ఎంత తీవ్ర ఖండనైనా సరిపోదనిపించే దుర్మార్గం -ఎన్.వేణు గోపాల్
(సంపాదకులు ఎన్.వేణుగోపాల్ రాసిన వీక్షణం సెప్టంబర్ 2019 సంచిక సంపాదకీయం)
కశ్మీర్ విషయంలో భారత ప్రభుత్వం సాగించిన దుర్మార్గాన్ని, దురాక్రమణ చర్యను ఎంత తీవ్రంగా ఖండించినా తక్కువే అనిపిస్తుంది. ఇది కేవలం ఒక ప్రాంతం మీద బలప్రయోగం, ఒక ప్రాంత ప్రజల ప్రాథమిక హక్కుల మీద ఉక్కుపాదం మాత్రమే కాదు, ఇది ఎన్నెన్నో కోణాలలో ఎంతమాత్రమూ ఆమోదించడానికి వీలు లేని, అత్యంత తీవ్రంగా అభిశంసించవలసిన హంతక ఉన్మాద చర్య.
ఇది కనీసం ఎనిమిది తొమ్మిది దశాబ్దాలుగా కశ్మీర్ ప్రజలు సామూహికంగా ప్రకటిస్తున్న ఆకాంక్షల అణచివేత. ఇది మానవ నాగరికతా ప్రయాణంలో రూపొందించుకున్న మానవతా విలువల హననం. ఇది స్వయంగా భారత పాలకవర్గాలు గత ఏడు దశాబ్దాలుగా కశ్మీర్ ప్రజలకూ, భారత ప్రజలకూ, అంతర్జాతీయ సమాజానికీ ఇచ్చిన హామీల ఉల్లంఘన. ఇది భారత ప్రజలమైన మనకు మనం రాసి ఇచ్చుకున్న రాజ్యాంగ స్ఫూర్తి విధ్వంసం.
ఆ రాజ్యాంగ రచనకు పునాది అయిన జాతీయోద్యమ, ప్రజా ఉద్యమాల విలువల వారసత్వాన్ని ఖననం చేయడం ఇది. ఏడు దశాబ్దాలలో ఎన్నిసార్లు తూట్లుపొడిచినా ఆభాసగానైనా, నటనకోసమైనా, ముసుగుగానైనా ఉన్న కనీస ప్రజాస్వామ్య పద్ధతుల కూల్చివేత ఇది.
వలస పాలనా కాలంలోనే దేశపు బహుళత్వమూ విభిన్న జాతుల అస్తిత్వమూ స్ఫురణకు వచ్చి, వలసానంతర సమాజంలో జాతుల స్వయం నిర్ణయాధికార హక్కు అంగీకరిస్తామనే దగ్గర మొదలై, చివరికి కనీసం భిన్నత్వంలో ఏకత్వ పునాదిగా హక్కులను రక్షిస్తామని వాగ్దానం చేసి, మూడు సంవత్సరాల చర్చాక్రమంలో, దేశదేశాల అనుభవాల అవగాహనతో రూపొందించుకున్న దేశ రాజ్యాంగపు సమాఖ్య స్వభావాన్ని పార్లమెంటు సాక్షిగా హత్య చేసిన ఘటన ఇది.
ఒక బహుళ సమాజాన్ని పట్టుకుని నీ అభివృద్ధి కోసమే, నీ కోసమే నేనిది చేస్తున్నాను అని గొంతు పిసుకుతున్న ఘటన ఇది. ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చి మిగిలిన రాష్ట్రాలన్నిటికీ కూడ పెట్టిన బెదిరింపు ఇది. మూడు వారాలు దాటిపోతున్నా, కర్ఫ్యూ విధించి, ఒక్క మనిషి కూడ బైటికి రాకుండా, గొంతెత్తకుండా నిర్బంధించి, ప్రజాందోళనకూ నిరసనకూ నాయకత్వం వహించగలరేమో అనిపించిన ఆరువేల మందిని చెరసాలల పాలుచేసి, సమాచార సంబంధాల వ్యవస్థలన్నిటినీ మూసివేసి, చీకటి రాజ్యం స్థాపించి, వాక్సభాస్వాతంత్య్రాలను, రాజ్యాంగం హామీ ఇచ్చిన ప్రాథమిక హక్కులను ఉత్తరించి ఇదంతా కశ్మీర్ వెలుగు కోసమే నంటున్న అబద్ధాల కోరు ప్రభుత్వం ఇవాళ రాజ్యం చేస్తున్నది.
