మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !
కేంధ్ర బీజేపీ ప్రభుత్వం, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్య మహిళా సంఘం కార్యకర్తలపై దాడులు, అరెస్టులు చేస్తూ భయబ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఉపా (UAPA) లాంటి ప్రజాస్వామ్య వ్యతిరేక చట్టాలను వారిపై బనాయిస్తున్నారు. ఈ పాలకుల చర్యలకు నిరసిస్తూ చైతన్య మహిళా సంఘం ప్రచురించిన కరపత్రం పూర్తి పాఠం...
చైతన్య మహిళా సంఘం(CMS)1995లో ఏర్పడి 25 సంవత్సరాలుగా చట్టబద్ధంగా పని చేస్తున్నది. 25 సంవత్సరాలుగా చైతన్య మహిళా సంఘం నిత్యం నిర్బంధం ఎదుర్కొంటూ మహిళా సమస్యలపై పోరాడుతుంది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు చైతన్య మహిళా సంఘం సభ్యులపై ఒక్క సంవత్సరంలోనే వరుసగా పలుసార్లు వచ్చిన అక్రమ ఉపా(UAPA)కేసుల లిస్టులలో చైతన్య మహిళా సంఘం సభ్యులు తొమ్మిది మంది పేర్లు చేర్చారు. సంస్థ సభ్యుల్ని అరెస్టు చేయడానికి పోలీసులు అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇండ్లకు వచ్చి కుటుంబ సభ్యులను ఇబ్బందులు పెడుతున్నారు.
ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో కెసిఆర్ పాలన ఉద్యమాల అణచివేతతో మొదలయింది. సుశృత అనే మహిళ దారుణ హత్యపై న్యాయం చేయమని సిఎంఎస్ ఉద్యమిస్తే సిఎంఎస్ కార్యకర్తలైన పది మందిపై కేసులు పెట్టి ఇప్పటివరకు కూడా కోర్టుల చుట్టు తిప్పుతున్నారు. గద్వాల కుట్ర కేసులో శిల్ప, రేణులను కూడా ఇరికించింది. ప్రజల మధ్య తిరుగుతున్న కూడా పరారీలో ఉన్నారని ఎఫ్ఐఆర్ లో రాశారు. ఇటీవల అక్టోబరు 20న చర్లలో మరో అక్రమ అరెస్టులో దేవేంద్ర, స్వప్న, అన్నపూర్ణ అనితలపై కూడా ఉపా కేసు పెట్టడం జరిగింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చైతన్య మహిళా సంఘం, రాష్ట్ర అధ్యక్షురాలు అనిత, ప్రధాన కార్యదర్శి శిల్ప, కార్యదర్శులు దేవేంద్ర, స్వప్న, అన్నపూర్ణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రేణుకలపై తెలంగాణ ప్రభుత్వం ఉపా చట్టం పెట్టడం అమానుషం, అప్రజాస్వామికం. కార్యదర్శి స్వప్న ఇంటి యజమానులను పోలీసులు బెదిరించి ఇల్లు ఖాళీ చేయించారు. సంఘం కార్యకర్తల పైనే పోలీసుల అణచివేత ఇంత దారుణంగా ఉంటే ఇక సాధారణ మహిళల పరిస్థితి ఎంతగా ఉంటుందో ఊహించగలము.
