సీఏఏకు వ్యతిరేకంగా షహీన్బాగ్ నిరసనల్లో కాశ్మీరీ పండితులు
సీఏఏ, ఎన్నార్సీలకు వ్యతిరేకంగా భారతదేశ వ్యాప్తంగా సాగుతున్న నిరసనలకు ఢిల్లీలోని షాహీన్ బాగ్ కేంద్ర బిందువుగా మారింది. అత్యంత తీవ్రమైన చలిలో కూడా ఆదివారం సాయంత్రం స్వేచ్ఛా నినాదాలు చేస్తున్న వేలాది మంది ప్రజలు ఇక్కడ జష్న్-ఎ షాహీన్ (కవిత్వం, పాటలతో ఓ సాయంత్రం) జరుపుకున్నారు.
హమ్ క్యా చాహ్తే... ఆజాది!.. ఆకలి నుండి ఆజాదీ.. పేదరికం నుండి ఆజాదీ.. అణిచివేతల నుండి ఆజాదీ.. దోపిడి నుండి ఆజాదీ... నినాదాలతో షాహీన్ బాగ్ ప్రాంతం మారుమోగుతోంది. ఈ దేశం మాది మా తాత తండ్రులది అంటూ అక్కడ కూడిన వేలాది ప్రజలు నినదిస్తున్నారు.
కునాల్ కమ్రా, అంకుర్ తివారీ, మాయ కృష్ణారావుతో సహా అనేక మంది కళాకారులు ప్రభుత్వానికి తమ ప్రతిఘటనను తెలపడానికి ఇక్కడికి వచ్చారు. షాహీన్ బాగ్ ప్రజలకు సంఘీభావం ప్రకటించారు. ఇవ్వాళ్ళ షాహీన్బాగ్కు మద్దతు ఇవ్వడమంటే దేశానికి మద్దతు ఇవ్వడమే.
ఆదివారం ప్రముఖ కాశ్మీరీ పండీత్స్ ఎం.కె.రైనా, ఇందర్ సలీమ్లతో సహా మరికొందరు షహిన్బాగ్కు వచ్చారు. షాహీన్బాగ్కు తమ సంఘీభావం ప్రకటించడానికి వాళ్ళొచ్చారు.
బాలీవుడ్ నిర్మాత వివేక్ అగ్న్ హోత్రి రేపిన ఓ అబద్దపు ప్రచారాన్ని త్తుత్తునియలు చేయడానికి వాళ్ళిక్కడికొచ్చారు. కవిత్వంతో సాయంత్రం అనే ఈ కార్యక్రమం కాశ్మీరీ పండీట్లను కాశ్మీర్ లోయ నుండి వెళ్ళగొట్టినందుకు ఆనందం వ్యక్తం చేస్తూ జరుగుతున్న కార్యక్రమమని ఆయన ట్విట్టర్లో ప్రచారం మొదలు పెట్టాడు. ఇలాంటి అబద్దపు ప్రచారాన్ని వెంటనే అందుకునే కొన్ని గ్రూపులు కూడా దీన్ని ప్రచారంలో పెట్టాయి.
అయితే ఈ సాయంత్రం దేశరాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు, మతం ఆధారంగా ఈ దేశ ప్రజలను విభజించే కుట్రలను ఓడించేందుకు ప్రతినబూనే సాయంత్రమని షాహీన్ బాగ్ ప్రకటించింది.
ʹʹఈ సంఘటనకు కాశ్మీరీ పండిట్ల తరలింపుతో ఎటువంటి సంబంధం లేదు, పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా మేము చేస్తున్న శాంతియుత ఉద్యమాన్ని అణిచివేసేందుకు కొందరు చేస్తున్న అబద్దపు ప్రచారం. ʹʹ అని ఒక నిర్వాహకుడు తెలిపాడు.
షహీన్బాగ్ నిరసనల్లో పాల్గొన్న ఓ మహిళ మాట్లాడుతూ ʹʹకాశ్మీర్లో అన్నింటినీ విడిచిపెట్టి పారిపోయిన కాశ్మీరీ పండిట్ల బాధను మేమూ అనుభవిస్తున్నాము. షాహీన్బాగ్ ప్రజలం వారి వేదనలో వారికి సంఘీభావం తెలుపుతున్నాము. ʹʹ అని ప్రకటించింది.
వక్తలలో ఒకరి అభ్యర్థన మేరకు కాశ్మీరీ పండిట్లకు సంఘీభావంగా నిరసనకు హాజరైన వారందరూ రెండు నిమిషాల మౌనం పాటించారు.
" 500 రూపాయలు మరియు ఒక ప్లేట్ బిర్యానీ కోసం ప్రజలు ఈ నిరసనల్లో పాల్గొంటున్నారని మోడీ సర్కార్ తమ తోలుబొమ్మ మీడియా ద్వారా ప్రచారం చేస్తోంది, కానీ ఇవ్వాళ్ళ భారత దేశం మొత్తం షాహీన్ బాగ్ లాగా ఎలా మారిందో చూడండి.ʹʹ ఆ మహిళ చెప్పింది
ʹʹమేము ఇక్కడ ఓ రెండు రోజులు కూర్చుని ఇంటికి తిరిగి వెళ్తామని ప్రభుత్వం భావించింది కాని భారత ప్రజలు ఇప్పుడు మేల్కొన్నారని వారు గ్రహించలేదు. భారతదేశంలో ఏదైనా అన్యాయం జరిగితే మతాలతో సంబంధం లేకుండా ఆ అన్యాయానికి వ్యతిరేకంగా అందరం కలిసి పోరాడుతాముʹʹ అని ఒక యువ ప్రదర్శనకారుడు చెప్పాడు.
Keywords : Shahinbagh, CAA, NRC, Kashmir Pandits, BJP, Modi, Amit Shah
(2024-03-28 19:56:48)
No. of visitors : 729
Suggested Posts
0 results