మహమ్మద్ యాసీన్ మాలిక్ - విరామమెరుగని పోరాటానికి చిరునామా
(మాతృక పత్రిక సంపాదకులు, రచయిత, కార్యకర్త రమా సుందరి రాసిన ఈ వ్యాసాన్ని తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేశారు)
యాసీన్ మాలిక్ కశ్మీరీ ప్రతిఘటనా పోరాట నాయకుడు. 1966లో శ్రీనగర్ లోని డౌన్ సిటీలో పుట్టిన యాసీన్ మాలిక్ కశ్మీర్ అత్యంత సంక్షోభ కాలంలో పెరిగాడు అక్కడ. ఆ కాలంలో పుట్టి పెరిగిన పిల్లల జీవన ప్రయాణాన్ని నిర్దేశించినది తల్లిదండ్రులు కాదు. ఆ ప్రాంత అల్లకల్లోల రాజకీయ పరిస్థితులు. వాళ్లను ఉగ్రవాదులు అన్నా, ఫండమంటలిష్టులు అన్నా- ఎవరి ప్రయోజనాలకు అనుగుణంగా ఎవరు ఎలా పిలుచుకొన్నా వారి రాజకీయ భౌతిక పరిస్థితులే వాళ్ల రాజకీయ కార్యాచరణను శాసించాయి అనటం వాస్తవం.
యాసీన్ మాలిక్ ప్రయాణం కూడా అలాగే మొదలయ్యింది. చిన్నతనం నుండే తన దేశంలో పెత్తనం సాగిస్తున్న ఆర్మీని అసహ్యించుకోవటం మొదలు పెట్టాడు. మొదట తాల్ అనే పార్టీని పెట్టి, కొన్ని కార్యకలాపాలను కొనసాగించాడు. 1989లో తీహార్ జైల్లో జరిగిన మక్బూల్ భట్ ఉరితీతకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం చేశాడు. అప్పుడే అరెష్టు అయ్యి నాలుగు నెలలు జైల్లో ఉన్నాడు. 1986లో విడుదల అయ్యాక, ఇస్లామిక్ స్టూడెంట్స్ లీగ్ (ISL) గా తన పార్టీ పేరును మార్చాడు.
1987లో ముస్లిం యునైటెడ్ ఫ్రంట్ (MUF) లో తన పార్టీని భాగం చేశాడు. ఈ MUF అనేక అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసింది. మాలిక్ కి ఎన్నికల మీద నమ్మకం లేకపోయినా మహమ్మద్ యూసుఫ్ షా అనే అభ్యర్ధి కోసం పని చేశాడు. అతను అత్యంత మెజారిటీ గెలుస్తాడని ఓటింగ్ చెబుతూ ఉండగా, నేషనల్ కాన్ఫెరెన్స్ అభ్యర్ధి (ఇది షేక్ అబ్ధుల్లా పార్టీ) అభ్యర్ధి గులాం మొహిద్దీన్ గెలిచినట్లు ప్రకటించారు. యూసుఫ్ షా తో పాటు యాసీన్ మాలిక్ ను కూడా అరెష్టు చేసి జైల్లో పెట్టారు.
ఆ నాడు కశ్మీర్ లో జరిగిన ఈ ఎన్నికల ప్రహసనం కశ్మీర్ లో అనేకమంది యువకుల జీవితాలను మార్చివేసింది. ప్రజాస్వామ్యం మీద పూర్తి విశ్వాసాన్ని వారు కోల్పోయి, ఆయుధాలు పట్టుకోవటానికి పాకిస్తాన్ బోర్డర్ కు తరలి వెళ్లారు. జైలు నుండి బయటకు వచ్చిన యాసీన్ మాలిక్ కూడా అలాగే వెళ్లాడు. వెళ్లక ముందు హిజ్బ్ -ఉల్ -ముజాహిద్దీన్ అనే సాయుధ సంస్థకు నాయకత్వం వహించాడు. వచ్చాక JKLF (జమ్మూ కశ్మీర్ లిబెరేషన్ ఫ్రంట్) లో ముఖ్య సభ్యుడు అయ్యాడు. జమ్ము కశ్మీర్ కు సర్వ స్వాతంత్ర్యం కావాలనేది ఈ సంస్థ డిమాండ్. గెరిల్లా యుద్ధాన్ని ప్రారంభించిన ఈ సంస్థ, ముఫ్తి మహమ్మద్ సయీద్ (అప్పటి భారతీయ హోమ్ మినిస్టర్) కూతురు రుబియా సయీద్ ను కిడ్నాప్ చేసింది. వెంటనే విడిచి పెట్టారు.
