నాలుగున్నర దశాబ్దాల నిత్య నిర్బధం - ఎన్.వేణుగోపాల్
(వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ రాసిన ఈ వ్యాసం అరుణతార డిసెంబర్ సంచికలో ప్రచురించబడినది)
నక్సల్బరీ పంథాలో ఐదు దశాబ్దాలుగా ప్రజా ఉద్యమ స్వరంగా ఉన్న విప్లవ కవి వరవరరావు మీద మరొకసారి నిర్బంధం మొదలయింది. చట్టవ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (అన్ లా ఫుల్ ఆక్టివిటీస్ ప్రివెన్షన్ ఆక్ట్ - యు ఎ పి ఎ) అనే దుర్మార్గమైన, అప్రజాస్వామికమైన చట్టం కింద అనేక ఆరోపణలతో ఆయన మీద మహారాష్ట్రలోని పుణెలో కేసు నమోదయింది. ఈ కేసులో ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హత్య చేయడానికి కుట్ర, మణిపుర్, నేపాల్ లతో సహా అనేక ప్రాంతాల నుంచి ఆయుధాల సేకరణ, దేశవ్యాప్తంగా విప్లవ కార్యక్రమాలకు నిధులు సమకూర్చడం, నిషిద్ధ మావోయిస్టు పార్టీతో నిరంతర సంబంధంలో ఉండడం, తప్పుడు చరిత్రతో దళితులను రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేకంగా మార్చడానికి పన్నిన కుట్రలో భాగంగా జరిగిన ఎల్గార్ పరిషద్ సభకు నిధులు సమకూర్చడం, ప్రభుత్వం మీద యుద్ధం వంటి నేరారోపణలు ఎన్నో ఉన్నాయి.
ఆశ్చర్యకరమైన విషయమేమంటే, వివి మీద రాజ్యం, పోలీసులు ఇటువంటి నేరారోపణలు చేయడం, కేసుల్లో నిందితుడిగా చూపడం, ఏళ్ల తరబడి విచారణ పేరుతో వేధించడం ఇదే మొదటిసారి కాదు. మొదటిసారి 1973 అక్టోబర్ 10న హనుమకొండలో అరెస్టు చేసిన నాటి నుంచి 2018 ఏప్రిల్ 28న ఖమ్మంలో అరెస్టు చేసిన దాకా ఆయనను కనీసం పదిహేను సార్లు అరెస్టు చేసి, దాదాపు ఏడు సంవత్సరాల పాటు పోలీసు లాకప్ లోనో, జైలులోనో, జైలులో ఒంటరి సెల్ లోనో నిర్బంధించారు. ఈ నలబై ఐదు సంవత్సరాలలో ఆయన మీద 25 కేసులు మోపి, ఇంతగా వేధించినప్పటికీ, పోలీసులు, ప్రాసిక్యూషన్ ఒక్క కేసులో ఒక్క నేరారోపణను కూడ రుజువు చేయలేకపోయారు. పోలీసులు అల్లిన కట్టుకథలను, ప్రాసిక్యూషన్ చేసిన దొంగ వాదనలను రాజ్యాంగ యంత్రంలోనే భాగమైన న్యాయస్థానాలు కూడ నమ్మలేకపోయాయి. ఆయన నిందితుడిగా ఉండిన ఇరవై ఐదు కేసులలో పదమూడు కేసులను సుదీర్ఘ విచారణ తర్వాత న్యాయస్థానాలు కొట్టివేసి, ఆయనను నిర్దోషిగా ప్రకటించాయి. అలాగే మూడు కేసులను న్యాయస్థానాలు విచారణ జరపకుండానే కొట్టివేశాయి. ఇక మిగిలిన తొమ్మిది కేసులను కొంతకాలం విచారణ జరిపిన తర్వాత ప్రాసిక్యూషన్ తానే వెనక్కి తీసుకుని, ఆయన మీద నేరారోపణలను తొలగించింది.