ఈ విధంగా 9 మంది సిఎంఎస్ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం సిఎంఎస్ చరిత్రలో మున్నెన్నడూ జరుగలేదు. ఉద్యమాల ద్వారా సాధించుకున్న తెలంగాణలో, ఉద్యమ నాయకుడని చెప్పుకుంటున్న కేసీఆర్ నిర్బంధ పాలనకు నిదర్శనం. అక్టోబరు 5 నుండి ప్రారంభమైన ఆర్టీసీ సమ్మెకు మద్దతు తెలిపినందుకు వరంగల్ జిల్లాలో కార్యదర్శి రమ,జిల్లా ఉపాధ్యక్షురాలు కళ, మహబూబ్ నగర్లో జిల్లా కార్యదర్శి శ్రీదేవి, చైతన్య మహిళా సంఘం కార్యకర్తలపై కూడా పోలీసులు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి రోజంతా స్టేషనులో నిర్బంధించి సమ్మె వైపు రావద్దని బెదిరించారు. మహబూబ్ నగర్ కార్యకర్త మంగమ్మను CMSలో పనిచేయవద్దని బెదిరించారు. గద్వాల్ లో కూడా ఆర్టీసీ కార్మికులు, ప్రజాసంఘాలపై పోలీసులు కేసులు బనాయించారు. దానిలో సిఎంఎస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రేణుక పేరు పెట్టారు. మహిళా మార్గం ఎడిటర్ అయిన జ్యోతిని ఆర్టీసీ సమ్మె సందర్భంగా ఇంటికి వెళ్లి వేధించారు. ప్రజా సంఘాల నాయకులను అరెస్టు చేసినపుడు వారి కుటుంబ సభ్యులను ఇబ్బంది పెడుతున్నారు.
విరసం నేత అరెస్టు సందర్భంలో జగన్ సహచరి రజని (మహిళామార్గం సంపాదకవర్గం సభ్యురాలు) ని పోలీసులు తమకు సహకరించాలని లేకుంటే మీ మరిదిని కూడా అరెస్టు చేస్తామని తీవ్ర బెదిరింపులకు గురిచేశారు. టివివి మద్దిలేటి లేని సమయంలో సుమారు 50 మంది మగ పోలీసులు అక్రమంగా ఇంట్లోకి చొరబడి మద్దిలేటి సహచరి చంద్రకళ (హైదరాబాదు
జిల్లా CMS సభ్యురాలు) ను భయబ్రాంతులకు గురి చేసి 2 ఏండ్ల బిడ్డకు తిండి కూడా పెట్టనివ్వకుండా గదిలో నిర్భందించారు. పైగా CMSలో పని చేయవద్దని ఎన్ కౌంటర్ చేస్తామని బెదిరించారు. టిపిఎఫ్ నలమాస క్రిష్ణ సహచరి సంధ్య (మహిళామార్గం సంపాదకవర్గం సభ్యురాలు) ను కూడా ఆర్టీసీ సమ్మె సందర్భంగా ప్రివెంట్ అరెస్టు పేరుతో నారాయణగూడ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి ఒక రోజు మొత్తం స్టేషన్లో ఉంచి మానసికంగా వేధించారు. CMSలో పని చేయవద్దని బెదిరించారు.
ఆర్టీసీ ఉద్యమాన్ని అణచివేయడంలో భాగంగా ఉద్యమకారులపై అణచివేత తీవ్రతని పెంచారు. కండక్టర్ నీరజ ఆత్మహత్యను నిరసించిన మహిళా కండక్టర్లపై కూడా నాన్ బెయిలబుల్ అక్రమ కేసులను బనాయించారు. ఆర్టీసీ ఉద్యమంలో అరెస్టు కాని ఉద్యమ నాయకులు లేరు. యూరేనియం మైనింగ్ కు వ్యతిరేకంగా, సాగుభూముల కోసం, పోడు భూముల కోసం చేస్తున్న పోరాటాల్లో మహిళలు అనేక కేసులను ఎదుర్కొంటున్నారు. ఒక్కోసమూహంపై ఒక్కో రూపంలో అణచివేత అమలవుతూ అప్రకటిత ఎమర్జెన్సీ నేడు కొనసాగుతున్నది. ఉద్యమకారులపై నిర్భందం కేంద్ర రాష్ట్ర కనుసన్నల్లోనే జరుగుతున్నది. తెలంగాణాలో బిజెపి పాగా వేయడం అంతసులువు కాదు. ఉద్యమ నేపధ్యం, ప్రశ్నించే సమూహాలు, మేధావుల వల్ల ప్రమాదమని భావించి అడ్డు తొలగించుకొనే పరిస్థితులను సృష్టిస్తున్నది.
