కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!

కశ్మీర్


ʹఅంతా ప్రశాంతంగా ఉందిʹ అని భారత ప్రభుత్వం చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని పటాపంచలు చేస్తూ, అంతర్జాతీయ పత్రిక టైమ్ కు రాసిన వ్యాసంలో కశ్మీర్ వాస్తవ పరిస్థితిని వివరిస్తున్నారు షహనాజ్ బషీర్

టైమ్ పత్రిక కోసం నేనీ వ్యాసం రాస్తున్న సమయానికి జమ్ము నగరం పొలిమేరల్లో ఒక కార్యాలయం వెనుక ఒత్తయిన ఎత్తయిన కలుపు మొక్కల మధ్య రహస్యంగా నిలబడి ఉన్నాను. డజన్లకొద్దీ దోమలు నా చేతుల మీదా, మెడమీదా, కాళ్ల మీదా వాలుతూ, సాయంత్రపు నెత్తుటి భోజనాన్ని సంతోషంగా ఆరగిస్తున్నాయి. నేను అప్పుడప్పుడూ నా శరీరం కదిలిస్తూ, అక్కడా ఇక్కడా గోక్కుంటూ ఉన్నాను గాని నా ఫోన్ ను వదిలిపెట్టగల స్థితిలో లేను.

గత మూడు వారాలలో, నాకు బ్రాడ్ బాండ్ సంబంధాన్నీ, బైటి ప్రపంచంతో సంబంధాన్నీ కలిగించిన ఒకే ఒక్క స్థలం ఇది.

ఒక రోజు ముందే, నేను వివాదాస్పద హిమాలయ ప్రాంతమైన కశ్మీర్ లో నా ఇంటి నుంచి రెండు వందల మైళ్లు డ్రైవ్ చేసుకుంటూ ఇక్కడికి చేరాను. కశ్మీర్ కు బైట ఉండి నా కోసం ఆందోళన పడుతున్న బంధువులకూ మిత్రులకూ ఇప్పుడు ఫోన్ చేసి నేను ఇప్పటికైతే బాగానే ఉన్నానని చెప్పవలసి ఉంది. జమ్మూకు చేరగానే నాకు సరిగ్గా ఒక జైలు నుంచి విడుదలైన ఖైదీకి కలిగే లాంటి భావం కలిగింది. కాని అది కొద్దిసేపు మాత్రమే. రెండు సంవత్సరాల కింద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించిన ఆరు మైళ్ల పొడవైన చెనాని – నష్రీ సొరంగంలోకి ప్రవేశించగానే, సందేశాలూ, ఇమెయిళ్లూ వరదలాగ ముంచెత్తి నా ఫోన్ హడావుడి చేయడం మొదలుపెట్టింది. సొరంగం బైటికి రాగానే కాసేపు ఆగి నేను కుటుంబ సభ్యులకూ, మిత్రులకూ ఫోన్ చేశాను. వాళ్లందరూ ఒక్కసారి ఫోన్ మోగగానే జవాబిచ్చారు. ఆందోళనతో ఉన్నారు, ఆశ్చర్యపోతున్నారు. నేను వాళ్లకు ఎలా ఫోన్ చేయగలిగానని ఆదుర్దా పడుతున్నారు. బైట ఉన్నవాళ్లెవరికైనా తమ టెలిఫోన్ తెరమీద కశ్మీర్ నంబర్ కనబడడమంటే ఏదో అద్భుతం జరిగినట్టే.

