నిజం ఎప్పటికి బయటకు వస్తుంది?
కశ్మీర్ లో నిన్న ఒక విచిత్రమైన సంగతి జరిగింది. విధులు బాగా నిర్వహించినందుకుగాను ప్రెసిడెంట్ అవార్డ్ తీసుకొన్న జమ్మూ కశ్మీర్ డిఎస్ పీ దవీందర్ సింగ్ ను ఇద్దరు హిజ్బుల్ ముజాహిదీన్ ʹటెర్రరిశ్టులʹతో సహా అరెస్టు చేశారట. అరెస్టు చేసేటప్పటికి వారు ముగ్గురు, కుల్గామ్ జిల్లా దగ్గరి జమ్ము కశ్మీర్ హై వే మీదుగా ఢిల్లీకి వెళుతున్నారట. ఈ డి ఎస్ పీ శ్రీనగర్ ఇంటర్ నేషనల్ ఎయిర్ పోర్ట్ లో పని చేస్తున్నాడు. అరెస్టు రోజు ముందు, నాలుగు రోజులు సొంత పని ఉందంటూ సెలవు పెట్టాడట. అతని ఇంట్లో (శ్రీనగర్ లో) ఒక ఎకె -47 రైఫిల్ దొరికిందట. అతన్ని ఇక టెర్రరిష్టు గానే పరిగణిస్తారట. అతనితో ఉన్న టెర్రరిష్టు నవీద్ ముస్తాక్ అలియాస్ నవీద్ బాబు ఒక గతంలో పోలీసు డెపార్ట్మెంట్ లోనే ఎస్పిఓ గా పని చేసేవాడట. ఉద్యోగాన్ని వదిలేసి మిలిటెంట్లలోకి చేరాడట. ఈ ʹటʹ లు ఎందుకంటే ఇవన్నీ చెప్పింది జమ్మూ కశ్మీర్ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ విజయ్ కుమార్. రేపు బయటకు రాబోయే నిజం ఈ కథనానికి సరిగ్గా వ్యతిరేకంగా ఉండవచ్చు. అలా అనుకోవటానికి చాలా కారణాలు ఉన్నాయి.
నవీద్ ముస్తాక్ పోలీసు ఉద్యోగాన్ని వదిలేసి మిలిటెంట్లలో చేరిన విషయాన్ని నమ్మచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువమంది కశ్మీర్ లో అలా చేరుతున్నారు కూడా. నమ్మలేని విషయం డీ ఎస్ పీ దవీందర్ సింగ్ ను అరెస్టు చేయటానికి చెబుతున్న కారణాలే.
ఈ దవీందర్ సింగ్ పేరు చాలా రోజుల క్రితం ఉరితీయబడిన అఫ్జల్ గురు నోటి నుండి వచ్చింది. అఫ్జల్ గురుతో కారవాన్ ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ వినోద్ కె జోస్ జైల్లో చేసిన ఇంటర్వ్యూలో (అప్పటికే అతనికి ఉరి శిక్ష పడింది) అతను ఈ దవీందర్ సింగ్ గురించి చెప్పాడు.
మెడిసన్ చదువుతుండే అఫ్జల్ గురు కశ్మీర్ విముక్తి కోసం 1990 ప్రాంతాల్లో అన్నీ వదిలేసి, పాకిస్తాన్ బోర్డర్ వైపు వెళ్లిన వాళ్లలో ఒకడు. అక్కడకు వెళ్లాక అతని భ్రమలు తొలిగి పోయి వెనక్కి వచ్చాడు. పెళ్లి చేసుకొని కొత్త జీవితం మొదలు పెట్టాడు. ఒక కొడుకు కూడా పుట్టాడు. అయితే వెనక్కి వచ్చినప్పటి నుండి పోలీసుల, భద్రతా దళాల చేతిలో హింసలపాలయ్యాడు. ఎక్కడ ఏ మిలటరీ యాక్షన్ జరిగినా అఫ్జల్ గురుని అదుపులో తీసుకొని హింసించేవారు.