మొట్టమొదట 1973 అక్టోబర్ 10న, సరిగ్గా విరసం మొదటి సాహిత్య పాఠశాల మూడు రోజుల పాటు విజయవంతంగా జరిగి ముగిసిన మర్నాడు వివిని, చెరబండరాజును, ఎంటి ఖాన్ ను ఆంతరంగిక భద్రతా చట్టం (మెయింటెనెన్స్ ఆఫ్ ఇంటర్నల్ సెక్యూరిటీ ఆక్ట్ - మీసా) కింద అరెస్టు చేశారు. కవుల మీద, రచయితల మీద ఇటువంటి నేరారోపణ చెల్లదని డిఫెన్స్ న్యాయవాదులు చేసిన వాదనను అంగీకరించిన హైకోర్టు ఐదు వారాల జైలు నిర్బంధం తర్వాత వారిని విడుదల చేసింది. కాకపోతే, ఈ హైకోర్టు తీర్పులో ఎవరినైనా వారికి నేర చర్యలతో సంబంధం ఉంటే మాత్రమే నిర్బంధించవచ్చునని, కేవలం విశ్వాసాల వల్ల, రచనల వల్ల నిర్బంధించగూడదని ఒక వాక్యం రాశారు. ఆ వాక్యానికి ఆంధ్రప్రదేశ్ పోలీసులు, ప్రభుత్వం ఒక కొత్త అర్థం కనిపెట్టారు. విప్లవ రచయితల రచనల, ఉపన్యాసాల ప్రేరణతోనే ʹʹనేరాలుʹʹ జరిగాయని అంటూ తెలంగాణలో అంతకుముందు మూడు నాలుగు సంవత్సరాలలో జరిగిన ʹʹనేరాలʹʹన్నిటినీ ఏదో ఒక కవితతో, వ్యాసంతో, ఉపన్యాసంతో, సభతో జోడించారు. ఆ ʹʹనేరాలʹʹ మీద అప్పటికే స్థానిక కోర్టులలో కేసులు నమోదై విచారణలు జరుగుతున్నప్పటికీ అటువంటి కేసులన్నిటినీ కలిపి, వాటిలో నేరపూరిత కుట్ర, రాజద్రోహం కోణాల మీద విచారణకు సికిందరాబాద్ కుట్రకేసు అని పేరుపెట్టారు. ఆరుగురు విప్లవ రచయితలు, 46 మంది విప్లవకారులు నిందితులుగా ఉన్న ఈ కేసులో కెవి రమణా రెడ్డి, త్రిపురనేని మధుసూదనరావు, చెరబండరాజు, ఎంటి ఖాన్, ఎం రంగనాథంలతో పాటు వివి కూడ నిందితులుగా ఉన్నారు. ఈకేసులో వివిని 1974 మే 18న అరెస్టు చేశారు. పదకొండు నెలల జైలు నిర్బంధం తర్వాత ఆయన 1975 ఏప్రిల్ 24న బెయిల్ పై విడుదలయ్యారు.
అయితే సరిగ్గా రెండు నెలలు తిరగకుండానే దేశం మీద ఇందిరా నియంతత్వం అమలు చేసిన ఎమర్జెన్సీ చీకటిరాత్రిలో మళ్లీ ఆయనను 1975 జూన్ 26న అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా దాదాపు లక్ష మంది బుద్ధిజీవులను ఇలా 21 నెలల పాటు నిర్బంధించి, 1977 మార్చ్ 21న ఎమర్జెన్సీ ఎత్తివేసిన తర్వాత రెండురోజులకు మార్చ్ 23న విడుదల చేశారు. కాని వివిని మాత్రం కరడుగట్టిన నక్సలైటుగా అభివర్ణించి, జైలు బైట మళ్లీ అరెస్టు చేసి, మరొక వారం తర్వాత మాత్రమే విడుదల చేశారు.
ఆ తర్వాత మూడు సంవత్సరాల పాటు దేశవ్యాప్తంగానూ, రాష్ట్రంలోనూ సాగిన ప్రజాస్వామిక వెల్లువలో భాగంగా ప్రజాఉద్యమాలు విస్తరించాయి. ప్రజాసంఘాలు బలోపేతమయ్యాయి. ఈ విస్తరణను అడ్డుకోవడానికి కల్లోలిత ప్రాంతాల ప్రకటన, అరెస్టులు, దాడులు, ఎన్ కౌంటర్ హత్యలు, హత్యాప్రయత్నాలు, అబద్ధపు కేసులు మళ్లీ మొదలయ్యాయి. ఆ క్రమంలో విస్తరిస్తున్న వరంగల్ రైతాంగ, రాడికల్ విద్యార్థి యువజన ఉద్యమాల మీద అమలయిన ఉక్కుపాదంలో భాగంగా వివి మీద అబద్ధపు కేసుల బనాయింపు మొదలయింది. అలా 1981 నుంచి 1985 సెప్టెంబర్ వరకు, అంటే ఆట పాట మాట బంద్ విధానం మొదలయ్యేవరకు గడిచిన నాలుగు సంవత్సరాల్లోనే వివి మీద ఎనిమిది కేసులు బనాయించారు. వీటిలో గిరాయిపల్లి అమరవీరుల సభ మీద కేసు, కొడవటి సుదర్శన్ లాకప్ హత్య సందర్భంగా ఇచ్చిన బంద్ పిలుపు కేసు, రాడికల్ విద్యార్థి యువజనుల నిరసన కార్యక్రమాల కేసులు కూడ ఉన్నాయంటే, ఈ కేసులన్నీ ఆయనను వేధించడానికి, ఆయన కదలికల మీద ఆంక్షలు విధించడానికి మాత్రమేనని అర్థమవుతుంది. ఈ సందర్భంలోనే మహారాష్ట్ర చంద్రపూర్ జిల్లా కమలాపూర్ లో ఆదివాసి రైతుకూలీ సంఘం సభకు వెళ్తున్న సందర్భంగా గోదావరి ఆవలి ఒడ్డున మహారాష్ట్రలోని సిరొంచలో అరెస్టు చేసి మరొక కేసు కూడ పెట్టారు.
ఈ తొమ్మిది కేసుల్లో ఐదు కేసులను న్యాయస్థానాలు కొట్టివేయగా, మిగిలిన నాలుగు కేసులు విచారణ జరగక ముందే ప్రాసిక్యూషన్ ఉపసంహరించుకుంది. అయినా ప్రతి కేసు సందర్భంలోను నిర్బంధంలోకి తీసుకుని ఒక రోజు నుంచి ఒక నెల వరకూ వేరు వేరు వ్యవధుల్లో జైలులో, పోలీసు లాకప్లో నిర్బంధించారు.
ఆట పాట మాట బంద్ కాలంలో 1985 సెప్టెంబర్ 3న వరంగల్ లో ప్రధాన రహదారి మీద పౌరహక్కుల సంఘం ఉపాధ్యక్షుడు, పిల్లల వైద్యుడు డా. రామనాథం గారి క్లినిక్ లోకి జొరబడిన పోలీసులు ఆయనను కాల్చిచంపారు. వరవరరావును నరుకుతాం అని ఊరేగింపులు జరిపారు. ఆ స్థితిలో రచించే, జీవించే స్వేచ్ఛ కొరకు బెయిల్ రద్దు చేసుకుంటున్నాను అనే సంచలనాత్మక ప్రకటనతో వివి అప్పటికి పది సంవత్సరాలుగా సికిందరాబాద్ కుట్రకేసులో అనుభవిస్తున్న బెయిల్ ను రద్దు చేసుకుని 1985 డిసెంబర్ 26న జైలుకు వెళ్లారు. సికిందరాబాద్ కుట్రకేసులో నిందితులందరూ నిర్దోషులని న్యాయస్థానం 1989 ఫిబ్రవరిలో తీర్పు ఇవ్వడంతో ఆ బెయిల్ అవసరం పోయింది గాని, అప్పుడు జైల్లో ఉండగానే ఆయన మీద రాంనగర్ కుట్రకేసు అని మరొక కేసు మోపారు. ఆ కేసులో కూడ బెయిల్ తీసుకుని మార్చ్ 21న బైటికి వచ్చారు.
రాంనగర్ లో పీపుల్స్ వార్ అగ్రనాయకుల స్థావరం మీద దాడి చేసి నల్లా ఆదిరెడ్డితో సహా కొందరు విప్లవకారులను అరెస్టు చేసినప్పుడు, అక్కడ దొరికిన పత్రాలలో అనేక నేరాలకు కుట్ర జరిగినట్టు ఆధారాలు దొరికాయని ఆరోపిస్తూ విప్లవకారులను, ప్రజాసంఘాల బాధ్యులను కలిపి తయారు చేసిన కుట్రకేసు అది. పదహారు సంవత్సరాల సుదీర్ఘ విచారణ తర్వాత ఆ కేసులో వివి మీద ఏ ఒక్క నేరారోపణనూ ప్రాసిక్యూషన్ రుజువు చేయలేకపోయిందని కేసు కొట్టివేశారు.
అప్పటికి బనాయించిన పద్నాలుగు కేసుల్లో ఒక్కటి కూడ రుజువు చేయలేకపోయినందువల్లనో, మరే కారణం వల్లనో గాని దాదాపు పది సంవత్సరాల పాటు మళ్లీ వివి మీద కేసు పెట్టడానికి పోలీసులు సాహసించలేదు. 1999లో పీపుల్స్ వార్ కేంద్ర కమిటీ నాయకులు శ్యాం, మహేశ్, మురళి, పశువుల కాపరి లక్ష్మిరాజం బూటకపు ఎన్ కౌంటర్ కు నిరసనగా సెక్రటేరియట్ ముందు ప్రదర్శన జరిపినప్పుడు అరెస్టు చేసి, సెక్షన్ 144ను ఉల్లంఘించిన కేసు పెట్టారు గాని అది కూడ ఆ తర్వాత ఉపసంహరించుకున్నారు.
