విద్వేషం అతని మతం.. అణచివేత అతని ఆయుధం..!
జేఎన్యూలో ఇటీవల చోటు చేసుకున్న ఘటనలకు మాస్టర్ మైండ్ ఆ యూనివర్సిటీ వీసీ జగదీష్ కుమార్ అని కొన్ని వార్తా కథనాలు వచ్చాయి. ఈ సందర్భంగలో వీసీని గతంలో అమీర్ మాలిక్ అనే సీనియర్ జర్నలిస్టు చేసిన రిపోర్టు ఒకటి మళ్లీ వెలుగులోనికి వచ్చింది. ఆ కథనాన్ని మోహన సుందరం తెలుగులో అనువదించి తన ఫేస్బుక్ వాల్పై పెట్టారు. ఆ పోస్టు యధాతథంగా...
-----------------------------------------------------------------------------------------
JNU వీసీ మామిడాల జగదీష్ కుమార్తో ఓ ముఖాముఖి లాంటి ఘటన
- అమీర్ మాలిక్ ( సీనియర్ జర్నలిస్ట్ )
------------------------------------------------------------------------------------------
JNU విద్యార్థుల మీద అమానుష దాడి జరిగిన నేపథ్యంలో JNU వీసీ ని తొలగించాలనే డిమాండ్ తో ఆందోళన జరుగుతున్న సందర్భంగా రెండేళ్ల క్రితం నేను ఉపకులపతి మామిడాల జగదీష్ కుమార్ తో జరిపిన ఓ ముఖాముఖి గుర్తుకొస్తుంది.
ఆరోజు ఆయన భాషా విజ్ఞాన భవనం, సాంస్కృతిక అధ్యయన భవనాల పక్కనుంచి అధికార పాలనా భవనాల పక్కాగా నడిచి వెళ్తున్నప్పుడు అనుకోకుండా నేను అక్కడ ఉండటం జరిగింది. ఆయన ఫ్రీడమ్ గ్రౌండ్ చేరుకునేలోపు చిన్న అవకాశాన్ని చేజిక్కించుకొని ఆయనతో నాలుగు మాటలు మాట్లాడే వీలు చిక్కింది. మేం కేవలం 200 మీటర్ల మేర మాత్రమే కలిసి నడవగలిగాం. ఆ కాస్త సమయంలోనే JNU గురించి ఒక డజను ప్రశ్నలు అడగగలిగాను. సరిగ్గా ఆ సమయంలోనే విశ్వవిద్యాలయంలో విద్యార్థుల వ్యక్తిగత హాజరు తప్పనిసరి చేయడానికి వ్యతిరేకంగా విద్యార్థులు పోరాటం చేస్తున్నారు. ʹ హాజరు తప్పనిసరి అనే నియమాన్ని ఎందుకుపెట్టారు ?ʹ అని నేనడిగితే , దానికాయన " మేం తప్పనిసరి అని విధించలేదు. బలవంతంగా రుద్దడానికి మేం వ్యతిరేకం. ఆ నిర్ణయం AC మీటింగ్ లో తీసుకోవడం జరిగింది. " అని చెప్పారు. కానీ ఆ సమావేశం పూర్తి సారాంశం మార్చివేసి తమకు తప్పుడు ప్రతిని ఇచ్చారని విద్యార్థి సంఘం చెబుతోంది. ఆనాటి సమావేశంలో చర్చించాల్సిన విషయాల్లో విద్యార్థుల హాజరు అంశం లేనేలేదని చెబుతున్నారు. అది కేవలం వీసీ తీసుకున్న ఏకపక్ష, మొండి నిర్ణయం అని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. అసలు విశ్వవిద్యాలయంలో హాజరు తప్పనిసరిగా ఎందుకుండాలో తెల్సుకోవాలనుకుంటున్నాను ? అని నేను అడిగితే
" ప్రపంచంలోని అత్యుత్తమ విశ్వవిద్యాలయాలన్నింటిలో హాజరు నియమం ఉంది " అని చెప్పారు. ʹ చదవాలా, ఒద్దా అనే అంశాన్ని విద్యార్థులకే వొదిలేయాలి కదా ? విద్యార్థుల్ని కాగితాల మీద సంతకాలు పెట్టమని ఒత్తిడి చేయడం.. అది వారి ఎదుగుతున్న మనస్తత్వానికి చెందిన పరిపక్వతకి హద్దులు గీస్తూ విశ్వవిద్యాలయాల ప్రామాణిక సూత్రాలనే ఉల్లంఘించడం కాదా ? ʹ అని అడిగితే
" అణగదొక్కబడిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు తమంతట తాము చదువుకోలేక వెనుకబడి పోతారు. అందుకే హాజరు తప్పనిసరి చేశాం " అని చెప్పారు. అంటే వెనుకబడిన వర్గాల నుంచి వచ్చిన విద్యార్థులు సరిగ్గా చదవరు అనే ఆయన ఉద్దేశం. దేశంలోని అత్యున్నత స్థాయి విశ్వవిద్యాలయం ఉపకులపతి అమూల్యమైన ఆలోచన సరళి ఇది.. !