యుద్దం ముగియకుండానే ఓడిన దేశం మీద పడి ఎవడికి దొరికినది వాడు చేజిక్కించుకునే రాబందుల్నీ జాగిలాల్నీ ఉసి గొలిపినట్టు బహుళ జాతి సంస్థలకూ వారి దళారీలకూ దేశదేశాల సంపన్నులకూ ఎర్రతివాచీ పరిచి ఆహ్వానాలు పలుకుతున్న, ప్రత్యేక సన్నాహాలు చేస్తున్న దుర్మార్గం ఇది.
అన్యాయం, అక్రమం, చట్టవ్యతిరేకత, అప్రజాస్వామికత, క్రూరత్వం, దుర్మార్గం, సిగ్గులేనితనం, హంతక స్వభావం, ధూర్తత్వం, అమానుషత్వం వంటి ఎన్ని మాటలతో వర్ణించినా జరిగిన, జరుగుతున్న దారుణంలో వందోవంతును కూడ చిత్రించడం సాధ్యం కాదు. ఒక ప్రాంతం మీద, ఒక ప్రాంత ప్రజల మీద రెండు పొరుగుదేశాలు జరిపే దౌర్జన్యాలకు కశ్మీర్ ఒక పాఠ్యపుస్తకం వంటి ఉదాహరణ అని గత డెబ్బై సంవత్సరాలలో ఎందరో అన్నారు. ఆ దుర్మార్గ, అక్రమ, హంతక పాఠ్యపుస్తకం మరింత ఎక్కువ ఉదాహరణ ప్రాయ స్థితికి చేరుతున్నది.
ఈలోగా చరిత్ర గమనం సాగుతుంది. ఆ చరిత్రలో, ఆగామి భవిష్యత్తులో ఏం జరగనున్నదో ఊహించడం కూడ కష్టం కాదు. నిన్నటి వరకూ భారతదేశం మీద నమ్మకం పెట్టుకున్న కశ్మీరీలు కూడ ఆ నమ్మకం వమ్ము అయిందని నిరాశలోకీ, ఆగ్రహంలోకీ ప్రయాణిస్తారు. భారత పాలకుల మీద, భారతప్రభుత్వం మీద మాత్రమే కాదు, భారతదేశం మీదికి, అంటే భారత ప్రజల మీదికి కూడ ఆ ఆగ్రహం బదిలీ అవుతుంది.
ఆ ఆగ్రహానికి ఆజ్యం పోయడానికి పొరుగుదేశపు పాలకవర్గాలు ఎలాగూ సిద్ధంగా ఉంటాయి. అంటే ఆగస్ట్ 5 పరిణామాలు కశ్మీర్లో మరింత మందిలో భారత్ పట్ల వ్యతిరేకతను పెంచుతాయి. మరింతమంది క్రియాశీల, సాయుధ చర్యలలోకి వెళ్లడానికి దారితీస్తాయి. డెబ్బైలక్షల జనాభాకు పది లక్షల సైనిక, అర్ధసైనిక బలగాలను పెట్టి ఇవాళ ఒక శ్మశానశాంతిని స్థాపించి ఉండవచ్చు గాని, త్వరలోనో, ఆలస్యంగానో ఈ శ్మశానశాంతి బద్దలయ్యే విస్ఫోటక పరిణామాలు జరుగుతాయి.
అక్కడ మాత్రమే కాదు, కశ్మీర్ ను ఒక జాతి సమస్యగా, ఒక ప్రాంత సమస్యగా కాక ప్రధానంగా మత సమస్యగా చిత్రించినందువల్ల దేశవ్యాప్తంగానే ఆ మతంలోని సున్నిత మనస్కులలో ప్రభుత్వవ్యతిరేక భావనలు పెరిగిపోతాయి. వాటికి ఏ విపరిణామాలు ఉంటాయో ఎవరికి వారు ఊహించుకోవలసిందే.
ఇవాళ అన్ని దేశాల ప్రభుత్వాలను, ముఖ్యంగా సామ్రాజ్యవాద ప్రభుత్వాలను, ఐక్యరాజ్యసమితిని, భద్రతామండలిని మాయచేసి మనతో ఉన్నారని అనిపించుకోవచ్చు గాని క్రమక్రమంగా భారత ప్రభుత్వ దుర్మార్గాన్ని నిరసించే దిశగా అంతర్జాతీయ ప్రజాభిప్రాయ సమీకరణ పయనిస్తుంది. గతం నుంచి, ప్రత్యేకంగా పాలస్తీనా నుంచి మనం ఏమన్నా నేర్చుకోగలిగితే, రానున్న రోజుల్లో ఏం జరిగే అవకాశం ఉందో ఊహించవచ్చు. ఆ భవిష్యత్తు ప్రమాదకరమైనదనుకుంటే, దాన్ని ప్రమాదకరంగా మార్చిన ఘనత మన పాలకులదే తప్ప కశ్మీరీ ప్రజలది కాదని మాత్రం గుర్తుంచుకోవాలి.
