కవిత్వం, విప్లవం సహచరులుగా - పి.వరలక్ష్మి
పి.వరలక్ష్మి రాసిన ఈ వ్యాసం అరుణతార డిశంబర్ సంచికలో ప్రచురించబడినది
ఒక అసాధారణ నిర్బంధ స్థితిలో జీవించే, రచించే స్వేచ్ఛ కోసం బెయిల్ రద్దు చేసుకొని జైలు కెళ్ళారాయన. 88 ఆగస్టు నుండి ఆయన విడుదలయ్యేవరకు జైలు లోపలి నుండి ఇండియన్ ఎక్స్ప్రెస్కు రాసిన లేఖలు ʹసహచరులుʹ పుస్తకంగా వెలువడ్డాయి. ఆంక్షల మధ్యనే వ్యక్తీకరించిన స్వేచ్ఛా భావనలవి. ఇందులో వచనం కవిత్వంతో సంభాషిస్తుంది. కవిత్వాన్ని కోట్ చేస్తూ వచనం కవితామయమై సాగుతుంది. కవిత్వంతో తప్ప ఇమడని ఉద్విగ్నతతో తన పదముగ్గురు సహచరులను గురించి చెప్తూ కవి జైలు బయటి ప్రపంచంతో మాట్లాడతాడు. అత్యధిక కాలం ఖైదులో ఉన్న కవిగా వివి జైలు కవిత్వం విస్తృతంగా రాసాడు. కానీ జైల్లో కవి ఏం చేస్తుంటాడు అనే ఊహకు వెంటనే గుర్తొచ్చేది ʹసహచరులుʹ. 2010లో ʹకాప్టివ్ ఇమాజినేషన్ʹగా ఇంగ్లీషులో వెలువడిన పుస్తకానికి గూగి ముందుమాట రాసాడు. కెన్యా జైల్లో కాగితాలు కూడా ఇవ్వని నిర్బంధంలో టాయ్లెట్ పేపర్ మీద గూగి రాసిన నవల ʹడెవిల్ ఆన్ ది క్రాస్ʹను వివి అనువాదం చేయడం ఎలా యాదృచ్ఛికం కాదో జైలులో వివి ఊహలకు గూగి ముందుమాట రాయడం కూడా యాదృచ్ఛికం కాదు.
దేశమే జైలైన సందర్భాలు చరిత్రలో చాలా ఉన్నాయి. ఆ సందర్భాలలో స్వేచ్ఛను ప్రేమించేవాళ్లు జైలుపాలవుతారు, లేదా హత్యకు గురవుతారు. తమతమ పరిధుల్లో, పరిమితుల్లో భద్రంగా ఉన్నామనుకునేవాళ్లు సాపేక్షిక స్వేచ్ఛను అనుభవిస్తున్నామని భ్రమిస్తుంటారు. బందీలుగానే ఉన్నవారితో వ్యవస్థకు ఏ పేచీ లేదు. స్వేచ్ఛను నినదిస్తూ కనిపించని జైళ్లను బద్దలుకొట్టేవాళ్లతోనే సమస్య. స్వేచ్ఛ నిప్పులా అంటుకుంటుందేమోనని కూడా రాజ్యం భయపడుతుంది. అందుకే వాళ్లను జెయిల్లో వేస్తుంది.
