50 ఏళ్ళ ధిక్కారస్వరం...ఈ నెల11,12 తేదీల్లో విరసం రాష్ట్ర మహాసభలు
50 ఏండ్ల విప్లవరచయితల సంఘం ఈ నెల 11, 12 తేదీల్లో హైదరాబాద్ లోని సుందరయ్య విఙాన కేంద్రంలో తన 27 వ మహాసభలు జరుపుకుంటున్న సందర్భంగా వేసిన కరపత్రం పూర్తి పాఠం
బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం దేశాన్ని చుట్టేస్తోంది. అల్లకల్లోలం చేస్తోంది. గాలి పారాడకుండా చీకటి కొట్టులా మార్చస్తోంది. కశ్మీర్ ను బందిఖానాలోకి తోసేసింది. బాబ్రీ మసీదు రామ జన్మభూమి వివాదంలో అత్యున్నత న్యాయస్థానం హిందుత్వ తీర్పును ప్రకటించింది. రాజ్యంగ వ్యతిరేకంగా పౌరసత్వ సవరణ బిల్లును మూక బలంతో తీసుకొచ్చింది. చీకటి న్యాయానికి ఉరితాళ్లను పేనుతోంది. అన్ని సమస్యలకు, పోరాటాలకు, ధిక్కారాలకు హింసాత్మక సమాధానాలు చూపిస్తోంది. మూకుమ్మడి ఎన్కౌంటర్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జేజేలు పలుకు తున్నాయి. నాలుగు వైపుల నుంచి ఫాసిజం చుట్టుముడుతున్న వేళ విరసం యాభై ఏళ్ల సభలు జరుగుతున్నాయి. ఉత్పత్తి కులాలు, ముస్లింలు, ఆదివాసులు, మహిళలు నెత్తురోడుతున్న సందర్భం ఇది. పశ్చిమ కనుమల నుంచి దండకారణ్యం, ఆంద్రా ఒడిషా సరిహద్దు ప్రాంతాల దాకా లక్షల సైన్యం విప్లవోద్యమ నిర్మూలనకు తలపడుతున్న యుద్ధ సన్నివేశంలో ఈ సభలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఎక్కడ చూసినా కన్నీళ్లు ధ్వంసమైపోతున్న మానవ దేహాలు, కలుషితమవుతున్న సాంస్కృతిక విలువలతో చీకటి అవరిస్తున్న సన్నివేశంలో ఈ సభలకు తెలుగు సాహిత్యలోకం సిద్ధమవుతోంది. సారాంశంలో మావోయిస్టు రహిత, ముస్లిం రహిత అఖండ భారత్ కోసం బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజం బరితెగించిన సంక్షోభ సందర్భంలో విరసం తన యాభై వసంతాల మహాసభలు జరుపుకోబోతోంది.
