ఈ హత్యలకు అంతే లేదా..?
దళితులులపై జరిగే దారుణాలకు, హత్యాకాండకు అంతే లేకుండా పోతోంది. అగ్రవర్ణాలే కాకుండా తోడుండాల్సిన బహుజన కులాలు కూడా వేరు చేసి దారుణంగా హింసిస్తున్నాయి. ఇల్లంతకుంట మండలం కందికట్కూరులో జరిగిన ఈ సంఘటనే దీనికి నిదర్శనం. తన సాగుభూమిలోనికి ప్రవేశించడమే నేరమై ఎల్లయ్య, శేఖర్లు దారుణంగా హత్య చేయబడ్డారు. గొడ్డళ్లు, కొడవళ్లతో నిర్ధాక్షిణ్యంగా చంపేయబడ్డారు. అక్కడ జరిగిన ఘోర సంఘటనపై విరసం తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన యధాతథంగా..
విప్లవ రచయితల సంఘం
పత్రికా ప్రకటన
కందికట్కూరు దళితుల దారుణహత్యను నిరసిద్దాం.
ఎస్.సి, ఎస్.టి అత్యాచార నిరోధక చట్టాన్ని బలహీనపరిచే యత్నాలను తిప్పికొడదాం.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలం కందికట్కూరుకు చెందిన సావనపల్లి ఎల్లయ్య, ఆయన కొడుకు శేఖర్లను 12వ తేదీన పక్కనే ఉన్న కిష్టారావుపల్లెకు చెందిన ముదిరాజు కులస్థులు గొడ్డళ్లతో నరికి హత్య చేశారు. ఈ రెండు గ్రామాల సరిహద్దుల్లో సావనపల్లె ఎల్లయ్యకు 39 కుంటల పొలం ఉంది. అదే ఆ కుటుంబానికి జీవనాధారం. ఆ పొలాన్ని కిష్టారావు పల్లెకు చెందిన బీసీ కులం మామిళ్ల దేవయ్య, స్వామి, వెంకటేశ్ అనే అన్నదమ్ములు కబ్జా చేసుకోదలిచారు. ఈ వివాదం చాలా కాలంగా నడుస్తోంది. ఎల్లయ్య ఈ విషయంపై కోర్టుకు వెళ్లాడు. అక్కడ కేసు నడుస్తోంది.
గత రెండు రోజులుగా తొలకరి వానలు కురుస్తుండటంతో ఎల్లయ్య కుటుంబీకులు సాగు కోసం భూమిలోకి వెళ్లారు. మంగళవారం ఎల్లయ్య, ఆయన భార్య ఎల్లమ్య, కొడుకులు అనిల్, శేఖర్ ట్రాక్టర్ తీసుకొని పొలంలోకి వెళ్లారు. కొద్ది దూరం వెళ్లాక డీజిల్ తెస్తానని అనిల్ ఊళ్లోకి వెళ్లాడు. ఎల్లమ్మ దూరంగా ఉంది. ఆ సమయంలో ముదిరాజు దేవయ్య అన్నదమ్ములు ముగ్గురు, వాళ్ల తల్లి కలిసి వెళ్లి ఎల్లయ్య, శేఖర్ కళ్లలో కారం చల్లి గొడ్డళ్లతో నరికి చంపారు. ఈ హత్యాకాండ జరుగుతుండగా దూరం నుంచి వస్తూ అనిల్ చూశాడు. దాంతో ఆయన మతి స్థిమితం తప్పిపోయింది.
ఈ తొలకరి దళితుల నెత్తురుతో నేల తడిసిపోయింది. భూమిని కాపాడుకోడానికి ఎల్లయ్య, శేఖర్ ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. మన సమాజంలో దళితులకు, బీసీ కులస్థులకు సహితం కుల వ్యవస్థ వల్ల తలెత్తిన సాంఘిక, ఆర్థిక వైరుధ్యానికి ఇది గుర్తు. ఈ ఘటన పత్రికల ద్వారా ప్రచారమైనా ఇప్పటికీ పోలీసులు కేసు నమోదు చేయలేదు. ఎస్టీ ఎస్టీ రక్షణ చట్టానికి తూట్లు పొడుస్తూ సుప్రీంకోర్టు మోదిత్వ తీర్పు ఇచ్చిన ఈ సందర్భంలో ఇది మనకు తెలిసిన ఘటన. గ్రామాల్లో దళితులు 39 గుంటల భూమి కాపాడుకోడానికి ఇద్దరు ప్రాణాలు బలిపెట్టాల్సి వచ్చింది. ఇక ఆత్మగౌరవ పరిరక్షణకు ఎక్కడ చోటు ఉంటుందో ఊహించవచ్చు. నేల మీది వాస్తవం ఇదైతే సుప్రీం కోర్టు ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం దుర్వినియోగం అవుతోందని దాని వెన్ను విరిచి పడేస్తుంది.
ఈ ఘటనలో నిందితులపై కేసు నమోదు చేయాలని విరసం డిమాండ్ చేస్తోంది. బీసీ కులాలకు చెందిన ప్రజాస్వామికవాదులు కూడా ముందుకు వచ్చి బలహీనవర్గాలకు, దళితులకు మధ్య ఉన్న వైరుధ్యాన్ని తగ్గించేందుకు కృషి చేయాల్సిన తరుణం ఇది. పీడిత కులాలు కలిసి అగ్రకుల భావజాలానికి, ఆధిపత్యానికి వ్యతిరేకంగా పోరాడాల్సిన అవసరాన్ని ప్రచారం చేయాల్సి ఉంది. అట్లాగే ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టాన్ని బలహీనపరచకుండా దళితుల జీవించే హక్కుకు, ఆత్మగౌరవానికి చట్టం, న్యాయవ్యవస్థ హామీ పడాలి.
-విప్లవ రచయితల సంఘం
పాణి(కార్యదర్శి)
సి. కాశీం, జగన్, బాసిత్, గీతాంజలి, అరసవెల్లి క్రిష్ణ, వరలక్ష్మి (కార్యవర్గ సభ్యులు)
వరవరరావు (విరసం వ్యవస్థాపక సభ్యుడు)
Keywords : illantakunta, nandikotkur, dalits, murderd, land, ఇల్లంతకుంట,దళితులు, హత్య, బీసీ, ఎస్సీ ఎస్టీ,
(2024-03-09 03:43:53)
No. of visitors : 968
Suggested Posts
0 results