విప్లవ వాగ్గేయకారుడు వంగపండు ప్రసాదుకు నివాళి -విరసం
ప్రముఖ వాగ్గేయ కారుడు వంగపండు ప్రసాదరావుకు నివాళులు అర్పిస్తూ విప్లవ రచయితల సంఘం ప్రకటన
ప్రముఖ విప్లవ కవి, కళాకారుడు వంగపండు ప్రసాద్ ఈ ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. విజయనగరం జిల్లా పెదబొండపాడు ఆయన సొంతూరు. చాలా కాలంగా పార్వతీపురంలో ఉంటున్నారు. శ్రీకాకుళ పోరాట ఉత్తేజంతో ఆయన విప్లవ సాహిత్య, సాంస్కృతికోద్యమంలోకి వచ్చారు. అప్పటికే ప్రజల నుంచి ప్రజలకు విప్లవ సందేశాన్ని అందించేందుకు మౌఖిక, దృశ్య కళారూపాల అవసరాన్ని విప్లవ రచయితల సంఘం ముందుకు తీసుకొచ్చింది. విప్లవోద్యమ కవులు పాటను విప్లవ అవసరానికి తగినట్లు తీర్చిదిద్దుతున్నారు. ఆ సమయంలో వంగపండు ఉత్తరాంధ్ర అత్యద్భుత మాండలికంతో, నుడికారంతో, సహజ సౌందర్యవంతమైన ప్రజల బాణీలతో విప్లవ సాహిత్యోద్యమంలోకి ప్రవేశించారు. శ్రీకాకుళ పోరాట విశిష్టతనే కాదు, మొత్తంగా నక్సల్బరీ పంథాలో సాగుతున్న వర్గపోరాటాలను ఎత్తిపడుతూ ఏం పిలడో.. అనే అజరామరమైన పాటతో ఊపునందించారు. ఎమర్జెన్సీ నాటికే ఆయన రాసిన భూమి భాగోతం విస్తృత ప్రచారమైంది. అప్పుడూ, ఆ తర్వాత వేలాది చోట్ల ప్రదర్శించారు. అప్పటికే ఆయన రాసిన పాటలు ఏరువాక పేరుతో విరసం ప్రచురించింది. అందులోని పాటలన్నీ శ్రీకాకుళ పోరాటం సెట్ బ్యాక్ తర్వాత విప్లవ రాజకీయాలను ఉత్తరాంధ్ర ప్రజానీకంలోకి తీసికెళ్లడానికి గొప్పగా దోహదపడ్డాయి. ఆ కాలంలోనే ఆయన సిక్కోలు యుద్ధం ఒగ్గుకథ రాశారు. తద్వారా ఉత్తరాంధ్ర జన జీవితంలోని ఒగ్గుకథ కళా రూపం తెలుగు ప్రజలందరికీ పరిచయం అయింది. శ్రీకాకుళం నిప్పురవ్వను తిరిగి ప్రజ్వరిల్లచేయడంలో విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమం చేసిన యావత్తు కృషిలో ఉత్తరాంధ్ర నుంచి వంగపండు ఆట పాటల పాత్ర గణనీయమైనది. వంగపండు విప్లవ సాహిత్యోద్యమంలోకి వచ్చిన తొలి రోజుల్లోనే ఉందర్రా మాలపేట అనే అద్భుతమైన పాట రాశారు. దళిత జీవిత విషాదాన్ని, పీడిత సాంఘిక అస్తిత్వాన్ని ఆ పాట పొడవునా ఆయన ఆర్ద్రంగా పలికించారు. వెలివాడలను వర్గపోరాట కేంద్రంగా తీర్చిదిద్దాలనే అవగాహన విప్లవోద్యమానికి ఉన్నందువల్ల, అలాంటి ఆచరణ కొనసాగుతున్నందువల్ల వంగపండు ఆ పాట రాయగలిగారు. ఆయన పాటలన్నీ దాదాపుగా విప్లవోద్యమ అవగాహనలను, వైఖరులను అత్యంత కళాత్మకంగా చిత్రించినవే. దీనికి ఉందర్రా మాలపేట లాంటి అత్యుత్తమ ఉదాహరణ ఆరిందం పాట. విప్లవోద్యమం రూపొందించుకున్న వ్యవసాయక విప్లవం డాక్యుమెంట్ మొత్తాన్ని వంగపండు ఈ పాటలో తిరుగులేని విధంగా వర్ణించారు. అందుకే ఎమర్జెన్సీలోనూ, ఆ తర్వాత విప్లవ విద్యార్థుల గ్రామాలకు తరలండి క్యాంపెయిన్లోనూ ఈపాట ప్రధానంగా పాడేవారు. ఆరిందం పాట భూమిలేని నిరుపేదలను, దళితులను వ్యవసాయక విప్లవంలోకి సమీకరించేందుకు, ఉందర్రా మాలపేట పాట దళితులకు సాంఘిక సమస్యలపట్ల ఉత్తేజం కలిగించేందుకు ప్రధానంగా పాడేవారు.
