వరవరరావుపై పెట్టిన అక్రమ కేసులు వెంటనే వెనక్కి తీసుకోవాలి : విరసం
మోడీ హత్యకు కుట్ర పేరుతో విరసం నేత వరవరరావును అక్రమంగా పూణే పోలీసులు అరెస్టు చేయడాన్ని విప్లవ రచయితల సంఘం తీవ్రంగా ఖండిస్తూ ఒక ప్రకటన విడుదల చేసింది. ఆ ప్రకటన యధాతథంగా..
అదే కుట్ర... మరింత దుర్మార్గంగా, మరింత నిస్సిగ్గుగా
ప్రజా గొంతులకలను నులిమేసే మోడీ కుట్రను ఖండిద్దాం. దేశాన్ని ఫాసిజం బారినుండి రక్షించుకుందాం.
ఈరోజు ఉదయం విరసం వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ వరవరరావు, కార్యవర్గ సభ్యుడు, జర్నలిస్టు క్రాంతి ఇళ్ళపై మహారాష్ట్ర పోలీసులు సోదాల పేరుతో దాడిచేశారు. గంటల తరాబడి విచారణ పేరుతో వారిని, వారి కుటుంబ సభ్యలను వేధించారు. నరేంద్ర మోడీ హత్యకు కుట్ర పన్నిన వారిలో వరవరరావును ఉన్నారని ఆరోపిస్తూ ఆయన్ని అరెస్టు చేసారు. క్రాంతి ల్యాప్ టాప్, సెల్ ఫోన్ ఎత్తుకుపోయారు. బొంబాయిలో రచయిత వెర్నన్ గొంజాల్వెజ్, సుజాన్ అబ్రహం, ఇండియన్ అసోసిఏషన్ ఆఫ్ పీపుల్స్ లాయర్స్ నాయకుడు అరుణ్ ఫెరేరా, రాంచిలో సామాజిక కార్యకర్త 85ఏళ్ల స్టాన్ స్వామి, డిల్లీలో అడ్వకేట్ సుధా భరద్వాజ్, పౌరహక్కుల కార్యకర్త, పాత్రికేయుడు గౌతమ్ నవలాఖా, గోవాలో ప్రొఫెసర్ ఆనంద్ తేల్తుంబ్డే ఇళ్ళ మీద కూడా దాడులు జరిగాయి. వెర్నన్ గొంజాల్వెజ్, సుజాన్ అబ్రహం, అరుణ్ ఫెరేరా, స్టాన్ స్వామిలను అరెస్టు చేసారు. గౌతమ్ నవలాఖా అడ్వకేట్లు సుప్రీం కోర్టును కలిస్తే అరెస్టుపై ఒక రోజు స్టే విధించింది. సరైన కారణము, వారెంట్ లేకుండా అడ్వకేట్ సుధా భరద్వాజ్ ను అక్రమంగా అరెస్టు చేయడానికి స్థానిక కోర్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నది. ఇక ఆ సమయంలో ఇంట్లో లేని ఆనంద్ తేల్తుంబ్డే పరారీలో ఉన్నాడని పోలీసులు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారు.
1975 అనుభవం తర్వాత ప్రభుత్వం ఎమర్జెన్సీని ప్రకటించడం మానుకున్నాయి. ప్రకటించకుండానే పకడ్బందీగా అమలు చేయడంలో పాలకులు ఒకరికి మించి ఒకరు ఆరితేరుతున్నారు. ఇవాల తెల్లవారుఝాము నుండి దేశంలోని పలుప్రాంతాల్లో ప్రజాస్వామికవాదుల, సామాజిక కార్యకర్తల ఇళ్ళ పై పోలీసులు దాడులు చేసిన విధానం, వందల సంఖ్యలో ఇళ్ళను దిగ్బంధించడం, వారెంటు, ఆధారాలు లేకుండా చొరబడి, విచారణ పేరుతో భీభత్సం సృష్టించి అరెస్టులు చేయడం చూస్తే ఈ ప్రభుత్వం ఇంకెంత బరితెగించిందో అర్థమవుతున్నది.