కశ్మీర్ లో ఉన్న సందర్శకులు, యాత్రికులు అందరూ వెంటనే కశ్మీర్ వదిలిపోవాలని ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వు స్కాన్ కాపీ ఆగస్ట్ తొలిరోజుల్లో సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. వెంటనే పెట్రోల్ పంపులూ, కిరాణా దుకాణాలూ ఖాళీ అయిపోయాయి. జమ్మూ కశ్మీర్ రాష్ట్రపు వేసవి రాజధాని శ్రీనగర్ లో ఎటిఎంల ముందూ, దుకాణాల ముందూ బార్లు తీరిన సమూహాలను కొందరు మొదట వేళాకోళం చేశారు. కాని ఆగస్ట్ 4 రాత్రికల్లా తాము మూర్ఖంగా ఉన్నామని వారికే తెలిసివచ్చింది. అర్ధరాత్రి ఫోన్ లైన్లు, ఇంటర్నెట్ కనెక్షన్లు తెగిపోయాయి. మర్నాడు ఉదయానికల్లా సూర్యకాంతి పరచుకున్న శ్రీనగర్ వీథుల్లో మానవమాత్రులు కనిపించకుండా పోయారు. తమ తమ ఇళ్లలో ఉండిపోయిన ప్రజలకు మిగిలిన ఒకే ఒక్క వనరు కొన్ని న్యూస్ చానళ్లలో ప్రసారమవుతున్న భారత పార్లమెంటు సమావేశాలు. అక్కడ కొద్దిపాటి ప్రతిపక్ష విమర్శలు ఉన్నప్పటికీ, అధికార భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఏకపక్షంగా అధికరణం 370ని రద్దు చేస్తున్నది. గత కొన్ని దశాబ్దాలుగా కశ్మీరీలకు ఎంతో కొంత స్వతంత్ర ప్రతిపత్తి రాజ్యాంగ హక్కులను హామీ ఇచ్చిన అధికరణం అది.

ఆగస్ట్ 5 న ఉదయం 11 గంటల సమయంలో నాటిపొరాలోని తాజుద్దీన్ వలీ సమాధి దగ్గర కొద్దిమంది మగపిల్లలు ప్రధాన రహదారికి అడ్డంగా ఇనుప స్తంభాలు, రాళ్లు, తగలబడుతున్న టైర్లు పోగు చేశారు. నాటిపొరా చౌరస్తా దగ్గర యుద్ధసమయపు సకల కవచాలూ ధరించి మోహరించిన బలగంతో ఉన్న ఒక పోలీసు అధికారి ఆ పిల్లలను తన దగ్గరికి పిలిచాడు. వాళ్లతో మాట్లాడతానన్నాడు. పిల్లలు రాళ్లు విసరడం ఆపేశారు. ముసుగు వేసుకున్న పిల్లవాళ్లతో తమమీద రాళ్లు విసరడం ఆపమనీ, కావాలంటే శాంతియుత నిరసనలు చేసుకోవచ్చుననీ పోలీసులు చెప్పారు. బీహార్ నుంచి వలస వచ్చిన కూలీల పొడవాటి వరుస ఆ పిల్లల ముందు నుంచి కదిలిపోయింది. ఆ కూలీల మూపుల మీద చిరిగిపోయిన, బరువైన, పెద్దపెద్ద సంచులు ఉన్నాయి. కోపంతో ఉన్న పిల్లలు కొందరు వెళ్లిపొమ్మని వారిమీద అరిచారు. అప్పుడే ఆ వీథిలోని పెద్దమనిషి, స్థానిక కిరాణాదుకాణం యజమాని, ఆ పిల్లలకూ బీహారీలకూ మధ్య నిలబడి కూలీల మీద అరిచినందుకు వాళ్లను కోప్పడ్డాడు.

ఆ రోజు సాయంత్రానికల్లా, అధికరణం 370ని రద్దు చేసిన విషయం నిర్ధారిస్తూ టెలివిజన్ తెరల మీద వార్తలు వెల్లువెత్తాయి. అప్పటి నుంచి కశ్మీర్ ఒక జైలుగా మారిపోయింది. ప్రతిరోజూ ఇరవై పేజీలు వెలువడే స్థానిక వార్తాపత్రికలు నాలుగు పేజీలకు తగ్గిపోయాయి. ప్రస్తుతానికైతే అందులో రెండు పేజీలు, వాయిదాపడిన పెళ్లి ఉత్సవాల ప్రకటనలే. సెల్ ఫోన్లు మూగపోయాయి. పెద్ద పెద్ద మీసాల సైనికులతో, మెరుస్తున్న ముళ్ల కంచెలతో నగరం భీతావహంగా మారిపోయింది. అన్నిటికన్న దారుణమూ, ఇవాళ్టికి కూడ కొనసాగుతున్నదీ, అన్ని రకాల సమాచార సంబంధాల మీద పరచుకున్న చీకటి. హజ్ యాత్ర కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన వారి బంధువులు దిక్కుతోచని స్థితిలో, ఆందోళనలో ఉన్నారు.

