రంజన్ గోగోయ్ తుచ్ఛుడే, మరి మీరేం చేస్తున్నారు మిలార్డ్ - మార్కండేయ కట్జూ
(సుప్రీం కోర్టు మాజీ న్యాయ మూర్తి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ అధ్యక్షుడు జస్టిస్ మార్కండేయ కట్జూ రాయగా వీక్షణం ఎడిటర్ ఎన్.వేణుగోపాల్ తెలుగులోకి అనువదించిన ఈ వ్యాసం వీక్షణం మార్చ్ 2020 సంచికలో ప్రచురించబడినది.)
మాజీ భారత ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా సుప్రీంకోర్టులో కేసుల పరిధులను అప్పగిస్తున్నప్పుడు అక్రమాలకు పాల్పడ్డాడని నలుగురు అత్యంత సీనియర్ న్యాయమూర్తులు నిరసన తెల్పుతూ బహిరంగంగా పత్రికాసమావేశం ఏర్పాటు చేసి మిశ్రాకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఆ నలుగురిలో రంజన్ గోగోయ్ కూడ ఉన్నారు.
కాని ఆ రంజన్ గోగోయే (ఆయనను నేను జస్టిస్ అని కూడ పిలవదలచుకోలేదు. లైంగిక అత్యాచారాలకు పాల్పడే ఒక వికృతజీవికి ఆ విశేషణం తగదు) మరింత ఘోరమైన మరెన్నో రకాల అక్రమాలకు పాల్పడ్డాడు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం మీద వాస్తవంగా సాగిలపడ్డాడు. మొత్తం అత్యున్నత న్యాయస్థానాన్నే రాజకీయ అధికారవర్గం చేతుల్లో పెట్టాడు. ప్రజల హక్కులను పరిరక్షించే పవిత్ర బాధ్యతను వదిలేశాడు. అటువంటి సమయంలో సుప్రీం కోర్టు న్యాయమూర్తులలో ఒక్కరంటే ఒక్కరు కూడ బహిరంగంగా తమ అసమ్మతి వ్యక్తం చేయలేదు.
గతంలో ఆంతరంగిక భద్రతా చట్టం మీద అన్యాయమైన, సిగ్గుమాలిన తీర్పు (ఎడిఎం జబల్పూర్ వర్సస్ శివకాంత్ శుక్లా) వెలువడినపుడు, కనీసం జస్టిస్ ఎచ్ ఆర్ ఖన్నా అనే ఒకే ఒక్క ధైర్యమైన అసమ్మతి స్వరం వినిపించింది.
కాని అంతకన్న సిగ్గుచేటైన అయోధ్య తీర్పు వెలువడినప్పుడు అది ఏకగ్రీవ తీర్పుగా బైటికి వచ్చింది.
గోగోయ్ ధూర్తుడూ తుచ్ఛుడూ అనే మాట నిజమే. న్యాయవ్యవస్థ మీద ఒక మచ్చలాంటివాడనే మాట నిజమే. కాని న్యాయవ్యవస్థలో న్యాయమూర్తులందరూ సమానమే. ప్రధాన న్యాయమూర్తి అయినంతమాత్రాన ఒకరు మిగిలినవారికన్న ఎక్కువేమీ కాదు.
మరి ఇతర న్యాయమూర్తులు ఈ అవమానకరమైన మనిషి ముందర తమ అంతరాత్మలను ఎందుకు తాకట్టు పెడుతున్నారు? అలా వారు తమ అంతరాత్మలకు వంచించుకుంటున్నారనేందుకు ఎన్నెన్నో ఆధారాలున్నాయి గాని మచ్చుకు ఈ ఐదు కేసులు చూడండి:
1. అయోధ్య కేసు విచారించి తీర్పు చెప్పిన బెంచి లో ఐదుగురు సుప్రీం కోర్టు న్యాయమూర్తులున్నారు. వారిలో గోగోయ్ కేంద్ర ప్రభుత్వం ఏమి చెప్పమంటే అదే చెపుతాడని ఎవరైనా ఊహించగలరు.
