశనం చేసుకుంటే నాయకులు మాత్రం పార్టీలు ఫిరాయించి మంత్రులు అవుతారు.
పై ఘటన గురించి విలేకర్లు మంత్రిని అడిగితే పులివెందులలో వాళ్ళ రాజ్యం అయితే ఇక్కడ మాది. అక్కడ ఏ రూలో ఇక్కడా అదే రూలు అని నిస్సిగ్గుగా చెప్తాడు. ఇది మన ప్రజాస్వామ్యం.
దొంగలు ఊర్లు పంచుకొని నాయకులయ్యారు. సామాన్య ప్రజలు, దళితులు వాళ్ళ కింద అనగారిపోయి కష్టాలు పంచుకొని బికారులుగా నిస్సహాయులుగా మిగిలారు. ఈ స్థితిని మరోమారు పెద్దదండ్లూరు, దేవగుడి అద్దంలో చూపించాయి. టూకీగా చెప్పాలంటే ఇది ముఖ్యమంత్రి అండతో మంత్రి తన ప్రత్యర్థులపై చేసిన దండయాత్ర.
జయశ్రీ (మానవహక్కుల వేదిక),
వరలక్ష్మి (విరసం),
సుబ్బరాయుడు (సి.పి.ఐ),
భాస్కర్ (రాయలసీమ విద్యార్థి వేదిక)
Keywords : ap minister, aadinarayana, aruna, jammalamadugu, dalits, virasam, rights activists, ఏపీ మంత్రి, ఆదినారాయణ, అరుణ, జమ్మలమడుగు, దళితులు, అరాచకం
(2024-03-13 23:57:20)
No. of visitors : 934
Suggested Posts
0 results