అత్యవసరంగా విమాన టికెట్లు కొనుక్కోవాలన్నా కేవలం శ్రీనగర్ విమానాశ్రయంలో మాత్రమే దొరుకుతాయి. వేరువేరు విమాన సంస్థల కార్యాలయాల దగ్గర మనుషులు లేరు. అక్కడ టికెట్ల ఖరీదు, ఎప్పుడెప్పుడు విమానాలున్నాయో చెప్పే బోర్డులు ఉన్నాయి గాని టికెట్ కొనుక్కోవాలంటే విమానాశ్రయానికి వెళ్లవలసిందే. విమానం బయల్దేరుతుందని చెప్పిన సమయానికి మీరు మీ సామానంతా వేసుకుని అక్కడ సిద్ధంగా ఉండాలి. ఆ విమానంలో తగినంత మంది ప్రయాణికులున్నారా, అసలు విమానం బయల్దేరుతుందా ఎదురుచూస్తూ ఉండాలి. ఆగస్ట్ 10న సాయంత్రం నాలుగు గంటలకు, మధ్యాహ్నం రెండింటికి రావలసిన విమానం గురించి సమాచారం ఏమన్నా చెపుతారా అని అక్కడ తలమునకల పనిలో ఉన్న అధికారిని విమానాశ్రయం కౌంటర్ లోని అద్దంలోని చిన్న కంత ద్వారా అడగడానికి ఒక తండ్రి ప్రయత్నిస్తున్నాడు. ఆ విమానంలో ఆయన కొడుకు రావలసి ఉన్నదట. ఆయన ఇంకా ఇంటికి చేరలేదు, ఎందుకు చేరలేదో తండ్రికి తెలియదు, ఎయిర్ లైన్ సంస్థకూ తెలియదు.

ఒక స్థానిక వార్తా చానల్ బంధువుల నుంచి తప్పిపోయిన ప్రజల సందేశాలను ప్రసారం చేయడం మొదలుపెట్టింది. కిడ్నీ వైఫల్యానికి చికిత్స చేయించుకోవడానికి సుదూరాన చండీగడ్ లో ఆస్పత్రిలో చేరిన ఒక భర్త, కశ్మీర్ లో చిక్కుబడిపోయిన తన భార్య కోసం సందేశం పంపుతున్నాడు. ఆమె కోసం మర్నాడు వేకువజామున విమానం బుక్ చేశానని ఆయన ఆమెకు చెప్పదలచాడు. కశ్మీర్ కు బైట ఎక్కడో చదువుతున్న విద్యార్థులు లోయలోని తమ బంధువులు ఆందోళన పడనక్కరలేదని, తాము బాగానే ఉన్నామని రికార్డ్ చేసిన దృశ్య-శ్రవణ సందేశాలను ఈ చానల్ లో పంపుతున్నారు. తాము ఎట్లాగో అట్లా డబ్బు అప్పు చేసి, తమ కాలేజి ఫీ చెల్లించామని, కుటుంబాలు ఆందోళన పడనక్కరలేదని సందేశం పంపడానికి అష్టకష్టాలు పడుతున్నారు.

ఒక ప్రభుత్వాధికారికి తన కార్యాలయంలో లేకలేక ఒక పనిచేస్తున్న ఇంటర్నెట్ కనెక్షన్ అందుబాటులోకి వచ్చింది. ఆయన తన రాత్రి డ్యూటీ సమయంలో లాగిన్ అయి, కశ్మీర్ బైట ఆందోళనలో ఉన్న బంధువులతో మాట్లాడుతున్నాడు, చాట్ చేస్తున్నాడు. త్వరలోనే ఆయన కశ్మీర్ బైట ఉన్న తన ఇరుగుపొరుగువారి బంధువులతో కూడ సందేశాలు పంచుకోవలసి వచ్చింది. ప్రతిరోజు పొద్దున్నే ఆయన తన వీథిలో వాళ్ల సందేశాలు, వారి ఫేస్ బుక్ ఐడిలు, వాట్సప్ నంబర్లు సేకరించుకుని వెళ్లి సాయంత్రానికల్లా వాళ్ల బంధువుల జవాబులు, స్పందనలు తీసుకొస్తున్నాడు. ఇక అలా ఇచ్చినవాళ్లు తమ ప్రశ్నలకు జవాబుల కోసం రోజంతా కళ్లకు కాయలు కాచినట్టు ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు ఆయన తన వీథికంతా దైవదూత అయిపోయాడు.

ఇదంతా నేను భూతకాలంలో రాస్తున్నాను గాని ఇందులో ప్రతి అక్షరమూ వర్తమానం. ఇప్పటికీ జరుగుతున్నది.