కాని మిగిలిన నలుగురు న్యాయమూర్తులు అంత ఘోరమైన, దుర్మార్గమైన, అన్యాయమైన తీర్పుకు ఎట్లా అంగీకరించారు?
ఆ నలుగురు న్యాయమూర్తుల అంతరాత్మ ప్రబోధాలు, న్యాయవిచక్షణ ఏమైపోయాయి? లేక ఆ నలుగురూ కూడ తమ అంతరాత్మలనూ, విచక్షణలనూ ఆ వంచకుడూ దుర్మార్గుడూ తుచ్ఛుడూ గోగోయ్ కి అప్పజెప్పేశారా?
2. అభిజిత్ అయ్యర్ మిత్రా బెయిల్ దరఖాస్తును తిరస్కరిస్తూ, గోగోయ్ ʹమీకు సురక్షితమైన స్థలం జైలేʹ అనే చౌకబారు, క్రూరమైన వ్యాఖ్య చేశాడు.
రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వం వర్సస్ బాల్ చంద్ అనే కేసులో జస్టిస్ కృష్ణ అయ్యర్ ఇచ్చిన సుప్రసిద్ధమైన తీర్పు ప్రకారం న్యాయశాస్త్ర సూత్రంగా స్థిరపడిపోయిన సంప్రదాయం ప్రకారం భారత న్యాయస్థానాలలో బెయిల్ నే సాధారణంగా, జైలు ను మినహాయింపుగా మాత్రమే చూడాలనే. నిందితులు తప్పించుకుపోతారనో, సాక్ష్యాధారాలను తారుమారు చేస్తారనో, లేక నిందితులు దారుణమైన నేరాలకు ఒడిగట్టి ఉంటేనో తప్ప మిగిలిన అన్ని సందర్భాలలో ఈ సూత్రాన్ని పాటించాలి.
అభిజిత్ చేసిన నేరమల్లా కోణార్క్ ఆలయం గురించి ఒక వ్యంగ్య వ్యాఖ్యను ట్వీట్ చేయడం మాత్రమే. ఆ పని చేసినందుకు ఆయన వెంటనే క్షమాపణ చెప్పాడు కూడ. తప్పనిసరిగా ఇది బెయిల్ ఇవ్వడానికి తగిన కేసే. అయినా ఆ బెయిల్ దరఖాస్తును తిరస్కరించారు.
న్యాయశాస్త్ర సూత్రాలను పాటించకపోవడంలో గోగోయ్ సిద్ధహస్తుడే. కాని ఆ బెంచి మీద ఆయనతో పాటు కూచున్న మరి ఇద్దరు న్యాయమూర్తులకేమైంది? వారిద్దరూ గోగోయ్ తీర్పుకు తమ అసమ్మతి ఎందుకు తెల్పలేదు? ఇప్పటికే స్థిరపడిన న్యాయశాస్త్ర సూత్రాల ప్రకారం ఇది బెయిల్ ఇవ్వదగిన కేసేనని ఎందుకు వాదించలేదు? ఎందుకు గోగోయ్ ను అనుసరించారు?
నేను అలహాబాద్ హైకోర్టులో ఒక న్యాయమూర్తిగా ఉన్నప్పటి సంగతి ఒకటి గుర్తొస్తున్నది. అప్పుడు నేను ఒక సీనియర్ న్యాయమూర్తితో పాటు ఒక డివిజన్ బెంచి లో ఉన్నాను. మేమిద్దరమూ కలిసి విన్న కేసుల్లో ఆయన నన్ను సంప్రదించకుండానే తీర్పులు ఇవ్వడం మొదలుపెట్టాడు. అలా ఆయన రెండు మూడు కేసుల్లో తీర్పులు ఇచ్చిన తర్వాత అది నాకు అంగీకారం కాదని చెప్పేశాను. ఆ బెంచి మీద నేను కూడ ఆయనతో సమానమైన న్యాయమూర్తినేనని, ఏ ఆదేశం ఇవ్వదలచుకున్నా నన్ను సంప్రదించ వలసిందేనని చెప్పేశాను. అలా సంప్రదించకుండా ఉత్తర్వులు ఇస్తే వాటి మీద నేను సంతకం చేయనన్నాను. గోగోయ్ తో బెంచి మీద కూచున్న న్యాయమూర్తులు ఇట్లా ఎందుకు చెప్పలేకపోయారు?
