అమిత్ షాకు బహిరంగ లేఖ !
(రచయిత సాహిత్య విమర్శకులు, సాంస్కృతిక కార్యకర్త, పీపుల్స్ లింగ్విస్టిక్ సర్వే ఆఫ్ ఇండియా అధ్యక్షులు గణేష్ డెవీ రాసిన ఈ లేఖ వీక్షణం సంపాదకులు ఎన్.వేణుగోపాల్ తెలుగులోకి అనువదించగా వీక్షణం జనవరి 2020 సంచికలో ప్రచురించబడినది)
ʹʹసిటిజెన్ షిప్ అమెండ్ మెంట్ ఆక్ట్ 2019 గురించి ఏ ఒక్క భారతీయ పౌరుడూ భయపడనక్కరలేదుʹʹ అని ఎంత బాగా అన్నారు, అమిత్ భాయ్! ఆఫ్ఘనిస్తాన, పాకిస్తాన్, బంగ్లాదేశ్ లలో తాము ఎదుర్కొన్న మతపరమైన వివక్ష వల్ల చట్టవ్యతిరేక చొరబాటుదారులుగా భారతదేశంలో ప్రవేశించిన హిందూ, జైన, బౌద్ధ, సిక్కు, పార్సీ, క్రైస్తవ సోదర సోదరీమణులు సంతోషంతో నిట్టూర్పు విడవడానికి ఒక కారణం దొరికింది. వేదనకు గురవుతున్న మానవుల పట్ల అంత దయ చూపినందుకు, మీలో అంత లోతైన కరుణాహృదయం ఉన్నందుకు కృతజ్ఞతలు. వివక్షకు గురవుతున్న బాధితుల వేదనను రూపుమాపడానికి మీరు చూపిన ఈ అపార కరుణకు వారూ, భారతీయులందరమూ మీకు కృతజ్ఞులమై ఉంటాము. కాని, మరికొందరు కూడ అటువంటి వాళ్లున్నారు. బంగ్లాదేశ్ లో మ్రో అనే గిరిజన తెగ సమూహం ఉంది. వారికి వారి సొంత దేవతలున్నారు. వారు మందిరాలకు వెళ్లరు, మసీదులకూ వెళ్లరు. చర్చిలకో, గురుద్వారాలకో, డేరాసారి లకో, సినగాగ్ లకో వెళ్లరు. వారు కేవలం ప్రకృతిని ఆరాధిస్తారు. దైవత్వం గురించి వారికి ఉన్న భావన గురించి తెలియని ఆంత్రొపాలజిస్టులు, జనగణన అధికారులు వారిని ʹసర్వాత్మవాదులుʹ అనే వర్గంలో చేర్చారు. నిజానికి ఇటువంటి సమూహాలలో మ్రో సమూహం ఒక్కటి మాత్రమే కాదు, మరెన్నో ఉన్నాయి. మీటీ, త్రిపుర, మర్మా, తంచంగ్యా, బరువా, ఖాసీ, సంథాల్, చక్మా, గారో, ఒరావున్, ముండా, త్రిప్పెరా వంటి సమూహాలెన్నో. ఈ పదకొండు గిరిజన తెగలకు చెందినవారిలో అత్యధికులు చిటగాంగ్ కొండ చరియల్లో జీవిస్తారు. వీరందరినీ బంగ్లాదేశ్ ప్రభుత్వం ʹమైనారిటీలుʹ అని వర్గీకరించింది.
ఈ గిరిజన తెగలవారందరూ కూడ సుదీర్ఘకాలంగా ఒక ఇస్లామిక్ రిపబ్లిక్ పౌరులుగానే ఉన్నారు. వారు కూడ మీలాగనే మతపరమైన వివక్ష పట్ల భయంతో జీవిస్తున్నారు. మరి, అమిత్ భాయ్, మీ కరుణాదృక్కులు వారి మీద ప్రసరించడంలో విఫలమయ్యాయేం? వారు గిరిజనులు గనుకనా? లేక తమను తాము హిందువులుగా చెప్పుకోని గిరిజనులంటే ఆర్ ఎస్ ఎస్ కు సహజంగా ఉండే కోపం వల్లనా?బంగ్లాదేశ్ అధికారిక గణాంకాల ప్రకారం ఈ గిరిజన తెగలకు చెందిన దాదాపు తొమ్మిది లక్షల మంది ఆ ప్రాంతంలో నివసిస్తున్నారు. ఇవే తెగలకు చెందిన దాదాపు అంతే మంది మిజోరాంలో, మేఘాలయలో, త్రిపురలో, అస్సాంలో నివసిస్తున్నారు, పనిచేస్తున్నారు. వారిని మీరేం చేయబోతున్నారు?
