విమర్శను స్వీకరించలేక.. ఎదురు దాడి చేస్తారా..?
గత కొన్ని రోజులుగా మీడియాలో రాముడు, రామాయణంపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో సామాజిక కార్యకర్త కత్తి మహేష్ అన్న మాటలపై సోషల్ మీడియాలో తీవ్రమైన విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే అసలు కత్తి మహేష్ ఏ సందర్భంలో అన్నాడు..? వాటిని విమర్శలుగా ఎందుకు స్వీకరించలేక ఎదురు దాడి చేస్తున్నారు అనే విషయంపై సాయికుమార్ అనిశెట్టి తన ఫేస్బుక్ వాల్పై రాసిన పోస్టు యధాతథంగా..
---------------------------------------------------
దేవుడైన రాముడిని దగుల్బాజీ అన్నందుకు ముందుగా.. ప్రధానంగా కత్తి మహేష్ను అరెష్టు చేయాలంటూ, ఆపై రామాయణ, భారతాలను విమర్శిస్తూ పుస్తకాలు రాసినందుకు రంగనాయకమ్మపై చర్యలు తీసుకోకపోతే రెండు ప్రభుత్వాలూ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందనీ ఓ ఛానల్ యజమాని.. పరిపూర్ణానంద స్వా మి అనే వ్యక్తి తిరుపతిలో పత్రికా సమావేశం పెట్టి హెచ్చరించాడు. వాళ్ళు బయట ఎట్లా తిరుగుతారో చూస్తానంటూ ఆగ్రహావేశాలు వెళ్ళగక్కాడు. కరుణానిధి కూడా విమర్శించాడు గదా! అన్న విలేకరుల ప్రశ్నకు ఇక్కడి సంగతి తేల్చిన తరువాత తన సంగతి తేల్చడానికి అక్కడికీ వెళతానన్నాడు. ఈ వార్త నేటి మధ్యాహ్నం చాలా టీవీ ప్రసారాల్లో లైవ్ వచ్చింది.
ʹరామాయణం రంకు భారతం బొంకు" అన్న నానుడి నేటిది కాదు. రామాయణ కాలం నాటి జనాభాను దృష్టిలో ఉంచుకొని చూస్తే, అది కొన్ని చిన్న తండాల వంటి వందలు, వేల జన సంఖ్యతో ఉన్న గణాల మధ్య జరిగిన ఘర్షణల రూపమే కానీ మరొకటి కాదు. కింద రెండు, పైన రెండు పద పాదాలతో అనుష్టుప్పు శ్లోకాల రూపంలో ఉన్న రామాయణాన్నీ, ʹజయంʹ పేరుతొ ఉన్న స్వల్ప కధతో కూడుకున్న భారతాన్నీ, ఇవ్వాళ పది, పదిహేను కిలోల మహాగ్రంధాలుగా తయారు చేశారు. ఆర్యులు భారత ఉపఖండంలోని దక్షిణ భాగాన్ని తమ ఏలుబడిలోకి తెచ్చుకున్న తరువాత వారి సాహిత్యాన్నే ఆనాటికి వీలున్న పద్ధతులలో ప్రతులు తయారు చేసి ఉంచారు. ఇక్కడి ఇతర భాషలు ముఖ్యంగా దక్షిణాదిన ఉన్న ద్రావిడ భాషా కుటుంబం నుంచీ లిఖిత వాజ్మయం ఊపిరూలూదు కుంటున్న వేళ.. నన్నయ తిక్కనాదులకు అప్పటికే లిఖిత రూపంలో నిక్షిప్తమై ఉన్న సంస్కృత రామాయణ, భారతాలు తప్ప వేరేమీ దొరకకపోవడంచేత.. వాటినే అనుసరించడంతో, సంస్కృత భాషా పదాల ప్రభావం ఈ భాషపై పడింది. పాలకులైన ఆర్యుల భాష, వారి సంస్కృతులు కావడంతో, ఆ సంస్కృతిని ప్రజలపై రుద్ది, ప్రాచుర్యం కల్పించడంతో, అదే అందరి సంస్కృతిగా ప్రచారం చేసి జనాల మెదళ్లపై రుద్దారు. భాష అనేది నిర్దిష్టంగా ఒక భావాన్ని/వస్తువును/అంశాన్ని, చెప్పటానికి వీలయినన్ని ఎక్కువ పదాలను కలిగి ఉన్నప్పుడే అది సుసంపన్నమైన భాషగా చెప్పుకోవచ్చు. ఆనాటికి జన వ్యావహారికంలో ఉన్న మిగిలిన భాషలన్నిటి కంటే కొంచెం మెరుగ్గా ఉన్న.. అన్ని భావాలు, వస్తువుల వ్యక్తీకరణకు తగినన్ని పదాలు సంస్కృతంలో కూడా లేకపోవడం వల్ల ఒకే పదానికి చాలా అర్ధాలు చెప్పుకునేవారు. విస్తృతమైన పద సంపదతో ఈనాటి అభివృద్ధి చెందిన భాషలతో పోల్చి చూసేట్లయితే సంస్కృతాన్ని అంతగా అభివృద్ధి చెందని ఆటవిక భాషగానే చెప్పుకోవచ్చు. అందువల్లనే అనంతర కాలాల్లో వాటిని రాసిన/అనువదించిన రాతలలో చాలా తేడాలు కనబడతాయి. అంతేకాకుండా.. "కాళిదాసు కవిత్వం కొంత-నా పైత్యం కొంత" అన్నట్లు ఎవరికి వారు స్వకపోల కల్పితంగా విస్తరించుకుంటూ పోతూ ఉండటం వలన ఆ గ్రంధాలూ ఈనాటికి వందల రెట్లు విస్తృతి అయాయి.