రెండు సంవత్సరాల క్రితం ఆంధ్ర ప్రభుత్వం కూడా సిఎంఎస్ రాష్ట్ర నాయకుల ఫోటోలతో పోస్టర్లు వేసి మావోయిస్టులతో సంబంధాలున్నాయని కాలేజి హాస్టళ్లు, కాలేజీల్లో ప్రచారం చేస్తూ సంఘం పని చేయకుండా అడ్డుకోవాలని చూసింది. ప్రభుత్వ దుష్ప్రచారానికి వ్యతిరేకంగా మహిళా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేపడితే 58 వివిధ సంఘాల సభ్యులపై కేసులను బనాయించింది. అంతటితో ఆగక అందాల పోటీలకు వ్యతిరేకంగా నిరసించిన మహిళా సంఘాలందరిపై మళ్లీ అక్రమ కేసులు పెట్టి కోర్టుల చుట్టూ తిప్పుతున్నది. చైతన్య మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు సిపోరా ఆమె పిల్లలు ఇందు, మంజు (సిఎంఎస్ కార్యకర్తలు) లను గుంటూరు పోలీసులు స్టేషనుకు తీసుకువెళ్లి ఒకరోజు మొత్తం కౌన్సిలింగ్ పేరుతో మానసిక వేదనకు గురిచేశారు. ఇప్పటికీ కూడా కుటుంబాన్ని వేదిస్తూనే ఉన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలినిలు సంధ్యను 72 గంటలు టార్గెట్ అంటూ పరోక్షంగా చంపేస్తామని బెదిరించి మానసికంగా వేధించారు.
సంవత్సరం క్రితం చైతన్య మహిళా సంఘం సహాయ కార్యదర్శి అన్నపూర్ణ, సభ్యురాలు అనూష, భవాని (ఎబిఎంఎస్) లను ఇంటి నుంచి బలవంతంగా అరెస్టు చేసి ఉపా కేసు బనాయించారు. కుటుంబ సభ్యులను ఇబ్బంది పెట్టారు. వారితో పాటు సహాయకార్యదర్శులు రాజేశ్వరి, దేవేంద్ర, స్వప్న, సభ్యురాలు ప్రసన్నలపై కూడా ఉపా కేసు నమోదు చేశారు. అతి కష్టం
మీద అన్నపూర్ణ, అనూషలకు బెయిల్ లభించినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వారిపై కండిషన్స్ పెడుతూ వారిని వేధించడం జరుగుతుంది.
ప్రజాస్వామ్య దేశంలో సంఘం పెట్టుకునే హక్కు ఉన్నది. పాలకులు మహిళల సమస్యలను పట్టించుకోనప్పుడు, హింస మరింత పెరుగుతున్నప్పుడు మహిళా సంఘాలు పుట్టుకొస్తాయి. నిర్దిష్టమైన లక్ష్యాలతో మహిళల సమస్యలకు మూలాలపై వారిని చైతన్యపరిచే స్వతంత్రత రాజ్యాంగం కల్పించింది. పాలకులను ప్రశ్నించే హక్కు రాజ్యాంగం ఇచ్చింది. ఇటీవల పెరుగుతున్న అత్యాచారాలకు మూలాలైన మద్యం, అసభ్య దృశ్యాల వ్యాపారాలపై కాలేజీల్లో, బస్తీల్లో CMS విస్తృతంగా ప్రచారం చేస్తున్నది. మరోవైపు ఆర్టీసీ సమ్మె కేసిఆరుకు దడ పుట్టిస్తున్నది. ముఖ్యంగా మహిళా కండక్టర్ల పోరాటం కేసీఆర్ మెడలు వంచుతున్నది. కేసిఆర్ ప్రభుత్వ పునాదులను మహిళా కండక్టర్లు కదిలిస్తున్నారు. కాబట్టి చైతన్య మహిళా సంఘంపై అణచివేత మహిళా కండక్టర్లను ఏకాకులను చేయడానికి మొత్తం మహిళా ఉద్యమకారులకు కేసిఆర్ ప్రభుత్వం హెచ్చరింపు సంకేతాన్నిస్తున్నది.