పాలస్తీనా ప్రజలపై, భూభాగంపై సామ్రాజ్యవాదులు సాగించిన దుర్మార్గం, ఇజ్రాయిల్ ఏర్పాటు, క్రమక్రమంగా ఇజ్రాయెలీల దురాక్రమణ దౌర్జన్యాలు, తమ దేశంలో తామే కాందిశీకులుగా బతకవలసి వచ్చిన పాలస్తీనీయుల స్థితి, తమ హక్కుల పరిరక్షణ కోసం, మాతృభూమి పునరుద్ధరణ కోసం ఇంతిఫాదా సాయుధ పోరాటానికి దిగిన స్థితి, కళ్లూ చెవులూ మూసుకున్న అంతర్జాతీయ సమాజం, ఏడు దశాబ్దాలుగా ఆరకుండా రగులుతున్న అణచివేత-ప్రతిఘటన చరిత్ర పూర్తిగా తెలియని వారికి, ఇప్పుడు కశ్మీర్ పై భారత పాలకవర్గాల దురాక్రమణ ఆ చరిత్రను కళ్ల ముందర పునరావిష్కరిస్తున్నది.
ఎదురుగా ముక్కు గుద్దినట్టు కనబడుతున్న ఈ వాస్తవాల పట్ల మానవీయంగా, ప్రజాస్వామికంగా, చట్టబద్ధంగా, చరిత్ర గమనానికి అనుగుణంగా స్పందిస్తామా లేదా చరిత్రలో నమోదవుతుంది. మన స్పందన వల్లనే మారే అవకాశం లేనంత దుస్థితి కొనసాగుతుండవచ్చు, కాని కనీసం మన స్పందన ప్రకటించి చరిత్ర దృష్టిలో క్షమారులమవుతామా, నేరస్తులుగా మిగులుతామా ఎవరికి వారు తేల్చుకోవలసిందే.
- ఎన్.వేణుగోపాల్
Keywords : kashmir, article 370, 35a, bjp, narendra modi
(2024-04-05 05:29:50)
No. of visitors : 728
Suggested Posts
| పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో తిరుగుబాటుపాకిస్థాన్ ఆక్రమిత కశ్మీరులో తిరుగుబాటు తీవ్రమయ్యింది. తమపై పాకిస్థాన్ ఆధిపత్యాన్ని సహించేది లేదంటూ పాక్ అణచివేత నుండి తమకు విముక్తి కల్పించాలంటూ ఆందోళనలు ఉధృతమవుతున్నాయి..... |
| మా పిల్లలను హత్యలు చేస్తున్న మీతో మాట్లేడేది లేదు - రాజ్ నాథ్ కు షాకిచ్చిన కాశ్మీరీలుభద్రతా దళాల దాడులతో, ప్రజల ఆందోళనలతో అల్లకల్లోలంగా ఉన్న కాశ్మీర్ లో పర్యటించడానికి వెళ్ళిన కేంధ్ర హోమంత్రి రాజ్ నాథ్ సింగ్ కు కాశ్మీరీలు షాకిచ్చారు. 46 మంది చనిపోయి, 2,400 గాయాలపాలై, 15 రోజులుగా కర్ఫ్యూలో మగ్గుతున్నకశ్మీర్ లో.... |
| అబద్దాలు చెప్పలేక జర్నలిస్టు రాజీనామాఅతడో ఆత్మాభిమానం ఉన్న జర్నలిస్టు. అందుకే యాజమాన్యం చెప్పిన మాట కాదన్నాడు. ఉద్యోగానికి గుడ్ బై చెప్పేసి తన అసలైన జర్నలిస్టుగా పాత్రికేయ ప్రపంచానికి చాటి చెప్పుకున్నాడు.... |
| మానసిక సమస్యలతో కశ్మీర్ ప్రజలు - నిండిపోతున్న ఆసుపత్రులుప్రజలు మానసిక జబ్బుల భారిన పడుతున్నారు. మతిస్తిమితం కోల్పోవడం, తీవ్ర ఆందోళనకు గురవ్వడం, విపరీతంగా భయాందోళనలతో రోధిస్తూ పలువురు అపస్మారక స్తితికి చేరుకుంటున్నారు. గడిచిన 12 రోజుల్లో... మానసిక సమస్యలతో ఆసుపత్రుల్లో చేరుతున్నవారి సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోందని SHMS ఆసుపత్రి వైద్యులు |
