ఇప్పుడు పోరాటం ఒక్కటే...మన ఉనికిని నిలబెడుతుంది -అరుంధతీ రాయ్
"భయభీతిని గొలిపే అన్యాయాన్ని సాధారణ స్థితిగా ఎలా ఎంచగలం ? దీన్ని మనం ఏమాత్రం భరించలేం. "
ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజల కనీస ప్రాథమిక డిమాండ్లు అయిన ఆహారం, ఆశ్రయం, ఆరోగ్యం, విద్య, కనీస మూలవేతనాలని నెరవేర్చమని అడుగుతున్నాం. ఇవ్వన్నీ కూడా ఒక సాధారణ మానవ సమాజంలో ప్రజలకందాల్సిన అత్యవసరాలు. అవి తీర్చాల్సిందిగా అడగడానికి మనం ఇక్కడ ఇలా కలుసుకుంటున్నాం. ఇలా అడగాల్సి రావడం ఒక విషాదం. అయితే మనం ఎవర్ని అడుగుతున్నాం ? మనం ఆడిగేవి, మనం చెప్పేవి అసలెవరైనా వింటున్నారా ? కోవిడ్ - 19 లో బాధితులు సమాజంలో పేరుకుపోయిన మురికిని అత్యంత హీనస్థాయిలో భరించారు. మనం మన సమాజానికీ, భూగోళానికీ ఏమి చేసేమో.. అదే ఇప్పుడు మన ముందుకొచ్చి నిలబడింది. అంతా బహిరంగం అయిపోయిందిప్పుడు. ఎవరికివారు వేరువేరుగా ఉండటమే నాగరికత అయిపోయిందిప్పుడు. ఈ అత్యాశని సంతోషం అనుకుంటున్నాం. ఎప్పటిలాగే భయం, భీతి గొలిపే దూరాగతాన్ని వ్యాపారం అని పిలుస్తున్నాం. ఇప్పుడు అంతా ఛిద్రమైపోయింది. పరిస్థితి పేలాడానికి సిద్ధంగా ఉన్నట్టుగా ఉంది. తినే పళ్లలో పేలుడుపదార్ధాలు పెడుతున్నారు. ఇంతవరకూ చేసిన పరిశోధనలు, రాసుకున్న వ్యాసాలు అన్నీ గాల్లో వేలాడుతున్నాయి.
మానవసమాజం చరిత్రలో ఇటువంటి సందర్భం ఒక్కసారి కూడా వొచ్చి ఉండదు. కోటానుకోట్లమంది లాక్ డౌన్ చేయబడ్డారు. గ్లోబ్ మొత్తంగా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది. అందరిమీదా ఒకేలాంటి అధికారం రుద్దబడింది. అన్నిచోట్లా రసాయనాలతో ముంచెత్తారు. కొన్ని దేశాలు మొత్తంగా కబళించుకుపోతున్నాయి. కొన్ని ప్రదేశాల నుంచీ జనం ఖాళీ చెయ్యబడుతున్నారు. కోట్లాది మంది ప్రజలు తమ ఉపాధిని కోల్పోయారు. ఇండియాలో వందకోట్ల పైబడిన జనం మీద కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే 55 రోజుల లాక్ డౌన్ ఒక్కసారిగా విధించబడింది. లక్షలాది మంది శ్రామిక ప్రజలు అలా రోడ్లమీద నిలబడిపోయారు. తినడానికి తిండి లేదు, ఉండటానికి నీడ లేదు, ఊళ్ళకి వెళ్ళడానికి రవాణా సౌకర్యం లేదు. వాళ్ళందరూ అలాగే చేసేదేంలేక తమ ఇళ్ళకి లాంగ్ మార్చ్ నడక ప్రారంభించారు. ఆకలికి, ఎండల వేడికి, మితిమీరిన నడక వలన కలిగిన శ్రమకి, అన్నింటికీ మించి ఆందోళన వలన కలిగిన భయానికి కూడా లెక్కలేనంత మంది చనిపోయారు. ట్రాఫిక్ ప్రమాదాల వలన కూడా అనేకమంది చనిపోయారు. ఎక్కడికీ వెళ్ళడానికి లేదు. ఎక్కడా ఉండటానికి లేదు. కొందరు ఎక్కడికక్కడ ఆపివేయబడ్డారు. వాళ్ళమీద క్రిమిసంహారక మందుల్ని ఏవో జంతువుల మీద జల్లినట్టుగా జల్లారు. పోలీసులు లాఠీలతో చితకబాదారు. లక్షలాదిగా తమ గ్రామాలకి బయల్దేరిన వాళ్లంతా ఆకలితో, నిరుద్యోగంతో తమ గ్రామాల వైపు సాగిపోయారు. ఇదంతా మానవత్వం మీద జరిగిన పెద్ద దాడి. దీన్ని మనం గుర్తించాలి. మనం ఇప్పుడు తప్పక మేల్కొనాల్సి ఉంది.