అందుకే ఇది వసంతాలు పూచే కాలమా? కవులు గొంతెత్తి స్వేచ్ఛాగానం చేసే దేశమా? విరసం చరిత్రలో కూడా యాభై వసంతాలతో పాటు యాబై శిశిరాలు కూడా ఉన్నాయి. ప్రతి వసంతమూ మానవులు పరిమళించే తీరం వైపు సాగిపోయింది. ప్రతి సంక్షోభమూ రేపటి మీద పైచేయి కోసం సాగినదే. శిశిర వసంతాల కలనేతలోంచే మానవ జాతి సుందర భవితవ్యం కోసం విరసం తన కాల్పనిక శక్తినంతా ధారపోస్తున్నది. విరసం ఏర్పడ్డాక ఆర్నెల్లకల్లా విప్లవ రచయితల అరెస్టులు, పుస్తక నిషేధాలు మొదలయ్యాయి. ఇప్పటి దాకా మూడు తరాల విరసంలో కనీసం ఒక్క అక్రమ కేసైనా మోయని, ఒక్కసారైనా ఖైదు కాని సభ్యులు లేకపోవచ్చు. రచన కోసం, విశ్వాసం కోసం చిత్రహింసలు అనుభవించిన సభ్యులు ఎందరో. ఏండ్ల తరబడి జైలు జీవితం గడిపిన వారెందరో. ఈ యాభై ఏళ్ల సందర్భంలో కూడా వ్యవస్థాపక సభ్యుడు పరపరరావు, సీనియర్ సభ్యుడు జిఎస్ సాయిబాబా, కార్యవర్గ సభ్యుడు జగన్ దీర్ఘకాలంగా జైల్లో ఉంటున్నారు. కార్యవర్గ సభ్యుడు కాశీం మీద ఏడు కుట్ర కేసులు ఉన్నాయి. ఎందరో విరసం సభ్యుల మీద అలాంటి కేసులు ఉన్నాయి. ప్రతి సృజన స్వరం మీద కత్తి వేలాడుతూనే ఉన్నది. అయినా ధిక్కారమే తన నైజమని విరసం చాటి చెప్తోంది. రచన కోసం, ఆలోచన కోసం, అంతిమంగా ఈ దేశ ప్రజల విముక్తి కోసం ఎడతెగని రాపిడిని యాభై ఏళ్లుగా అనుభవిస్తున్నది. విరసంలోని ఈ శక్తి అంతా అట్టడుగు ప్రజల వర్గపోరాటాలలో ఉన్నది. సాంఘిక స్వేచ్ఛా ఉద్యమాలలో ఉన్నది. అందుకే తరతరాల ఈ నేల బిడ్డల ధిక్కారానికి తనను తాను వారసురాలిగా విరసం మొదట్లోనే ప్రకటించుకున్నది. నిర్బంధాలు, అణచివేతలు, ఆటుపోట్ల మధ్య విస్తారమైన అనుభవాలను గడించింది. భారతీయ సాహిత్య చరిత్రలో ఇలాంటి రచయితల సంఘంగా తానే ఒక ఈ ఉదహరణగా నిలబడింది. అక్షరం కోసం అణచివేతను ఎదుర్కొంటున్నది.
ఇవాళ దేశవ్యాప్తంగా ప్రగతిశీల బుద్ధిజీవులు, రచయితలు ఇలాంటి హింసను అనుభవిస్తున్నారు. ఎందరో ఆలోచనాపరులను ఫాసిజం బలి తీసుకున్నది. దేశవ్యాప్తంగా అపూర్వమైన మేధావులను ఫాసిస్టు రాజ్యం ఖైదు చేస్తున్నది. వాళ్ల కంఠస్వరానికి, కలం పదునుకు భయపడిపోతున్నది. ఇక అసంఖ్యాక ఆదివాసులు, ముస్లింలు, దళితులు వేల సంఖ్యలో జైళ్ళలో ఉన్నారు. ʹప్రశాంతʹ పాలన కోసం ఫాసిజం మరిన్ని అప్రజాస్వామిక చట్టాలను తీసుకొస్తోంది. బ్రాహ్మణీయ పార్లమెంటరీ విధానం ద్వారానే ఫాసిజం పెచ్చరిల్లుతున్నది.
