మైనింగ్ పేరుతో ప్రకృతి విధ్వంసం.. ʹఆపరేషన్ అనకొండʹతో రంగంలోకి ప్రభుత్వం
ఇది "కురుంజి" పూలు విరిసే కాలం. పచ్చని పశ్చిమ కనుమలు నిండుగా విరిసిన నీలి కురుంజి పూలతో నింగికి నేలకీ సరిహద్దుల్ని చెరిపేస్తున్నాయి. పన్నెండేళ్ల కొకసారి విరిసే కురుంజి పూలు అందరి గుండెల్నీ దోచుకుంటున్నాయి. ప్రతీ వేకువనా చీకటి తెరలు వీడకముందే దట్టమైన మంచుని చీల్చుకుంటూ ఏ కొండవంపులోనో తడుముకుంటూ నడుస్తున్నప్పుడు ఏ కనుమ పీలిక నుంచో వెలుతురు కిరణాలు చొచ్చుకొచ్చినప్పుడు..... ఒక్కసారిగా దిగ్భ్రాంతిగా, సంబరంగా నిలబడిపోతాం. ఎదురుగా కనిపించే దృశ్యానికి. ఈ కొండవాలునుంచి సుదూరంగా కనిపిస్తూ ఆకాశానికీ నేలకీ వంతెన వేసినట్టు అద్భుత నీలిమ. భగ్గుమని విచ్చుకున్న " నీలి కురుంజి పూలు ".
ఈ నీలి కురుంజీలు పశ్చిమ కనుమలకే ప్రత్యమైనవి. కచ్చితంగా12 ఏళ్ళకి ఒకసారి విరుస్తాయి. 2006 లో విరిసిన కురుంజీలు మళ్ళీ ఈ యేడు విరిశాయి. మళ్లీ 2030 లొనే విరుస్తాయి. ఈ నీలి కురుంజీలు విరియడానికి ముందు కామ్రేడ్ సాకేత్ రాజన్ అమరత్వాన్ని దివిటీగా పట్టుకొని పశ్చిమ కనుమల్లో ప్రజాసైన్యం అడుగుపెట్టిన ఏడాది విరిసిన కురుంజీలు, ప్రజల్లో పునాది వేసుకొని ట్రై జంక్షన్ డివిజన్ కమిటీగా విస్తరించినాక తిరిగి ఇప్పుడు మళ్ళీ పలకరించాయి. నీలాంబుర్ ఎన్కౌంటర్లో కామ్రేడ్స్ దేవరాజ్, అజితల అమరత్వం ఉద్యమానికి మరింత పడునుపెట్టింది. దోపిడీ దారులకు,మైనింగ్ మాఫియాలకు,కేంద్ర, రాష్ట్ర సాయుధ బలగాలకు సవాళ్ళని విసిరే స్థాయికి ఉద్యమం విస్తరించింది. కామ్రేడ్ వర్గీస్ అమరత్వం తర్వాత ఆణిగిపోయినట్లు కనిపించిన ఉద్యమం తిరిగి ఒక్కసారిగా భగ్గుమన్నట్టుగా ఎక్కడో భూమి పొరల్లో దాక్కుని పన్నెండేళ్ల కొకసారి ఈ నీలి కురుంజీలు భగ్గుమని విరుస్తాయి. సంభ్రమాశ్చర్యాల్లో ముంచేస్తాయి.
ఈ నీలి కురుంజీలను ʹstrobilanthes kunthiansʹ అనే వృక్షశాస్త్ర నామంతో గుర్తిస్తారు.ఈ పూల వల్లే పశ్చిమ కనుమలను నీలగిరులని పిలుస్తారు. మూడు నాలుగు అడుగులు పెరిగే ఈ కురుంజి పూల మొక్కలు నీలి తివాచీని పరిచినట్లు పెరుగుతాయి. తమిళనాడు, కర్ణాటక, కేరళ రాష్ట్రాల పరిధిలో ఈ కురుంజీలు విరుస్తాయి. తమిళనాడు పరిధిలోని అనామలై కొండలు,యాలుకల కొండలు, నీలగిరి కొండలు, ఫళనీ కొండలు, బాబాబుడంగరి కొండలు, కర్ణాటకలోని చికమంగుళూరు జిల్లాలోని సందూరు కొండలు, కేరళలోని ఇడుక్కి జిల్లాలోని ఘాట్లు ఈ కురుంజీలకు కేన్వాస్లు. కేరళలోని ఇడుక్కి జిల్లాలోని కొట్టకంబూర్, వట్టవాడై గ్రామాల పరిధిలోని 32 కిలోమీటర్ల విస్తీర్ణంలో టూరిస్టుల కోసం "కురింజిమల శాంక్ఛువరీ "ని నిర్వహిస్తారు,
