కామ్రేడ్ కాశీం కోసం... ప్రజాస్వామిక హక్కుల కోసం అందరం గొంతు విప్పుదాం
విరసం 50 ఏళ్ల సభలు విజయవంతంగా ముగిసి కొత్త కార్యదర్శిగా కామ్రేడ్ కాశీం ఎన్నికై వారం తిరక్కుండానే ఆయన్ని అక్రమంగా దౌర్జన్యపూరితంగా అరెస్టు చేశారు. వ్యవస్థాపక సభ్యుడు కామ్రేడ్ వరవరరావు ఏడాదికి పైగా పూనా జైల్లో ఉన్నారు. సభ్యుల మీద కేసులు నడుస్తున్నాయి. అయినా అత్యంత చైతన్యపూరితంగా సభలు జరిగాయి. తెలుగు సాహితీ లోకం యావత్తూ విరసం గురించి మాట్లాడుతోంది, చర్చిస్తోంది.
ఈనాడు దేశమే జైలైపోయిన సందర్భంలో, ముఖ్యంగా రచనను, ఆలోచనను, జ్ఞానాన్ని ద్వేషించే పాలకులు బుద్ధిజీవులను వెంటాడుతున్న రోజుల్లో యాభై ఏళ్లుగా నిర్బంధాల నడుమ పనిచేస్తోన్న విరసం అనుభవం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విరసం వంటి సంస్థలు ఉండాలి, రాజ్య హింసను సవాలుగా తీసుకొని కత్తి అంచున నడుస్తున్న రచయితల స్ఫూర్తి నేడు అందరూ అలవరచుకోవాలని ఇవాల్టి స్థితి పట్ల ఆందోళన చెందుతున్న ఆలోచనాపరులందరూ మాట్లాడారు. ఆరెస్సెస్ దత్త పుత్రులు టిఆరెస్ వారికి ఇది కంటగింపు అయింది. మా కార్యదర్శిని అరెస్టు చేసారు.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పార్వతీపురం కుట్ర కేసు మొదలు సికింద్రాబాద్, రాంనగర్, తిరుపతి, ఔరంగాబాద్, భీమా కోరేగాం కుట్రకేసుల దాకా అన్నింటిలో విప్లవ రచయితలపై కుట్ర ఆరోపణలు చేసి నిర్బంధించింది రాజ్యం. ఇప్పుడు కాశీంపైనా అదే కుట్ర. కా. కాశీం ఇరవై ఏళ్లకు పైగా, ఉద్యమ పార్టీగా చెప్పుకుంటున్న తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టక ముందు నుండే, అంటే మలితరం తెలంగాణ విద్యార్థి ఉద్యమం నుండి ప్రజా ఆచరణలో ఉన్నవాడు. తెలంగాణ రాష్టం కోసం విద్యార్థి దశ నుండి ఎన్నో పోరాటాల్లో భాగమైన వాడు. ఆయన మట్టి పరిమళాల, బతుకు అలజడుల కవిత్వం రాసిన వాడు. సాహిత్య విమర్శకుడు, సైద్ధాంతిక రాజకీయ విశ్లేషణలు అందించే మేధావి, వక్త. ʹనేను తెలంగాణోన్ని మాట్లాడుతున్న (వ్యాసాలు)ʹ, ʹతెలంగాణ ఉద్యమాలు - పాట (వ్యాసాలు)ʹ, ʹకాశీం కవిత్వంʹ, ʹతెలంగాణ సాహిత్య వ్యాసాలుʹ, ʹపొలమారిన పాలమూరు (దీర్ఘకవిత)ʹ, ʹగుత్తికొండ (దీర్ఘ కవిత)ʹ, ʹమానాల (దీర్ఘకవిత)ʹ, ʹవర్గీకరణ నాలుగు వ్యాసాలుʹ, ʹఆంధ్రప్రదేశ్ ఏర్పాటు-విద్రోహ రాజకీయాలు (వ్యాసాలు)ʹ, ʹప్రపంచీకరణ వ్యతిరేక సాహిత్యం (పిహెచ్డి సిద్ధాంత గ్రంథం)ʹ, ʹప్రపంచీకరణ వ్యతిరేక కవిత్వం (ఎంఫిల్ పరిశోధన పత్రం)ʹ తాజాగా ʹఅకెడెమిక్ అన్ టచబిలిటీʹ వంటి పదికి పైగా పుస్తకాలు ప్రచురించాడు. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలోనే కాదు బహుశా రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పరిచయమంతా అక్కరలేని పేరు ఆయనది. కాశీం విప్లవం ద్వారా సమాజిక మార్పు సాధ్యమనే ప్రాపంచిక దృక్పథం కలవాడు. ప్రజాస్వామిక తెలంగాణను కోరుకున్నాడు. అది నేరం కాదు. ఆయన సంపాదకత్వం వహిస్తున్న ʹనడుస్తున్న తెలంగాణʹ మాసపత్రిక తెలంగాణలో బలమైన ప్రతిపక్ష గొంతుక.