సమాజాన్ని భయానికీ, అభద్రతకు, నిరాశకు లోను చేయడమే ఫాసిజం లక్షణం. ఇక మనమేమీ చేయలేమనే నిస్సహాయతను పోరాట శక్తుల పై పులమడమే ఫాసిజం. సమాజమంతా మౌనంలోకి జారిపోవడమే ఫాసిజానికి కావాలి. ఇది ఇవ్వాల్టి కవి సమయం. హృదయాన్ని సాచి మానవ ప్రేమను ప్రకటించదల్చుకున్నావా? జైలుపాలు కావాల్సి వస్తుందని ఫాసిజం హెచ్చరిస్తున్న సాహిత్య సందర్భం. ఈ విపత్కర పరిస్థితిలో కూడా విరసం తన అచంచలమైన నిర్భయ ప్రకటన చేయడానికి ఈ సభలు నిర్వహిస్తోంది. ఫాసిజం ఓడిపోతుందని, ప్రజులు జయిస్తారని, భవిష్యత్తు కార్మికవర్గానిదేనని చెప్పడానికి ఈ సభలు జరుపుతోంది. చరిత్రలో ఫాసిజం ముసిరిన వేళ సాహసోపేతంగా జీవించి, మరణించిన రచయితలు, కళాకారులు తనకు ఆదర్శం. రాజ్యం నిరంకుశంగా మారినా, సామాజిక హింస పెచ్చరిల్లినా, ప్రగతిశీల మార్పులు సంక్షోభంలో పడినా విప్లవ రచయితలకు కల చెదిరిపోదు. గుండె చెమ్మగిల్లవచ్చుగాని విషాదాన్ని అలింగనం చేసుకోరు. నిస్పృహ గీతాలను ఆలపించరు. ఇది మొండి ధైర్యం కాదు. చారిత్రక పరిణామాల మీద తార్కిక అంచనా, ఈ కల్లోలాన్ని రద్దు చేసే శాస్త్రీయ ఆచరణకు సిద్ధం కాగలమనే విమర్శనాత్మక వైఖరి
చరిత్ర పొడవునా ఎన్నో భావజాల యుద్ధాలు జరిగాయి. ఇప్పుడది తీవ్రస్థాయికి చేరుకుంది. రాజ్యమే మత భావజాలానికి అధికార ప్రతినిధి అయింది. పైకి ఇది ఎట్లా కనిపించినా దేశంలోని ఆర్థిక సంక్షోభమే ఈ ఫాసిజానికి మూలం. ఆస్తి సంబంధాల సంఘర్షణలో దోపిడీ వర్గ ప్రయోజనాల కోసం ఇదంతా. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పరిణామాల్లో భాగంగా మన దేశంలో ఫాసిజం వచ్చింది. ఇది యావత్ సమాజాన్నే భౌతిక, భావజాల యుద్ధాల మధ్యలోకి తీసుకెళ్లింది. విరసం నక్సల్బరీ శిశువుగా ఈ పరిణామాలను మొదటి నుంచి అర్ధం చేసుకొని విశ్లేషిస్తోంది. మతాన్ని మతవర్గ తత్వంగా చూడాలని, మన దేశంలో ఫాసిజాన్ని బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజంగా చూడాలని చాలా కాలం కిందే సూత్రీకరించింది. సనాతన సంప్రదాయాన్ని, పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని రివిజనిజాన్ని తిరస్కరిస్తూ ముందుకు వచ్చిన నక్సల్బరి పంథాను సామాజిక పీడనలన్నిటికీ, ఫాసిస్టు అణిచివేత రూపాలన్నిటికీ వ్యతిరేకంగా సాహిత్య సాంస్కృతిక మేధో రంగాల్లోకి తీర్చిదిద్దుతోంది. ఈ క్రమంలో శ్రామిక ప్రజల సాయుధ పోరాటానికి సృజనాత్మక వ్యక్తీకరణ అయింది. అట్టడుగు కులాల, శ్రామికుల నిర్దిష్ట జీవితాన్ని సాహిత్య ఇతివృత్తం చేసింది. ప్రజల పలుకుబళ్లను, మాండలికాలను సమున్నతంగా ఎత్తి పట్టింది. జానపద, మౌఖిక కళారూపాలను, దేశీయ సంప్రదాయాలకు ఎనలేని ప్రాధాన్యతను తీసుకవచ్చింది. సాహిత్య విమర్శను తత్వశాస్త్రం, చారిత్రక భౌతికవాదం, రాజకీయార్థిక శాస్త్రం, చరిత్ర తదితర సామాజిక శాస్త్రాల పునాది మీద శక్తివంతం చేసింది. విప్లవానికి ఉండే బహుముఖీన కాళాత్మకతనంతా తన రచన, ఆలోచన, ఆచరణల ద్వారా ప్రపంచానికి చాటి చెప్తున్నది.