ఈద్ రోజున, ఆగస్ట్ 12న, కశ్మీర్ లో ఆంక్షల మధ్యనే ప్రజలందరూ పవిత్ర నైవేద్యపు మేక మాంసాన్ని, ఖుర్బాన్ మాజ్ ను, బంధువులకూ మిత్రులకూ పంచిపెట్టాలని ప్రయత్నిస్తుండగా, పోలీసు స్టేషన్లన్నీ పెద్ద పెద్ద గుంపులతో నిండిపోయాయి. కశ్మీర్ బైటికి ఫోన్ చేసే అవకాశం కోసం వాళ్లు పోలీసు స్టేషన్ కు వచ్చారు. అక్కడ వరుసలో నిలబడ్డవాళ్లకు కాక, తన మిత్రుడికి దొడ్డిదారిన ఫోన్ ఇవ్వడానికి ఒక పోలీసు కానిస్టేబుల్ ప్రయత్నించినప్పుడు పోలీస్ స్టేషన్ ముందర పెద్ద కొట్లాట జరిగింది. అక్కడ ఫోన్ దగ్గర విధినిర్వహణలో ఉన్న పోలీసు అధికారి ఆ కానిస్టేబుల్ చొక్కా కాలర్ పట్టుకున్నాడు.

కశ్మీర్ సంక్షోభం గురించి వార్తలు ఇవ్వాలనే అంతర్జాతీయ ప్రచార సాధనాల ఒత్తిడితో, కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందనే అభిప్రాయాన్ని భారతీయులకూ, ప్రపంచం మొత్తానికీ ఇవ్వాలనే ఉద్దేశంతో, జమ్ము కశ్మీర్ గవర్నర్ కార్యదర్శి ఒకరు ఆగస్ట్ 16న ఒక పత్రికా సమావేశం నిర్వహించాడు. కశ్మీర్ సంక్షోభంలో వెసులుబాటు కల్పించడానికి ప్రభుత్వం ఏ చర్యలు తీసుకుంటున్నదో వివరాలు చెప్పడానికి ఆయన ఉపక్రమిస్తుండగానే మా అమ్మానాన్నా ఆ వార్త చూస్తూ వెటకారంగా పక్కున నవ్వారు. అంతా మామూలై పోతున్నదని, మామూలై పోతుందని, ప్రభుత్వం నీరూ విద్యుత్తూ సరఫరా చేస్తున్నదని ఆయన చెప్పాడు.

ఆయన మాటల అర్థం ఏమంటే ఈ ప్రగల్భాలు ఒక మేలిముసుగు కప్పిన హెచ్చరిక అని. ప్రస్తుతానికి ప్రభుత్వం నీటి సరఫరా, విద్యుత్ సరఫరా యథాతథంగా ఉంచింది అని. తమ మౌలిక మనుగడకు అవసరమైన నీటినీ, విద్యుత్తునూ ఇస్తున్నందుకు కశ్మీరీలు ప్రభుత్వానికి కృతజ్ఞులై ఉండాలి అని. అంటే గాలిలోంచి ప్రాణవాయువునూ, ప్రజల మనసుల్లోంచి ఆలోచనలనూ అదుపు చేయగల శక్తే గనుక ఈ ప్రభుత్వానికి ఉంటే, గాలి పీల్చుకోనిస్తున్నందుకూ, ఆలోచించనిస్తున్నందుకూ ప్రభుత్వానికి కృతజ్ఞులై ఉండాలని ప్రజలను అడిగేవారే.

కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ఇటువంటి ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే.

ఇప్పటికిప్పుడు, కశ్మీర్ లో కల్పించబడిన సంక్షోభపు పద్దెనిమిదో రోజున, కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి సరిగ్గా ఇట్లాగే ఉంది. ఒకే ఒక్క మార్పు, లాండ్ లైన్ ఫోన్లు అప్పుడప్పుడు పనిచేస్తున్నాయి గాని అది కూడ ఊగిసలాడుతూ, చాలసార్లు అవకతవకలుగా, అక్కడో ఇక్కడో మాత్రమే అవి పనిచేస్తున్నాయి. ఎప్పుడైనా ఫోన్ పనిచేస్తే, విదేశాలతో మాట్లాడాలంటే, కశ్మీర్ ప్రజలు కశ్మీర్ బైట ఎవరో ఒక మిత్రుడికో, బంధువుకో ఫోన్ చేసి, వారితో ఒక కాన్ఫరెన్స్ కాల్ ఏర్పాటు చేయించుకుని అప్పుడు మాత్రమే మాట్లాడగలుగుతున్నారు.