పాకిస్తాన్ లో మతపరమైన వివక్షకు గురవుతున్న షియాలు, అహ్మదియాలు వంటి ʹఇతరʹ ఇస్లామిక్ శాఖల గురించి మీకు అవగాహన కల్పించడానికి ఇప్పటికే చాల మంది ప్రయత్నించారు. నిజం చెప్పాలంటే, అసలు ఇస్లాం అనే మాట వింటేనే మీకు ఒంటిమీద తేళ్లూ జెర్లూ పాకుతాయని మాకు తెలుసు. మరి మీరు కోరుకుంటున్నట్టుగా జాతీయ పౌరుల పట్టిక నమోదు జరుగుతున్నప్పుడు, అల్లా కటాక్షాన్నే కోరుకునే సూఫీలనూ, మాదరిలనూ, దర్వేష్ లనూ, బౌల్ లనూ మీరు ఏం చేయదలచుకున్నారు? వారికి నిర్దిష్టమైన స్వస్థలాలు లేవు, గుర్తింపు పత్రాలు లేవు. వారి పూర్వీకుల గురించీ, స్వస్థలాల గురించీ రుజువు చేసుకునే చిహ్నాలేమీ లేవు. మీరు ఉత్సాహంగా నిర్మించిన నిర్బంధ శిబిరాల్లో బంధించబోయే తొలి ఖైదీలు వాళ్లేనా?
మీ ప్రతిపాదనకు లోకసభలో 311 మంది, రాజ్యసభలో 125 మంది ʹఔనుʹ మీట నొక్కేలా చూసుకున్నందుకు అభినందనలు. కాని మీకైనా, ఆ మీట నొక్కినవారికైనా ఏం చేస్తున్నారో అర్థమయిందా? భారీ సంఖ్యలో ప్రజానీకపు హక్కులను తుడిచివేశారనీ, వారి ఆర్తనాదాలు మీ చెవికి ఎన్నడూ వినబడబోవనీ మీకు తెలిసిందా? అలా హక్కులు కోల్పోయిన వారిలో అందరికంటె మొట్టమొదట చెప్పవలసిన వారు పదమూడు కోట్ల డినోటిఫైడ్, నొమాడిక్ (విముక్త, సంచార) జాతుల ప్రజలు. వారు రెండు వందల కన్న ఎక్కువ తెగలలో, సముదాయాలలో దేశమంతా వ్యాపించి ఉన్నారు. వారిని వలసపాలనా సమయంలో తప్పుడు పద్ధతిలో నేరస్త జాతులుగా వర్గీకరించి 1871లో నేరస్త తెగల చట్టం తీసుకువచ్చారు. వారి మీది నుంచి ఆ మచ్చ తొలగించి ʹʹవిముక్తʹʹ జాతులుగా పిలవాలనే ప్రయత్నాన్ని 1952లో జవహర్ లాల్ నెహ్రూ ప్రారంభించాడు. వారు ʹʹపౌరులు కారుʹʹ గనుక 1951 జనగణన కసరత్తులో వారి పేర్లు సహజంగానే నమోదు కాలేదు. ఆ జనగణన ఆధారంగానే మొట్టమొదటి జాతీయ పౌరుల పట్టిక తయారైనప్పుడు వారి పేర్లు అందులోకి ఎక్కలేదు. వారిలో అతి తక్కువ అంత దురదృష్టవంతులు కాని తెగలు మినహా మిగిలినవారందరూ షెడ్యూల్డ్ తెగల జాబితాలోకీ ఎక్కలేదు, షెడ్యూల్డ్ కులాల జాబితాలోకీ ఎక్కలేదు.