కాశీం మీద కుట్ర తెలంగాణ సమాజం మీద కుట్ర. నాలుగేళ్ల క్రితం నాటి కేసును ఇప్పుడు బైటికి తీసి ఆయన ఇంటి మీద దాడి చేయడం, తలుపులు బద్దలు కొట్టి మరీ సోదాలు చేసి అరెస్టు చేయడం ఉన్మత్త రాజ్యహింస తప్ప మరోటి కాదు. పై కేసులోనూ, ఆయన పేరును ఇటీవల పలు కేసుల ఎఫ్ ఐ ఆర్ లలో ప్రస్తావించిన సందర్భంలోనూ ఆయన పరారీలో ఉన్న నిందితుడిగా చూపారు. ఆయన ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతిరోజూ విద్యార్థులకు పాఠాలు చెప్తాడని, బహిరంగ సామాజిక ఆచరణలో ఉంటాడని ప్రభుత్వానికి తెలియంది కాదు. ఇది నిస్సందేహంగా ప్రజాస్వామిక స్వరంపై ప్రభుత్వ దాడి. భావప్రకటనపై మానసిక యుద్ధం. విద్యార్థులను, మహిళా సంఘం కార్యకర్తలను, పలు ప్రజాసంఘాల బాధ్యులను వరుసగా అరెస్టులు చేసి మొత్తం సమాజాన్ని భయంలోకి నేట్టివేయడానికి రాజ్యం ప్రజలపై చేస్తున్న యుద్ధం ఇది.
2016లో అప్పటి మేదక్ జిల్లా ములుగు పోలీస్ స్టేషన్లో మావోయిస్టు కొరియర్గా అనుమానిస్తున్న ఎం. శ్యాంసుందర్ రెడ్డి అనే వ్యక్తితో పాటు కా. కాశీంను రెండవ ముద్దాయిగా చూపుతూ మావోయిస్టులకు లేఖలు రాశాడని అభియోగం మోపారు పోలీసులు. ఐ.పి.సి 120బి, 121ఎ, 124 సెక్షన్ల కింద (ప్రభుత్వాన్ని కూలదొయాలనే నేర పూరిత కుట్ర, రాజద్రోహం, తన మాటలు, చేతల ద్వారా చట్టబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వంపై విద్వేషాన్ని ప్రేరేపించే ప్రయత్నం చేశాడని), చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం (UAPA) సెక్షన్ 10, 18 కింద (నిషేధిత సంస్థలో సభ్యుడని, టెర్రరిస్టు చర్యలకు పూనుకున్నాడని) కేసు నమోదు చేశారు. పోలీసులు సృష్టించిన లేఖలతో పాటు మావోయిస్టు అనుబంధ పత్రికలుగా ʹనడుస్తున్న తెలంగాణʹ పత్రికలు చూపిస్తూ కుట్ర రచన చేశారు. ప్రభుత్వ గ్రంథాలయాలు, యూనివర్సిటీలు సహా తెలంగాణ రాష్ట్రంలో, బైటా ఎంతో మంది చదివే పత్రికను కూడా కుట్రలో చూపారు. ఇప్పుడు నాలుగేళ్ల తర్వాత అరెస్టు చేసారు. ఇన్ని రోజులూ కాశీం వీళ్ళకి దొరకలేదట.