భౌద్ధాన్ని హిందూమతంలో జీర్ణం చేసుకోవడంలో విఫలమయ్యారు గానీ, ఇక్కడి స్థానిక దైవాలుగా పూజలందుకుంటున్న శివుడిని, దుర్గను, అనేక స్త్రీ దేవతలనూ తమ ఆర్య మతంలో ఎప్పుడో కలిపేసుకున్నారు. వాస్తవానికి అసలైన రామాయణ భారతాలలో ఈ స్థానిక దైవాల ఊసే లేదు. అన్నీ అనంతర కాలంలో పుట్టించినవే. వారి సంస్కృతిని ఇక్కడి ప్రజలపై రుద్ది.. వీరంతా అదే తమ సంస్కృతిగా భావించి, అందుకై తపించే విధంగా తయారు చేశారు. ఆ కాలంనుంచీ నేటివరకూ ఇండో ఆర్యన్ భాషా జాతులవారయిన ఉత్తరాది వారు రాజకీయ, సాంస్కృతిక, ఆర్ధిక రంగాల్లో ఆధిపత్యాన్ని మరింతగా విస్తరిస్తూ,నిరంతరాయంగా కొనసాగిస్తూనే ఉన్నారు. అన్నిచోట్లా వ్యాపార దోపిడీ కొనసాగించే గుజరాతీ మార్వాడీ సాంస్కృతిక ఆధిపత్యానికి కాక ఏ విలువలకీ ప్రస్థానం?
కేవలం వేదాలు చదువుకున్నందుకు రాముడి చేత శూద్రుడైన శంభుకుడి తల నరికించిన భావజాలం, విలు విద్య నేర్చుకున్నందుకు విల్లు పట్టే వీలు లేకుండా ఏకలవ్యుడి బొటనవేలు కత్తిరించిన ఈ దుర్మార్గపు భావజాలంకోసం ఉగ్రవాదులుగా మారుతున్నది ఎవరు? సాటి మనుషులను మెడకు ముంత, మొలకు తాటి ఆకు, నడిచిన మేరా ఊడ్చడానికి నడుముకు చీపురూ కట్టించి హింసించినది ఏ భావజాలం? ʹనస్త్రీ స్వాతంత్ర్య మర్హ్యతిʹ అంటూ స్త్రీలను వ్యక్తిగత ఆస్తిగా చూపుతూ, సహగమనాన్ని సైతం బలవంతంగా నిర్వర్తించినది ఏభావజాలం?
అనేక పోరాటాల ఫలితంగా ప్రజాస్వామ్యీకరించబడుతూ, మరింత మానవీయతను సంతరించుకోవడం కోసం, ఆకలి కన్నీళ్లు, దోపిడీ, అవకాశాల నిరాకరణ లేని వ్యవస్థను సాధించుకోవడానికి సమాజం పురిటి నెప్పులు పడుతున్నఈ తరుణంలో కాలాన్ని వెనక్కు తిప్పడానికి నానా ప్రయత్నాలూ చేస్తున్నారు. మార్పుకోసం సమిధలు కావడానికి సిద్ధపడ్డ విప్లవకారులను చంపే పరిస్థితులనుంచీ, ఈనాడు హేతువాదులు, మానవ వాదులూ, నాస్తికులను చంపడం, అందుకు ప్రణాళికలు వేసుకోవడం వార్తలలో చూస్తూనే ఉన్నాం. గౌరీలంకేష్ హత్య తరువాత సినిమా నటుడు ప్రకాష్రాజ్తో సహా యాభై మందిని చంపటానికి ఒక జాబితా తయారు చేసుకున్నట్లు వార్తల ద్వారా తెలుస్తోంది.
ప్రజాస్వామ్యానికి విమర్శ ప్రాణం వంటిది. విమర్శ.. రాజ్యం తను చేసే తప్పులను తెలుసుకొని మరింత ప్రజాస్వామికంగా మారడానికి దోహదం చేస్తుంది. అట్లా కాకుండా భావప్రకటన స్వేచ్చను అణగదొక్కి హత్యాకాండకు పాల్బడుతూ, నేరమే అధికారమై గళాలను ఉత్తరిస్తున్న తరుణంలో నోరుండీ ప్రశ్నించని ప్రతిఒక్కరూ నేరస్తులే!!!
Keywords : ramayanam, mahabharatam, katti mahesh, ramudu, tv9, రామాయణం, మహాభారతం, కత్తి మహేష్, విమర్శలు, రాముడు, టీవీ9
(2024-04-11 01:21:11)
No. of visitors : 2842
Suggested Posts
0 results