జవహర్ లాల్ నెహ్రూ అప్పటి పాకిస్తాన్ ప్రధాని లియాఖత్ అలీ ఖాన్ తో ఒక ఒప్పందం మీద సంతకం చేసి ఉండనట్టయితే ఇప్పుడు ఆ దేశాల నుంచి వివక్షకు గురవుతున్న హిందువులను భారత పౌరులుగా గుర్తించే వ్యవహారంలోకి దిగవలసిన అవసరమే మీకు వచ్చేది కాదని వాదిస్తున్నారు గదూ, అమిత్ భాయ్, అబ్బ మీరు మాట్లాడేది ఎంత వాస్తవం. నెహ్రూ చేసిన పనులను తిరగదోడాలన్న మీ దృఢ దీక్ష నిజంగా ప్రశంసనీయం. మరి, విదేశాల సంగతి పక్కన పెట్టండి, భారత దేశంలోని విముక్త జాతుల సంగతి ఏమిటి? వారు ఇంకా మన నగరాల, పట్టణాల కూడళ్లలో గాలి బుడగలు అమ్ముకుంటూ తిరుగుతున్నారు. వారికి ఏ గుర్తింపు పత్రాలూ లేవు, ఆధార్ కార్డు లేదు, గ్యాస్ కనెక్షన్ లేదు. కరెంటు బిల్లు లేదు. పాస్ పోర్ట్ అయితే కచ్చితంగా ఉండి ఉండదు. వారు అప్పటికే ఉండిన నిర్బంధ శిబిరాలను 1952లో తెరిపించి, నెహ్రూ వారిని విడుదల చేశాడు. మరి నెహ్రూ చేసినవన్నీ తిరగదోడాలి గదా, మీరు వారిని మళ్లీ నిర్బంధంలోకి తీసుకుని నిర్బంధ శిబిరాల్లోకి తోయనున్నారా? ఎలాగా వారు 1871 నుంచి 1952 దాకా అక్కడే బందీలుగా బతుకునీడ్చారు.
నెహ్రూ పేరు వినగానే మీరు ముఖం చిట్లిస్తారని నాకు తెలుసు. ఔను, నెహ్రూనే, ఆ నెహ్రూనే మన సమస్యలనిటినీ ప్రారంభించినవాడు. అది కశ్మీర్ గాని, లౌకికవాదం గాని, నిర్బంధ శిబిరాల్లో ఉన్న తెగలను విముక్తం చేయడం గాని సమస్యలన్నీ సృషించినది ఆయనే. మన దరిద్రాలన్నిటికీ ఆ నెహ్రూ, రాజీవ్, కాంగ్రెస్ లే కారణమని నరేంద్ర భాయ్ ఆరు సంవత్సరాలుగా మనకు చెపుతూనే ఉన్నారు. మీరు, నరేంద్ర భాయీ, ఆర్ ఎస్ ఎస్ లో మీ పూర్వీకులూ కూడ లౌకికవాదం పట్ల భారతదేశపు అవగాహన ఎంత లోపభూయిష్టమైనదో చెపుతూనే ఉన్నారు. భారత్ లో ఉన్న ప్రతి ఒక్కరూ హిందువేనని, వారు తమ మతం ఏమని చెప్పుకున్నప్పటికీ, తమను తాము ఏమని పిలుచుకున్నప్పటికీ వారందరినీ హిందువులుగానే చూడాలనీ మావంటి కుహనా లౌకికవాదులలో చాలమందిమి అర్థం చేసుకోకపోవడం నిజంగా శోచనీయం. ఒక భిన్నమైన వ్యక్తిని కొట్టి చంపినప్పుడల్లా, బుద్ధుడు, బసవన్న, కబీర్, మీరా, నానక్, గాంధీ వంటి పేర్లు చెపుతూ మన దేశపు సంకీర్ణ, బహుళత్వపు సంస్కృతి గురించి, ఇతర చరిత్ర భావనల గురించి మాట్లాడే మమ్మల్ని మీ దేశభక్తులు ఎంతగా దుర్భాషలాడుతున్నారో మీకు తెలిసే ఉంటుంది. గోమాతకు ప్రమాదం ఏర్పడినప్పుడు ఇటువంటివి తప్పవు.
కశ్మీర్ ను ఎన్నో నెలలుగా ʹʹమూసిపెట్టడంʹʹ లోనూ, అనవసరమైన ప్రశ్నలు వేసేవారిని అనుమతించక పోవడంలోనూ, కశ్మీర్ ఎంత ప్రశాంతంగా ఉన్నదో చూసి మెచ్చుకోవడానికి సహచర యూరోపియన్ల ప్రతినిధివర్గాన్ని మాత్రమే ఆహ్వానించడంలోనూ మీరు చేస్తున్న కృషి ఎంత ప్రశంసనీయం! అలాగే జామియా మిలియా ఆవరణలో కాల్పుల తర్వాత సమస్యా కారకులను శిక్షిస్తామని ప్రకటించినందుకూ, పౌరసత్వ చట్టానికి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చెలరేగిన తర్వాత సగం దేశంలో సెక్షన్ 144 విధించినందుకూ అబినందనలు. భారతదేశం అనే మీ అవగాహనతో మీరు గుజరాత్ అల్లర్లను ఎలా ʹʹఅదుపు చేశారోʹʹ, అల్లర్లకు సంబంధించిన కేసులతో ఎలా వ్యవహరించారో మేం ఇంకా గుర్తు చేసుకుంటూనే ఉన్నాం.