జూన్ నెలలో భీమా కారేగావ్ హింసకు కారకులని ఆరోపిస్తూ డిల్లీ, పూనేలలో ప్రజాసంఘాల నాయకులను అరెస్టులు చేసి విమర్శల పాలైన ప్రభుత్వం, పోలీసులు ఒక కుట్రకు తెరతీసారు. మావోయిస్టులు మోడీ హత్యకు కుట్ర పన్నారని, అందులో పలువురు ప్రజాసంఘాల బాద్యుల పేర్లను ఇరికించి, వాటికి సంబంధించిన ఆధారాలంటూ మూడు లేఖలను బైటికి తీసారు. ఇవి పోలీసులు సృష్టించిన కాగితాలని వాటిల్లో ప్రతి వాక్యంలోని అసంబద్ధత రుజువు చేసాయి. అందులో వరవరరావు, తదితరుల పేరు ప్రస్తావించడం భారీ కుట్రలో భాగమని ఆనాడే దేశవ్యాప్తంగా ప్రజాస్వామికవాదులు, రచయితలు ఖండించారు. దిగజారిన మోడీ ప్రతిష్టని తిరిగి నిలబెట్టడానికి వీటిని సృష్టించారని ప్రతిపక్ష పార్టీలు కూడా మాట్లాడాయి. ఇవాల మళ్ళీ దాన్ని బైటికి తీసి, అరెస్టులు, సోదాలతో ఉద్రిక్తతలు సృష్టించి తమ పెంపుడు మీడియా చానళ్ళతో గోబెల్స్ ప్రభారం చేస్తోంది ప్రభుత్వం. తెలంగాణ ప్రభుత్వం దీనికి పూర్తి సహకారం అందిస్తూ వందలాదిగా పోలీసులను వరవరరావు, క్రాంతిల ఇళ్ళ చుట్టూ మోహరించింది.
దేశంలో బిజెపి అధికారంలోకి వచ్చాక నాలుగు వందల దాకా పట్టపగలు హత్యలు జరిగాయి. అన్నీ హిందూ సంస్కృతి పరిరక్షణ పేరుతో. ఒకటి రెండు మినహాయిస్తే కనీసం వీటిపై దర్యాప్తు కూడా లేదు. ఆదివాసీ ప్రాంతాల్లో పన్నెండేళ్ళ, పదమూడేళ్ళ పిల్లలతో సహా మావోయిస్టులని పేరుపెట్టి వందల సంఖ్యలో జనాన్ని కాల్చివేస్తున్నారు. ఈ హత్యలకు రివార్డులు దక్కుతున్నాయి. మహిళలు, దళితులు, ముస్లింలు, ఆదివాసులు ఎవరికీ దేశంలో రక్షణ లేదు. చట్టం, న్యాయవ్యవస్థ ఎన్నడూ లేనంతగా బోనులో నిలబడ్డాయి. ప్రజల్ని కొత్తకొత్త పన్నులతో చావబాదుతున్నారు. అధికారంలోకి వచ్చేముందు చేసిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేదు. ఏ మాత్రం నైతికత ఉన్నా అధికారంలో ఉండడానికి పాలకులు సిగ్గుపడాలి.
అణచివేత తప్ప ఏ నీతీ లేని ప్రభుత్వం నిస్సిగ్గుగా ఒక అసంబద్ధమైన ఆరోపణను చేసి, కుట్రపూరితంగా ప్రజల పక్షాన నిలిచిన రచయితలను, మేధావులను, సామాజిక కార్యకర్తలను అరెస్టులు చేస్తున్నది. భీమా కారేగావ్ ప్రతిఘటనకు ఉలిక్కిపడిన ఆరెస్సెస్, బిజెపి ప్రభుత్వం నిజమైన నేరస్తులను కాపాడుటానికి, ప్రజల దృష్టి మళ్ళించడానికి కుట్ర పన్నింది. పనిలోపనిగా ప్రధాన మంత్రి ప్రాణాలకు ప్రమాదం దాపురించినదని గగ్గోలు పెడుతూ సానుభూతి మైలేజ్ సంపాదించాలని చూస్తున్నది. మేం ముందే చెప్పినట్లు నాగపూర్ నుండి భీమా కోరేగావ్ మీదుగా హైదరాబాద్ దాకా ప్రభుత్వం పన్నిన కుట్ర ఇది. విరసంపైనా, కామ్రేడ్ వరవరరావుపైనా కుట్ర కేసులు కొత్త కాదు. గతంలో అనేక అప్రజాస్వామిక చట్టాల కింద నిర్బందిన్చినట్లు ఇప్పడు మరింత దుర్మార్గమైన ఊపా చట్టం వివి పై మోపారు. ఈసారి మరింత నిస్సిగ్గుగా ఈ కుట్ర జరిగింది, జరుగుతున్నది. బిజెపి, సంఘపరివార్ కుట్రలను తిప్పికొడదాం. అక్రమంగా అరెస్టు చేసిన ప్రజాసంఘాల బాధ్యులందరినీ విడుదల చేయాలని, కుట్ర కేసులు వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేద్దాం. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రచయితలూ అందరూ కలిసి రండి.
-పాణి (కార్యదర్శి),
కాశీం, వరలక్ష్మి, రాంకీ, గీతాంజలి, జగన్, అరసవిల్లి కృష్ణ, కిరణ్ (కార్యవర్గ సభ్యులు)
కళ్యాణ్ రావు (సీనియర్ సభ్యులు)
Keywords : వరవరరావు, విరసం, అరెస్టు, పత్రికా ప్రకటన, varavararao,arrest, press note,virasam
(2024-03-23 20:47:09)
No. of visitors : 592
Suggested Posts
0 results