జైలు అంటేనే మానవ సమూహం నుండి వేరుచేయడం. సంస్కరించడానికా, శిక్షించడానికా, ఏ మాట ఉపయోగించినా జైలు చేసేది సంఘజీవియైన మానవుని జీవన బాంధవ్యాలను తెంచివేయడం. అది రాజకీయ ʹనేరంʹ అయితే పబ్లిక్ నుండి వేరుచేసి ʹప్రమాదకరʹ కార్యకలాపాలు చేయకుండా నిరోధించడం. మరి ఎప్పుడూ ఊపిరి సలపని ప్రజాజీవిత ఆచరణలో ఉండే సాంస్కృతిక కార్యకర్త, మౌనం యుద్ధనేరమని నిరంతరం చైతన్య ప్రవాహంలా మాట్లాడే మనిషి, భావాలను పంచుకోను సాటి మనిషి లేని, చేయడానికి పనిలేని, కాలం స్థంబించినట్లుగా ఉండే జైలులో ఎలా జీవిస్తాడు? అప్పటి కాలం కూడా ఆటా పాటా మాటా బందైన కాలం. సున్నితమైన మానవ స్పందనలూ, సృజన కలాపాలు నిషిద్ధమైన కాలం. ప్రజల డాక్టర్ రామనాథంను పట్టపగలు హత్య చేసిన కాలం. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల్లో అమలవుతున్న రాజ్యహింసను గురించి ప్రచారం చేయడానికి అఖిల భారత విప్లవ సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో వివి దేశమంతా తిరుగుతున్నాడు. కాబట్టి జైలులో, ఏకాంతవాసంలోనూ అదే ధ్యాస. వ్యక్తీకరణకు ఏకైక సాధనం కవిత్వం. చరిత్ర నిర్మాణంలో మాటలుగా, చేతలుగా, నడకలుగా వ్యక్తమయ్యే సమస్తమూ సాంద్రమై కవిత్వంగా రూపుగట్టుకుంటుంది. ఖైదు కవిత్వానికున్న శక్తి ఇదే. ఎంత చలనశీలంగా ఉంటాడో అంత శక్తివంతంగా, ఎంతగా మనిషి దు:ఖానికి, పీడనకు స్పందిస్తుంటాడో అంత సున్నితంగా కవిత్వం ప్రవహిస్తుంది. అంతర్లీనంగా విప్లవ కాంక్ష కవిత్వంలో నిలిచి ఉంటూ, కవిని కూడా నిలబెడుతుంది. జైలులో తన పదముగ్గురు సహచరులు (జీసెస్ 13మంది సహచరులలాగా తన అన్ థర్టీన్ సహచరులని అంటాడు) మొక్కలు, పక్షులు, పుస్తకాలు, ఉత్తరాలు, ఊహలు, ఆశనిరాశలు వంటి వాటిని తోడు చేసుకున్నా అన్నిటిలోనూ అంతర్భాగమై విప్లవం ఉంటుంది. అందెంత సున్నితంగా ఉంటుందంటే, పక్షులతో తన అనుబంధం రాసినా మొక్కలతో తన సహచర్యం గురించి రాసినా అది గాఢమైన మానవానుబంధంలా గోచరిస్తుంది. ఒక సందర్భంలో నిమ్మ చెట్టు పాదులో మొలిచిన మామిడి చెట్టును వేరు చేసి నాటే ప్రయత్నం చేస్తే వేర్లు పెనవేసుకుని తెగిపోయాయట. ʹనా కళ్ల ముందు ఆపరేషన్ అయి మూడేళ్ల కింద ఇదే రోజు నరాలు తెగుతున్న బాధతో మూలుగుతున్న నా మిత్రుడు రూపుగట్టాడʹని రాస్తాడు. ʹకన్నతల్లి, నేలతల్లి, విప్లవమూ, విప్లవ సంస్కృతిలో పర్యాయపదాలుʹ అయినట్లుగానే ప్రకృతి, మానవ సమాజం విప్లవంలో అంతర్భాగం.
పావురాల పావురంలో, కలత నిద్రను, కలల పావురాలను గురించి ఇలా రాస్తాడు.
మనసు ఎగిరేసిన కలల పావురాలు
కళ్ళ మీద వచ్చి వాలుతాయి
రెప్పలు తెరిస్తే చిక్కుకుని
రెక్కలు విరుగుతాయేమోనని
భయమే కాని
జాగ్రత్తే కాని
ఇది నిద్ర కాదని నీకూ తెలుసు
కవిత్వం కూడా విప్లవంలాంటి నిర్మాణం. రెండింటిని తన చైతన్యంలో, భావోద్వేగాలలో, తన వ్యక్తిత్వంలో భాగం చేసున్నాడు వివి. ఖైదులో ఉన్నప్పుడు ʹనా హృదయంలో నిరంతరం నిశ్శబ్దంగా నినదించే నెచ్చెలిగా, ఒక అంతర్జ్వాలగా, ఆ జ్వాల ఆరిపోకుండా విషగాలులు నుంచయినా సరే కాపాడే సాహచర్యంగా, ఒక ఆచ్ఛాదనగా, నాకిక్కడ కవిత్వం తోడుగా వున్నదʹని రాసుకున్నాడు.
పుస్తకాలు తనకు రెక్కలనిస్తాయి. అవి చైతన్యానికి ఆహారం లాంటివని చెప్తాడు. ఆ పుస్తకాల్లో కూడా బారులు బారులుగా జనం కనిసిస్తారు.