| కాశ్మీర్ ఉజ్వలమైన చరిత్ర, పోరాట గాథ...మాజీ కేంద్ర మంత్రి సఫుద్దీన్ సోజ్ కాశ్మీర్ పై రాసిన పుస్తకం గురించి.. కాంగ్రెస్స్, బీజేపీ నాయకులంతా కట్టగట్టుకొని తిట్టిపోసిన పుస్తకం ఇది. ఈ పుస్తకావిష్కరణకు రావాల్సిన రాహుల్ గాంధీ చివరి నిమిషంలో రాక పోవటానికి కారణం సైఫుద్ధీన్ ఈ పుస్తకంలో కాశ్మీర్ సమస్యకు నెహ్రూను కూడా బాధ్యడ్ని చేయటమే. పటేల్ 37 అడుగుల విగ్రహ నిర్మాణం జరిగాక, ఈ పుస్తకంలో సైఫుద్దీన్ ప్రస్తావించిన పటేల్ ప్రస్తావన విశేషమైనది. |
| కశ్మీర్ లో వాస్తవ పరిస్థితి ఇదీ!కశ్మీర్ లో అంతా సవ్యంగా ఉందని ప్రభుత్వం చేస్తున్న ప్రకటనలు కశ్మీర్ ప్రజలను ఎప్పుడూ ఆశ్చర్యపరచలేదు. అది ఒక అరిగిపోయిన మాట అయిపోయింది. తెలివితేటల వెలుగు కోల్పోయిన అబద్ధం అది. కశ్మీరీలకు ఆసక్తి కలిగించేదేమంటే, ప్రజల సొంత మేలు కోసం వారి మీద ఇలా విరుచుకుపడడం అవసరమైందనే ప్రభుత్వ ప్రచారంలోని తర్కాన్ని ప్రపంచం ఎట్లా ఆమోదిస్తున్నదనేదే. |
| పెల్లెట్లు వద్దంటే ఇక బుల్లెట్లే - సీఆర్పీఎఫ్పెల్లెట్లు వద్దంటే బుల్లెట్లు వాడాల్సి వస్తుందని సీఆర్పీఎఫ్ జమ్మూకాశ్మీర్ హైకోర్టుకు తెలిపింది. జమ్మూ కాశ్మీర్లో గత 32 రోజులుగా కొనసాగుతున్న అల్లర్లు, ఆందోళనలను అదుపు చేసేందుకు 13 లక్షల పెల్లెట్లను ఉపయోగించినట్లు జమ్మూ కాశ్మీర్ హైకోర్టుకు.... |
| కాశ్మీర్ లో మరో సాల్వజుడుంఓ వీడిసీ సబ్యుడి చేతిలో ఓ తల్లి, ఆమె కుమారుడు దారుణ హత్యకు గురయ్యారు. అందరూ చూస్తుండగానే ముస్తాఖ్ అహ్మద్ అనే వీడీసీ సభ్యుడు.. షమిమా అక్తర్ అనే మహిళ, ఆమె మూడేళ్ల బాబు తాహిద్ పై నేరుగా తుపాకీ ఎక్కుపెట్టి కాల్పులు జరిపాడు..... |
| దుఃఖమూ నేరమైన చోట - పి.వరలక్ష్మిఒక చావును దేశం వేడుక చేసుకుంటుంది. అటు వైపు ఒక దుఃఖిత సమూహం శవయాత్రకు పోటెత్తుతుంది. దశాబ్దాలుగా అది నిషిద్ధ దుఃఖం. వాళ్ళ దుఃఖానికి సంఘీభావం నేరం. అవును, మాట్లాడుతున్నది కశ్మీర్ గురించే..... |
| సైన్యంపై రాళ్ళు రువ్వడం దేశ ద్రోహం సరే... సైన్యం సృష్టించే అరాచకాన్ని ఏమనాలి ?26 ఏండ్ల ఫరూఖ్ అహ్మద్ థర్ అనే ఓ యువకుడు దగ్గరి బందువు చనిపోతే పక్క గ్రామం వెళ్తుండగా ఎదురు పడ్డ కొందరు సైనికులు అతనిపై దాడి చేసి తాళ్ళతో బందించి. జీపు బానెట్పై కూర్చోబెట్టారు. దాదాపు తొమ్మిది గ్రామాల్లో జీపును తిప్పారు. తొమ్మిది గ్రామాల గుండా జీపు ప్రయాణిస్తున్నప్పుడు సైనికులు బిగ్గరగా అరిచారు. రండీ...మీ మనిషిపైనే దాడి చేసేందుకు బయటకు రండీ..... |