ʹ ఆకాశం నిర్మలంగా , స్వచ్ఛంగా ఉంది.. పక్షుల పాటలు అంతటా వినపడుతున్నాయి. వన్యప్రాణులు మరోసారి నగరంలో రోడ్లమీదికి వస్తున్నాయి. ʹ .. ఇవ్వన్నీ పెద్దఎత్తున మనకి ప్రసారం చేసి, తమ లాక్ డౌన్ చర్య వలన ఎంతటి ఉపకారం జరిగిందో చెప్పాలను కున్నారు. రెండు ప్రపంచాల మధ్యనా ఈ పాండమిక్ అన్నిచోట్లకీ చేర్చబడింది. ఇప్పుడు ప్రశ్న ఏమిటంటే మనం ఇందులోంచి ఎలా బయట పడగలం అనేదే. మనం చచ్చిపోతున్నామా ? లేక తిరిగి పుడుతున్నామా ? మన పుట్టుకలకీ, మన చావులకీ వ్యక్తులుగా మనకి పెద్దగా స్పృహకి స్పష్టంగా ఉండకపోవచ్చు కానీ... ఒక జాతిగా మాత్రం మనకి కొన్ని వాహకాలు ఉన్నాయి. మనం గనక పుట్టినట్లయితే.. లేదా పుట్టాలని అనుకుంటున్నట్టయితే గనుక మనం తిరిగి లేవాలి. విప్లవం చెయ్యాలి. దానం ధర్మం ఇక్కడ పనిచెయ్యవు.
ఛారిటీ చూడ్డానికి బాగానే ఉంటుంది కానీ.. అది మన ఆగ్రహాన్ని దయనీయమైన స్థితిలోకి నెట్టివేస్తుంది. దానం చెయ్యడం, సహాయం చెయ్యడం లాంటివి.. అవి అందుకునే వ్యక్తుల్ని హీనులుగా కుదించి వేస్తుంది. న్యాయంగా తమకు రావాల్సిన వాటికి గానూ ఇచ్చే వ్యక్తుల్ని గొప్పగా చూపిస్తుంది. సాయం అందుకున్న వ్యక్తుల మీద సాయం ఇచ్చిన వ్యక్తులకు అధికారాన్ని దఖలు చేస్తుంది. వాళ్ళకి గొప్ప ఆత్మ సంతృప్తిని, నిర్బరతని ఇస్తుంది. అవన్నీ తమకి ఉండితీరాల్సిన హక్కులు అనుకునేలా చేస్తుంది. జాలితో చేసే దానాలు అమలులో ఉన్న ఈ వ్యవస్థని చెక్కుచెదరకుండా అలాగే యధాతథంగా ఉంచుతుంది. ఇచ్చేవాళ్ళకి అధికారాన్ని, పుచ్చుకునే వాళ్ళకి ఆధారపడి ఉండటాన్నే నేర్పుతుంది.
మన ఫిర్యాదుల్ని అందుకోవడానికి ఇప్పుడు ఇక్కడ ఎవరూ లేరు. ఏనాడో చచ్చిపోయిన వ్యక్తులు మనల్ని పరిపాలిస్తున్నారు. వారి కోరలు మనలోకి చాలా లోతుగా దిగివున్నాయి. ఈ తరుణంలో మనముందు ఉన్న ఏకైక మార్గం పోరాటం ఒక్కటే. బతకడానికి పోరాటం. కాస్త ఊపిరి తీసుకోవడానికి పోరాటం. కనీస హక్కుల కోసం పోరాటం.. !
( ఢిల్లీ FM రేడియోలో ప్రసారం అయిన అరుంధతీ రాయ్ ప్రసంగానికి తెలుగు అనువాదం మోహన సుందరం)
Keywords : arundhati roy, delhi, fm, corona, lockdown, migrants,
(2024-04-03 19:19:30)
No. of visitors : 987
Suggested Posts
0 results