ʹచెమటవాసన వేసే పాత్ర నుదిటి మీద
నెత్తురు తుడవబోతాను
అది అంతరిక్షంలో పరుచుకున్న సూర్యకాంతివలె
చెరగదు మాయదు నా వేలికి అంటదు
నా చేతుల్లోవున్న పుస్తకంలో ఉన్న మనుషుల చేతులోకి
నన్ను తీసుకున్నట్లే ఉంటుంది
ఆ మైమరపులో మునుషుల్లోకి వెళ్లిపోయి
వక్షస్సుమీద పుస్తకం పరచుకుంటే
అక్షరాలా అది స్పర్శే
నేను మౌనంగా చదివితే నన్ను రెప్పలార్పక చూస్తున్నట్లు
నేను పెదవులు కదిలించి నాలుక ఆడిస్తే
నా నోట్లోనే సృష్టి రహస్యం చెప్తున్నట్లు
నాభిదాకా అనుభూతి తాకి
నిలువెల్లా ప్రకంపనాల తరంగాలు జల్లుమంటాయిʹ
ఇవాళ వివి జైల్లో ఉండగా ఆయన రాసిన కవిత్వంతో మాట్లాడుతుంటే ఇటువంటి అనుభూతే కలుగుతుంది. కానీ ఆయననంటాడు ʹమనిషిని పుస్తకంగా చదువుకునే నాకు పుస్తకం మనిషికి ప్రత్యామ్నాయమవుతుందా?ʹ అని.
నిర్బంధంలో స్వేచ్ఛ గురించి, ఏకాకిగా లోకం గురించి, నిషేధింపబడి నిజం గురించి రాస్తానని అంటాడు వివి. అసలు రచయిత రాయవలసింది, మాట్లాడవలసింది నిషేధించబడిన మనుషుల గురించేనని ఆయన తన మాటల్లోనూ, ప్రసంగాల్లోనూ జీన్ పాల్ సార్త్ర్ను కోట్ చేస్తుంటాడు. అట్లా నిషేధింపబడి, సంఘం నుండి వేరు చేయబడిన రాజకీయ ఖైదీలకు నేర నిరూపణ కాకపోయినా సంవత్సరాల తరబడి విచారణే శిక్షగా పరిణమిస్తుంది. వివి తన వెయ్యి రాత్రుల, మెయ్యి పగళ్ల నిర్బంధంలో ప్రకటించిన స్వేచ్ఛా భావనలో రాజకీయ ఖైదీలకు సుదీర్ఘకాల ʹనిరీక్షణ తెలుసుగానీ నిరాశ తెలియదుʹ అంటాడు. ఇది సమాజానికి గొప్ప భరోసానిస్తుంది. నడుస్తున్న చరిత్రలో భాగం కాకుండా శతృవు నిర్బంధిస్తే, రాజకీయ ఖైదీల సడలని విశ్వాసాలు ఉద్యమానికి నైతిక బలాన్నిస్తాయి. ఎమర్జెన్సీ రోజుల్లో రాజకీయ ఖైదీగా ఆయన రాసింది ఎప్పటికైనా వర్తిస్తుంది.
ʹఇదివరకు ఊపరి సలపని ఉద్యమాలు ఉత్తేజం. నను నిలబెట్టేవి నడిపించేవి. ఇప్పుడు ఊపిరాడనివ్వని నీ నిర్బంధం నన్ను ఉక్కుమనిషిగా మారుస్తున్నాయి. నాచుట్టూ కట్టిన నీ ఎత్తైన గోడలు నా కళ్లు ఆకాశమంత ఎత్తు నుంచి ప్రపంచాన్ని చూడ నేర్పినయ్.ʹ
ఇవాల మళ్లీ ఆయన జైలుకెళ్లిన సందర్భంలో ఆయన ʹకాప్టివ్ ఇవాజినేషన్ʹ కొత్తగా అర్థమవుతున్నది.
బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం దేశాన్ని నిర్బంధ శిబిరం చేసేసింది. జైళ్లలో ఉన్నది సాయిబాబా అతని నలుగురు సహచరులో, భీమాకోరేగావ్ కుట్ర కేసులో వివి సహా పదిమందో, లేక దేశవ్యాప్తంగా కొన్ని వేల మంది ఆదివాసులో కాదు. ఇప్పుడు కనిపించని జైళ్లలో దేశపౌరులందరూ బందీలుగా ఉన్నారు. అర్బన్ నక్సలైట్లని ముద్ర ఉన్నవాళ్లో, ఆదివాసీ నక్సలైట్లని బందీలుగా ఉన్నవాళ్లో అయితే రాజ్యం గీసిన ఆంక్షలను ధిక్కరించారు. స్వేచ్ఛను ప్రకటించారు. కానీ కోట్లాది మంది మౌనంగా భరిస్తున్నారు. దారి దోపిడి దొంగలకన్నా వేలరెట్లు అధికంగా ప్రజల్ని కొల్లగొట్టే ప్రభుత్వాలను, వేలాది మందిని ఊచకోసిన ప్రభువులను ఎంతో సహనంతో భరిస్తున్నారు. క్యూలో నిలబడి నియంతలను ఎన్నుకునే ప్రజాస్వామ్య ప్రహసనంలో పాల్గొంటున్నారు. స్వేచ్ఛను స్వప్నించడం కూడా మర్చిపోయిన కాలానికి కల్బుర్గి, గౌరీ లంకేష్ వంటి రచయితలు అక్షరాలకు రెక్కలిచ్చి తాము బలయ్యారు. రాజ్యం, కార్పొరేట్ ప్రాయోజిత జాతరలకు తమ సాహిత్యాన్ని అప్పగించి వ్యక్తిత్వాలను తాకట్టుపెట్టిన రచయితలు, శాలువాలలో ముఖాలను కప్పేసుకుంటున్నారు. తెలుగునాట వీటిని బహిష్కరించే ధిక్కారంతో పాటు కోల్కతాలో ప్రత్యామ్నాయ ప్రజా సాహిత్య వేదిక ఏర్పడింది. మార్చ్లో బస్తర్ సాలిడారిటీ కమిటీ-కోల్కతా చాప్టర్ నిర్వహించిన తొలి పీపుల్స్ లిటరరీ ఫెస్టివల్లో పాల్గొన్న ముగ్గురు రచయితలు వరవరరావు, అరుణ్ ఫెరేరా, వెర్నన్ గొంజాల్వెజ్లు ఇప్పుడు ప్రధాన మంత్రి హత్యకు కుట్ర పన్నారనే అభియోగం కింద పూణే జైల్లో ఉన్నారు.
తెలంగాణలో వివి అరెస్టయిన రాజకీయ సందర్భం కూడా మాట్లాడుకోవాలి. ఇక్కడ అందరి గురించి ఎందుకు గాని రచయితల గురించి మాట్లాడుకుందాం. అందరూ రాజకీయ చైతన్యం ఉన్న రచయితలే. తెలంగాణ గురించి కొట్లాడినవాళ్లే. అయిదేళ్ల తర్వాత ఇవాళ అధికార పార్టీ తరపున ఎన్నికల ప్రకటన చేస్తారు కొందరు. ఏదో ఒక పాలకవర్గ పార్టీ తరపున ఎన్నికల బరిలో నిలుస్తారు కొందరు. అప్పుడూ, ఇప్పుడూ జైలును కావలించుకుంది విప్లవ కవే. ఇక్కడ ఎవరి రాజకీయాలు వాళ్లకుండొచ్చుగాక. కానీ వ్యవస్థ పరిధిలో ఉండడానికి, వ్యవస్థను సవాలు చేస్తూ నిరంతర ప్రతిపక్షంగా ఉండడానికి మధ్య తేడా ఉంది. అక్కడే రచయిత వ్యక్తిత్వం రూపొందుతుంది. తెలంగాణ ప్రకటించిన వెంటనే ʹకారులో ఆ నలుగురికే చోటుంది. తెలంగాణ ప్రయాణించాల్సిన దూరం చాలా ఉందʹని రాసాడు వివి. ఇది ఒక పార్టీ గురించే కాదు. అన్ని బూర్జువా పార్టీల రాజకీయార్థిక విధానాలు ఒక్కటే కాబట్టి ఇది ఏ నలుగురు కార్పొరేట్ల కోసమో పనిచేసే పార్లమెంటరీ రాజకీయాల గురించి. ప్రజాప్రత్యామ్నాయం పట్ల సడలని విశ్వాసంతో కవిత్వం, విప్లవం సహచరులుగా ఏ పన్నెండోసారో జెలుకెళ్లిన నికార్సైన కవి వివి. నేనాయనను కలవక ముందే ఆయన ʹసహచరులుʹ మొదటిసారి చదివినప్పుడైనా, తన 78వ ఏట చిరునవ్వుతో, బిగించిన పిడికిలితో జైలుకు తరలినప్పుడైనా మనసు చెమ్మగిల్లిన మాట నిజమే కానీ, ʹకవి అంటే ఇట్లా ఉండాలి కదాʹ అనిపించింది.
- పి.వరలక్ష్మి
Keywords : varavararao, virasam, maoists, prison
(2024-04-24 18:51:06)
No. of visitors : 2051
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITIThe fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908. |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |