ప్రశ్నించడమే నేరమైనప్పుడు : క్రాంతి
ఆ ఆరుగంటలూ.. అసలు సిసలైన దేశ ʹప్రజాస్వామ్యంʹ కండ్ల ముందు కదలాడింది. నా ఇంట్లో నేను స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోలేని క్షణాలు.
ఆగస్టు 28 అంతకు ముందు రోజులా లేదు. ఖాకీ బూట్ల చప్పుళ్ల మధ్య తెల్లారింది నాకు. నేను కలగనే ప్రభాతం కాదది. తలుపులు తన్నుకొని దూసుకొచ్చిన 20 మంది ఖాకీలు నన్ను అదాటున మరో భయానక ప్రపంచంలోకి ఈడ్చుకెళ్లారు. కళ్లు తెరిచేసరికి నేను బంధీనై ఉన్నాను.
ప్రశ్నల ప్రవాహం మొదలైంది. ఏం జరుగుతుందో అర్థమయ్యేలోపే నన్ను నిత్యం ఓదార్చే సాహిత్యాన్ని చెరబట్టడం మొదలెట్టారు. బుక్షెల్ఫ్లోని పుస్తకాలు ఒక్కొక్కటి కుప్ప కూలుతున్నాయి. వాళ్లకు ప్రతి అక్షరమూ ఒక దేశ ద్రోహంలాగే కనిపిస్తున్నది.
కవిగా, పాత్రికేయుడిగా, సాహితీ ప్రియుడిగా, ఉద్యమకారుడిగా రెండు దశాబ్ధాలుగా సాహిత్యంతో విడదీయరాన్ని బంధాన్ని పెంచుకున్న నాకు ప్రతి పుస్తకమూ ప్రాణవాయువే. ప్రతి అక్షరమూ ప్రాణమున్న గేయమే. చూస్తుండగానే లోలోపలి సొరుగులన్నీ జల్లెడబట్టారు. ఇంతకూ నేను చేసిన నేరమేంటి? నన్ను బంధీని చేయడానికి... వాళ్లకున్న హక్కులేంటి?
ఏ సెర్చ్ వారెంట్ లేకుండా, ఏ నేరారోపణలూ లేకుండా 80 మంది పోలీసులు ఆ ఉదయం నా ఇంటి మీద పడ్డారు. సెల్ఫోన్, ల్యాప్టాప్, హార్డ్ డిస్క్, పాటల సీడీలు సీజ్ చేసుకున్నారు. ఒక ఫొటోగ్రాఫర్గా నేను నాలుగైదేళ్లుగా తీసిన వేలాది ఫొటోలు సైతం ఎత్తుకెళ్లారు. ఒక్కమాటలో చెప్పాలంటే... నా వ్యక్తిగత సమాచారాన్ని తస్కరించారు. చివరకు నా మెయిల్, ఫేస్బుక్ అకౌంట్లను సైతం తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వెళ్తూ వెళ్తూ.. నాకు తెలియని, నాది కాని మరాఠి భాషలో నాలుగు కాగితాలు రాసి నా మొహాన వేసి వెళ్లారు.
ఇదీ భారతదేశంలో వర్థిల్లుతున్న ʹప్రజాస్వామ్యం.
హద్రోగంతో భాదపడే నా తల్లిని నానా దుర్భాషలాడి, ఆరు గంటల పాటు నన్ను కనీసం టాయిలెట్కి కూడా వెళ్లనీయకుండా హింసించిన వాళ్లు దేశభక్తులు! ప్రజల పక్షాన నిలబడినందుకు నేను నేరస్థుడిని.
ఎందుకిదంతా...? భిన్నాభిప్రాయాల్ని, ప్రత్యామ్నాయ రాజకీయాల్ని అణచివేయడానికి కాదా? అందుకోసమే కదా... ఇందిరా గాంధీ ఎమర్జెన్సీని ప్రకటించింది. ఇప్పుడూ అంతే. కాకపోతే ఇవాళ దేశంలో అమలవుతున్నది అప్రకటిత ఎమర్జెన్సీ.
90 శాతం వికలాంగుడైన ప్రొఫెసర్ జి.ఎన్ సాయిబాబాకు యావజ్జీవ ఖైధు విధించిన ప్రజాస్వామ్యం కదా ఇది. కళాలను, గళాలను నేల కూల్చిన ప్రజాస్వామ్యం కదా ఇది. ఆదివాసీలు, ముస్లింలను బంధీలను చేసే ప్రజాస్వామ్యం కదా ఇది. ఈ ప్రజాస్వామ్యంలో ప్రశ్న ఒక నేరం. అందుకే ప్రశ్నించే గొంతును అణచివేసేందుకు హక్కుల కార్యకర్తలపై ఉక్కుపాదం మోపుతున్నది. ఆర్.ఎస్.ఎస్ చేస్తున్న ఈ ధ్వంస రచనను అధికార బీజేపీ అమలు చేస్తున్నది.