కాని, అమిత్ భాయ్, నిరసన ప్రదర్శనలను భారత దేశం మొత్తం తమ టెలివిజన్ తెరల మీద చూస్తున్నప్పుడు, లేదా వాటిలో పాల్గొంటున్నప్పుడు, వ్యక్తమైన అసంతృప్తి వెల్లువ ఈసారి కాస్త భిన్నంగా ఉంది. ఈసారి దృశ్యంలో కనబడుతున్నవారు మీరు మామూలుగా దృష్టి మళ్లించడానికి చెప్పే ʹʹటుక్డే టుక్డే గ్యాంగ్ʹ లా అనిపించడం లేదు. ఈసారి నిరసనకారుల్లో ఎక్కువమంది విద్యార్థులూ, యువజనులూ మాత్రమే గాని, ఏ రాజకీయ బృందానికీ చెందినవాళ్లలా కనిపించడం లేదు. వీళ్లు ఈసారి ʹʹమనుషులందరూ మొట్టమొదట మనుషులుʹʹ అనే విచిత్రమైన మాటలు మాట్లాడుతున్నారు. వీళ్లు తమను తాము భారత పౌరులమని చెప్పుకుంటున్నారు. కాకపోతే మీరు చెపుతున్నలాంటి పౌరులు కాదు. వీళ్లు తమ అవగాహనలోని భారత భావన వర్ధిల్లాలంటున్నారు. అమిత్ భాయ్, ఎక్కడో ఏదో పొరపాటు జరిగినట్టు లేదూ?! మీకు మీ మీద ఎప్పుడూ సందేహాలు రావనుకోండి. కాని ప్రతి ఒక్కరికీ తమ పనులను గురించీ ఆలోచనల గురించీ పునరాలోచించుకోవలసిన సమయం ఒకటి వస్తుందని మీకు తెలియదా? పౌరసత్వమనేది మతానికీ, భాషకూ, లింగానికీ అతీతంగా ఉండాలని ఇవాళ దేశంలోని పౌరులందరూ లేచి నిలబడి ప్రశ్నిస్తున్నప్పుడు, అందులో మీకేదో సందేశం ఉన్నదని అనిపించడం లేదా? సిటిజన్ అమిత్ భాయ్, ఒక్కసారి ఆలోచించండి.
గణేష్ డెవీ
(https://www.freepressjournal.in/analysis/an-openletter-to-citizen-shah-ganesh-devy)
Keywords : caa, cab, nrc, npr, amit shah, narendra modi
(2024-04-11 19:03:16)
No. of visitors : 767
Suggested Posts
| నేను ముస్లింను కాను కానీ పోరాటంలో ముందుభాగాన ఉన్నాను, అందుకే నన్ను టార్గెట్ చేశారుపౌరసత్వ సవరణ బిల్లు (CAB)పై నిరసన కార్యక్రమాల సందర్భంగా పోలీసులు జామియా మిలియా యూనివర్సిటీపై దాడి చేసిన ఘటనలో యూనివర్సిటీ మొత్తం నెత్తురు ఏరులై పారింది. యూనివర్సిటీ రోడ్లు, లైబ్రరీ, హాస్టల్ గదులు విద్యార్హుల నెత్తురుతో తడిసిపోయింది. |
| NRC,CAA : ఫాసిస్టు చట్టంపై స్పందించండి - టెకీల బహిరంగ లేఖపౌరసత్వ సవరణ చట్టం (CAA), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్ (NRC) లకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో భారతీయ ఐటీ నిపుణులు ఘాటుగా స్పందించారు. పౌరసత్వ సవరణ చట్టం ఫాసిస్ట్ చట్టంగా పేర్కొంటూ బహిరంగ లేఖ రాశారు. |
| వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్ లను యూనివర్సిటీ నుండి బహిష్కరించిన విద్యార్థులు, అధ్యాపకులు, ఉద్యోగులుఇప్పటి వరకు విద్యార్థులను కాలేజీల నుండి, యూనివర్సిటీల నుండి బహిష్కరించే వైస్ ఛాన్సలర్, రిజిస్ట్రార్, ప్రిన్సిపాల్ లనే చూశాం కదా.... తప్పు చేసిన వైస్ ఛాన్సలర్ ను, రిజిస్ట్రార్ లను యూనివర్సిటీ నుండి బహిష్కరించిన విద్యార్థులు, అద్యాపకులు, ఉద్యోగుల గురించి విన్నారా ఎప్పుడైనా ? |
