భీమాకోరేగావ్ కేసులో సిట్ ఏర్పాటు చేయడానికి మళ్ళీ ప్రయత్నిస్తున్న శరద్ పవార్
జనవరి 1, 2018 న భీమా కోరెగావ్లో జరిగిన హింసాకాండపై దర్యాప్తు చేయడానికి ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) ఏర్పాటు చేసే అవకాశంపై మహారాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం మరోసారి ఆలోచిస్తోంది. ఈ విషయం చర్చించడానికి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సిపి) చీఫ్ శరద్ పవార్ సెప్టెంబర్ 10 న ముంబైలో అత్యవసర సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఎన్సిపి, కాంగ్రెస్ లకు చెందిన మంత్రులు హాజరయ్యారు. నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (ఎన్ఐఏ) చేస్తున్న ఎల్గార్ పరిషత్ దర్యాప్తులో అరెస్టు అయిన వారి కేసుల నిర్వహణలో ప్రత్యక్షంగా పాల్గొన్న పలువురు కార్యకర్తలు, న్యాయవాదులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సమస్యపై పవార్ ఆసక్తి చూపడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది డిసెంబర్లో, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పడిపోయి, శివసేన, ఎన్సిపి, కాంగ్రెస్ నేతృత్వంలోని త్రి పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే, ఈ కేసు దర్యాప్తుకు వ్యతిరేకంగా పవార్ మాట్లాడారు. అప్పుడు ఈ కేసును స్థానిక పూణే పోలీసులు చూస్తున్నారు. కానీ దేవేంద్ర ఫడ్నవిస్ ప్రభుత్వం పడిపోగానే కేంద్ర ప్రభుత్వం ఈ కేసును ఎన్ఐఏకు అప్పగించింది. ఎన్ఐఏ బాధ్యతలు స్వీకరించినప్పటి నుండి, అంతకుముందు తొమ్మిది మందితో పాటు, ఈ కేసులో మరో ఆరుగురిని అరెస్టు చేశారు.
దక్షిణ ముంబైలోని వైబి చవాన్ కేంద్రంలో జరిగిన సమావేశంలో పవార్ దర్యాప్తుపై తాజా వివరాలను కోరారు. ఈ సమావేశంలో ఎన్సిపి నుంచి ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్, హోంమంత్రి అనిల్ దేశ్ ముఖ్ కాంగ్రెస్ విద్యా మంత్రి వర్షా గైక్వాడ్, ఇంధన మంత్రి నితిన్ రౌత్ అదనపు చీఫ్ సెక్రటరీ (హోమ్) సీతారాం కుంటే, ప్రిన్సిపల్ సెక్రటరీ (హోమ్) అమితాబ్ గుప్తా పాల్గొన్నారు.
ʹప్రస్తుత దర్యాప్తు హైడ్రా లాగా వ్యాపించింది. ఎవరినైనా సరే ప్రశ్నించడానికని పిలుస్తారు, ఎటువంటి ఆధారాలు లేకపోయినా అరెస్టు చేస్తారు. ఏజెన్సీ (ఎన్ఐఏ) ఎవరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదన్నట్లుగా వ్యవహరిస్తోంది. ఈ విషయాలన్నీ సమావేశంలో చర్చకు వచ్చాయి అని సమావేశంలో పాల్గొన్న ఒక సీనియర్ నాయకుడు చెప్పారు. సీనియర్ రాష్ట్ర పోలీసు అధికారుల సమన్వయంతో పనిచేసే రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో సిట్ పనిచేసే అవకాశం ఉంటుందని ఆయన అన్నారు. " శాంతిభద్రతలు ఇప్పటికీ రాష్ట్ర విషయమే, ఓపెన్ మైండ్తో ముందుకు సాగాలని కోరుకుంటున్నాము ʹఅని ఎన్సిపికి చెందిన ఒక నాయకుడు చెప్పారు.
ఈ ఏడాది జనవరి 22 న రాష్ట్ర హోంమంత్రి దేశ్ముఖ్, ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ పూణే పోలీసులు, రాష్ట్ర ఇంటెలిజెన్స్ అధికారులను ఈ కేసుపై సమీక్షా సమావేశం కోసం కలిశారు. సమావేశం ముగిసిన వెంటనే, దేశ్ముఖ్ వచ్చే వారం నాటికి, దర్యాప్తును పరిశీలించడానికి ఒక సిట్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందా అనే అంశంపైపై తన శాఖ నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. దర్యాప్తులో ఎన్ఐఏను చేర్చుకోవాలన్న కేంద్ర నిర్ణయాన్ని దేశ్ముఖ్ బహిరంగంగా ఖండించారు.
"ఈ విషయం మూలం లోకి వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన వెంటనే, కేంద్రం అడుగు పెట్టాలని నిర్ణయించుకుంది"...." రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తును చేస్తున్న కేసును తన చేతిలోకి తీసుకొని, మా అనుమతి తీసుకోకపోవడం మాట అటుంచి మా ప్రభుత్వంతో ఏ మాత్రం సంబంధం లేకుండా కేంద్రం తానే ముందుకు సాగడం తప్పు" అని దేశ్ ముఖ్ అన్నారు.