3. జస్టిస్ అకిల్ అబుల్హమీద్ కురేషి విషయంలో సుప్రీం కోర్టు కొల్లీజియంలోని మిగిలిన నలుగురు సభ్యులు గోగోయ్ మాటను ఎందుకు అంగీకరించారు? భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం చెప్పినట్టు చేసిన గోగోయ్ కి ఎందుకు లొంగిపోయారు. జస్టిస్ కురేషి ముస్లిం గనుక ఆయన మధ్యప్రదేశ్ హైకోర్టు వంటి పెద్ద హైకోర్టుకు ప్రధాన న్యాయమూర్తి కాగూడదని, అందుకు బదులు త్రిపుర హైకోర్టు వంటి చిన్న హైకోర్టుకు బదిలీ చేస్తే సరిపోతుందని కేంద్ర ప్రభుత్వం భావించింది.
ప్రభుత్వం ఏమి చెపితే దానికి గోగోయ్ అంగీకరించడంలో ఆశ్చర్యం లేదు. కాని మిగిలిన న్యాయమూర్తులు ఎందుకు అంగీకరించినట్టు? వారి అంతరాత్మలకు ఏమయింది?
4. జస్టిస్ ప్రదీప్ నందరాజోగ్ విషయంలో జరిగిన అక్రమ పద్ధతి అందరికీ తెలుసు.
ఆయనకు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతి ఇవ్వాలని ఐదుగురు న్యాయమూర్తుల సుప్రీంకోర్టు కొల్లీజియం ఏకగ్రీవంగా సిఫారసు చేసింది. ఆ సిఫారసు మీద ఐదుగురు న్యాయమూర్తులూ సంతకం చేశారని, ఆ కొల్లీజియంలో అప్పుడు సభ్యుడుగా ఉండిన జస్టిస్ లోకూర్ నాకు చెప్పారు. కాని గోగోయ్ దగ్గరివాడైన జస్టిస్ వాల్మీకి మెహతాకూ జస్టిస్ నందరాజోగ్ కూ పడదు గనుక, మెహతా కోరికపై గోగోయ్ ఆ సిఫారసు లేఖను ప్రభుత్వానికి పంపకుండా తన జేబులో పెట్టుకుని కూచున్నాడు. జస్టిస్ లోకూర్ పదవీ విరమణ జరిగాక, తన చెప్పుచేతల్లో ఉండే కొల్లీజియం ఏర్పాటయ్యాక పాత సిఫారసు లేఖను ఉపసంహరించుకునేలా చేశాడు.
5. గోగోయ్ నాయకత్వంలోని సుప్రీం కోర్టు బెంచి సిబిఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ విషయంలో ఎంత అక్రమంగా వ్యవహరించిందో అందరికీ తెలుసు.
అయితే ఆ బెంచి మీద ఉన్న న్యాయమూర్తులలో గోగోయ్ ఒక్కడే లేడు. న్యాయాన్ని అంత నగ్నంగా ధ్వంసం చేస్తుంటే మిగిలిన న్యాయమూర్తులు ఏం చేస్తున్నారు?
ద్రౌపది వస్తాపహరణ సమయంలో భీష్మాచార్యుడి గొంతు మూగవోయినట్టుగా వారందరి గళాలూ ఎందుకు మూగవోయాయి?