వచ్చే సీజన్కి బహుశా ఈ అరుదైన నీలి కురుంజి పూలు పూసే ఈ భూమి ,కొండలు, కొండవాలులు, జలపాతాలు ఇక కనుమరుగై పోవచ్చు. వీటితోపాటు పచ్చని లోయలు, వంపుతిరిగే సెలయేళ్ళు, పచ్చని మిరియాల తీగల గుబురులు, మిరియాల గుత్తులు, యాలుకల పొదలు ఇకపై ఇక్కడ అంతరించిపోవచ్చు. ఈ ప్రాంతంలోని భూగర్భంలో ఉన్న అరుదైన ఖనిజాల కోసం, ముఖ్యంగా బంగారం గనుల కోసం పొంచివున్న మైనింగ్ మాఫియాలు, రియల్ ఎస్టేట్ సంస్థలు ఎప్పటి నుంచో గద్దల్లాగా కాచుకుకూర్చున్నాయి. ఆధిపత్య హత్యల తర్వాత దీని కోసం కేంద్రంలోని బిజెపి పార్టీ, రాష్ట్రంలోని వామపక్ష పార్టీలు సైతం ఒక అంగీకారానికి వచ్చాయి. అయితే ఇప్పుడు అక్కడ ప్రధాన సమస్య మావోయిస్టుల నాయకత్వంలో తీవ్రంగా ప్రతిఘటిస్తోన్న సంఘటిత ప్రజాసమూహాలు. ఇప్పుడు అక్కడ మైనింగ్ చేయాలంటే వేలాది ఊళ్ళని, ప్రజల్ని తరలించాలి. కానీ మావోయిస్టుల నాయకత్వంలో గట్టిగా నిలబడిన ఆ ప్రజాశ్రేణుల్ని చెదరగొట్టాలంటే మావోయిస్టులని అక్కడ నుంచి తుడిచి పెట్టేయాలి. అందుకోసం తమిళనాడు, కేరళ, కర్ణాటక ప్రభుత్వాలు కలిసి ఓ ఉమ్మడి ఆపరేషన్ చేపట్టాయి. ఇప్పటిదాకా వేరువేరుగా ఆపరేషన్లు చేపట్టిన మూడు రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పుడు కేంద్రం అండదండలతో భారీఎత్తున మిలటరీ ఆపరేషన్లు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.
" ఆపరేషన్ అనకొండ" పేరిట చేపడుతున్న ఈ సంయుక్త ఆపరేషన్ లక్ష్యం మావోయిస్టుల్ని అంతమొందించి.. గోల్డ్ మైనింగ్ ప్రాంతంలోని ఆవాస ప్రాంతాల్ని ఖాళీ చేయించడం. పకడ్బందీగా, చడీచప్పుడూ లేకుండా ఈ ఆపరేషన్ మొదలు పెట్టేందుకే శబరిమల వివాదాలు వంటివి వేదిక మీదకు తెచ్చి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. ఇప్పటికే లక్షలాదిమంది పారామిలాటరీ బలగాలు ట్రై జంక్షన్ ఏరియాకు చేరుకున్నాయి. ఇక ఏ క్షణంలోనైనా విధ్వంసం మొదలయ్యే అవకాశం ఉంది.
ప్రజలారా! పర్యావరణ వేత్తలారా! త్వరలో మైనింగ్ గుంటలుగా, మారుభూమిగా మారబోతోన్న ఈ పశ్చిమ కనుమలను కాపాడుకొనేందుకు ,ఇక్కడి అరుదైన ప్రకృతి సంపదను కాపాడుకొనేందుకు ముందుకు రండి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలపెడుతున్న ఈ మహావిధ్వంసాకాండని ముక్తకంఠంతో ఖండించండి. గాడ్గిల్ నివేదికను బహిర్గతం చేసి అమలుపరిచేలా ఒత్తిడి తెచ్చేందుకు ఉద్యమించండి. అంతర్జాతీయ మానవహక్కుల సంఘాల దృష్టికి ఈ మానవ,ప్రకృతి హననాన్ని తీసుకువెళ్లండి.
కామ్రేడ్స్! మనం మడమ తిప్పొద్దు. ఈ దాడులూ, ముట్టడులూ మనకు కొత్తకాదు.విశాల జన సమూహాల్ని సన్నద్ధం చేసి ప్రతిఘటిద్దాం.ఒక అంగుళం భూమి కూడా వాళ్ళకి దక్కే ప్రసక్తే లేదు.ఓ చిగురుటాకైనా చెదరడానికి వీలులేదు.అంతిమ విజయం ప్రజాలదే. ఈ సారి ఈ నీలి కురుంజీలు వచ్చే విడత లాల్ కురుంజీలుగా విప్పారాలి ఈ విముక్త భూమిలో!
- మోహన సుందరం ఫేస్ బుక్ వాల్ నుంచి
Keywords : నీలి కురింజిలు, నీలగిరి, పశ్చిమ కనుమలు. westren ghats, neelagiri, maoists, gold mining
(2024-04-24 18:49:50)
No. of visitors : 1404
Suggested Posts
0 results