విప్లవోద్యమం ఏ జీనవ క్షేత్రాల్లోకి విస్తరించిందో, ఏ ప్రజా సమూహాల్లోకి వెళ్లిందో ఆ ప్రజల జీవితాన్ని, ప్రత్యేక సమస్యలను, నిర్దిష్ట సాంస్కృతిక విశిష్టతలను పట్టుకొని ఉద్యమ వైఖరిని ప్రతిబింబిస్తూ వంగపండు వందలాది పాటలు రాశారు. వంగపండు ఉరుములు, వంగపండు ఉప్పెన పేర్లతో ఆయన పాటల క్యాసెట్లు వేలాది గ్రామాలకు చేరాయి. లక్షలాది ప్రజల ముందు ఆయన ప్రదర్శనలు నడిచాయి. విరసం ఇరవై ఏళ్ల సభల సందర్భంలో కూడా ఆయన పాటల పుస్తకం, క్యాసెట్ విడుదలయ్యాయి. ఆయన కొన్ని కథలు కూడా రాశారు.
1990లలోని ఆర్థిక పరిణామాలను వెంటనే వంగపండు పట్టుకొని కళారూపాలు రాశారు. ఆర్థిక సాంస్కృతిక రంగంలో తలెత్తిన ప్రతి సమస్య మీద అత్యుద్భుత కళా విలువలతో ఆయన పాటలు 1990లలో కూడా అంతే ప్రజాదరణ పొందాయి. పెట్టుబడి, సామ్రాజ్యవాద వ్యతిరేక అవగాహనను ప్రజల్లోకి తీసికెళ్లాయి. పోరాట ఉత్తేజాన్ని అందించాయి.
రచనలో, ప్రదర్శనలో విప్లవోద్యమ రాజకీయ అవగాహనను అత్యంత ప్రతిభావంతంగా చిత్రించే వంగపండు సొంత జీవితంలో ఒకింత అమాయకంగా ఉండేవాడు. 1990ల చివరికి వచ్చేనాటికి ఆయన సొంత జీవితంలో సమస్యలు తలెత్తాయి. అవి రాజకీయ వైఖరుల్లో కూడా మార్పుకు కారణం అయ్యాయి. అయినా అనేక ప్రయత్నాల వల్ల 2005 రాష్ట్ర ప్రభుత్వానికి, విప్లవోద్యమానికి మధ్య జరిగిన చర్చల కాలం దాకా ఆయన విప్లవ రాజకీయాలతో కొనసాగారు. ఆ రోజుల్లో డజన్ల కొద్ది భారీ బహిరంగ సభల్లో ఆయన తొలినాళ్ల ఉత్తేజంతోనే ప్రదర్శనలు ఇచ్చారు. కొత్త రచనలు చేశారు.
ఆ తర్వాత క్రమంగా విప్లవ రాజకీయాలకు దూరమయ్యారు. బూర్జువా రాజకీయ మార్గాన్ని అనుసరించారు. ఆయన జీవితంలో రెండు దశలనుకుంటే మొదటిది విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలో నిత్య ఉత్తేజితమైనది. శాశ్వతమైనది. ఈ రెండు దశల మధ్య విప్లవ రాజకీయ వైఖరుల విషయంలో వివాదాస్పదంగా, ఊగిసలాటగా సాగిన కాలం కూడా ఉన్నది. చర్చల కాలంలో ఆయన నిర్వర్తించిన సాంస్కృతిక పాత్ర వల్లనైనా ఆయన ఈ సమస్య నుంచి బైటపడి ఉండాల్సింది. కానీ దానికి భిన్నంగా జరిగింది. ఈ రెండో దశలోనే ఆయన ఉత్తరాంధ్ర ప్రాంతీయ ఆకాంక్షల మీద పని చేశారు. శక్తివంతమైన పాటలు రాశారు. అలాగే ఉత్తరాంధ్ర సమస్యలపై రాజకీయ పార్టీ పెడుతున్నట్లు కూడా ప్రకటించారు.