6. గోగోయ్ తనపై లైంగిక వేధింపులు జరిపాడని ఆరోపించిన ఒక మహిళా ఉద్యోగి కేసులో అప్పటికి ప్రధాన న్యాయమూర్తి అయిన గోగోయ్ తాను నియమించిన ముగ్గురు న్యాయమూర్తుల బెంచిలో తనను తాను నియమించుకున్నాడు.
ఆ తర్వాత ఆ విచారణ నుంచి తాను ఉపసంహరించుకుంటానని ఒక నాటకం ఆడాడు. అలా ఆయన ఉపసంహరణను ఆమోదిస్తే ఆ బెంచి రద్దయిపోవలసింది. గోగోయ్ సభ్యుడుగా ఉండని మరొక బెంచికి ఈ కేసు బదిలీ అయి ఉండేది.
మరి గోగోయ్ ఉపసంహరించుకుంటానని చెప్పి కూడ అదే బెంచి మీద కూచుని విచారణలో పాల్గొంటూ ఉంటే ఆ విచిత్రమైన, అసాధారణమైన ప్రవర్తనను మిగిలిన ఇద్దరు న్యాయమూర్తులూ ఎందుకు అంగీకరించారు?
ఇటువంటి దిగ్భ్రాంతికరమైన ఉదాహరణలు మరెన్నో ఇవ్వవచ్చు. నిస్సందేహంగా గోగోయ్ ఖల్ నాయకుడే. కాని మిగిలిన సుప్రీం కోర్టు న్యాయమూర్తులు సుప్రీంకోర్టు వస్త్రాపహరణ జరుగుతుంటే, భీష్మాచార్యులు వ్యవహరించినట్టుగా ఎందుకు వ్యవహరించారు?
వారు కూడ సమానంగా అపరాధులు కారా? ప్రధాన న్యాయమూర్తి దీపక్ మిశ్రా విషయంలో జరిపినట్టుగా ఆ మిగిలిన న్యాయమూర్తులందరూ గోగోయ్ అక్రమాల గురించి ఒక బహిరంగ పత్రికా సమావేశం ఎందుకు నిర్వహించలేకపోయారు?
ఈ గంభీరమైన ప్రశ్నలకు భారత ప్రజానీకానికి జవాబులు చెప్పవలసి ఉంది. అలా చెప్పలేకపోతే, భారత న్యాయవ్యవస్థలో వారి నమ్మకం, ఇప్పటికే చాలవరకు బలహీనమై పోయిన నమ్మకం, పూర్తిగా రద్దయిపోతుంది.
- మార్కండేయ్ కట్జూ
Keywords : ranjan gogoi, markandey katju, supreme court
(2024-04-24 17:00:57)
No. of visitors : 864
Suggested Posts
| లెనిన్ ఎవరూ..!?భగత్సింగ్ వంటి యువకిశోరాల వర్థంతులనాడు దండులు వేసి దండం పెట్టడమే తప్ప ఏనాడైన ఆయన చరిత్రను చదివుంటే లెనిన్ కొంతలో కొంతైనా అర్థమయ్యేవాడు. పాతికేళ్ళు కూడా నిండని కొంతమంది యువకులు, ఆ లెనిన్ నుండి ఆయన సారధ్యం వహించిన సోవియట్ యూనియన్ నుంచి స్ఫుర్తిని పొందబట్టే ʹహిందూస్తాన్ రిపబ్లిక్ అసోషియేషన్ʹ |
| నువ్వు హిందువా ముస్లింవా అంటూ జర్నలిస్టు ప్యాంట్ విప్పి చూశారు...ఢిల్లీలో కొన సాగుతున్న అరాచకం
రెండు రోజులుగా దాడులతో, హింసతో అట్టుడుకుతోంది. ఈశాన్య ఢిల్లీలో అనేక ఇళ్ళు షాపులు తగలబడుతున్నాయి. సీఏఏ కు వ్యతిరేకంగా రెండు నెలలుగా శాంతియుతంగా ఆందోళనలు జరుగుతున్నాయి. |
| ఆజాదీ నినాదాలతో దద్దరిల్లిన ఢిల్లీ రాంజాస్ కాలేజ్ఢిల్లీ రాంజాస్ కాలేజ్ విద్యార్థులపై ఏబీవీపీ మూక చేసిన దాడికి నిరసనగా వేలాదిమంది విద్యార్థినీ విద్యార్థులు ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ మాజీ అధ్యక్షుడు కన్హయ్య మాట్లాడారు.... |
