ʹమానవ విషాదంలోనూ మెజార్టీ హిందూ మనస్తత్వాన్ని రెచ్చగొట్టడం కరోనా కంటే ప్రమాదకరం - విరసంʹ
ప్రపంచ యుద్దం తర్వాత మానవాళి ఎదుర్కుంటున్న అతిపెద్ద విపత్తు కరోనా వైరస్ అని ఏకంగా ఐక్యరాజ్య సమితి ప్రకటించింది. కరోనాపై ప్రతీ దేశం శక్తిమేరకు పోరాడుతున్నాయి. కాని మన దేశంలో కరోనాపై చిత్తశుద్ది కలిగిన పోరాటం లేకపోగా.. దాన్ని ఒక మతానికి అంటగట్టే ప్రయత్నాలు విజయవంతంగా సాగుతున్నాయి. ఒక వర్గం ప్రజలను భయబ్రాంతులకు గురి చేయడమే కాకుండా.. వారిని నిస్సహాయులుగా, ఒంటిరి వాళ్లుగా నిలబెడుతున్నాయి. ఈ విషయంలో మోడీ, అమిత్ షాల ఫాసిస్టు విధానాలను విరసం గర్హిస్తోందని.. వీరికి వత్తాసు పలుకుతు వార్తలు ప్రసారం చేస్తున్న మీడియా వైఖరిని ఖండిస్తున్నట్లు విప్లవ రచయితల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. శనివారం (04.04.2020) విడుదల చేసిన ఆ ప్రకటన యధాతథంగా...
----------------------------------------------------------------------------
మానవజాతి ఐక్యతను తక్షణ అవసరంగా ముందుకు తెచ్చిన కరోనా సంక్షోభ కాలంలో ఆ మహమ్మారి ముందు మనుషులను ఏకాకులుగానూ, నిస్సహాయులుగానూ నిలబెడుతున్న మోదీషా హిందూ ఫాసిస్టు విధానాలను విప్లవ రచయితల సంఘం గర్షిస్తోంది. ఢిల్లీలో జరిగిన తల్లీగీ జమాత్ సదస్సును అడ్డుపెట్టుకొని ముస్లింలకు, వారి ఇస్లామ్ విశ్వాసాలకు ఉగ్రవాదాన్ని అంటగట్టేలా సాగుతున్న ప్రెస్, మీడియా కథనాలను ఖండిస్తున్నాం. ఆర్ఎస్ఎస్ యే ఈ దేశానికి పట్టిన పెద్ద వైరస్ అని నినదించాల్సిందిగా దేశ ప్రజలను కోరుతున్నాం!
కరోనా భారతదేశంలో మత రూపం తీసుకున్నది. ఈ వైరస్ వ్యాప్తి గురించిన శాస్త్రీయ విశ్లేషణలన్నీ పక్కకుపోయి గత వారం రోజులుగా భారదేశంలో నిజాముద్దీన్ మర్కజ్ కేంద్రంగా కరోనా చర్చ నడుస్తోంది. ఢిల్లీ మత కార్యక్రమంలో పాల్గొన్నవారి నుంచి కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయనే వాస్తవానికి పరిమితమైతే అభ్యంతరం లేదు. కానీ ముస్లింల చుట్టూ, ఇస్లాం చుట్టూ ఈ వైరస్ ను తిప్పుతున్నారు. ఆ మత సంస్థకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయనే దాకా ఈ దుష్ప్రచారం సాగడం ఎవరికైనా అభ్యంతకరమే కావాలి. ముస్లింల ప్రస్తావన రాగానే ఉగ్రవాదం గుర్తుకు రావడమనే మెజారిటీ మత మానసిక స్థితి ఇంతటి విపత్తులో కూడా పదిలంగా ఉంది. అదే శివరాత్రి ఉత్సవాలో, శ్రీరామనవమి వేడుకలో కరోనా హాట్ స్పాట్లుగా మారితే ఇలాగే హిందుత్వ చర్చ చేస్తారా? ఆ వేడుకలకు, వాటిని ఆర్గనైజ్ చేసిన సంస్థలకు ఉగ్రవాదంలాంటి వాటితో సంబంధం అంటగడతారా?