మార్చ్ 1990 నాటికి JKLF సభ్యులు వందలాది మంది హతులు అయ్యారు. లొంగిపోవటానికి వెళ్లిన వారిని కూడా ఆర్మీ చంపేసింది. పాకిస్తాన్ తో విలీనానికి ఒప్పుకోకపోవటంతో JKLF కు ఆ దేశం నిధులు ఆపేసింది. గాయపడిన పరిస్థితుల్లో యాసీన్ మాలిక్ పట్టుపడ్డాడు. బయటకు వచ్చిన యాసీన్ మాలిక్ ఆయుధాలను వదిలివేస్తున్నామని ప్రకటించాడు. అప్పటి నుండి గాంధేనియన్ పద్దతుల్లో కార్యకలాపాలను చేస్తున్న JKLF కశ్మీర్ కు విముక్తి కావాలనే తమ లక్ష్యాన్ని మాత్రం విడువలేదు. యాసీన్ మాలిక్ అనేక సార్లు అరెష్టు అవుతూ వచ్చాడు. కశ్మీర్ విషయంగా ఇండియా, పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్లతో అనేక సార్లు చర్చలు జరిపాడు. సఫర్-ఇ- ఆజాదీ (విముక్తి కోసం ప్రయాణం) అనే ప్రచారాన్ని చేపట్టాడు. కశ్మీర్ ప్రజలను మోసం చేసిన ప్రధాన స్రవంతి పార్టీలకు భిన్నంగా యాసీన్ మాలిక్ పూర్తిగా కశ్మీర్ మనోభావాల పక్షానే ఉన్నాడు. ఆయనను ఆర్టికల్ 370 రద్దుకు ముందే మళ్లీ 30పాత కేసులు తిరదోడి అరెష్టు చేసింది బీజేపీ ప్రభుత్వం. ఆయన మీద కొత్తగా మార్చి నెలలో టాడా కేసును పెట్టారు.
తీహార్ జైల్లో ఉన్న యాసీన్ మాలిక్ ఏప్రిల్ 1 నుండి ఆమరణ నిరాహార దీక్ష చేస్తానని ప్రకటించాడు. తన మరణం తరువాత తన శరీర అవయవాలను దానం ఇవ్వమని కోరాడు. తీహారు జైలు నుండి ఆయన రాసిన లేఖను ఆయన సోదరి ఇటీవల విడుదల చేసింది. అందులో కొన్ని ముఖ్యాంశాలు...
ʹనేను 12వ తరగతిలో ఉన్నప్పుడు స్వతంత్ర కశ్మీర్ కోసం స్టిక్కర్లు ముద్రిస్తున్న ఆరోపణతో మొదట 1986లో అరెష్టు అయ్యాను. రెడ్ సిక్స్టీన్ అనే విచారణ కేంద్రంలో 15 రోజులు, పోలీస్ లాకప్ లో 3 నెలలు ఉన్నాను. బయటకు వచ్చి విద్యార్ధి సంఘాన్ని ఏర్పరచాను. అది కశ్మీర్ లో చాలా పాపులర్ అయ్యింది. మేము MUF కోరిక మేరకు అందులో భాగస్వాములం అయ్యాము. మేము పోటీ చేయకపోయినా MUF అభ్యర్ధిత్వానికి మద్దతు ఇచ్చాము. ఫలితాల రోజు అంతా తారుమారు అయ్యింది. కౌంటింగ్ హాల్ లోనే నన్ను అరెష్టు చేశారు. నా మీద విపరీతమైన హింసా పద్దతులు ఉపయోగించటం వలన, నా రక్తం కలుషితం అయ్యింది. శ్రీనగర్ పోలీస్ హాస్పిటల్ లో నన్ను చేర్చారు. అక్కడే నా హార్ట్ వాల్వ్ డామేజ్ అయ్యిందని చెప్పారు. మమ్మలందరిని PSA కింద అదుపులో ఉంచుకొన్నారు.
జైలు నుండి బయటకు వచ్చాక మేము భారతదేశంలో అహింసా ప్రజాస్వామిక రాజకీయ పోరాటానికి స్థానం లేదని నిర్ణయించుకొన్నాము. గాంధీని, మార్టిన్ లూథర్ కింగ్ నీ, నెల్సన్ మండేలా ను మార్గదర్శకులగా తీసుకొనే ఈ దేశం ఆ పద్దతులకు గౌరవం ఇవ్వటం లేదని అర్థం చేసుకొన్నాము. భారత స్వాతంత్ర్య సంగ్రామంలో భగత్ సింగ్, చంద్ర శేఖర్ ఆజాద్, అశ్ఫక్ ఉల్లా, రామ్ ప్రకాష్ బిస్మిల్, రాజ్ గురు మొదలైన వాళ్లు ఒక వర్గాన్ని నడుపుతుంటే, గాంధీ ఇంకో మార్గానికి నాయకత్వం వహించాడు. మొదటి వర్గాన్ని అణచివేసిన బ్రిటిష్ ప్రభుత్వం, గాంధీని అరెష్టు చేసినా హింసా కేంద్రాలకు పంపలేదు. గాంధీ శాంతియుత ఉద్యమానికి న్యాయమైన స్థానాన్ని ఇచ్చారు బ్రిటిష్ వాళ్లు. కాంగ్రెస్ పార్టీ ప్రెషర్ కుకర్ లో గాలి బయటకు పోయే మార్గాన్ని ఇచ్చిందని పొగిడారు. కానీ ఇక్కడ కశ్మీర్ లో, అహింసాయుత రాజకీయ కార్యకర్తలకు ఎలాంటి స్థానం లేదని అర్థం అయ్యింది. మేము JKLF పేరుతో తప్పని సరిగా ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చింది.
1990లో నేను మళ్లీ అరెస్టు అయ్యాను. జైల్లో నాతో అనేక మంది ఆఫీసర్లు, రాజకీయ నాయకులు మాట్లాడారు. అప్పటి ప్రధాన మంత్రి చంద్రశేఖర్ తో డిన్నర్ కు రమ్మని బలవంతం చేశారు. నేను ఒప్పుకోలేదు. నా ఆరోగ్యం దెబ్బతినటంతో నన్ను AIIMS కు పంపారు. అక్కడే నాకు హార్ట్ సర్జరీ జరిగింది. అక్కడ కుల్ దీప్ నయ్యర్, రాజ్ మోహన్ గాంధీ నన్ను చూడటానికి వచ్చారు. అనేక రాష్ట్రాల గవర్నర్లు వచ్చారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా వచ్చారు. ఒక మీటింగ్ లో అప్పటి హోమ్ మంత్రి రాజేష్ పైలెట్ కూడా నాతో మాట్లాడి కశ్మీర్ గురించి తెలుసుకొన్నారు. వారంతా కశ్మీర్ లో శాంతి స్థాపనకు ఇంకో అవకాశం ఇవ్వమని కోరారు. కశ్మీర్ లో శాంతియుత రాజకీయ పోరాటం మీద ప్రభుత్వం ప్రయోగించిన హింస వలన ఇదంతా జరిగిందన్ననా వాదనను అంగీకరించినట్లే కనిపించారు. విషయాలు తమకు సరిగ్గా తెలియలేదని పశ్చాత్తాపాన్ని ప్రకటించారు.
కశ్మీర్ సంఘర్షణకు అంతిమ గీతం పాడాలంటే అర్థవంతమైన చర్చలు జరగాలని ప్రతిపాదించాను. జేకేఎల్ఎఫ్ సభ్యులమీద పెట్టిన కేసులు తీసివేయాలని కోరాను. ఆ ప్రకారంగా భారత ప్రభుత్వం హామీతో, 1994లో మేము ఆయుధాలు వదిలేశాము.
ఆ నిర్ణయం మమ్మల్ని చాలా అప్రసిద్ధులని చేసింది. ప్రమాదకరం కూడా అయ్యింది. నన్ను విద్రోహి అన్నారు. కొంతమంది మిలిటెంట్లు నన్ను కిడ్నాప్ కూడా చేయారు. నా సహచరులు ప్రాణాలు కోల్పోయారు. అయినా మా నిర్ణయం మీద మేము గట్టిగా నిలబద్దాము. ఆ సమయానికి 20000 మంది సభ్యులు కశ్మీర్ లో ఆయుధాలు పట్టుకొని ఉన్నారు.
అటల్ బీహార్ వాజ్ పాయ్ 2000 లో జరిపిన ఇంకో రంజాన్ ఆయుధ విరమణ చర్చల్లో కూడా మేము పాల్గొన్నారు. ఇప్పటి NSA చీఫ్ అజిత్ కుమార్ దోవల్ కూడా నన్నుఅప్పుడు కలిశాడు. మేము మనస్ఫూర్తిగా అంగీకరించాము. 2002లో శాంతియుత పోరాటం కోసం కశ్మీర్ లో సంతకాల సేకరణ మొదలుపెట్టాము. రెండున్నర సంవత్సరాలు కశ్మీర్ లోని ప్రతిగ్రామానికి, బడులకు, యూనివర్శిటీలకు తిరిగాము. 15 లక్షల సంతకాలు సేకరించాము.
2006లో మన్ మోహన్ సింగ్ కు ఈ సంతకాలను సమర్పించాను. చర్చలు చేయమని అభ్యర్ధించాను. 2009లో చిదంబరం మళ్లీ కొన్ని ప్రయత్నాలు చేశాడు. 2010లో అన్ని పార్టీల పార్లమెంటరీ డెలిగేషన్ కశ్మీర్ కు వచ్చింది.
ప్రియమైన మిత్రులారా!
1994 నుండి ఇప్పటి వరకూ మేము JKLF గా కశ్మీర్ సమస్య పరిష్కారం కోసం ఎంతో కృషి చేశాము. గత 30 సంవత్సరాలుగా మా JKLF లో ఎవరూ ఎలాంటి సాయుధ గ్రూపు చర్యలను సపోర్ట్ చేయలేదు. ఈ కాలంలో మా మీద ఎలాంటి కేసులు కూడా లేవు. పీవీ నరసింహారావు, హెచ్ డి గౌడ, ఐ కె గుజ్రాల్, అటల్ బీహార్ వాజ్ పేయి -ప్రధాన మంత్రులుగా ఉన్నపుడు, 1994లో ఇచ్చిన ప్రమాణాన్ని వారు గౌరవించారు. నరేంద్ర మోడి మొదటి ఐదు సంవత్సరాల పాలనలో కూడా మా మీద ఎలాంటి నిర్బంధం లేదు. కానీ హటాత్తుగా 2019లో నా మీద 30 ఏళ్ల క్రితం కేసును తిరగదోడారు. నా సహచరులతో పాటు నా మీద టాడా కేసు పెట్టారు. టాడా కోర్టు ముందు హాజరు పర్చకుండా నన్ను సిబిఐ ఆపుతోంది. వీడియో లింక్ కాన్ఫరెన్స్ జర్పుతున్నారు. దాని ద్వారా నేను నా తరఫు వాదనలను వినలేకపోతున్నాను. నేను మాట్లాడాలి అనుకొన్నపుడు వాల్యూమ్ ను మ్యూట్ చేస్తున్నారు. లేక ఆఫ్ లైన్ లోకి వెళ్లిపోతున్నారు. జడ్జి కూడా పోలీస్ ఆఫీసర్ లాగానే వ్యవహరిస్తున్నాడు. రాజకీయ ఉద్దేశాలు ఉన్న ఈ కేసును జడ్జీలు ఇంకో అధ్వానంగా కఠినతరం చేస్తున్నారు.
