దండకారణ్యంలో నుల్కతోంగ్ నిజాలు
ఎన్ని సార్లు వినుంటామో. అయినా... మళ్లీ మళ్లీ అదే కథ. ఎదురు కాల్పుల కట్టుకథ.
మొన్న స్కూలుకు వెళ్లే పిల్లాడు చనిపోయాడు. ఆ మర్నాడు పొలంకెళ్లే అమ్మాయిపై అత్యాచారం జరిగింది. ఆ రాతిరే.. నిద్రపోతున్న రైతు గుండెల్లో తూటాలు దిగాయి. వంట చేస్తున్న మహిళ ఇంటి గుమ్మం ముందే ఒరిగిపోయింది. ఇవాళా అంతే... ఏకంగా పదిహేను మంది ఆదివాసీలు హత్యగావించబడ్డారు. పసిపిల్లలు, మహిళలు, రైతులు, ఆకులు ఏరుకొని, కట్టెలు కొట్టుకొని బతికే కూలీలు. వాళ్లంతా ఆదివాసీలు. ఉన్నపళంగా.. ఆగస్టు 6న వాళ్లు మావోయిస్టులయ్యారు. నిద్రలోనే పోలీసు ఎదురు కాల్పుల్లో ప్రాణాలు ఒదిలారు. ఎదురు కాల్పుల కథ ఎప్పుడూ పత్రికల పతాక శీర్షికే అవుతుంది. నుల్కతోంగ్ ఎన్కౌంటర్ కథ కూడా అంతే.
చత్తీస్ఘడ్ రాష్ట్రం, సుక్మా జిల్లాలోని నుల్కతోంగ్ అటవీ ప్రాంతంలో ఆగస్టు 6న జరిగిన ఎన్కౌంటర్లో 15 మంది మావోయిస్టులు చనిపోయారని, ఇటీవలి కాలంలో మావోయిస్టులపై తాము సాధించిన అతి పెద్ద విజయంగా పోలీసులు ప్రకటించుకున్నారు. దాదాపు మూడు రోజుల పాటు మీడియాలో ప్రసారమైన కథనాలు, ఫొటోలను చూపిన వారికెవరైనా అక్కడ ఏం జరుగుంటుందో అర్థమవుతుంది.
దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన పోరాటంలో ఆదివాసీలు ( పోలీసుల అర్థంలో మావోయిస్టులు) మాత్రమే మరణించారు. ఒక్క పోలీసుకూ ఏ చిన్న గాయమూ కాలేదు. డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్స్, స్పెషల్ టాస్క్ ఫోర్స్, కోబ్రా ఫోర్స్ సంయుక్తంగా ఆగస్టు 6 తెల్లవారుజామున చత్తీస్ఘడ్ రాష్ట్రం, సుక్మా జిల్లాలోని నుల్కతోంగ్ అటవీ ప్రాంతంపై దాడికి పాల్పడ్డాయి. వాళ్లు చట్టానికి అతీతులు కదా.. అందుకే, నిర్ధాక్షిణ్యంగా 15 మందిని పొట్టన బెట్టుకున్నారు. దానికి ఎన్కౌంటర్ అనే రాజముద్రనే వేయగలిగారు. చనిపోయిన వారిలో ఆరుగురు గంపాడ్ గ్రామానికి చెందిన వారు కాగా, మరో ఆరుగురు నుల్కతోంగ్ గ్రామానికి చెందిన వారు, మిగిలిన ముగ్గురూ ఏటిగట్ట, కిందరపాడు, వెల్పోచ గ్రామాలకు చెందిన వారు.
మావోయిస్టుల పేరుతో ఎందరినైనా చంపొచ్చని భావిస్తున్న రాజ్యం... ఆదివాసీలపై తుపాకులను ఎక్కుపెట్టింది. ఇప్పుడు బస్తర్లో... మొత్తం దండకారణ్యంలో జరుగుతున్నదీ అదే. విప్లవోద్యమాన్ని అణచివేసేందుకు లక్షలాదిగా పారా మిలిటరీ బలగాను మోహరించడంతో పాటు, ప్రైవేటు సాయుధ బలగాలను ఏర్పాటు చేస్తోంది. ఊళ్లకు ఊళ్లను తగులబెట్టి, లైంగిక దాడులు, హత్యలు లాంటి హింసను అమలు చేస్తోంది. దశాబ్ధాలుగా బస్తర్లో ఆదివాసీలు ఈ హింసను అనుభవిస్తూనే ఉన్నారు. రాజ్యం దాడులను ప్రతిఘటిస్తూనే ఉన్నారు. ప్రాణాలు కోల్పోతూనే ఉన్నారు. రెండేళ్ల క్రితం గంపాడ్ గ్రామంలో మడ్కం హిడ్మే అనే ఆదివాసీ యువతిని ఇంట్లోంచి లాక్కొచ్చి పోలీసు క్యాంపుకు తీసుకెళ్లి అత్యాచారం జరిపి హత్య చేసిన సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. గ్రామస్తులందరి ముందు నుంచీ తీసుకెళ్లిన పోలీసులు.. హిడ్మ ఒక మావోయిస్టు అని, ఆమె ఎదురుకాల్పుల్లో మరణించిందని ప్రకటించారు. ఇప్పుడూ.. అలాంటి స్థితే ఎదురైంది ఆ గ్రామస్థులకు.
నుల్కతోంగ్లో జరిగింది ఎన్కౌంటర్ కాదని, నిరాయుధులైన గ్రామస్తులపై జరిగిన ఏక పక్ష కాల్పులని ప్రత్యక్ష్య సాక్ష్యులే చెబుతున్నారు.