మార్చి రెండో వారం నుంచి దేశంలో కేవలం తల్లీగీ జమాత్ మత కార్యక్రమం ఒక్కటే జరగలేదు. గత నెల 23వ తేదీ లాక్ డౌన్ ప్రకటించే వరకు అన్ని మతాల కార్యక్రమాలు జరిగాయి. ఆ తర్వాత ఆగిపోయాయని కాదు... నిన్నటి శ్రీరామనవమి వేడుకలు ఎంత గౌరవప్రదంగా జరిగాయో చూశాం. ఢిల్లీ జమాత్ కు విదేశీయులు రావడం వల్ల వైరస్ వ్యాపించి ఉంటే ఆ కోణంలో అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. అసలు విమానాశ్రయాల్లో పరీక్షలు జరపకుండా, మార్చి చివరి వారం దాకా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా నిర్లక్ష్యం వహించిన భారత ప్రభుత్వానిది బాధ్యత అవుతుంది గాని వ్యాధిబారిన పడిన బాధితులది ఎలా అవుతుందనే కనీస విచక్షణ మీడియాకు ఎందుకు లేకుండాపోయింది?
ఇక్కడ ʹముస్లింలుʹ అంటూ చర్చిస్తుండటం ఏమిటి? మతంలోని గుడ్డితనమే సమస్య అయితే అది అన్ని మతాలకూ వర్తిస్తుంది. కానీ ఇస్లాంను మాత్రమే ఈసడిస్తూ మాట్లాడుకోవడం హేతుచింతన అనిపించుకోదు. అది మెజారిటీ హిందుత్వ మనస్తత్వం. ʹకరోనా మనల్ని ఏం చేయదʹని ముస్లిం మత పెద్దలు అన్నట్లు ఇప్పుడు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. ఈ మాట మొదట అన్నది హిందూ మత పెద్దలే. సంఘ్ పరివార్ మూక ఆవు మూత్రం తాగితే సరి...కరోనా మన దరిదాపులకు రాదని ప్రచారం చేసింది. హిందువుగా బతికితే కరోనా రాదని అన్న వాళ్లూ ఉన్నారు. నిజానికి, ఏ మత పెద్దలు, మత గ్రంథాలు, విశ్వాసాలు మానవులను కాపాడలేవని, ఎప్పటికైనా మనుషులే ఈ విపత్తును నిలువరించగలరనే అతి ముఖ్యమైన సంకేతం కరోనా అందించింది. అంటే ప్రకృతి-మనిషి అనే అతి మౌలికమైన విషయం దగ్గరికి ఈ వైరస్ మనల్ని లాక్కెళ్లింది. ఏ మత విశ్వాసానికీ కరోనా వంటి వైరస్ లోబడదు. ముస్లిం మత పెద్దల అశాస్త్రీయమైన మాటలకు హిందూ మతవాదులను పోటీతేవడం కాదు ఇది. ఏ మతమైనా మనుషుల్ని హేతుబద్ధంగా ఆలోచించనీయనేది స్పష్టం!
అసలు సంగతి ఏమంటే- ఏ విపత్తునైనా, సంక్షోభాన్నయినా ఆర్ఎస్ఎస్ వాడుకుంటుంది. దాన్ని ముస్లింల మీద ఎక్కుపెడుతుంది. వాళ్లను బోను ఎక్కిస్తుంది. వాళ్లంటే మెజారిటీకి ద్వేషం కలిగేలా చేస్తుంది. ఢిల్లీ జమాత్ వల్ల కరోనా పాజిటివ్ కేసులు పెద్ద ఎత్తున పెరిగిన మాట వాస్తవమే. కానీ ఇప్పటిదాకా దేశంలో నమోదైన మిగతా కేసుల విషయంలో ఉన్న సంయమనం ఇప్పుడు ఎందుకు కోల్పోతున్నారు? ఏ కారణం వల్ల వైరస్ వ్యాపించినా అది ప్రమాదమే. దానికి కావలిసింది నియంత్రణ చర్యలు. దాని మీద శాస్త్రీయ అవగాహన పెంచుకోవాల్సిన సమయంలో ఒక మతాన్ని టార్గెట్ చేయడం మత వాదం కాక మరేమవుతుంది? ముస్లింల