అందుకే నేను ఏప్రిల్ 1 నుండి ఆమరణ నిరాహారదీక్షకు వెళుతున్నాను. 1994లో నాకు భారత ప్రభుత్వం చేసిన ప్రమాణాన్ని గౌరవించనందుకు ఈ నేను ఈ నిర్ణయం తీసుకొన్నాను. ఈ అగౌరవ జీవితం కంటే గౌరవప్రద మరణం మేలనుకొంటున్నాను. నా కీలక అవయవాలను నా మరణం తరువాత అవసరం అయినవారికి దానం చేయమని ఇంతకు ముందే రాశాను. నా చివరి కోర్కెను అందరూ గౌరవిస్తారని భావిస్తున్నాను. నా నిరాహారదీక్షలోనే నా ఆఖరు శ్వాస ఆగాలని నేను కోరుకొంటున్నాను.
ప్రతిఘటనా పోరాటం వర్ధిల్లాలి.
విముక్తి పోరాటం వర్ధిల్లాలి.
మహమ్మద్ యాసీన్ మాలిక్
తీహార్ జైల్ నంబర్:7
Keywords : kashmir, jammu kashmir, yaseen malik, JKLF
(2024-03-18 13:47:44)
No. of visitors : 1073
Suggested Posts
| kashmir: UAPA కింద 15 ఏండ్ల బాలుడు అరెస్ట్ జమ్ము కశ్మీర్ కుప్వారా జిల్లా బుమ్హామా గ్రామానికి చెందిన ముగ్గురు యువకులతో కలిపి 15 ఏండ్ల బాలుడు జహాబ్ పై చట్టవిరుద్ధ కార్యకలాపాల నివారణ చట్టం (UAPA) కింద కేసు నమోదు చేశారుపోలీసులు. ఈ నలుగురిని మే 29 న పోలీసులు అరెస్టు చేశారు |
| కథువా నిందితులకు అనుకూలంగా మళ్ళీ ర్యాలీ తీసిన బీజేపీ నేతలు - మెహబూబా ముఫ్తీపై బూతుల వర్షం తంలో ఇలాంటి ర్యాలీ నిర్వహించినందుకు జమ్ము కాశ్మీర్ కు చెందిన బీజేపీ మంత్రి లాల్ సింగ్ ను మెహబూబా ముఫ్తీ ప్రభుత్వం గత నెలలో మంత్రి పదవి నుంచి తొలగించింది. ఇప్పుడు అతని తమ్ముడు రాజేందర్ సింగ్ అద్వర్యంలో మళ్ళీ ర్యాలీ నిర్వహించారు. |
| హక్కుల కార్యకర్తను మావోయిస్టుగా మార్చే ప్రయత్నం చేసిన పోలీసులు
ʹసివిల్ డ్రెస్లో ఉన్న పోలీసులు ఇద్దరు నన్ను గట్టిగా పట్టుకుంటే మరొకరు, నా నడుముకి రివాల్వర్ ఎక్కుపెట్టి బొలెరోలోకి లాగినప్పుడు, నేను చాలా భయపడ్డాను. వీళ్ళు నన్ను థర్డ్ డిగ్రీ చిత్రహింసలకు గురి చేయడమో లేదా, ఎన్కౌంటరే చేసేస్తారేమోననిపించింది.ʹ |
| ʹStop Intimidation and Harassment of Masrat Zahraʹs Familyʹ: NWMIThe Network of Women in Media, India, expresses its outrage at the harassment and violence meted out to the elderly parents of award-winning Kashmiri photojournalist and NWMI member Masrat Zahra. Such harassment of vulnerable family members is an abhorrent strategy of intimidation that must be strongly condemned. |
