పాఠాలు నేర్చుకోని దళిత ఉద్యమ నాయకులు..!
విశాఖ జిల్లాలోని మన్యంలో ఇద్దరు ప్రజాప్రతినిధుల హత్య జరిగిన తర్వాత అధికార పార్టీ నాయకులతో సహా తెలుగు సమాజంలోని ఇద్దరు ఉద్యమ నాయకులు మందకృష్ణ మాదిగ , జూపూడి ప్రభాకర్ కూడ ఘటనను తీవ్రంగా ఖండించారు. హుటాహుటిన అక్కడికి వెళ్ళి బాధిత కుటుంబాలను ఓదార్చడమే కాకుండా మృతులకు నివాళి కూడ అర్పించారు..!
మృతి చెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు కూడ అట్టడుగు వర్గమైన ఆదివాసీ సమూహానికి చెందిన వారు కావడం వీరి తక్షణ స్పందనకు కారణంగా భావించవచ్చు. అయితే చాలా కాలంగా మావోయిస్టు పార్టీ సిద్దాంతాలపట్ల (పూర్వపు పీపుల్స్ వార్ కూడా), వారి పోరాటాల పట్ల సానుభూతితో ఉండే ఈ నాయకులు మొదటి సారి (నాకు తెలిసినంత వరకు) మావోయిస్టు పార్టీ వర్గ స్పృహ పై ప్రశ్నలు ఎక్కుపెట్టారు. మందకృష్ణ మాదిగ అయితే ఒకడుగు ముందుకు వేసి ʹనిజంగా తప్పుచేసి ఉంటే ఒకటికి రెండుసార్లు హెచ్చరికలు చేయాలి, ప్రత్యక్షంగా నిలదీయాలి కదాʹ అంటూ ప్రశ్నించారు.
నిజానికి వీరి ప్రశ్నలను.. ఆవేదనను ఎక్కడా తప్పుపట్టాల్సిన అవసరంలేదు. కానీ మావోయిస్టులపై ఇన్ని ప్రశ్నలు ఎక్కుపెడుతున్న వీళ్ళు... హత్యలు జరగడానికి కారణమైన అధికార పార్టీ విధానాలపై ఒక్క ప్రశ్న అయినా ఎక్కుపెట్టకపోవడాన్నే శంకించాల్సి వస్తోంది. ఇద్దరి మరణాల పట్ల చూపుతున్న ఆందోళన, వందలాది మంది ఆదివాసీ ప్రజలు రోజూ చస్తూ ఉంటే దానికి కారణమైన వాళ్లపట్ల ఎందుకు ఆగ్రహం, ఆందోళన కలగటం లేదు అనే అనుమానం కలుగుతుంది. ఇటువంటప్పుడే ʹప్రపంచ బాధిత ప్రజలʹ అనుభవాల నుంచి ఈ నాయకులు నేర్చుకోవాల్సింది చాలానే ఉందని అనిపిస్తుంది.
2005, జులై 7వ తేదిన రెండు ఇస్లాం అతివాద గ్రూపునకు చెందిన ʹమానవబాంబు దారులుʹ లండన్లోని అండర్గ్రౌండ్ మెట్రోస్టేషన్లో, బస్సుల్లో వరుస విధ్వంసం సృష్టించడం మూలంగా 52 మంది చనిపోవడమే కాకుండా వందలాది మంది గాయపడ్డారు. ఆ ఘటనతో ఆ దేశం మొత్తం ఉలిక్కిపడింది.
అయితే ఇక్కడ అసక్తి కలిగించే విషయమేమంటే ఆ దేశ ప్రజలు ముఖ్యంగా ఆ ఘటనతో తమ కుటుంబ సభ్యును కోల్పోయిన కుటుంబాలు మాత్రం కేవలం టెర్రరిస్టులను తిట్టడం మాత్రమే చేసి ఊరుకోలేదు. దానికంటే ముఖ్యంగా ఇలాంటి ఘటనలు తరచుగా జరగడానికి ఈ దేశ ప్రభుత్వం అక్రమిత ఇరాక్లో జోక్యం చేసుకోవడం, అక్కడి ప్రజల్ని అమెరికా అండతో ఇబ్బందుకు గురిచేయడం వంటి ఘటనలు కారణమవుతున్నాయేమో ఒకసారి ఆలోచించండి, దానిపైన విచారణ జరిగించండని డిమాండ్ చేశారు.!