విషయంలో అది పక్కా ఆర్ఎస్ఎస్ వాదన అవుతుంది. హిందూ మనస్తత్వాన్ని ఈ సందర్భంలో కూడా రెచ్చగొట్టాలనుకోవడం కరోనా కంటే ప్రమాదకరం. ముస్లింలను ఒక చివరికి తోసేయడానికి దేన్నయినా వాడుకోడానికి సిద్ధంగా ఉండే ఆర్ఎస్ఎస్ కు ఇప్పుడు ఇది దొరికింది. దాని దృష్టిలో సోషల్ డిస్టెన్స్ అంటే ఇదే. మనుషులను ఒంటరి చేయడం! ఈ ధోరణి పెరిగే కొద్దీ హిందూ మెజారిటీ మనస్తత్వం బలపడుతూ ఉంటుంది. ఆర్ఎస్ఎస్ కు కావాల్సింది ఇదే! కాగల కార్యం కరోనా తీర్చినా సరే ఆర్ఎస్ఎస్ ఆనందిస్తుంది. అందుకే సామాజిక మాధ్యమాల్లో హిందూ మనస్తత్వం కరోనాకంటే వేగంగా బైటపడి విస్తరిస్తోంది. సోషల్ మీడియాలో ఈ ఆపద్కాలంలో అసత్య ప్రచారం చేస్తే చర్యలు తీసుకుంటామని అంటున్న ప్రభుత్వం ఈ దుష్ప్రచారాలు చేసే వాళ్లను ఏమీ అనడం లేదు. ఇదిలా ఉండగా ఫేస్ బుక్ లో ఈ దుష్ప్రచారాన్ని ప్రశ్నిస్తూ పోస్టు రాసిన ప్రొ.సూరేపల్లి సుజాత మీద తెలంగాణ పోలీసులు కేసు నమోదు చేశారు.
ఇటువంటి కారణంతోనే ద వైర్ ఎడిటర్ సిద్ధార్థ వరదరాజన్ మీద ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కేసు పెట్టింది. అక్కడి యోగీ ప్రభుత్వం తమ రాష్ట్రంలోని మదరసాల మీదికి, ఇతర ముస్లిం సంస్థల మీదికి పోలీసుల్ని ఉసిగొల్పాడు. ఇప్పటికే ఢిల్లీలోని తల్లీగ్ సంస్థ ప్రధాన కార్యాలయాన్ని పోలీసులు మూసేశారు. ఆ సంస్థ నాయకులను అదుపులోకి తీసుకున్నారు. మోదీషాల బంటు అజిత్ దోవల్ కూడా రంగంలోకి దిగాడు. వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ కేంద్రాన్ని కూల్చివేసే ఆలోచనలు దోవల్ నాయకత్వంలో సాగుతున్నట్టు వస్తున్న వార్తలు కలవరపెడుతున్నాయి.
మిత్రులారా,
ఇప్పుడు తప్పుబట్టాల్సింది ముస్లింలనో, హిందువులనో కాదు! పాలకులను బోను ఎక్కించాలి. గంభీర ప్రసంగాలు, చప్పట్లు కొట్టడం, పళ్లేలు మోగించడం, దీపాలు ఆర్పడం వంటి రూపాయి ఖర్చు లేని కబుర్లు చెప్పడం తప్ప నోటికి కప్పుకోడానికి మాస్కులు కూడా ఇవ్వలేని ఈ పాలకులను మనం నిలదీయాలి. ఆ పనిని వదిలేసి నిజాముద్దీన్ కేంద్రంగానే వైరస్ పెరుగుతున్నదంటూ, ముస్లింలను ఆ సాకుతో మరోసారి ʹచర్చనీయాంశంʹగా మార్చిన ఆర్ఎస్ఎస్ ట్రాప్ లో పడటం ఎవరికీ సరికాదని విప్లవ రచయితల సంఘం విజ్ఞప్తి చేస్తోంది.
అరసవిల్లి కృష్ణ
బాసిత్
రివేరా
కృష్ణా బాయి
జి కల్యాణరావు
రత్నమాల
అరుణ్
సీఎస్ఆర్ ప్రసాద్
వి. చెంచయ్య
విప్లవ రచయితల సంఘం
తేది: 04.04.2020
Keywords : Virasam, Corona, Modi, Amit Shah, Fascist, Jamat, Muslims
(2024-03-30 00:06:16)
No. of visitors : 831
Suggested Posts
0 results