సృజనాత్మక ధిక్కారం.. విరసం 50 ఏళ్ల సభలు ప్రారంభం
విప్లవ రచయితల సంఘం (విరసం) 50 ఏండ్ల మహాసభలు ఇవాళ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ప్రారంభమయ్యాయి. సభల ప్రారంభానికి ముందు ఎర్రజెండాను కేరళా హక్కుల కార్యకర్త రావున్ని, విరసం జెండాను విరసం వ్యవస్థాపక సభ్యులు కృష్ణా భాయి, అమరుల స్తూపాన్ని ఇటీవల అమరుడైన దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి రామన్న సోదరుడి కుమారుడు కమలాకర్ ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా పలువురు వక్తలు తమ అభిప్రాయాలను తెలియజేశారు. 60వ దశకం మరోమారు పునరావృతం అవుతోందని, ఇవ్వాళ విశ్వవిద్యాలయాల్లో వినిపిస్తున్న నినాదాలే అందుకు నిదర్శనమని ప్రముఖ విప్లవ రచయిత, ఆముఖ్ పత్రికా సందపాదుకులు కంచన్కుమార్ అన్నారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విప్లవ రచయితల సంఘం 50 ఏళ్ల సభల ప్రారంభోపన్యాసం చేసిన ఆయన విరసం ఐదు దశాబ్ధాలుగా ఎత్తిన జెండా దించకుండా అవిశ్రాంతంగా తన ప్రస్థానాన్ని కొనసాగిస్తోందన్నారు. "విశాఖ విద్యార్థులు రచయితలారా మీరు ఎటువైపు అని వేసిన ప్రశ్న, దానికి దీనికి ప్రతిస్పందనగా ఏర్పడిన విరసం చరిత్రను వివరించారు. పోరాటాలను, విప్లవోద్యమాన్ని, నక్సల్ బరీ పోరాటాన్ని విప్లవ రచయితల సంఘం అద్దంపట్టింది. 70వ దశకాల నుంచి ఇప్పటి వరకూ అవిశ్రాంతంగా కొనసాగిస్తూనే ఉన్నది. ఈ క్రమంలో ఎంతో నిర్భంధాన్ని ఎదుర్కొంది. ఎమర్జెన్సీ సందర్భంగాను, అనేక మంది విరసం సభ్యులు పలు కుట్ర కేసుల్లో రాజ్య నిర్భంధాన్ని ఎదుర్కొన్నారు. అది ఇప్పటికీ కొనసాగుతోంది. విరసం వ్యవస్థాపక సభ్యుడు, గొప్ప విప్లవ కవి వరవరావు బీమాకోరేగావ్ కుట్ర కేసులో జైల్లో ఉన్నారు. అసలు బీమా కోరేగావ్లో సమావేశమైన దళితులపై మతోన్మాద శక్తులు దాడికి పాల్పడ్డాయి. ఈ సందర్భంగా పోలీసులు అసలు హింసకు పాల్పడ్డ అసలు నిందితులను వదిలేసి.. దేశ వ్యాప్తంగా మేధావులను అరెస్టు చేసి, అక్రమ కేసులు మోపారు. బెయిలుకూడా రాకుండా అడ్డుకుంటున్నారు. ఇక ప్రస్తుత పరిస్థితుల వద్దకు వస్తే.. దేశ వ్యాప్తంగా.. సీఏఏ కి వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళనలను సైతం పాశవికంగా అణచివేసేందుకు ప్రయత్నిస్తోంది ప్రభుత్వం. జామియా మిలియా, జేఎన్యూ విద్యార్థుల పోరాటానికి దేశ వ్యాప్తంగా లభిస్తున్న మద్దతును ప్రజల్లో వ్యక్తమవుతున్న ప్రజా వ్యతిరేకతను అర్థం చేసుకోవచ్చు. జేఎన్యూలో ఏబీవీపీ గూండాలు విద్యార్థులపై జరిపిన దాడి అత్యంత హేయమైనది. పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కలిసిరావాలని విద్యార్థులు పిలుస్తున్నారు. నాడు విశాఖ విద్యర్థులు ఇచ్చిన స్పూర్తిని ఇవాళ జామియా, జేఎన్యూ విధ్యార్థులు కొనసాగిస్తున్నారు. ఈ స్పూర్తిని ఎత్తిపట్టాల్సిన అవసరం ఉంది. జామియా విద్యార్థులు, ఆ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతంలోని ప్రజలు పౌరసత్వ సవరణ చట్టం, జాతీయ పౌరసత్వ రిజస్టర్ తయారీకి వ్యతిరేకంగా సాహీన్ బాగ్ శాశ్వత కేంద్రంగా.. రెండు నెలలుగా పోరాటం చేస్తున్నారు. ప్రజాస్వామిక వాదులు సమావేశం కావడానికి, పోరాడటానికి అవసరమైన వేదికలుగా దేశవ్యాప్తంగా షహీన్ బాగ్ లు మరిన్ని నిర్మించాల్సి ఉంది" అన్నారు. ప్రస్తుత కాలంలో ఇది మనందరి బాధ్యత అని తెలిపారు.