ఒకవేళ ఈ దేశ ప్రభుత్వం అవంభిస్తున్న విధానాలే ఇలాంటి ఘటనకు కారణమైతే వెంటనే దానినుంచి విరమించుకొండని పబ్లిక్గా డిమాండ్ చేశారు. దానిపై ఒక ఎంక్వయిరీ కమిటీ వేసేంతవరకూ వదిలిపెట్టలేదు...!.
కానీ నిన్న మందకృష్ణ మాదిగ విశాఖలో మాట్లాడిన మాటలు ఏంటో తెలుసా.. ʹఇంటలిజెన్స్ వైఫల్యం చెందిందనిʹ, ʹమండల కేంద్రానికి దగ్గరకు వచ్చిన పసిగట్టలేదనిʹ, ʹʹఘటన జరిగిన తర్వాత కూడ ఆలస్యంగా చేరుకున్నారనిʹ, ʹభయపడి అక్కడకు పోలేదనిʹ, ʹభయపడటం అంటే విధినిర్వహన నుండి తప్పు కోవటం కాదా అనిʹ ʹబాధ్యునిగా ఒక సిఐని సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని.. ఇవి కాదు కదా వాస్తవానికి మీరు మాట్లాడాల్సింది..!
రెండు వైపుల ఆదివాసుల చంపబడటానికి, లేదా లక్షల సంఖ్యలో ఆదివాసీలు నిర్వాసితులకు కావడానికి, వేలాది మంది జైళ్లలో నిర్భందింపబడటానికి, బూటకపు ఎన్కౌంటర్ పేర హతమార్చడానికి కారణం పాలక వర్గ విధానాలని, ఏ నేల మీద అయితే ఆ గిరిపుత్రులు వేల సంవత్సరాలుగా జీవిస్తున్నారో .. ఆ నేలను కూడ వారి నుంచి లాకుంటున్నందుకు ప్రతీకారంగా ఇలాంటివి జరుగుతున్నాయని మాట్లాడాలి. ముందు ఆ విధానాలను ప్రభుత్వాలు వెనక్కి తీసుకోవాలని, ఏజన్సీ నుండి పోలీసు బలగాలను, గ్రేహౌండ్ పోలీసులను వెనక్కి పిలవాలని డిమాండ్ చేయాలి. అందు కోసం ప్రభుత్వాలపై పోరాటం చేయాలి. అవి చేయకుండా కేవలం ʹచర్చలు చేయమనిʹ ఉచిత సలహాలు ఇస్తే లాభం ఉండదు.
నిన్న మొన్న పంజాబులో కూడ ఒక కాలేజీ అమ్మాయి, మిలట్రీలో పనిచేస్తున్న తన తండ్రి తీవ్రవాదుల చేతిలో చనిపోతే ఆ అమ్మాయి తండ్రి మరణం పట్ల దుఃఖిస్తూనే..ʹనా తండ్రి మరణానికి కారణం ఈ దేశంలోని పాలక వర్గం పొరుగు దేశంపట్ల వ్యవహరిస్తున్న శత్రుపూరిత వైఖరే (విదేశాంగ విధానమే) కారణమని, దాన్ని సమీక్షించుకోమని కోరిందిʹ
బాధిత కుటుంబాల నుంచి ఈ నాయకులు పాఠాలు నేర్చుకోవల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఎందుకంటే నడుస్తున్న చరిత్ర మిమ్మల్ని గమనిస్తూనే ఉంది.
- ఎస్ఏ డేవిడ్
Keywords : manyam, agency area, vizag, manda krishna madiga, jupudi prabhakar, ఏజెన్సీ, గిరిజనులు, ఆదివాసీలు, మంద కృష్ణ, జూపుడి ప్రభాకర్
(2024-03-15 16:04:42)
No. of visitors : 2496
Suggested Posts
0 results