తనను హింస పెట్టిన వారిలో దవీందర్ సింగ్ ఒకడు అని అఫ్జల్ చెప్పాడు. అంతే కాకుండా ఈ దవీందర్ సింగ్ తనకు ఒక చిన్న సహాయం చేయాలని అడగగా ఒప్పుకొన్నాననీ, మహమ్మద్ అనే వ్యక్తిని ఢిల్లీ చేర్చాలని కోరగా ఒప్పుకొని చేర్చానని చెప్పాడు. కొన్ని రోజులు అతనితో ఉన్న తరువాత మహమ్మద్ తనను 35000 రూపాయలు గిఫ్ట్ గా ఇచ్చి వెనక్కి పంపాడనీ చెప్పాడు. ఈద్ పండగకు ఇంటికి పోవాలని బయలుదేరి వస్తుండగా తనని శ్రీనగర్ లో అరెష్టు చేశారని, ఆ తరువాతే పార్లమెంటు దాడి జరిగినట్లు తనకు తెలిసిందనీ చెప్పాడు.
తనను పార్లమెంటు పై దాడి కుట్ర కేసులో ఇరికించారనీ; తనతో ఎస్ ఏ ఆర్ జిలానీ తదితరులను అరెష్టు చేశారని, వారికి ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదనీ చెప్పాడు. ఈ పార్లమెంటు కుట్ర కేసు గురించి బాగా తెలుసుకోవాలంటే అరుంధతి రాయ్ ముందుమాట రాసిన ʹThe Strange Case attack on Indian Parliamentʹ పుస్తకం చదవాలని అంటున్నారు. (నేనూ చదవలేదు) అందులో ఈ దవీందర్ సింగ్ ఇంటర్వ్యూ కూడా ఉందట.
నవీద్ ముస్తాక్ మీద ఈ మద్య (370 రద్దు తరువాత) 11 మంది యాపిల్ తోటలో పని చేసే కశ్మీరేతరులను చంపిన కేసు కూడా ఉంది. ఈ హత్యలు యాపిల్ తోటల ఆధిపత్యం కొరకు జరిగాయని తెలుస్తోంది. ఎవరు చంపారో తెలియదు కానీ, నవీద్ ముస్తాక్ మాత్రం పోలీసు రికార్డులకెక్కి కూర్చోన్నాడు.
ఇంతకీ జమ్ము కశ్మీర్ లో అంత ʹబాగాʹ పని చేసి, ప్రెసిడెంట్ వగైరా అవార్డ్స్ తెచ్చుకొన్న దవీందర్ సింగ్ మీద అపవాదు ఏమిటి? జనవరి 9న శ్రీనగర్ ఎయిర్ పోర్ట్ లో ఒక డజన్ మంది రాయబారులను ఆహ్వానిస్తున్న ఫోటోలో కూడా ఇతను ఉన్నాడు. అఫ్జల్ గురు, ఈ దవీందర్ సింగే తనని మహమ్మద్ తో పంపించాడని చెప్పాడు కదా మరి ఆ విషయం అడిగారా, అతను ఆ విషయం ఒప్పుకొన్నాడా అని కొంతమంది విలేఖరులు అమాయకంగా అడగగా పోలీసులు ఏ సమాధానం చెప్పలేదు.
ఇంతకీ ఏమి జరిగి ఉంటుంది? ఇంకో పార్లమెంటు దాడికో, ప్రధాన మంత్రి హత్యకో పథకం వేశారనే డ్రామా కోసం దవీందర్ సింగ్ వీళ్లను పట్టుకొని పోతున్నాడా? ఎన్నికలు ఏమైనా దేశంలో పెండింగ్ లో ఉన్నాయా? ఇంకో అఫ్జల్ గురు దొరకక దవీందర్ సింగ్ తనే అఫ్జల్ గురు గా మారాడా? మరి అంత ʹదేశ ద్రోహిʹ పోలీస్ స్టేషన్ లో కశ్మీరీలను ఎందుకు హింశిస్తాడు? మరి ఎందుకు అతనికి అన్ని అవార్డులు వచ్చాయి?
ఎక్కడో ఏదో చెడిన వాసన, కాలిన వాసన వస్తుంది. త్వరలో ఇంకో ముగ్గురి ఎన్ కౌంటర్ చూడబోతున్నామా? ఎప్పుడో సత్యం బయటకు వస్తుంది. అప్పటి వరకు అబద్దాలనే నమ్ముతూ పోదాము.
- రమా సుందరి
URL : https://www.facebook.com/permalink.php?story_fbid=2596271987323735&id=100008228765507
Keywords : Afzal Guru, Parliament Attack, Davinder Singh, Kashmir, DSP, Terrorist Links
(2024-03-29 21:06:54)
No. of visitors : 798
Suggested Posts
0 results