ఎన్సిపి నాయకుడు, గృహశాఖ రాష్ట్ర క్యాబినెట్ మంత్రి, మీడియాలోనే కాదు, శీతాకాల అసెంబ్లీలో కూడా, మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ హక్కుల కార్యకర్తలను లక్ష్యంగా చేసుకోవడం సరికాదనీ, వారిపై "అర్బన్ నక్సల్స్" అని తప్పుగా ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. ఫడ్నవీస్ ఆదేశాల మేరకు పూణే పోలీసులు పనిచేస్తున్నారని ఆయన ఆరోపించారు.
అయితే రాష్ట్ర ప్రభుత్వం అప్పడు సిట్ దర్యాప్తులో ముందుకు సాగలేదు. కానీ ఈ సమావేశంలో ప్రభుత్వం ఈ విషయాన్ని మరింత గంభీరంగా పరిగణించిందనీ, ప్రతి చిన్న వివరాన్ని చర్చించారని సమావేశంలో పాల్గొన్న ఒక కార్యకర్త అన్నారు.
ఈ కేసులో ప్రస్తుతం ఏర్పాటు చేసిన జ్యుడిషియల్ కమిషన్కు భిన్నంగా ఏర్పాటుచేయబోయే సిట్ ఉంటుందని సీనియర్ మంత్రి చెప్పారు. ʹఈ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే సిట్ ఆ కమిషన్ ఆదేశం కంటే చాలా భిన్నంగా ఉంటుంది. కార్యకర్తలు, మేధావులను నిజంగా లక్ష్యంగా చేసుకుంటున్నారా?, భీమా కోరెగావ్ వద్ద జరిగిన హింస వెనుక ఎవరు ఉన్నారు అనే దానిపై మేము దృష్టి సారించాము.ʹ మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జె.ఎన్ పాటిల్, మాజీ ప్రధాన కార్యదర్శి సుమిత్ మల్లిక్ ఆధ్వర్యంలో 2018 ఫిబ్రవరిలో ఏర్పాటు చేసిన జ్యుడీషియల్ కమిషన్. హింస వెనుక కారణాలను తప్పనిసరిగా కనుక్కోవాల్సి వుండింది. కానీ ఆ కమిషన్ పురోగతి సాధించలేదు. కమిషన్ "పక్షపాత వైఖరి" అవలంబిస్తున్నదని అనేకమంది కుల వ్యతిరేక కార్యకర్తలు ఆరోపించారు.
ఎల్గార్ పరిషత్ కేసు
2018జనవరి 1 న, దళిత-బహుజన సముదాయాల సభ్యులు, కుల వ్యతిరేక కార్యకర్తలు పూణే సమీపంలో భీమా-కోరేగావ్ యుద్ధం 200 వ వార్షికోత్సవాన్ని జరుపుతుండగా హింసాకాండ జరిగింది. ఈ దాడుల్లో గాయపడిన వారు కొన్ని హిందుత్వ సంఘాలు హింసను ప్రేరేపించాయని పేర్కొనగా, పూణే పోలీసులు పలువురు కార్యకర్తలు, హక్కుల న్యాయవాదులను అరెస్టు చేశారు.
2017డిసెంబర్ 31న, ఎల్గార్ పరిషత్ మహాసభ, ఆ మరుసటి రోజు భీమా-కోరెగావ్ ప్రాంతంలో జరిగిన కులపర హింసకు మధ్య సంబంధం ఉన్నదనే ఆరోపణలపై దర్యాప్తు చేస్తున్నప్పుడు ʹఅర్బన్ నక్సల్ʹ అనే పదాన్ని పూణే పోలీసులు ఉపయోగించారు. అరెస్టు చేసిన కార్యకర్తలు ప్రధాని నరేంద్ర మోడీపై హత్యాయత్నం చేస్తున్నారని పోలీసులు పేర్కొన్నారు.
ఈ కేసులో కొంతమంది హక్కుల కార్యకర్తలను పూణే నగర పోలీసులు అరెస్టు చేయగా, గ్రామీణప్రాంత పోలీసులు హిందూత్వ బ్రాహ్మణ నాయకులు మిలింద్ ఎక్బోటే, మనోహర్ కులకర్ణి అలియాస్ సంభాజీ భిడేలపై హింసను ప్రేరేపించారని కేసు నమోదు చేశారు. ఎక్బోటే కు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయగా, భిడేను ఎప్పుడూ అరెస్టు చేయనేలేదు. ఆ దర్యాప్తులో రాష్ట్ర పోలీసులు ఎటువంటి పురోగతి సాధించలేదు.