ఈ వైఖరులు, ఒడుదొడుకులు విమర్శనీయమే అయినా ఆయనలోని కవి, కళాకారుడు మనల్ని ఆశ్చర్యానికి గురి చేస్తారు. అద్భుతమనిపిస్తారు. ఉత్తరాంధ్ర జన జీవిత సౌందర్యాన్ని, శ్రీకాకుళం ఆదివాసీ పోరాట పరిమళాన్ని కళా రంగంలో ఒడుపుగా పట్టుకున్న వాగ్గేయకారుడాయన. విప్లవ సాహిత్య సాంస్కృకోద్యమాన్ని శిఖర స్థాయికి తీసికెళ్లడంలో ఆయన తొలి దశ పాత్ర చెరిగిపోనిది. వ్యక్తుల్లోని సృజనాత్మకతను వర్గపోరాటం తట్టి లేపుతుంది. వాళ్లదే అయిన వ్యక్తీకరణ శక్తికి, కళా దృష్టికి ఒక ఆకృతిని ఇస్తుంది. నిర్మాణయుతమైన సమిష్టి ఆచరణే వ్యక్తిలోని ప్రత్యేకతలు వెల్లివిరిసేలా చేస్తుంది. దీనికి వంగపండు ఉత్తమ ఉదాహరణ. ఆయన తొలి దశ పాటలు, కళారూపాలు, ప్రదర్శనలు అన్నీ ప్రజా పోరాటాల్లో, విప్లవ సాహిత్య సాంస్కృతికోద్యమంలో శాశ్వతంగా ఉంటాయి. ఆయనకు విరసం నివాళి.
విప్లవ రచయితల సంఘం
అరసవెల్లి క్రిష్ణ(అధ్యక్షుడు)
బాసిత్ (ఉపాధ్యక్షుడు)
రివేరా(సహాయ కార్యదర్శి)
Keywords : vangapandu prasada rao, virasam, revolution, JNM
(2024-04-13 16:21:12)
No. of visitors : 719
Suggested Posts
| కలకత్తాలో జరుగుతున్న చారుమజుందార్ శత జయంతి ఉత్సవాల్లో విరసం కార్యదర్శి పాణి స్పీచ్ నక్సల్బరీ లేకపోతే భారత పీడిత ప్రజానీకానికి విప్లవ దారే లేకుండా పోయేది. కమ్యూనిస్టు రాజకీయాలు చర్చించుకోవడానికే తప్ప వర్గపోరాట బాట పట్టకపోయేవి. ఆ నక్సల్బరీ దారిని చూపినవాడు చారు మజుందార్. విప్లవ పార్టీకి వ్యూహాన్ని, ఎత్తుగడలను ఒక సాయుధ పోరాట మార్గాన్ని చూపించిన వాడు చారు మజుందార్. |
| ఆదివాసి.. లంబాడా వివాదం - ఎం.రత్నమాలమహారాష్ట్ర ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి తెగగా గుర్తించడం లేదు కనుక ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లంబాడాలను ఆదివాసి షెడ్యూల్డు తెగగా ప్రకటించడంతో దీన్ని అవకాశంగా తీసుకుని మహారాష్ట్ర నుంచి ఆదిలాబాద్ (పాత) జిల్లాకు లంబాడాల వలసలు పెద్ద ఎత్తున వెల్లువలా సాగాయి..... |
| మహాశ్వేతా దేవి - మన తెలంగాణ సాగర హారంః వరవర రావుమన మహా సాగరహారం ʹచలో హైదరాబాద్ అంటూ తెలంగాణ మార్చ్ చేసిన సెప్టెంబర్ 30, 2012 మహత్తర మధ్యాహ్నం మహాశ్వేతాదేవి కూడా మన ఊర్లో ఉన్నారు. ఆ రోజు ఆమెను మన మధ్యకు తెచ్చుకొని ఉంటే.... |
| సెప్టెంబర్ 17 - ఇండియన్ యూనియన్ సైనిక దురాక్రమణ దినం - వరవరరావు1947 ఆగస్ట్ 15న విలీనానికి అంగీకరించకుండా షరతులు విధిస్తూ వచ్చిన నిజాంను నెహ్రూ - పటేల్ ప్రభుత్వం సగౌరవంగా, సాదరంగా చర్చలకు ఆహ్వానించింది. అప్పటికే నిజాంను వ్యతిరేకిస్తూ వీరోచిత పోరాటం నడుపుతున్న కమ్యూనిస్టులను మాత్రమే కాదు, కనీసం కాంగ్రెస్ ను కూడా ఈ చర్చల్లో భాగం చేయలేదు.... |