ఇదొక్కటే కాదు ఆయన వీసీ అయినప్పటినుంచీ పేద వర్గాల విద్యార్థులు వర్సిటీలోకి ప్రవేశించడానికి ఉన్న మార్గాలన్నింటినీ మూసేస్తూ వచ్చారు. అనేక నియమాలను రద్దు చేసేశారు. ʹ JNU లో రిజర్వేషన్లు, పేద, మహిళా వర్గాలకు మేలు చేసే ప్రత్యేకమైన వెసులుబాట్లన్నీ రద్దు చేసేశారు? ఇంకా మౌఖిక పరీక్ష(viva)లో ఎందుకు 100 మార్కుల నియమాన్ని విధించారు? కుల, మత,భాషా పరంగా విద్యార్థుల్ని అణిచివేయడానికీ, ఇన్క్ మనకి కావాల్సిన వారికీ, కూలీన వర్గాలకు మేలుచేసుకోవడానికే కదా ఈ నియమాలు జాతీయ రహదారుల్లాగా ఉపయోగపడుతున్నాయి ?ʹ అని అడిగితే ఆయన కిక్కురుమనలేదు. అలాగే UGC గెజిట్ ని గుర్తుచేసుకున్నాను. అధ్యాపకులకు పని ఒత్తిడి ఎక్కువవుతుందనే సాకుతో ఎంఫిల్, పి ఎచ్ డీ ల్లో 1300 సీట్లని ఇతడు రద్దుచేసేశాడు. దీనివలన అనేకమంది విద్యార్థులు తమ పరిశోధనల కలల కేంద్రమైన JNU లోకి ప్రవేశించే అవకాశాన్ని పూర్తిగా కోల్పోయారు. ʹ ఎందుకలా చేశారు ?ʹ అని నేనడిగితే మే..మే.. అని నీళ్ళు నమిలారు.
ఇతగాడు చేసిన నిర్వాహం వల్ల మహిళా విద్యార్థులు మరింత బాధితులుగా మారారు. మహిళలపై జరిగే లైంగిక అకృత్యాల్ని నిరోధించే లైంగిక అత్యాచార నిరోధక కమిటీ(CSCASH)ని విశ్వవిద్యాలయంలో రద్దుచేసిపారేశాడు. ఇది దేశం మొత్తం మీద ఒక్క JNU లో మాత్రమే జరిగింది.
ʹఎందుకు ఈ కమిటీ ని రద్దు చేసేశారు ?ʹ అని అడిగితే ఆ విషయం న్యాయస్థానం లో ఉంది మాటాడకూడదు అన్నాడు. ఇంతలో అతని అంగరక్షకుడు కలిగజేసుకొని నన్ను ఇక అక్కడ్నుంచి వెళ్ళిపొమ్మన్నాడు. అయితే వీసీ అతడ్ని నివారించి పర్లేదు నన్ను మాట్లాడనియ్యమన్నాడు.
" నజీబ్ ఎక్కడున్నాడు? అతనిపై దాడిచేసిన వాళ్ళెందుకు స్వేచ్ఛగా, ఏ శిక్షా లేకుండా ఇక్కడే తిరగగలుగుతున్నారు ?" అని అడిగాను. జవాబు మాత్రం క్రూరమైన మౌనమే. ʹప్రతీ చిన్న విషయానికీ విద్యార్థులపై జరిమానా లు విధించి, డబ్బులు వసూలు చేస్తున్నారేందుకు ?, బిరియాని వండుకున్నందుకు సైతం జరిమానా విధించారెందుకు ?ʹ అని అడిగాను. దానికతడు ʹమీరు బిరియాని లైబ్రరీలో వండుకుంటారా?ʹ అని అడిగాడు. అతని ప్రశ్న జవాబు చెప్పకుండా తప్పించుకునే ఓ దారి అంతే. వాస్తవానికి విద్యార్థులు బిర్యానీ ని ఫ్రీడమ్ గ్రౌండ్లో అక్కడ దొరికిన కర్రలు,కట్టెలతో వండుకున్నారు. అది చట్టవ్యతిరేకమో, నియమాల ఉల్లంఘనో కాదు. తనతో గానీ, తన మద్దతుదారులతో గానీ ఎవరైనా విద్యార్థి విభేదిస్తూ గట్టిగా మాట్లాడితే ఆ విద్యార్థికి తక్షణమే నోటీసులు జారీ అయిపోతాయి. ʹ మీకు ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడినా, నినాదాలు ఇచ్చినా షోకాజ్ నోటీసులు ఎందుకిస్తున్నారు ?ʹ సమాధానం మళ్ళీ నిశ్శబ్దమే. ʹ ఎందుకని విద్యార్థుల యొక్క ప్రేమించుకొనే, జీవించే, నిరసన తెలిపే హక్కుల్ని కాలరాస్తున్నారు? ఎందుకని వాళ్ళని కరడుగట్టిన నేరస్తుల్లా చూస్తున్నారు?ʹ అని అడిగితే
ʹ ప్రజల్లో మంచివాళ్ళూ వుంటారు, అంతగా మంచివాళ్ళు కాని వాళ్ళూ ఉంటారు..ʹ అని చెబుతుంటే నేను అడ్డుపడి ʹ ఈ విభజన ఒక ఆరోగ్య కరమైన సమాజానికి మంచిది కాదు.. సరిపోదు. విద్యార్థుల చదువుకొనే హక్కుని ఇలా అన్ని రకాలుగా ఎందుకు కాలరాస్తున్నారు ?ʹ అని అడిగాను. ʹ నేనేమీ వాళ్ళ హక్కుల్ని కాలరాయడం లేదు ʹ అన్నాడు. అప్పటికే అతనికి కోపం తారాస్థాయికి చేరిపోయింది. నేను అడిగిన చివరి ప్రశ్న అతనికి మరింత చిర్రెత్తించింది. అదేమిటంటే
" మీరెప్పుడు JNU ని వదిలిపెట్టి వెనక్కి వెళ్లిపోతున్నారు ?" JNU పాలక భవనం మెట్లు ఎక్కుతున్న అతడు ఆగి , వెనక్కితిరిగి నావైపు చూశాడు. అప్పటికే అతడి మొఖం ఎర్రగా రంగు మారిపోయి ఉంది. మరింక ఏ ప్రశ్నలూ అడగకుండా అతని బాడీగార్డ్ నన్ను ఆపేశాడు.
JNU లో జరుగుతున్న వరుస ఘటనలకు భాద్యత వహిస్తూ వీసీ మామిడాల జగదీష్ కుమార్ ని ఆ పదవి లోంచి తొలగించాలనే విద్యార్థుల డిమాండ్ లో, ఆందోళనలో ఎంతో న్యాయం ఉంది.
( నజీబ్ పై దాడి చేసి, అదృశ్యం చేసిన ఘటనపై విద్యార్థులు చేస్తున్న ఘెరావ్ నుంచి వీసీని భద్రతా సిబ్బంది బయటకు తీసుకెళ్తున్న దృశ్యం పైన ఫొటో)
- మోహన సుందరం
ఫేస్బుక్ పోస్ట్ : https://www.facebook.com/story.php?story_fbid=465221864383514&id=100026871128416
Keywords : JNU, VC, Mamidala Jagadish Kumar, AMir Malik, Journalist
(2024-03-26 18:36:45)
No. of visitors : 769
Suggested Posts
0 results