ఉపా చట్టం పాశవికమైనది, అది పోలీసు వ్యవస్థకు పూర్తి అధికారాలను అందించి, బెయిలు అవకాశాలను తగ్గించే విధంగా రూపొందించబడింది, ఉగ్రవాదులని ముద్రవేసి, వారికి డబ్బులు అందజేయడం, సాహిత్యం, సిద్ధాంతాలు కలిగి ఉండడం, ప్రచారం చేయడం కూడా నేరమే అని ఇటీవల కేంద్రం ఉపా చట్టంను సవరించింది. ఇది దేశంలో అత్యంత భయంకరమైన చట్టం అని, కనీస ప్రాథమిక హక్కులను హరించే ఉపా వల్ల భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందనడానికి ఒక సూచిక అని మేధావి వర్గం చెబుతున్నది. అటువంటి ఉపా చట్టాన్ని 23 సంఘాల కార్యకర్తలైన 45 మందిపై పెట్టి కేసీఆర్ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలకు పూనుకుంటున్నది.
ఇప్పటికే సూరేపల్లి సుజాత, పివోడబ్లూ సంధ్య, దేవి, ప్రొ॥ వినోదినిలపై హిందూ ఫాసిస్టు దాడులు జరిగాయి. అరుణోదయ ఆఫీస్ పై దాడి చేసి తాళం వేయడంతో పాటు విమలక్కపై దుష్ప్రచారం చేశారు. హిందూ ఫాసిస్టు వ్యతిరేక వేదిక కన్వీనర్ అనూరాధని ఆమె సహచరుడు రవిశర్మని (సభ్యుడు) అరెస్టు చేసి ఉపాతో పాటు అనేక కేసులు బనాయించి జైల్లో పెట్టారు .
ఈ పరిస్థితుల్లో సగభాగంగా ఉన్న మహిళల్లో అత్యంత దారుణంగా అణచివేయ బడుతున్న, హింసించబడుతున్న, పేద, దళిత, బహుజన, మైనార్టీ మహిళల హక్కుల కోసం నిలిచిన చైతన్య మహిళా సంఘం రాష్ట్ర నాయకులైన 9 మందిపై ఉపా చట్టం క్రింద పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలని డిమాండు చేస్తున్నాం. ఉపా చట్టాన్ని రద్దుచేయాలని ఉద్యమిద్దాం.
డిమాండ్:
1) చైతన్య మహిళా సంఘం రాష్ట్ర నాయకులపై పెట్టిన అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలి.
2) అనూష బెయిల్ విషయంలో పెడుతున్న షరతులను వెనక్కు తీసుకోవాలి.
3) మహిళా ఆక్టివిస్టులపై హిందూ ఫాసిస్టు దాడులు నిలిపి వేయాలి.
4) అక్రమంగా అరెస్టు చేసిన వారిని బేషరతుగా విడుదల చేయాలి.
5) ప్రజాసంఘాలపై, ప్రజలపై అమలవుతున్న నిర్బంధం నిలిపి వేయాలి.
6) ఉపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి.
- చైతన్య మహిళా సంఘం (CMS) |
Keywords : CMS, telangana, andhrapradesh, narendramodi, kcr, ys jagan, women, RTC
(2024-03-17 11:01:27)
No. of visitors : 1916
Suggested Posts
| ʹసావిత్రి బాయి పుట్టినరోజునే టీచర్స్ డే గా ప్రకటించాలిʹ1831 జనవరి 3 న పూణే సతారా ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాయిగావ్ లో సావిత్రి బాయి జన్మించింది. |