ఇది నాజీల వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న బ్రాహ్మణీయ హిందూ ఫాసిస్టు రాజ్యం సష్టిస్తున్న భీతావాహ వాతావరణం. అది వంటింట్లోకి చొరబడి అఖ్లక్ని హత్య చేసిన రాజ్యం, రోహిత్ వేములను స్మతిబద్ధ హత్యచేసిన రాజ్యం.
భీమా కోరేగావ్లో నయా బ్రాహ్మణిజం చెల్లదని చాటిన దళిత బహుజనులపై, ఆవుతోక మీరే ఉంచుకోండి-మా భూమి మాకు పంచండి అని నినదించిన ఉనా ఉద్యమంపై, ఆజాదీ నినాదాన్నిచ్చిన జేఎన్యూపై, మా ఊళ్లో మా రాజ్యం అంటున్న ఆదివాసీలపై హింస అమలవుతున్నది. ఇప్పుడు దేశవ్యాప్తంగా రచయితలు, పాత్రికేయులు, న్యాయవాదులు, హక్కుల కార్యకర్తలపై జరుగుతున్న దాడులు అందులో భాగమే. ఇది సమీప భవిష్యత్తులో మరింత తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు.
ఏక కాలంలో హైదరాబాద్, ముంబై, రాంచీ, ఢిల్లీ, ఫరీదాబాద్ నగరాల్లో సుధా భరద్వాజ్, ఆనంద్ తేల్తుమ్డే, వరవరరావు, గౌతమ్ నవలాఖ, అరుణ్ ఫెరెరా, వెర్నన్ గోంజాల్వ్, సూసన్ అబ్రహం, స్టాన్ స్వామి లాంటి హక్కుల కార్యకర్తల ఇండ్లపై దాడులు జరిపి పలువురిని అరెస్టు చేయడం పొంచి ఉన్న ప్రమాదానికి పెద్ద సంకేతం.
నిజానికి జూన్ నెలలో భీమా కోరేగావ్ హింసకు కారకులని ఆరోపిస్తూ ఢిల్లీ, పూణే నగరాల నుంచి ఐదుగురు హక్కుల కార్యకర్తలను అరెస్టు చేసిన పోలీసులు తప్పుడు ఆధారాలు చూపిస్తూ వారిపై మోదీ హత్యకు కుట్రపన్నారనే నేరారోపణ చేశారు. ఆ కొనసాగింపులో భాగంగా తాజాగా పూణే పోలీసులు జరిపిన దాడులు, అరెస్టులు పూర్తి చట్ట వ్యతిరేక చర్యలు. భీమా కోరేగావ్ అల్లర్లకు ప్రధాన కారకులైన శంబాజీ బీడే, మిళింద్ ఎక్బోటేలను కాపాడేందుకు నాగ్పూర్ కేంద్రంగా జరిగిన కుట్రలో భాగంగానే ఈ దాడులను అర్థం చేసుకోవాలి.
అంతేకాదు.. దేశవ్యాప్తంగా ప్రజాస్వామ్య శక్తులను జైళ్లలో బంధించడం ద్వారా, ప్రశ్నించే వారిని లేకుండా చేయడం, ఆ తరువాత ఆదివాసీ, ముస్లిం సమాజంపై విచక్షణా రహిత దాడులకు పాల్పడే కుట్ర దాగి వుంది.
బీజేపీ అధికారంలోకి వచ్చాక దబోల్కర్, పన్సారి, కల్బుర్గి, గౌరీ లంకేష్ మొదలు వందలాది మంది దళిత, ఆదివాసీ, ముస్లింల హత్యలు జరిగాయి. హత్యలకు పాల్పడే వారికి సన్మానాలు, సత్కారాలు అందిస్తూ ప్రభుత్వం నేరస్తులను కాపాడుతుంది. ముస్లింలను, కమ్యూనిస్టులను శత్రువులుగా భావించే అమెరికాతో మిలాఖతైన హిందుత్వ మోదీ ప్రభుత్వం అదే నీతిని అమలు చేస్తున్నది.
(ది వీక్ మ్యాగజైన్, నడుస్తున్న తెలంగాణ సౌజన్యంతో..)
Keywords : virasam, kranthi, tekula, pune police, bhima koregaon, urban
(2024-04-01 00:46:42)
No. of visitors : 1097
Suggested Posts
0 results