యాభై ఏళ్ల నక్సల్బరీ: కవిత్వంలో అమరత్వం...జూలై 28 - వరవరరావు

యాభై

జూలై 28 అనగానే విప్లవాభిమానులకు గుర్తొచ్చే అమరత్వం చారు మజుందార్‌ లాకప్‌డెత్‌. కలకత్తా లాల్‌బజార్‌ పోలీసు స్టేషన్‌లో అప్పటికే అక్రమమ నిర్బంధంలో పదిరోజులుగా ఉన్న చారు మజుందార్‌ ఆ రోజు మరణించినట్లు ప్రకటించారు. ఆయన అప్పటికే ఆస్త్మా, ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్నాడు. మధుమేహ వ్యాధి ఉంది. రక్తపుపోటు వ్యాధి ఉంది. వీటన్నిటికీ మందులు వాడుతున్నాడు. 1970ల ఆరంభంలో గుత్తికొండ బిలం వచ్చినప్పుడు డాక్టర్‌ చాగంటి భాస్కరరావు, మరికొందరు కామ్రేడ్స్‌ ఆయనను భుజాలపై మోసుకుపోయారని అంటారు. శ్రీకాకుళం అడవుల్లో కొండలు ఎక్కాల్సి వచ్చినప్పుడు స్ట్రెచర్‌పై తీసుక వెళ్లారంటారు. అటువంటి స్థితిలో ఆయనను ద్రోహి సమాచారంతో కలకత్తాలోని ఒక రహస్య స్థావరం నుంచి పోలీసులు ఎత్తుకెళ్లి లాల్‌బజార్‌ పోలీసు స్టేషన్‌లో నిర్బంధించాక ఆయన వాడుతున్న మందులు ఇవ్వకపోవడాన్ని మించిన చిత్రహింసలు ఏం కావాలి. అది కూడా ఒకటి రెండు రోజులు కాదు పదిరోజులు. ఆక్సిజన్‌ మీద ఉన్న మనిషిని అందుకు దూరం చేస్తే చాలదూ. ప్రాణవాయువులోంచి వాయువు నిలిపేస్తే పోయేది ప్రాణమే.

అందుకే చెరబండరాజు వెంటనే ప్రజలకు పిలుపు ఇచ్చాడు.

చావలే చావలే చారు మజుందార్‌

చాటండి గళమెత్తి

చారుమజుందార్‌

చచ్చిపోలేదని

చంపబడ్డాడని.

1973 జనవరి ʹసాహిత్య పాఠశాలʹ (వరంగల్‌) సందర్భంగా సృజన ప్రచురణలుగా వెలువడిన ʹగమ్యంʹ కవితా సంకలనాన్ని చారు మజుందార్‌కు అంకితమిచ్చాడు.

చారు మజుందార్‌ అమరత్వం తెలియగానే విప్లవోద్యమాన్ని అమ్మగా భావిస్తూ శివసాగర్‌ అజరామరమైన గీతం రాసాడు.

అమ్మా!

ఆ సమాధి వద్ద

అలా ఎందుకు ఏడుస్తావు?

నీలో నీవే కుమిలి కుమిలి

ఎందుకు ఏడుస్తావు?

ఆ సమాధిలో నువు పెంచిన

నీ కోసం పోరాడిన కొడుకు లేడు.

అప్పుడే అతడు ఒళ్లు విరుచుకొని

సమాధి నుండి లేచి, ఆయుధం చేతబట్టి

తిరిగి రణరంగం చేరినాడు

అమ్మా! కళ్లు తుడుచుకొని

ఆశీర్వదించు పోరాటాన్ని

( జూలై 1972)

ʹ1972లో నక్సల్బరీ ఉద్యమ నాయకుడు కామ్రేడ్‌ చారు మజుందార్‌ పోలీసు నిర్బంధంలో అమరుడైనపుడు రాశాను!ʹ అని శివసాగర్‌ చెప్పుకున్నా, ʹనరుడో భాస్కరుడాʹ పాట వలె, ʹసత్యం చావదు సత్యం చావడుʹ కవిత వలె ఇది ఏ అమరుడైన విప్లవ యోధునికైనా, అమరురాలైన విప్లవకారిణికైనా వర్తించే విశ్వజనీనమైన జోహారు. అట్లాగే తల్లులకు, పిల్లలకు దృఢమైన ఆశ్వాసాన్ని, సంకల్పాన్ని కలిగించే విప్లవ చారిత్రక గతితార్కిక సత్యం.

ఇంక శ్రీశ్రీ ʹమరోప్రస్థానంʹలో ʹచారుమజుందార్‌ పవర్‌ మనʹదేనని (2-12-1973) చెప్పడంతో తృప్తి పడకుండా ʹచారులేని చారుశీలికిʹ అని మన అందరి తరఫున జోహార్లు అర్పించారు. స్పష్టమైన రాజకీయ అంచనాతో ఆయన వ్యక్తిత్వాన్ని రూపు కట్టాడు.

విద్యుత్తులు ప్రవహించే నీ నరాల్తో

విప్లవం శాలువ అల్లినవాడా

తెల్లభయాని కెదురుగుండా

ఎర్ర బీభత్సం జల్లినవాడా

ఉడుకు నెత్తురుప్పొంగే యువతీ యువకుల్ని

అడవుల్లోకి పంపించినవాడా

అడవుల్లోంచి మైదానాల్లోకి

ఆనందం దింపించినవాడా

ఆలోచనల్ని ఘాటెక్కించి

శ్రమకి బొమిడికం పెట్టి

జులుం పని పట్టించినవాడా

హజం ఆట కట్టించినవాడా

జనం బలం అనే నిస్త్రింశంతో

ధనం వ్రణం శస్త్రించినవాడా

డియర్‌ కామ్రేడ్‌ చారు మజుందార్‌

అందుకో మా అందరి జోహార్‌

(26 జూలై, 1973)

నేను 1974లో పిల్లల కోసం జైలులో రాసిన ʹకొత్త పాఠంʹ అనే పాటలో మొదట

ʹసిʹతో నేర్చే మాటే చారు మజుందార్‌ చారు మజుందార్‌ చారు మజుందార్‌ అని రాసాను.

అయితే చారు మజుందార్‌ కన్న ముందే 1970 జూలై 28ననే మరొక గొప్ప విప్లవకారుడు కామ్రేడ్‌ భుజాసింగ్‌ పంజాబ్‌లో అమరుడయ్యాడు. అది పోలీసులు చేసిన ఎన్‌కౌంటర్‌ హత్య. అప్పటికానయకు 82 ఏళ్లు. వెయ్యి చంద్ర దర్శనాల వయసులో సహస్ర ప్రచండ విప్లవ సూర్యకాంతులను ప్రసరించిన వాడాయన. మన దేశంలో బ్రిటిష్‌ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా 102 సంవత్సరాల క్రితం సాయుధ పోరాటం చేపట్టిన గదర్‌ పార్టీ మొదలు నక్సల్బరీ వసంత మేఘగర్జన దాకా ఆయన సాయుధ విప్లవంతో కొనసాగిన కమ్యూనిస్టు. ఈ తొలి మలి సంధ్యల్లో పొడిచిన వేగుచుక్క. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట కాలంలో కూడా ఆయన పంజాబ్‌లో కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో ఉన్నాడు.

1888లో పుట్టిన భుజాసింగ్‌ 1929లో చైనాకు వెళ్లి అక్కడి నుంచి 1930లో ఆర్జెంటినాకు వెళ్లి అదే సంవత్సరం అక్కడ గదర్‌ పార్టీలో క్రియాశీల పాత్ర వహించాడు. అక్కడి నుంచి పార్టీ నాయకత్వం 1932లో మాస్కోకు పంపించిన బృందానికి ఆయన నాయకత్వం వహించాడు. అక్కడ ఈ బృందం ఈస్టర్న్‌ యునివర్సిటీ ఆఫ్‌ మాస్కోలో మార్క్సిస్టు సిద్ధాంతాన్ని అధ్యయనం చేసి 1934లో ఇండియాకు తిరిగి వచ్చింది. అక్కడి నుంచి నిర్బంధాలు, చిత్రహింసలు, జైలు, అజ్ఞాత జీవితాలు గడిచి నక్సల్బరీ విస్ఫోటనం దాకా ఆయన గుండెల్లో విప్లవాగ్నులు నిలుపుకున్నాడు. నక్సల్బరీ తర్వాత పంజాబ్‌లో నిర్మాణమైన కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ కమిటీ (1968)లో రాష్ట్ర కమిటీ సభ్యుడై 1970 ఫిబ్రవరిలో సిపిఐ ఎంఎల్‌ ఏర్పడగానే అందులోనూ రాష్ట్ర కమిటీ సభ్యుడయ్యాడు. 1970 పార్టీ కాంగ్రెస్‌కు ప్రతినిధిగా ఎన్నికయ్యాడు. జలంధర్‌, కపుర్తలా జిల్లాల్లో భూస్వాధీన పోరాటాలు నిర్వహించిన ఆయన తలకు ఆ రోజుల్లోనే ప్రభుత్వం వెలకట్టింది. అచెర్వాల్‌ కుట్రకేసులో నేరస్థుడుగా ప్రకటించింది.

చివరకు ఆయన జీవితపు మునిమాపు వేళ జులై 27న నగర్‌ అనే గ్రామంలో ఆయనను నిర్బంధించి చిత్రహింసలు పెట్టి 27-28 అర్ధరాత్రి ఒక నది వంతెన దగ్గరకు తీసుకువెళ్లి పోలీసులు ఆయనను కాల్చి చంపారు.

పంజాబ్‌లో తొలి నక్సలైటు ఉద్యమం (1968-75) నుంచి ముగ్గురు అద్భుతమైన విప్లవకవులు వచ్చారు. వారిలో అవతార్‌సింగ్‌ సిద్ధు (పాష్‌) దేశానికంతా, బహుశా ప్రపంచానికంతా తెలిసిన కవి. సంత్‌రామ్‌ ʹఉదాసీʹ విలాస్‌ గోఘ్రే వలె ప్రపంచానికంతా తెలిసిన వాగ్గేయకారుడు. ఒక చేత పెన్ను, ఒక చేత గన్ను పట్టి పోరాడి ʹఎన్‌కౌంటర్‌ʹలో అమరుడైన లాల్‌సింగ్‌ ʹదిల్‌ʹ బాబా భుజాసింగ్‌ అమరత్వంపై కూడా రాసాడు.

ఆట

సాయంకాలం వెన్నెలలో

వీథుల్లో పిల్లలు ఒక అంగీ చివరను ఒకరు పట్టుకొని

రైలు ఆట ఆడుతూ చుట్టూ తిరుగుతున్నారు

ఇంక్విలాబ్‌ జిందాబాద్‌.. ఇంక్విలాబ్‌ జిందాబాద్‌..

అనుకుంటూ

ఒకరోజు

ఒక వృద్ధుడు కూడా అదే ఆట ఆడడం

వాళ్లు చూశారు

పోలీసులు అతని మీద విరుచుకుపడి

అతన్ని జీపులో వేసుకొని

వెళ్లిపోయారు

మర్నాడు సాయంకాలం దాకా

పిల్లలు భయంతో వణికిపోయారు

పంజాబ్‌లో ప్రేమ కవిత్వం రాసే కవిగా సుప్రసిద్ధుడైన శివకుమార్‌ బటాల్వీ కూడా కామ్రేడ్‌ భుజాసింగ్‌ అమరత్వం గురించి రాయకుండా ఉండలేకపోయాడు.

వధ్యశిల

మా ఊళ్లో ఒక చెట్టును జైల్లో పెట్టారని

వాళ్లన్నారు

ఆ చెట్టు మీద చాలా నేరారోపణలు ఉన్నాయట

ఆ చెట్టు నిండా ఆకుపచ్చ ఆకులు కాక

ఎర్రవి ఉన్నాయట

గాలి వీచకుండానే అవి కదుల్తూ ఉంటాయట

అది గ్రామం బయట ఏమీ లేదు

సరిగ్గా గ్రామంలోనే అది పెరిగింది

ఎక్కడ విస్తరిస్తే అక్కడ నీడ పరచింది

సూర్యుడినే భయపెట్టింది

మండిపోయే ఎండల్లో చల్లదనాన్ని ఇచ్చి

ప్రయాణికుల్ని సంరక్షించింది

ఆ చెట్టు దగ్గర బావి నుంచి

నీళ్లు తోడుకోవడానికి వచ్చిన ఆడపిల్లలందర్ని

కన్నబిడ్డల వలె చూసుకున్నది

ఆ చెట్టుకు చాలా కాళ్లున్నాయని

అర్ధరాత్రి పూట నడుస్తుందని

చెప్పుకుంటారు

ఆ చెట్టు రాత్రిపూట నడిచి

ఊళ్లో ఉన్న చెట్లన్నిటిని కలిసిగాని తిరిగిరాదని చెప్పుకుంటారు

ఊళ్లో గాలులు అనుకూలంగా లేనప్పుడు

ఆరాటపడుతుంది ఆ చెట్టు

మిత్రులారా

నాకిది చాలా ఆశ్చర్యంగా ఉన్నది

నేను కొమ్మలు ఉన్న చెట్లను చూశాను గాని

వాటికి కాళ్లు కూడా ఉంటాయని తెలియదు

ఈరోజు నేను వార్తాపత్రికల్లో

లక్షలాది బాంబులు, తుపాకులు ఉన్న

సాయుధ వృక్షం అది అని విన్నాను

నేనెప్పుడూ చెట్ల చల్లటి నీడల గురించే విన్నాను

బాంబుల కథ నమ్మలేకుండా ఉన్నాను

ఇది కట్టు కథ

నేను నమ్మలేను

ఆ చెట్టు ఆ ఊళ్లో

ఇంకో చెట్టును చంపిందట

కలవారి ముంగిట్లో బలసిన చెట్టును

ఆ చెట్టేమో తన గూట్లో రోజూ

ఊరిమీద చాడీలు మోసే

కాకుల్ని పెంచుతున్నదట

ఈరోజు మా ఊరి నుంచి

ఒక మిత్రుడు ఒక వార్త మోసుకొచ్చాడు

మా ఊరి చెట్టును నరికేస్తారట

ఆ చెట్టు తండ్రి ఆకేషియా లాంటివాడు

ఆ చెట్టు తల్లి జుజుబి లాంటిది

వాళ్లు విషాదంలో మునిగారు

నక్సల్బరీ వసంత మేఘగర్జనతో పులకించి ʹశాసనసభ సాలెగూడు వంటిదʹని ప్రకటించి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ ప్రతిపక్ష నాయకత్వానికి రాజీనామా చేసి కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ కమిటీకి రాష్ట్రంలో నాయకత్వం వహించిన తరిమెల నాగిరెడ్డి ఆ తర్వాత సిపిఐ ఎంఎల్‌ నిర్మాణంలో చేరకుండా వైదొలగినప్పటికీ 1976 జూలై 28న అజ్ఞాత జీవితంలో అమరుడైనాడు. అది ప్రాథమిక హక్కులన్నీ రద్దయిన ఎమర్జెన్సీ కాలం. ఆజ్ఞాతంలో ఉన్న ఆయనకు కంటి పసకల జబ్బు వస్తే వెంకట రామయ్య అనే పేరుతో ఉస్మానియా ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స జరుగుతుండగానే ఆయన ఆసుపత్రిలోనే మరణించాడు. అప్పుడు గానీ ఆయన తరిమెల నాగిరెడ్డి అని బయటపెట్టారు.

తరిమెల నాగిరెడ్డిపై శ్రీశ్రీ ఆయన బతికుండగానే ʹవజ్రంʹ అనే పేరుతో ఒక కవిత రాసాడు. తరిమెల నాగిరెడ్డి పుట్టిన ఊరు (తరిమెల) అనంతపురం జిల్లాలో వజ్రాలకు సుప్రసిద్ధమైన వజ్రకరూర్‌ ప్రాంతానికి దగ్గర్లో ఉంటుంది. అక్కడ వర్షాలు పడ్డప్పుడు వజ్రాలు నేలపైనకే కనిపించేవట.

మన తరిమెల నాగిరెడ్డి
అనంతపురం జిల్లాలో దొరికిన
వజ్రకరూర్‌ వైఢూర్యం
నా తరిమెల నాగిరెడ్డి
విశాఖపట్నం సముద్ర తీరంలో
ఆకస్మికంగా అగుపించిన ఆణిముత్యం
ఒక తరిమెల నాగిరెడ్డి
స్నేహానికీ, స్వేచ్ఛకీ, విప్లవానికీ
ఒకే ఒక పర్యాయపదం
ఇంతెందుకూ
ఈ తరిమెల నాగిరెడ్డి
పదిపెట్టి గుణకారం చేసిన మంచితనం

(9 నవంబర్‌, 1973)

- వరవరరావు

Keywords : charumajundar, naxalbari, srikakulam, tarimela nagireddy, bujasingh, gadar party
(2024-04-16 18:02:35)



No. of visitors : 1401

Suggested Posts


పూణే పోలీసులకు సుప్రీం ఝలక్.. వీవీ సహా హక్కుల కార్యకర్తల అరెస్టుపై కీలక ఆదేశాలు

మంగళవారం పూణే పోలీసులు అన్యాయంగా చేసిన అక్రమ అరెస్టులపై సుప్రీంకోర్టులో చుక్కెదురైంది.

ఆ తల్లిముందు దోసిళ్లతో.....ʹ - వరవరరావు

ʹమీరేమనుకోకుంటే ఒక ప్రశ్న వేస్తాను. ఇంత పెద్దవాళ్లున్నారు. ఈ పిల్లవాడే దొరికాడా పంపడానికిʹ అని అడిగింది ఆ తల్లి. ఆ తల్లిని నేను అప్పుడే చూడడం. ఆమె షాక్‌ తిన్నట్లుగా ఉన్నది. తండ్రి విహ్వలంగా దు:ఖిస్తున్నాడు గనుక గుండెబరువు దిగిపోతున్నట్లున్నది.....

OPPOSE THE BAN IMPOSED BY JHARKHAND GOVERNMENT ON MAZDOOR SANGATHAN SAMITI

The fascist Raghuwar Das government of Bhartiya Janta Party (BJP) has banned the MazdoorSangathan Samiti (MSS), by branding it as frontal organization of the Communist Party of India (Maoist) under colonial law, the Criminal Law Amendment Act, 1908.

సారూ.. ఆరోగ్యం జాగ్రత్త..!

మరికాసేపట్లో వాహనం ఎక్కిస్తారనగా అపార్ట్‌మెంట్ వాసులు వరవరరావు చుట్టూ చేరారు. వారెవరో ఆయనకు కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ పెద్దగా పరిచయం లేదు. అయినా కానీ విరసం నేత చుట్టూ చేరారు. సొంత బంధువు కన్నా మిన్నగా జాగ్రత్తలు చెప్పడం మొదలుపెట్టారు. ʹʹసార్.. నమస్తే సార్. ఆరోగ్యం జాగ్రత్త.. వేళకు మందులు వేసుకోండిʹʹ అనడం చూసి విస్తుపోవడం కుటుంబ సభ్యుల వంతు అయ్యింది.

నక్సల్బరీ ప్రాసంగికత ‍- వరవరరావు (2)

చుండూరు మారణకాండపై ప్రత్యేక కోర్టు ఏర్పడి నేరస్తులకు శిక్ష పడిన స్థితి నుంచి హైకోర్టు వాళ్లను వదిలి పెట్టిన కాలానికి ఈ పరిణామ క్రమాన్ని చూస్తే ఇదొక విషాదం. ఇటు విప్లవోద్యమం, అటు దళిత అస్తిత్వ ఉద్యమాలు స్వీయ విమర్శ చేసుకోవలసిన విషాదం....

తొలితరం మహిళా నక్సలైట్‌ కొమురమ్మకు విప్లవ జోహార్లు -వరవరరావు

మహబూబాబాద్‌ ప్రాంతంలో కరుడుగట్టిన భూస్వామ్యంతో రాజీలేకుండా పోరాడి 1989-90లలో మళ్లీ వెళ్లిన అజ్ఞాత జీవితంలో వాళ్లను ప్రతిఘటించే క్రమంలోనే దొరికిపోయి హత్యకు గురైన యోధుడు. యాదగిరి రాజు నాయకత్వం నుంచి లిన్‌పియావో వర్గం వైపు ఆకర్షితులైన జగన్‌ మోహన్‌ రెడ్డి, స్నేహలతల దళంలో వెంటకయ్య, కొమురమ్మలు పనిచేసినట్లు వింటుండేవాళ్లం.

ప్రజల సభంటే.. ఇట్లుంటది

ఇప్పుడెందుకో.. సభలు గుర్తుకు వస్తున్నాయి. తెరలు తెరలుగా నాటి జ్ఞాపకాలు యాదికొస్తున్నాయి. అవి మర్చిపోవటానికి ఏమైనా ఘటనా.. కాదు అనుభవం. తేనెతుట్టె కదిపినట్టు..జ్ఞాపకాల దొంతరలు.. ముసురుకుంటున్న ముచ్చట్లు.. మానవీయ స్పర్శలు.. ఆత్మీయతలు..

సాయిబాబాను రక్షించుకుందాం -వరవరరావు

నాగపూర్ సెంట్రల్ జైలు లోని అండా సెల్ లో ఉన్న ప్రొ . సాయిబాబ ఆరోగ్య పరిస్ధితి నానాటి దిగజారాడం తో ఆయన భార్య వసంత జాతీయ మానవ హక్కుల కమిటీకి, జాతీయ వైకల్య హక్కుల వేదిక తో కలసి ఫిర్యాదు చేశారు . ఆయన శిక్ష విధించే కొద్దీ రోజుల ముందు పిత్తాశయం, క్లోమ గ్రంధి కి సంబంధి ఆపరేషన్...

ఒక మహిళ అస్తిత్వం ఏంటిది - పవన‌

నేను ʹపవనʹనా? ʹపెండ్యాల పవనʹనా? ʹకుసుమ పవనʹ నా? నేను ʹపవనʹ అనే ఒక మనిషినా లేక వరవరరావు బిడ్డనో, సత్యనారాయణ భార్యనో ʹమాత్రమేʹనా? నాలో సుళ్లు తిరుగుతున్న ఈ ప్రశ్నలన్నిటికి మల్లొక్కసారి నాకు నేను జవాబు చెప్పుకుంటూ మీ అందరితో నా ఈ ఘర్షణను పంచుకుందామని నా ఆశ.

సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు

నైజాం రాజ్యంలో వెయ్యి మంది కమ్యూనిస్టులు, సానుభూతిపరులు కూడా చంపబడ్డారో లేదో కాని యూనియన్ మిలిటరీ నాలుగు వేల మంది కమ్యూనిస్టులను, సానుభూతిపరులను చంపింది. ఎలమర్రు, కాటూరు గ్రామాల్లో గాంధీ విగ్రహం చుటూ పురుషులను వివస్త్రలను చేసి పరుగెత్తిస్తూ స్త్రీలపై అత్యాచారాలు చేసిన ఘటనలు ప్రపంచమంతా చెప్పకున్నది. హరీంద్రనాథ్ ఛట్టోపాధ్యాయ్ దీర్ఘ కవిత్ర రాశాడు.....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


యాభై