| మహిళా జర్నలిస్టుపై UAPA కేసు - దేశవ్యతిరేక ప్రచారం చేస్తున్నారని ఆరోపణఓ మహిళా ఫోటో జర్నలిస్టుపై జమ్ము కాశ్మీర్ పోలీసులు UAPA కేసు నమోదు చేశారు. జమ్ము కాశ్మీర్ లో ఫోటో జర్నలిస్టుగా పనిచేస్తున్న మస్రత్ జహ్రా తన ఫేస్ బుక్ పోస్టులతో యువతను రెచ్చగొడుతోందని, దేశవ్యతిరేక పోస్టులను పోస్ట్ చేస్తున్నట్టు తమకు విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అందిందని పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు. |
| కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ యిల్లు దురాక్రమణ, భీభత్సంలాక్డౌన్ సమయంలో తన సోదరి ఇంట్లో వుంటున్న కశ్మీర్ టైమ్స్ ఎడిటర్ అనురాధ భసిన్ అక్టోబర్ 5, ఆదివారంనాడు తన ఇంటికి వెళ్లినప్పుడు ఇల్లంతా భీభత్సంగా వుండటమే కాకుండా, పడకగదిలో మంచం మీద డాక్టర్ ఇమ్రాన్ గనై అనే వ్యక్తి పడుకొన్నాడు. అతనితో పాటు కొంతమంది సెక్యూరిటీ సిబ్బంది కూడా ఉన్నారు. |
| kashmir:పడవ ప్రమాదం పై వాట్సప్ లో స్టేటస్ పెట్టినందుకు జర్నలిస్టు అరెస్టుగతంలో పడవ ప్రమాదంలో చనిపోయిన వారి వర్ధంతి సందర్భంగా వాళ్ళ ఫోటోలను వాట్సప్ స్టేటస్ గా పెట్టుకున్నందుకు ఓ జర్నలిస్టుపై కేసు నమోదు చేశారు జమ్ము కశ్మీర్ పోలీసులు. |
| ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా సమ్మెకు దిగిన జమ్ముకశ్మీర్ విద్యుత్ ఉద్యోగులు- ఆర్మీని దించిన ప్రభుత్వంమోడీ-షా ప్రభుత్వం భారత రైతాంగ పోరాట అణిచివేతకు బరితెగించి భంగపడింది. నాగాలాండ్ ప్రజల్ని టెర్రర్ చేయబోయి చతికిల పడింది. విదేశీ యుద్దాలకై శిక్షణ ఇచ్చి నిర్మించిన ఇండియన్ ఆర్మీని ఇండియన్ పౌరులపై యుద్దానికి వాడుకుంటోంది. ఇప్పుడు జమ్మూ& కాశ్మీర్ లో ఆర్మీ మరో క్రూర ఫాసిస్టు చర్యకు బరితెగిస్తోంది. |
| kashmir: మస్రత్ జహ్రా కుటుంబంపై వేధింపులు తక్షణం ఆపివేయాలి -NWMIఅవార్డు గ్రహీత, కశ్మీరీ ఫోటో జర్నలిస్ట్, NWMI సభ్యురాలు మస్రత్ జహ్రా వృద్ధ తల్లిదండ్రులను వేధింపులు, హింసకు గురిచేయడం పట్ల నెట్ వర్క్ ఆఫ్ ఉమెన్ ఇన్ మీడియా (NWMI), ఇండియా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. |