ఈ కేసులు నిలిచేవి కావని వారికీ తెలుసు. అయినా ఇదేమీ నేర పరిశోధన కాదు. ప్రజా సంఘాలను, బుద్ధిజీవులను వేధించడమే లక్ష్యంగా పెట్టుకొని నడిపిస్తున్న కుట్ర.
దీనిని రచయితలూ, ప్రజాస్వామికవాదులందరూ ప్రశ్నించాలి. ఇది వరకు అడిగినదే మళ్ళీ మళ్ళీ అడగాలి. కాశీంపై ప్రభుత్వానికి ఎందుకంత కక్ష? ప్రొఫెసర్ గా తరగతి గోడలకు పరిమితం కాకుండా విశాల సమాజాన్ని తన మేధో, కార్యరంగం చేసుకున్నందుకా? తన జీతమేదో తీసుకొని తన కుటుంబం కోసం, పిల్లల కోసం ఇంత కూడబెట్టి ఇంకా ఉన్నత సోపానాలకు దారులేసుకోకుండా లోకంలో అందరి బాధలూ తనవే అని అందరికోసం మాట్లాడుతున్నందుకా? బాల్యం నుండే తెలంగాణను పలవరించి, ఉద్యమంలో దాడులు, కేసులు ఎదుర్కొని రాష్ట్రం ఏర్పడ్డాక కూడా అధికారానికి రాజీపడకపోవడమా? ఈ ప్రశ్నలు కాశీం కోసమే కాదు మాట్లాడే, రచన చేసే, సభలు పెట్టుకునే, నిరసన తెలిపే ప్రజాస్వామిక హక్కుల కోసం అడగాలి. రాజ్యం బరితెగింపును నిలదీయాలి. ఈ కాస్త ప్రజాస్వామిక ఊపిర్లు కూడా ఆగిపోకుండా కాపాడుకోవాలి.
-విప్లవ రచయితల సంఘం
ఫేస్బుక్ పోస్టు :
https://www.facebook.com/varalakshmi.puduru/posts/2770027043059015 (వరలక్ష్మీ)
Keywords : OU, Professor, Kasim, Virasam
(2024-04-13 17:40:31)
No. of visitors : 1451
Suggested Posts
| తనను అరెస్టు చేయడానికి వచ్చిన పోలీసులకు ʹజాషువా పద్యంʹ వినిపించిన కాశీం...!ప్రొఫెసర్ కాశీం ని అరెస్ట్ చేయడానికి వచ్చిన మెదక్ పోలీసులు ఇంట్లో సోదాలు నిర్వహిస్తున్న క్రమంలో ఒక పోలీసు ఆఫీసర్ జ్యోక్యం చేసుకొని "యూనివర్సిటీ ప్రొఫెసర్ గా ఉన్న మీలాంటి వాళ్లకు ఎందుకు సార్ ఈ రాజకీయాలు, మంచిగా మాట్లాడతారు, మంచిగా రాస్తారు. |
| ప్రొఫెసర్ కాసీం అరెస్టు.. తెలంగాణ పోలీసులపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం2016లో పెట్టిన కేసులో ఇప్పటి వరకు కాశీం తప్పించుకొని తిరుగుతున్నాడని ఎలా అంటారని ప్రభుత్వాన్ని హైకోర్టు ప్రశ్నించింది. |
| ʹప్రొఫెసర్ కాశీంను అణగారిన ప్రజల వైపు నిలబడ్డందుకే అరెస్ట్ చేశారుʹʹʹ2016 హైదరాబాద్ నుండి ఆదిలాబాద్ వెళ్తున్న శ్యామ్ సుందర్ అనే వ్యక్తి దగ్గర దొరికిన పుస్తకాల పై కేసు నమోదు చేశారు.ʹʹ |
| కట్టుకథ ఆధారంగా కాశీం అరెస్ట్...!!2016లో కాశీంపై కేసు నమోదు చేసిన పోలీసులు అతను ఇప్పటివరకు అబ్ స్కాండిగ్ లో ఉన్నట్లు ఆరోపించడం వింతలో కెల్ల వింత. |
| Condemning arbitrary arrest of Prof. C. KaseemThe voice that had echoed for the formation of separate Telangana state, the voice that reverberated for self-respect of Dalits: Prof. C. Kaseem has been arbitrarily arrested by |