విరసం మహాసభల ఆహ్వాన సంఘం అధ్యక్షుడు యాకూబ్ ప్రసంగిస్తూ హిందూత్వం పెచ్చరిల్లిన ప్రస్తుత సందర్భంలో విరసం వంటి సంస్థల బాధ్యత మరింత పెరిగిందని అన్నారు. అన్ని రకాల పీడనలకు గురైతున్న జనాలకు మద్దతుగా నిలవాల్సిన సమయమన్నారు. కేవలం విప్లవ శక్తులనే కాక... సమాజంలో అణచివేతకు గురైతున్న సమూహాలను కలుపేసుకుని పోవాల్సిన బాధ్యత విరసంపై ఉందని చెప్పారు. నిర్భంధాలను అణచివేతను ఎదుర్కొని యాభైఏళ్ల ప్రస్థానం పూర్తి చేసుకున్న విరసం మరింత స్పూర్తితో ముందుకు పోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
ఆహ్వాన సఘం మరో అధ్యక్షుడు ఖాదర్ మోహియుద్దీన్ మాట్లాడుతూ హిందూత్వ ఫాసిజం విజృంభిస్తున్న పరిస్థితుల్లో ఇలాంటి సభలు ఎంతో ఉత్తేజాన్ని ఇస్తాయన్నారు. "దేశంలో పరిస్థితులు రోజు రోజుకు దిగజారుతున్నాయి. మోదీ- షా ద్వయం రెండో సారి కేంద్రంలో అధికారంలోకి వచ్చాక.. మైనారిటీలు, పీడిత ప్రజలపై హింస మరింత పెరిగిపోయింది. వేల ఏళ్లగా తమ రక్తమాంసాలను వెచ్చించి దేశ అభివృద్దికి పాటుపడిన ప్రజలను పరాయి వారిగా చిత్రించే కుట్ర జరుగుతోంది.ఇన్నేళ్ల తర్వాత నా పౌర సత్వాన్ని ప్రశ్నించే హక్కు ఈ ప్రభుత్వనికి ఎవరిచ్చారు. ఈ దేశ లౌకిక ప్రజాస్వామిక హక్కులను కాపాడుకోవలసిన అవసరం మనందరికి ఉంద"ని అన్నారు. నిర్బంధాలను ఎదుర్కొన్ని సృజనాత్మక ధిక్కారం తెలిపే అదికొద్ది సంస్థలలో విరసం ఒకటని చెప్పడానికి ఎలాంటి సందేహంలలేదని అన్నారు.