ఎల్గార్ పరిషత్ కేసులో 2018 జూన్లో ప్రారంభమయిన మొదటి రౌండ్ లో రచయిత, ముంబైకి చెందిన దళిత హక్కుల కార్యకర్త సుధీర్ ధవాలే, యుఎపిఎ నిపుణుడు, నాగ్పూర్కు చెందిన న్యాయవాది సురేంద్ర గాడ్లింగ్, విస్థాపనా సమస్యలపై పని చేస్తున్న యువ కార్యకర్త మహేష్ రౌత్, గడ్చిరోలి, నాగ్పూర్ విశ్వవిద్యాలయంలో విశ్వవిద్యాలయ ప్రొఫెసర్, ఆంగ్ల సాహిత్య విభాగం అధిపతి షోమా సేన్, ఢిల్లీకి చెందిన ఖైదీల హక్కుల కార్యకర్త రోనా విల్సన్ లను అరెస్టు చేశారు.
2018 ఆగస్టు లో జరిగిన రెండవ రౌండ్ అరెస్టులలో, న్యాయవాది అరుణ్ ఫెర్రెరా, న్యాయవాది సుధా భరద్వాజ్, రచయిత వరవారరావు, వెర్నాన్ గోన్సాల్వెస్ లను అదుపులోకి తీసుకున్నారు. పూణే పోలీసులు ఇప్పటికే రెండు సెట్ల చార్జిషీట్లను దాఖలు చేశారు - ఒక ప్రధాన చార్జిషీట్, తరువాత అనుబంధ చార్జిషీట్ - అరెస్టు చేసినవారికి నిషేధిత కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) తో "క్రియాశీల సంబంధాలు" ఉన్నాయని, 2017 డిసెంబర్ 31నాటి ఎల్గర్ పరిషత్ ను ʹభీమా కోరేగావ్ శౌర్య దిన్ ప్రేరనా అభియాన్ʹ బ్యానర్ క్రింద పూణేలో జరపడానికి సహాయం చేశారని పోలీసుల అభియోగం.
ఈ కేసును స్వాధీనం చేసుకున్న తరువాత విద్యావేత్తలు ఆనంద్ తేల్తుంబ్డే, హనీ బాబు, కార్యకర్త గౌతమ్ నవలఖా, కబీర్ కలా మంచ్ ముగ్గురు కళాకారులను - సాగర్ గోర్ఖే, రమేష్ గైచోర్ మరియు జ్యోతి జగ్తప్ ల ను ఎన్ఐఏ అరెస్టు చేసింది.
(thewire.in సౌజన్యంతో)
Keywords : bhima koregaon, elgar parishath, sharad pawar, maharashtra, NIA, bjp, Maoists
(2024-04-14 01:05:57)
No. of visitors : 669
Suggested Posts
| భీమా కోరేగావ్ కేసు: మరో ప్రొఫెసర్ అరెస్ట్భీమాకోరేగావ్ (ఎల్గర్ పరిషద్) కేసులో ఈ రోజు ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హానీ బాబును ఎన్నైఏ పోలీసులు అరెస్టు చేశారు. |
| అక్రమంగా అరెస్ట్ చేసిన ఢిల్లీ యూనివర్సిటీ ప్రొఫెసర్ హనీ బాబును విడుదల చేయాలి - CLCభీమా కోరేగావ్-ఎల్గార్ పరిషత్ కేసులో ప్రొఫెసర్ హనీ బాబును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) ముంబయిలో అరెస్టు చేయడాన్నిరాజ్య అణచివేత వ్యతిరేక కేంపెయిన్ (సిఎఎస్ఆర్) ఖండిస్తూంది.
ఢిల్లీ, ముంబైలలో COVID-19 కేసులు పెరుగుతున్నప్పటికీ, NIA ఢిల్లీ విశ్వవిద్యాలయ ఇంగ్లీష్ విభాగం ప్రొఫెసర్ బాబును సాక్షిగా రమ్మని పిలవడంతో, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా మాట్లాడే |
| ఇవ్వాళ్ళ స్టాన్ స్వామి,రేపు మనమే కావచ్చు...జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరన్భీమా కోరేగావ్ కేసులో అరెస్టు చేయబడ్డ జార్ఖండ్ కు చెందిన ప్రముఖ ఆదివాసీ హక్కుల కార్యకర్త స్టాన్ స్వామితో సహా మొత్తం 16 మంది సామాజిక, హక్కుల కార్యకర్తలను విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు పీపుల్స్ యూనియన్ ఫర్ సివిల్ లిబర్టీస్ సంస్థ |
| భీమా కోరెగావ్: స్టాన్ స్వామి సహా ఎనిమిది మందిపై పది వేల పేజీల ఎన్ఐఏ చార్జిషీట్10,000 పేజీలకు పైగా వున్న ఈ చార్జిషీట్ లో మొత్తం ఎనిమిది మంది కార్యకర్తలు కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా (మావోయిస్ట్) భావజాలాన్ని మరింత వ్యాప్తి చేయడానికి కుట్ర పన్నారని ఆరోపించారు.
|