| అమరుడు బొజ్జా తారకం — ʹనది పుట్టిన గొంతుకʹ - వరవరరావుగోదావరి తెలంగాణలో ప్రవేశించిన నిజామాబాద్ కు 1968లో వచ్చిన తారకం గారు ఇక్కడి మట్టిలోని ఎరుపులోనూ, ఇక్కడి నీళ్లలోని ప్రవాహ గుణంలోనూ కలగలిసిపోయారు. 1968 నుంచి 78 దాకా ఒక దశాబ్దం పాటు విప్లవోద్యమాలకు, విప్లవ సాహిత్యానికి నిజామాబాద్ చిరునామా బొజ్ఞాతారకం.... |
| ఎస్సీ రిజర్వేషన్ వర్గీకరణ పోరాటానికి విరసం మద్దతుఅట్టడుగున ఉన్న మనిషికి ఫలితాలు అందినప్పుడే సామాజిక న్యాయం జరిగినట్టు లెక్క. మాదిగ, డక్కలి, చిందు, మాష్టి, బుడగజంగం, దాసరి, బేగరి కులాలకు ఈ నాటికీ ఎస్సీ రిజర్వేషన్ ఫలాలు అందడం లేదు.... |
|
ʹఅన్నలు మల్లొస్తరు బిడ్డా.. ఆల్లొస్తే వాళ్ళకు గిన్ని మంచి నీల్లో, తిండో పెట్టాలనే బతుకుతాన్నʹఅందుకే అంత నిర్బంధంల కూడా నా కొడుకు అంత్యక్రియలకు వచ్చిన జనాలకు మా ఖిలా వరంగల్ సరిపోలె. ఎక్కడోల్లను అక్కడ అరెస్ట్ చేసినా వచ్చిండ్రు. ఎవరో నక్సలైట్ అట, చిన్న పిల్లగాడేనట, బలే తెలివికల్లోడట అని అనుకుంట జనాలు వచ్చిండ్రు. పద్దెనిమిది నిండి పందొమ్మిది పడగానే చంపేసిండ్రు. |
| కాగడాగా వెలిగిన క్షణం... అమరుడు యెం యెస్ ఆర్ కోసం ... నారాయణ స్వామిఎంత ప్రాణం శ్రీనుది బక్క పలుచగా ఉండేటోడు – ఎక్కడన్న సరిగ్గా తిన్నడో లేదో శరీరం లో బలం సత్తువ ఉన్నదో లేదో – ఆ దుర్మార్గులు పట్టుకొని చిత్రహింసలు పెడుతుంటే ఆ లేత శరీరం ఎంత గోస పడిందో ఎంత హింసకు గురైందో ఎంత అల్లల్లాడిందో – ఆ క్రూరులు చంపేయ్యబోతుంటే, చివరికి మేఘే ఢాకా తార లో సుప్రియ అరిచినట్టు నాకు బతకాలని ఉంది నాకు చావాలని లేదు నాకు బతకాలని ఉంది.... |
| ఉత్తేజకరంగా సాగిన విరసం సాహిత్యపాఠశాల
అంతకుముందు అంతర్జాతీయ శ్రామికవర్గ పతాకావిష్కరణతో కార్యక్రమాలను ప్రారం భించారు. అమరుడు పులి అంజన్న తల్లి సైదమ్మ ఎర్ర జెండాను, సీనియర్ విరసం సభ్యురాలు రత్నమాల విప్లవ రచయితల సంఘం జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా అమరుడు శేషయ్య సోదరుడు సాంబయ్య, అమరుడు వివేక్ తండ్రి యోగానంద్ అమరుల స్థూపాన్ని ఆవిష్క రించారు. |
| ʹఅరుణోదయʹ పై పోలీసుల దాడిని ఖండించిన విరసం తెలంగాణ ఉద్యమంలో ఆట పాటతో ఆరుణోదయ కళాకారులు గ్రామ గ్రామాన తిరిగి ప్రజల్లో ప్రత్యేక తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు తమ వంతు కృషి చేశారు. ఆ సంస్థ కార్యాలయాన్ని దౌర్జన్యంగా మూసేయడం అత్యంత నిరంకుశమైన...... |