| నిరాశల నడుమ కొత్త ఆశడీమానిటైజేషన్, జీఎస్టీ, 370 ఆర్టికల్ రద్దు, అయోద్య తీర్పులాంటి ఉపద్రవాలు వచ్చినా సమాజం కదలవలసినంత కదలలేదని, కానీ ఇప్పుడు ఆ నిరాశలోంచి కొత్త కాంతి పుంజాలు వెలుగుచూస్తున్నాయని అన్నారు. ఇప్పుడు ఎన్ఆర్సీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనల్లో కనిపించే యువతే ఆ ఆశ అన్నారు. |
| CAA,NRC : ఈ దేశ ప్రజలపై పాలకుల హింసాకాండకు ఉత్తరప్రదేశ్ ఓ ఉదహరణ
పౌరసత్వ సవరణ చట్టానికి (CAA) వ్యతిరేకంగా ఉత్తరప్రదేశ్లో శాంతియుత నిరసనలు చేస్తున్న విద్యార్థులు, యువకులు, సామాజిక, హక్కుల కార్యకర్తలపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్ నేతృత్వంలోని బీజేపీ సర్కారు కేసులు పెడుతున్నది. |
| జామియా విద్యార్థులకు అండగా నిల్చిన వీసీ - పోలీసులపై కేసు నమోదు చేస్తామని ప్రకటనపౌరసత్వ సవరణ చట్టం(CAA)పై నిరసనలు తెలిపిన జామియా మిలియా యూనివర్సిటీ విద్యార్థులపై పోలీసుల దాడిని ఆ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ నజ్మా అఖ్తర్ తీవ్రంగా ఖండించారు |
| NPR పేరుతో NRC అమలు చేయబోతున్నరు... IAS కన్నన్ గోపీనాథన్ ఎన్పీఆర్ పేరుతో అమిత్ షా ఎన్నార్సీ అమలు చేయదల్చుకున్నాడని మాజీ ఐఏఎస్ కన్నన్ గోపీ నాథన్ మండి పడ్డారు. ఎన్నార్సీ, సీఏఏ లకు వ్యతిరేకంగా ముంబైలో జరిగిన ఓ ప్రదర్శనను ఉద్దేశించి ఆయన మాట్లాడారు. |
| ఎన్నార్పీలో సరైన వివరాలు ఇవ్వకండి - ప్రజలకు అరుంధతీ రాయ్ పిలుపుకేంద్ర ప్రభుత్వందొడ్డి దారిన ఎన్నార్సీ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోందని ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త అరుంధతి రాయ్ ఆరోపించారు. ఎన్ఆర్పీ అనేది ఎన్ఆర్సీకి డేటాబేస్గా ఉపమోగపడుతుందని ఆమె అన్నారు. ఢిల్లీ యూనివర్సిటీలో ఎన్ఆర్సీని వ్యతిరేకిస్తూ నిర్వహించిన నిరసన కార్యక్రమంలో బుధవారం ఆమె పాల్గొన్నారు. |
| హైదరాబాద్ను తాకిన ʹజామియాʹ నిరసన సెగ.. వందలాది మంది విద్యార్థుల ఆందోళనపౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఢిల్లీలోని జామియా మిలియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులు చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారిన విషయం తెలిసిందే. ఆందోళన చేపట్టిన విద్యార్థులపై ఢిల్లీ పోలీసులు అత్యంత దారుణంగా దాడులు చేశారు. ఈ దాడులకు నిరసనగా, జామియా విద్యార్థులకు మద్దతుగా హైదరాబాద్లో నిరసనలు వెల్లువెత్తాయి. |
| పోలీసుల దాడిలో కన్ను కోల్పోయిన విద్యార్థి ఏమంటున్నాడుదేశ రాజధాని ఢిల్లీకి వచ్చి చాలా పెద్ద తప్పు చేశానని పోలీసుల దాడిలో కన్ను పోగొట్టుకున్న జామియా మిలియా ఇస్లామియా విశ్వవిద్యాలయంలో విద్యార్థి మిన్హాజుద్దీన్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నెల 15న జామియా యూనివర్సిటీలో పౌరసత్వ సవరణ చట్టానికి |