ఈ సంక్షోభం మధ్య జీవిస్తూ, ఎప్పటికో ఒకప్పటికి సాధారణ సమాచార సంబంధాలు నెలకొంటాయనే ఆశతో నేను ఎన్నో రోజులు ఎదురుచూశాను. కాని అది జరగలేదు. నేను జమ్మూకు చేరిన రోజున, మందకొడిగా పనిచేసే 2జి ఇంటర్నెట్ తో నేను కొన్ని ముఖ్యమైన ఇమెయిళ్లు చూసుకోగలిగాను. భారత్ లోనూ, విదేశాల్లోనూ నా గురించి ఆందోళన పడుతున్నవారికి జవాబివ్వగలిగాను. వారు నా భద్రత గురించి ఎన్నోసార్లు సందేశాలు పంపారు. ప్రార్థనలు చేశారు. నేను క్షేమంగా ఉన్నానా అని అడిగారు. చిట్టచివరికి నా ఫోన్ తెరిచి వాట్సప్ లో వారి సందేశాలు చూశానని రెండు నీలి రంగు టిక్ గుర్తులు వచ్చాక వారి ఆందోళన తగ్గింది. కాని ఆ మర్నాడే ఆ ఫోన్ సేవలు కూడ మూసివేయబడ్డాయి. సంక్షోభం కొనసాగుతున్నది. అయినా ప్రభుత్వం ఇంకా ʹఅంతా ప్రశాంతంగా ఉన్నదʹనే అంటున్నది.

సోర్స్ : టైమ్‌
అనువాదం : ఎన్‌. వేణుగోపాల్‌
(రచయిత కశ్మీర్ లో విశ్వవిద్యాలయ జర్నలిజం ప్రొఫెసర్. ది హాఫ్ మదర్ అనే నవల, స్కాటర్డ్ సోల్స్ అనే కథల సంపుటం ద్వారా ప్రపంచ ప్రఖ్యాతి పొందారు.)

Keywords : kashmir, jammu, article 370, 35(a), military, india, Indian Government, SHAHNAZ BASHIR, N Venugopal
(2024-04-24 17:56:00)



No. of visitors : 2808

Suggested Posts


పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటు

పాకిస్థాన్‌ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్‌ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి.....

మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలు

భద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో....

అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామా

అతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు....

మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో క‌శ్మీర్ ప్ర‌జ‌లు - నిండిపోతున్న ఆసుప‌త్రులు

ప్ర‌జ‌లు మానసిక‌ జబ్బుల భారిన ప‌డుతున్నారు. మ‌తిస్తిమితం కోల్పోవ‌డం, తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వ్వ‌డం, విప‌రీతంగా భ‌యాందోళ‌న‌ల‌తో రోధిస్తూ ప‌లువురు అప‌స్మార‌క స్తితికి చేరుకుంటున్నారు. గ‌డిచిన 12 రోజుల్లో... మాన‌సిక స‌మ‌స్య‌ల‌తో ఆసుపత్రుల్లో చేరుతున్న‌వారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంద‌ని SHMS ఆసుప‌త్రి వైద్యులు

కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి..

కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది.

పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్‌పీఎఫ్‌

పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్‌పీఎఫ్‌ జమ్మూకాశ్మీర్‌ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్‌లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్‌ హైకోర్టుకు....

కాశ్మీర్ లో మరో సాల్వజుడుం

ఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు.....

దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మి

ఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే.....

సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?

26 ఏండ్ల ఫరూఖ్‌ అహ్మద్‌ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్‌పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ.....

నెత్తురోడుతున్న కాశ్మీర్ - పోలీసు పెల్లెట్లకు 11ఏండ్ల విద్యార్థి బలి

శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం రాత్రి ఓ విద్యార్థి మృతదేహం లభ్యమైంది. మృతుడి శరీరమంతా పెల్లెట్ల గాయాలతో నిండి ఉన్నది. శ్రీనగర్‌లోని హర్వాన్‌లో శుక్రవారం పోలీసులకు, నిరసనకారులకు మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది....

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


కశ్మీర్