ఇక ప్రభుత్వానికి, విప్లవకారులకు మధ్య చర్చలు విఫలమైన తర్వాత మరొకసారి కేసుల ప్రహసనం ప్రారంభమయింది. చర్చల సందర్భంగా ముదిగుబ్బ సభలో జరిగిన అల్లరి కేసు, విరసం మీద నిషేధం కేసు, చిలకలూరిపేట పోలీసు స్టేషన్ మీద దాడి కేసు, బాలానగర్, అచ్చంపేట, ఒంగోలుల్లో పోలీసుల మీద దాడి కేసు అన్నిట్లోను వివిని నిందితుడిగా చేర్చారు. 1999 కేంద్ర కమిటీ నాయకుల అరెస్టు సందర్భంగా దాచేపల్లిలో జరిగిన సభ మీద కూడ 2005లో కొత్తగా కేసు పెట్టారు. కరీంనగర్ జిల్లా బేగంపేటలో అమరవీరుల స్తూపావిష్కరణ పైన కూడ మంథనిలో కేసు పెట్టారు. ఇలా బనాయించిన ఎనిమిది కేసుల్లో ఏడింటిని విచారణకు ముందే ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఒక కేసును న్యాయస్థానం కొట్టివేసింది.
ఆ తర్వాత 2007లో సందె రాజమౌళి అంత్యక్రియల కేసులో, గంటి ప్రసాదం హత్య సందర్భంగా ముఖ్యమంత్రి కార్యాలయం దగ్గర ప్రదర్శన కేసులో కూడ వివిని నిందితునిగా చూపారు. వీటిలో ఒక కేసును న్యాయస్థానం కొట్టివేయగా, మరొక కేసును ప్రభుత్వమే ఉపసంహరించుకుంది.
ఈ 25 సందర్భాలలోను దొమ్మీ, చట్టవ్యతిరేక గుంపు, విధ్వంసం, దోపిడీ, ప్రభుత్వాధికారులను అడ్డగించడం, హత్యా యత్నం, హత్య, ఆయుధాల సేకరణ, ఆయుధాల ప్రయోగం, పేలుడు పదార్థాల వినియోగం, తీవ్రవాద చర్యలు, చట్టవ్యతిరేక చర్యలు, నేరపూరిత కుట్ర, రాజద్రోహం, ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నం, ఆంతరంగిక భద్రతకు ప్రమాదం వంటి ఎన్నో నేరాలు ఆరోపించినప్పటికీ, పోలీసులు, ప్రాసిక్యూషన్ ఒక్క కేసులోనైనా, ఒక్క ఆరోపణనైనా న్యాయస్థానాలలో రుజువు చేయలేకపోయారు. అయితే కేసులన్నిటి నుంచీ నిర్దోషిగా విడుదల అయినప్పటికీ, కేసుల విచారణ సందర్భంగా వివి దాదాపు ఏడు సంవత్సరాలు జైలు నిర్బంధాన్ని అనుభవించి ఎన్నో ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవలసి వచ్చింది. ఆ ఏడు సంవత్సరాల పాటు ఆయన స్వరం వినిపించకుండా, ప్రజా ఉద్యమాలలో భాగం కాకుండా ఉండవలసి వచ్చింది.
ప్రస్తుత కేసు కూడ అటువంటి అబద్ధపు ఆరోపణలతోనే, రుజువు చేయడం వీలు కాని ఆరోపణలతోనే ఉన్నప్పటికీ, ఇప్పుడు కూడ దేశంలో బ్రాహ్మణీయ హిందూ ఫాసిజం కోరలు చాపుతున్న సమయంలో ఆయన స్వరం బహిరంగంగా ప్రజా ఉద్యమాలలో వినిపించకుండా చేయాలనే కుట్రలో భాగంగానే ఆయన అరెస్టు జరిగింది.
- ఎన్.వేణుగోపాల్
Keywords : varavararao, venugopal, naxalbari, UAPA, undemocratic acts, warangal, police
(2024-03-29 20:54:13)
No. of visitors : 1466
Suggested Posts
| పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలుమంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. |
| ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావుʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది..... |
| OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITIThe fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908. |
| సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది. |
| నక్సల్బరీ ప్రాసంగికత - వరవరరావు (2)చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం.... |
| తొలితరం మహిళా నక్సలైట్ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు
మహబూబాబాద్ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్ మోహన్ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం. |
| ప్రజల సభంటే.. ఇట్లుంటదిఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం.
తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు.. |
| సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావునాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్... |
| ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవననేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ. |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావునైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు..... |