నిద్రిస్తున్న తమను చుట్టుముట్టి పోలీసులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారని గ్రామస్థులు మీడియాతో వెల్లడించారు కూడా. కడ్తి కొస్స, కడ్తి చుక్క ఇద్దరూ ఎన్కౌంటర్ ప్రత్యక్ష సాక్ష్యులు. వారిలో చుక్క ఎన్కౌంటర్లో గాయపడగా, కొస్స తప్పించుకు పోయింది. గ్రామస్తులతో పాటు వీరు కూడా పౌరహక్కుల సంఘం నిజనిర్ధారణ కమిటీకి నుల్కతోంగ్ ఎన్కౌంటర్ గురించిన వాస్తవాలను వివరించారు.
నిజానికి ఎన్కౌంటర్ జరగడానికి రెండు మూడు రోజుల ముందు నుంచే ఆ గ్రామాలకు కూంబింగ్ పేరుతో పోలీసులు వస్తున్నారు. సహజంగా పారామిటరీ బలగాలు గ్రామాలకు వస్తున్నాయంటేనే... గ్రామాల్లో మగవాళ్లు అడవిలోకి పారిపోతుంటారు. ఎక్కడ పోలీసులు తమను కూడా నక్సలైట్ల పేరుతో కాల్చిచంపుతారో అన్న భయంతో. అలాగే గంపాడ్ గ్రామానికి కూంబింగ్ పేరుతో పోలీసులు వస్తుండడంతో గ్రామంలోని మగవాళ్లు.. పిల్లల్ని తీసుకొని సమీపంలోని నుల్కతోంగ్ గ్రామానికి వెళ్లారు. రెండు రోజుల తరువాత పోలీసులు వెళ్లిపోయారో లేదో తెలుసుకోవడానికి కొద్ది మంది గ్రామస్థులు గంపాడ్కి వచ్చి చూశారు. కానీ... అప్పటికీ పోలీసులు గ్రామంలోనే ఉండడంతో తిరిగి నుల్కతోంగ్ గ్రామానికి వెళ్లారు.
అలా.. చుట్టుపక్కల గ్రామాల నుంచి దాదాపు 40 మందికి పైగా ఆదివాసీలు పోలీసుల భయంతో నుల్కతోంగ్ వద్ద చేరారు. 5వ తేది రాత్రి నుల్కతోంగ్ గ్రామంలో ఓ షెడ్డు కింద నిద్రపోయారు. మర్నాడు తెల్లవారు జామున నిద్రలేచి.. వేరు వేరు గ్రామాల నుంచి వచ్చిన వారంత ఒకరితో ఒకరు మాట్లాడుకుంటుండగానే దాదాపు 200 మంది పోలీసులు వారిని చుట్టుముట్టారు. ఎం జరుగుతుందో అర్థం చేసుకునే లోపే తూటాల వర్షం కురించారు. పలువురు చెల్లా చెదురుగా పారిపోయారు. పోలీసుల కాల్పుల్లో 15 మంది ఆదివాసీలు అక్కడిక్కడే మృతి చెందారు.
కాల్పులు ప్రారంభమవడంతో కడ్తి చుక్క భయంతో తన మూడేళ్ల బాబు(కడ్తి ఐత)ను తీసుకొని అడవిలోకి పరుగుపెట్టాడు. పోలీసులు వెనక నుంచి కాల్చడంతో కడ్తి ఐతకు బుల్లెట్ తగిలింది. చుక్క ఆగి తన బాబును చూసుకునే పరిస్థితి కూడా లేదు. తమను వెంటాడుతున్న పోలీసులు కాల్పులు జరుపుతూనే ఉన్నారు.
తొమ్మిదేళ్ల క్రితం తన భర్తను కోల్పోయిన ముచకి సుక్ది ఈ కాల్పుల్లో తన కొడుకు కూడా కోల్పోయింది. వీళ్లతో పాటు చనిపోయిన వారిలో సోయం సీత, సోయం చంద్ర, కడ్తి ఐత, మాదవి నందల్, మాదవి దేవ, కడ్తి హిడ్మే ఉన్నారు. నుల్కతోంగ్ గ్రామానికి చెందిన సోడి ప్రభు, మడ్కం టింకు, తాటి హంగ్రా, మచకి హిడ్మా, మచకి దేవా, ముచకి ముఖ ఉన్నారు. వీరిలో ఐదుగురు మైనర్లే. ప్రకృతిని ప్రేమించే... ప్రకృతిలో జీవించే ఆదివాసులు. వాళ్లిప్పుడు ప్రపంచానికి మృతిచెందిన మావోయిస్టులుగా పరిచయమయ్యారు. అడవి బిడ్డలైనందుకు, అడవిపైన హక్కు తమదే అన్నందుకు వాళ్లు నక్సలైట్లయ్యారు. కార్పోరేట్ల దాహానికి బలయ్యారు. నుల్కతోంగ్, గుంపాడ్ మాత్రమే కాదు.. హైదరాబాదు, ఢిల్లీ, ముంబై నగరాలు కూడా అంతే. కార్పోరేట్ల కౌగిలిలో మునిగిపోయాయి. అక్కడ ఆదివాసీ మావోయిస్టు అయ్యాడు. ఇక్కడ ఆలోచనా పరుడు మావోయిస్టు (అర్బన్) అయ్యాడు. ఇంకా.. ఆ పేరుతో ఎందరెందరినీ నేరస్థుల్ని చేస్తుందో రాజ్యం?
సోర్స్ : విరసం
Keywords : నుల్కతోంగ్, నకిలీ ఎన్కౌంటర్లు, దండకారణ్యం, nullakatong, fake encounters, dandakaranyam
(2024-03-29 20:52:15)
No. of visitors : 1640
Suggested Posts
0 results