తెలుగు సాహిత్యంలో ధిక్కార స్వరాన్ని విరసం వినిపించింది. పీడిత, పోరాట సమూహాలకు తన గొంతునిచ్చిందని కామ్రెడ్ చంచయ్య అన్నారు. సృజనాత్మక ధిక్కారం పేరిట యాభైఏళ్ల విరసం ప్రయాణాన్ని తన కీనోట్ ప్రసంగంలో విరసం కార్యదర్శి పాణి వివరించారు. ప్రజల సృజనను ఎత్తిపట్టి, వర్గ పోరాటాన్ని సాహిత్య, కళారంగాల్లోకి విరసం తీసుకువెళ్లింది. పోరాట ప్రజల, పీడిత ప్రజల భాషను, నుడికారాన్ని స్వీకరించింది. తెలంగాణ సాయుధ పోరాటం నుంచి స్వీకరించి నిత్య నిర్భంధాన్ని ఎదుక్కొంటూ యాభై ఏళ్ల కాలంగా తన సృజనలో ప్రతిఫలించింది. విరసం అన్ని రకాల ప్రజా పోరాటాలను, ధిక్కారాలను తనలో సంలీనం చేసుకుని సమకాలీన ప్రజా ఆకాంక్షలకు సృజనాత్మక వేదికగా నిలబడింది. నూతన ఆలోచనలకు అవసరమైన ప్రజాస్వామిక భూమికను ఏర్పరిచింది. దీనివల్ల తెలుగు సాహిత్యంలో అనేక ధిక్కార స్వరాలు వెల్లువెత్తడానికి విరసం కూడా కారణమైంది. తరతరాల సాంఘిక విముక్తి ఆకాంక్షలు. ఉద్యమాలు, వర్గపోరాటాల ప్రేరణ వల్ల బలోపేతమయ్యాయని వివరించారు.
సామూహిక ధిక్కారం ఇవ్వాల్టి అవసరం : వేరు వేరు రాష్ట్రాల ప్రతినిధులు
విరసం యాభైయొవ పుట్టిన రోజు సందర్భంగా వివిధ రాష్ట్రాల నుంచి పలువురు రచయితలు, సాంస్కృతిక కార్యకర్తలు తమ సందేశాలను తెలిపారు. భోపాల్ కి చెందిన మహిళాహక్కుల కార్యకర్త, రచయిత్రి రించిన్ మహిళలు, క్వియర్ సమూహాల కథనాలను, ఉద్యమాలను సాహత్యంలో ప్రతిఫలింపచేయాల్సిన అవసరాన్ని తెలిపారు. ప్రజా ఉద్యమాల వెలుగులో మనదైన బాల సాహిత్యాన్ని తీసుకురావాలని అభిప్రాయపడ్డారు. ప్రోగ్రెసివ్ సాహిత్యంలో సైతం బాలల సాహిత్యం అరకొరగా ఉంటోందని అన్నారు. అనంతరం కేరళకు కెందిన దళిత కవి, రచయిత కేకేఎస్ దాస్ మాట్లాడారు. కమ్యూనిష్టు పార్టీ ధికారంలో ఉన్నా.. కేరళలో ఉద్యమాలు ఎంతటి నిర్భందాన్ని ఎదుర్కొంటున్నాయో వివరించారు. విరసం వంటి సంస్థలు దేశ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఉండాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ఒరిస్సాకు చెందిన ఆదివాసీ కవి హేమంత దళపతి తమ ప్రాంతంలో ప్రజాఉద్యమాలను, ఆదివాసుల జీవన పరిస్ధితులను వివరించారు. కర్ణాటకకు చెందిన రచయిత, సాంస్కృతిక కార్యకర్త నగరిగిరి రమేశ్ కర్ణాటక ప్రజాఉద్యమాలను, అక్కడి బీజేపీ ప్రభుత్వ నిర్భంధాన్ని గురించి మాట్లాడారు.
విరసం సభల్లో సభల్లోప్రజాకళామండలి, అరుణోదయ, విరసం, లాల్ లాంతర్ కళాకారుల సాంస్కృతిక ప్రదర్శనలు విశేషంగా ఆకట్టుకున్నాయి. అలాగే విప్లవరచయితల సంఘం ప్రచురించిన పలుపుస్తకాల ఆవిష్కరణ జరిగింది.
Keywords : Virasam, 50 years, Meetings, Hyderabad,
(2024-04-10 04:08:13)
No. of visitors : 1049
Suggested Posts
0 results