| Statement by Sudha Bharadwaj on false allegations aired on Republic TV I have been informed that Republic TV aired a programme on 4 July 2018, presented by anchor and MD Arnab Goswami as ʹSuper Exclusive Breaking Newsʹ. |
| ఎమ్మెల్యే మనోడే.. ఎవ్వరూ ఏం చేయలేరు..వారిని తగులబెట్టండి...ʹఎమ్మెల్యే మనతో ఉన్నారు.. ఎవ్వరూ మనల్ని ఏం చేయలేరు.. వారిని తగలబెట్టండి..ʹ అక్బర్ఖాన్ను, అతని స్నేహితుడిని కొడుతూ గోరక్షకులు చేసిన వ్యాఖ్యలివి. ఈ ఘటనలో ప్రాణాలతో బయటపడిన అక్బర్ఖాన్ స్నేహితుడు అస్లామ్ పోలీసులకు రాతపూర్వకంగా ఇచ్చిన ఫిర్యాదులో ఈ విషయాలను పేర్కొన్నాడు.
|
| ఈ చిన్నారుల ఆకలి కేకల సాక్షిగా... వాళ్ళను మనమే హత్య చేశాం !అమ్మా ఆకలి అన్నా అన్నం పెట్టలేని స్థితిలో అమ్మ...బాబూ ఓ ముద్దేయండంటూ రోడ్డు మీద బోరుమన్నా పట్టించుకోని జనం... మూడు రోజుల పాటు ఆకలితో ఏడ్చీ ఏడ్చీ ఆ ముగ్గురు చిన్నారులు చనిపోయారు. |
| అవును,దళిత బాలిక కాబట్టే అత్యాచారం చేసి హత్య చేశాం -ఒప్పుకున్న పూజారి,ఇతర నిందితులుఢిల్లీ శ్మశానవాటికలో ఒక పూజారి, మరో ముగ్గురితో కలిసి తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం చేసి హత్య చేసిన ఘటనలో... బాలిక దళితురాలైనందునే ఆమెపై అత్యాచారం చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు. |
| ఏబీవీపీకి భయపడను - అమర జవాను కూతురుʹనేను ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్ ను . ఏబీవీకి భయపడను. నేను ఒంటరిని కాను దేశంలో ప్రతి స్టూడెంట్ నాతో ఉన్నాడుʹ. అని రాసి ఉన్న ప్ల కార్డ్ ను పట్టుకొని ఉన్న తన ఫోటోను ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది గుర్ మెహర్.... |
| మేం ప్రశ్నిస్తాం, తర్కిస్తాం, వాదిస్తాం, విభేదిస్తాం..ఇదే జేఎన్యూ ప్రత్యేకత - ఉమర్ ఖలీద్మిత్రులారా! నాలోని భావోద్వేగాన్ని ఎలా మాటల్లోకి మల్చాలో అర్థం కావడం లేదు. గత నెలాపదిహేను రోజులుగా వేగంగా జరిగిపోయిన సంఘటనలను ఒక క్రమంలో అర్థం చేసుకోవడానికి నేనింకా ప్రయత్నిస్తూనే ఉన్నాను. |
| కేజ్రీవాల్ పై మారణాయుధాలతో దాడిఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పై పంజాబ్ లో మారణాయుధాలతో దాడి జరిగింది అయితే ఈ దాడి నుంచి ఆయన త్రుటిలో తప్పించుకున్నారు.... |