తన లక్ష్య ప్రకటనకు, దృక్పథానికి కట్టుబడి ఐదు దశాబ్దాల తెలుగు సమాజ చరిత్రలో విరసం భాగమైంది. విప్లవ సాహిత్య సంస్థగా ఇదొక అరుదైన సందర్భం. అన్ని రకాల ప్రజా పోరాటాలను, ధిక్కారాలను తనలో సంలీనం చేసుకొని సమకాలీన ప్రజా ఆకాంక్షలకు సృజనాత్మక వేదికగా నిలబడింది. నూతన ఆలోచనలకు అవసరమైన ప్రజాస్వామిక భూమికను ఏర్పరిచింది. దీని వల్ల తెలుగు సాహిత్యంలో అనేక ధిక్కార స్వరాలు వెల్లువెత్తడానికి విరసం కూడా కారణమైంది. తరతరాల సాంఘిక విముక్తి ఆకాంక్షలు, ఉద్యమాలు వర్గపోరాట ప్రేరణ వల్ల బలోపేతం అయ్యాయి. వ్యవస్థ మార్పుతో పాటు పితృస్వామ్యం, అంటరానితనం, కుల వ్యవస్థ నిర్మూలన చైతన్యాలు తెలుగు సాహిత్య రంగాన్ని ప్రజాస్వామికీకరించాయి. ఆధిపత్య శక్తులకు, భావజాలానికి వ్యతిరేకంగా సమానత్వం ఒక ప్రధాన విలువగా స్థిరపడింది. వర్గపోరాటం కళా సాహిత్యాలతో పాటు ఉపరితల జీవన రంగాలన్నిటినీ కుదిపివేస్తుందనడానికి తానే ఒక సజీవ చారిత్రక సాక్ష్యం.
ఈ విజయాలన్నీ విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమం ఒక్కటే సాధించలేదు. ధిక్కారం, రాజ్య వ్యతిరేకత గీటురాయిగా గల సోదర సాహిత్య కళా సంస్థలు, అద్భుతమైన సృజనకారుల అండదండలతోనే ఇవన్నీ చేయగలిగింది. ఉమ్మడి కృషి వల్లనే ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. అన్ని సంక్షోభాల్లో అండగా నిలిచే మూడు తరాల మిత్రులు విరసానికి అసంఖ్యాకంగా ఉన్నారు. స్నేహపూర్వక విమర్శలతో కొత్త వెలుగును అందించిన సన్నిహితులు ఎందరో ఉన్నారు. తమ రక్తతర్పణతో వర్గపోరాటాలను పదునెక్కిస్తున్న ప్రజలు అందించే ఉత్తేజం లేకుండా, దిశా నిర్దేశం లేకుండా విరసం ఏ పనీ చేయగలిగేది కాదు. ఆ ప్రజలతో నడుస్తూ కలిసి రచించడమే విరసం బలం.
యాభై ఏళ్ల పోరాటంలోని సంక్షోభాలను, సవాళ్లను, చీకటి వెలుగులను, విజయ దరహాసాలను, కన్నీటి చారికలను, చీకటి జైలు అనుభవాలను విరసం ఈ యాభై ఏళ్ల సందర్భంలో తరచి చూసుకుంటోంది. సమీక్షించుకుంటోంది. మార్క్సిజంలోని విమర్శనాత్మకతే విరసం చైతన్యం. చరిత్రపట్ల అంతులేని తార్కిక విశ్వాసంతో పాటు వినయం, వినడం, నేర్చుకోవడం, తనలోకి తాను తొంగి చూసుకోవడం, పునఃసంఘటితం కావడం విరసం జీవధాతువు. దీని వల్లే చారిత్రక శక్తుల సంఘర్షణలోంచి పుట్టిన విరసం తానే సాహిత్యరంగంలో చరిత్ర కాగలిగింది. బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా వర్గపోరాట శక్తులు, వీడిత అస్తిత్వ పోరాట శక్తుల ఐక్యత దిశగా ఈ సభలు నిర్వహిస్తున్నాం, అందరూ రండి. విజయవంతం చేయండి.
- విప్లవ రచయితల సంఘం
Keywords : virasam, conference, hyderabad,
(2024-04-24 17:21:35)
No. of visitors : 1331
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |