జైల్లో మాకు ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది?

అధికారానికి ఎదురు నిలిచి సత్యం పలికిన నేరానికి చెరసాలల్లో మగ్గుతున్న ప్రియమైన మిత్రులారా,
మా పేర్లు కళ్యాణి, తన్మయ్. బీహార్ ఈశాన్య కొసన అరారియా అనే చిన్న జిల్లాకు చెందినవాళ్లం. బీహార్ లో భూమిలేని నిరుపేదల మధ్య పనిచేసే జన జాగరణ శక్తి సంఘటన్ కార్యకర్తలం.
మనం ఎన్నడూ కలిసి ఉండకపోవచ్చు. కాని మీరు అరెస్టయినప్పటి నుంచీ ప్రతి రోజూ మేం మీ పేర్లు వింటున్నాం. మీ ఫొటోలు చూస్తున్నాం. ఇప్పుడు మాకు మీరు అతి సన్నిహిత పరిచయస్తుల్లా అనిపిస్తున్నారు.
న్యాయస్థానం కార్యకలాపాలను అడ్డుకున్నామనే ఆరోపణపై, మా ఇద్దరినీ, ఒక 22 సంవత్సరాల అత్యాచార బాధితురాలితో సహా, 2020 జూలైలో అరెస్టు చేశారు. ఆరోజు ఆ బాధితురాలికి సహాయం చేయడం కోసం మేం న్యాయస్థానానికి వెళ్లాం. ఆమె ఆ రోజు తనకు జరిగిన దుర్మార్గం గురించి న్యాయస్థానంలో అధికారిక ప్రకటన చేయవలసి ఉండింది. ఆమె ఒక నిరక్షరాస్యురాలైన ముస్లిం శ్రామిక మహిళ. ఇళ్లలో పని మనిషిగా ఉండేది.
ఆమె ఆ ప్రకటన చేసిన తర్వాత, దాని మీద సంతకం చేసే సమయంలో తనకు సహాయంగా వచ్చిన స్నేహితులను తనతోపాటు ఆ గదిలో ఉండనివ్వాలని కోరింది. ఆమె అలా కోరడం న్యాయమూర్తికి కోపం తెప్పించింది. తర్వాత జరిగిన ఆశ్చర్యకరమైన మలుపుల్లో ఆయన మా ముగ్గురినీ అరెస్టు చేయించాడు.
అవును, అత్యాచార బాధితురాలిని అరెస్టు చేశారు.
ఎంతటి తలకిందుల న్యాయం అది. న్యాయాన్ని పొందడానికి ప్రయత్నించినందుకు, ఆ సమయంలో తనకు ధైర్యంగా మిత్రులను పక్కన ఉండనిమ్మని కోరినందుకు ఒక అత్యాచార బాధితురాలిని అరెస్టు చేశారు. అప్పుడు మా సొంత జిల్లా నుంచి 200 కిమీ దూరంలో ఉన్న ఒక మహిళా క్వారంటైన్ జైలుకు మా ముగ్గురినీ తరలించారు.
మాలో ఇద్దరం మహిళలం. ఒకరు ట్రాన్స్ జెండర్. ఆ అత్యాచార బాధితురాలికి వారం రోజుల తర్వాత బెయిల్ దొరికి విడుదల కాగా, మాకు బెయిల్ దొరికి విడుదల కావడానికి ఇరవై ఐదు రోజులు పట్టింది.
చిట్టచివరికి ఆగస్ట్ 5 న మేం స్వేచ్ఛను రుచి చూడగలిగాం గాని అది చాల చేదుగా ఉండింది. అదే రోజున రామమందిర శంకుస్థాపన జరిగింది. అదే రోజున అధికరణం 370 రద్దు చేసి కశ్మీర్ ను అతి భయంకరమైన దిగ్బంధానికి గురిచేసి సంవత్సరం గడిచింది.
కనుక విడుదలయ్యామని పెద్దగా సంతోషపడడానికేమీ లేదు. అంతేకాదు, అప్పటికీ మా స్నేహితులెందరో ఇంకా చెరసాలల్లో మగ్గిపోతూనే ఉన్నారు.

ʹధూళి లాగ ఎప్పటికప్పుడు లేవాలి మనంʹ

మేం మీకు ఇదంతా ఎందుకు చెపుతున్నామంటే, మేం చెరసాలలో గడిపిన ఆ ఇరవై ఐదు రోజులూ, మీరు మా మనసులో నిత్యం ఉన్నారని మీకు తెలియజేయడానికి.
ʹక్యోం డరాతే హో జిందోం కి దీవార్ సే ... ఐసే దస్తూర్ కో, సుబహ్ – ఎ – బేనూర్ కో హం నహీ జాన్తే, హం నహీ మాన్తేʹ అని మేం మా కటకటాలు పట్టుకుని గున్గునాయించుకుంటున్నప్పుడు బహుశా మీరు కూడ మీ ఒంటరి సెల్ లో అట్లాగే పాడుకుంటూ ఉన్నారనిపించింది. మీ చిరునవ్వులు, మీ నినాదాలు, మీ పోరాటాలు మాకు ఎంతో ధైర్యాన్నిచ్చాయి. ఇప్పటికీ మాకవి ధైర్యాన్నిస్తూనే ఉన్నాయి.
జైలు జీవితంలో ప్రతి కొత్త అవరోధం ఎదురైనప్పుడల్లా, అంటే మరుగుదొడ్లు పొంగి పొరలినప్పుడో, జైలు ఫోను పగిలిపోయినప్పుడో, తోటి ఖైదీలు నిరాశలో మునిగినప్పుడో, జైలు జవాన్లు అధికార అహంకారాన్ని చూపినప్పుడో, మీకు కూడ ఇటువంటి అవరోధాలే వచ్చి ఉంటాయా అనీ, దేశమంతటా జైలు జీవితం ఇదేవిధంగా ఉంటుందా అనీ మేం ఆలోచిస్తుండేవాళ్లం.
గద్దెల మీద కూచున్నవాళ్లు భిన్న స్వరాలను అణచివేయడానికీ, దేశంలో న్యాయం కోసం పోరాడుతున్న అద్భుతమైన మనుషులనూ, సుతిమెత్తని మనసులనూ జైళ్లలో బంధించడానికీ ఎంత పద్ధతి ప్రకారం పని చేస్తున్నారో చూసి ఆగ్రహం రగిలిపోతుండేది.
కాని వారికి తెలియనిదేమంటే సరిగ్గా ధూళి లాగ, కాళ్లకింద అణచబడిన దుమ్ము లాగ, మనం లేచి నిలుస్తాం. లేచి నిలబడుతూనే ఉంటాం.

ʹవాళ్లు మిమ్మల్ని ఎప్పటికీ ధ్వంసం చేయలేరుʹ


మీరెట్లా ఉన్నారని మిమ్మల్ని అడగబోవడం లేదు. బహుశా అది జవాబు చెప్పడం అసాధ్యమైన ప్రశ్న. పైగా, ఇవాళ ప్రపంచం ఉన్న స్థితిలో ఆ పీడనామయ గోడల లోపల ఉన్న వారికైనా, బైట ఉన్న వారికైనా ʹబాగాʹ ఉండడం అత్యంత కష్టతరమైన విషయం.
కాని మీరు మానసిక స్థైర్యంతో ఉండడానికి, ప్రతిదానిలో సౌందర్యం చూడడానికి, ప్రతిదానిలో సంతోషం కనిపెట్టడానికి, ఉనికిలో ఉండడానికి ఏయే చిన్న చిన్న పనులు చేస్తున్నారో తెలుసుకోవాలని మాకు కోరికగా ఉంది. బహుశా ఆ చిన్న పనుల ద్వారానే మీరు రోజురోజుకూ ఎదుగుతుంటారు కూడ.
ఇది రాస్తుంటే మాకు నాజిమ్ హిక్మత్ రాసిన కవితా పాదాలు గుర్తుకొస్తున్నాయి:
ʹఇట్లా చెప్పడం బాగుంటుంది: పట్టుబడడం అనేది పెద్ద విషయమేమీ కాదు. లొంగిపోకుండా ఉండడమే అసలు విషయం.ʹ
మిత్రులారా, సాథీ, వాళ్లు మిమ్మల్ని కటకటాల వెనక్కి నెట్టారు కావచ్చు, కాని వాళ్లు మిమ్మల్ని ఎప్పటికీ చెదరగొట్టలేరు.

ʹఒకరికొకరం ఉండడం ఎంత అదృష్టంʹ


మమ్మల్ని నిర్బంధంలో ఉంచినది చాల స్వల్పకాలమే అని మాకు తెలుసు. మీలో కొందరు నెలలూ, సంవత్సరాలూ జైలులో గడుపుతున్నారు. అది ఎలా ఉంటుందో మా ఊహకు అందడం లేదు.
కాని మాకు కచ్చితంగా తెలిసినదేమంటే మా ముగ్గురినీ ఆ కాలమంతా కలిపే ఉంచడం మా అదృష్టమనే చెప్పాలి.
మీకు మీ పాత మిత్రులతో కలిసి నవ్వడానికి, ప్రేమించడానికి, నేర్చుకోవడానికి, వినడానికి, అర్థం చేసుకోవడానికి, అన్వేషించడానికి, విస్తరించడానికి, ఏడ్వడానికి, గుండెపగలడానికి, తలపోతల్లో మునిగిపోవడానికి, చదవడానికి, అరవడానికి, పలవరించడానికి, పాడడానికి, చిందువేయడానికి తగినంత సమయం దొరుకుతున్నదనీ, కొత్తవారితో అర్థవంతమైన స్నేహాలు కలుపుకో గలుగుతున్నారనీ అనుకుంటున్నాం.
జైలులో ఉండడంలో అన్నిటికన్న గొప్ప నమ్రతనూ, వినయాన్నీ ఇచ్చే అంశం తోటి ఖైదీలను కలవడం, వారి మాటలు వినడం, వారి పోరాటాల గురించి తెలుసుకోవడం.
ఊహించినట్టుగానే జైలులో మేం కలిసిన మహిళల్లో అత్యధికులు అణగారిన వర్గాల నుంచి వచ్చిన వారు. దళితులు, ముస్లింలు, శ్రామిక మహిళలు. బహుశా ఆ కారణం వల్లనే జైలు అంటే తమతమ పద్ధతులలో బ్రాహ్మణీయ పితృస్వామ్యాన్ని ప్రతిఘటించిన అద్భుతమైన మహిళా యోధుల సంగమ స్థలంగా చెప్పవచ్చు. ఆ పోరాటాల వల్లనే జైలుకు చేరినవారెందరో.
ఏది ఏమైనా, జైళ్లనేవి చారిత్రకంగానే పీడితులను అణచి ఉంచడానికీ, శిక్షించడానికీ ఉపయోగించబడినవి కదా. పౌరుల మీద రాజ్యపు నియంత్రణను బలోపేతం చేయడానికి ఏర్పాటైనవి కదా.
జైళ్లలో మానసిక ఆరోగ్యం దారుణాతిదారుణంగా ఉన్నది. తమ బిడ్డల కోసం, ఒక శుభ్రమైన రవిక కోసం, తమ ప్రియమైన కుటుంబ సభ్యులతో మూడు నిమిషాల ఫోన్ సంబాషణ కోసం, ఒక చారెడు బట్టల సబ్బు కోసం, గౌరవం కోసం, న్యాయం కోసం శోకాలు పెట్టే మహిళలు అక్కడ కనబడతారు.
ఈ అపారమైన దుఃఖంతో పాటే మేమక్కడ ఎన్నో కొత్త విషయాలు నేర్చుకున్నాం. ఇతరుల పట్ల దయతో ఉండడంలో కొత్త వ్యాకరణాలు నేర్చుకున్నాం. భయానకమైన స్థాయిలో లొంగిపోయే బలహీనతలు, అనంతమైన కరుణ, ఔదార్యం, సంఘీభావం కూడ మేమక్కడ చూశాం. అంతే కాదు, ప్రతిభావంతమైన సృజనాత్మకత కూడిన తిట్లు, తమ ప్రియుల స్పర్శ కోసం స్త్రీల తపన వెతుక్కునే ఆశ్చర్యకరమైన కోరికలు కూడ మేమక్కడ చూశాం.

ʹప్రతిఘటన వంటి మానసిక ప్రశాంతత లేదుʹ


ఒకసారి, మా చుట్టూ ఎడతెగని ఏడుపు వినిపిస్తుండగా, అది భరించలేక మేం చాల సహజంగా ʹతూ జిందా హై...ʹ అని పాట ఎత్తుకున్నాం.
కాసేపు కొన్ని సిగ్గరి నవ్వులూ, అనుమానంతో మూతి విరుపులూ గడిచి, చుట్టూ ఉన్నవాళ్లు మెల్లగా చప్పట్లు కొట్టడం మొదలుపెట్టారు. త్వరలోనే పాటకు గొంతు కలిపారు.
మనసుకు ప్రశాంతత చేకూర్చే వాటిలో సంగీతాన్ని మించినది లేదు, కదూ?
ఇక ఆ తర్వాత, లాకప్ అయిన తర్వాత ప్రతి రాత్రీ, ఆ దాల్ సింగ్ సరాయి జైలులోని మా వార్డు ఒక సంగీతశాల అయిపోయింది. ప్రతి ఒక్కరూ ʹతూ జిందా హైʹ పాటకో, ʹతోడ్ తోడ్ కే బంధనోం కోʹ పాటకో, హిల్లేలే ఝగ్ ఝోర్ దునియాʹ పాటకో తాళం వేస్తుండేవారు.
ఈ సంగీతం జైలు జవాన్లను కూడ తేలిక పరచింది. కొంత మంది మహిళలమూ, ఒక ట్రాన్స్ జెండర్ వ్యక్తీ కలిసి స్వేచ్చ గురించీ, పీడక శక్తులను ధ్వంసం చేయడం గురించీ, కులాన్నీ, పితృస్వామ్యాన్నీ నిర్మూలించడం గురించీ పాటలు పాడుతుండేవాళ్లం. కొన్నిసార్లు ఊరికే ʹమున్నీ బద్ నాం హుయీʹ లాంటి పాటలు పాడుతుంటే మా సహఖైదీలు నాట్యం కూడ చేసేవాళ్లు.
ఆ క్షణాల్లో, మేం అలా ఏదీ పట్టనట్టుగా పాటలు పాడుతున్నప్పుడు, నాట్యం చేస్తున్నపుడు, నవ్వు తెరల్లో మైకం కమ్మినప్పుడు, కొద్ది సేపటికోసమైనా మా మనసులు వాస్తవంగా స్వేచ్ఛగా ఉన్నట్టే అనిపించేది.
ఇనుప కటకటాలు లేనట్టు, మమ్మల్ని బంధించి ఉంచిన సామాజిక రాజకీయ సంకెళ్లు తెగిపోయినట్టు, మా స్వేచ్ఛనూ, గౌరవాన్నీ, సమగ్రతనూ కొల్లగొట్టడానికి రాజ్యం చేస్తున్న ప్రయత్నాలను మేం ధిక్కరిస్తున్నట్టు అనిపించేది.
ఈ రాత్రివేళ నాట్యపు ఉత్సవాలలో, ఎంత క్షణికంగానైనా మేం స్వేచ్ఛను అనుభవించినట్టు అనిపించడం విచిత్రంగా ఉంది గదూ?
జుట్టు వెంటుకలు గాలిలో తేలియాడుతుండగా, పల్లూ జారిపోతుండగా, గుండీలు తెగిపోతుండగా, సంగీతం గంతులు వేయిస్తుండగా, ప్రపంచమంటే లెక్కేమిటన్నట్టు ఉండేది. అత్యంత కఠినమైన రాజ్య నిఘా ఉన్నప్పటికీ ఇక్కడ ఒక స్వేచ్ఛాస్థలంలో కొందరు మహిళలూ ఒక ట్రాన్స్ జండర్ వ్యక్తీ, ధిక్కారపూరితంగా మా సొంత చిన్న ప్రచండ స్త్రీవాద విశ్వాన్ని నిర్మిస్తున్నట్టుండేది.
ఈ ప్రచండ, స్త్రీవాద విశ్వం ఇప్పటికి క్షణికమైనదే కావచ్చు. కాని ఒకానొకరోజున, మన సామూహిక పోరాటాల ద్వారా తప్పకుండా మనం దాన్ని బైటి ప్రపంచంలోకి తీసుకొస్తాం. అన్ని పీడిత సమూహాలకూ అన్ని రకాల సంకెళ్ల నుంచీ స్వేచ్ఛను సాధిస్తాం.
అప్పటివరకూ, జాగ్రత్తగా ఉండండి. మీకు మీరు జాగ్రత్త తీసుకోండి. తోటివారి పట్ల జాగ్రత్త వహించండి. మీరు మీకు తెలిసినదానికన్న ఎన్నోరెట్లు ఎక్కువగా ప్రేమించబడుతున్నారనీ, ప్రాణంగా చూడబడుతున్నారనీ గుర్తించండి. మేమందరమూ మీకోసం పోరాడుతున్నాం. మీ విడుదల కోసం పోరాడుతున్నాం. మీరు ఏ విశ్వాసాల కోసం నిలబడ్డారో ఆ విశ్వాసాల కోసం పోరాడుతున్నాం.
పోరాటం కొనసాగుతూనే ఉంటుంది.
మనం పోరాడతాం! మనం విజయం సాధిస్తాం!
(ఈ లేఖ పూర్తి పాఠంతో పాటు, జైలులో ఉండగా తన్మయ్ వేసిన నాలుగు బొమ్మలతో, ప్రత్యేకంగా ఈ లేఖ ఆధారంగా తయారు చేసిన మూడు నిమిషాల లఘు చిత్రంతో కలిపి ది క్వింట్ వార్తా వెబ్ సైట్ 25 అక్టోబర్ 2020 న ప్రచురించింది. )
తెలుగు: ఎన్ వేణుగోపాల్

Keywords : bihar, delhi, jana jagarana shakti, kalyani, thnmayi, arrest, jail
(2024-04-22 23:00:18)



No. of visitors : 801

Suggested Posts


Leaders Of CPI Maoist In Bihar Seek To Consolidate Their Cadre Base Amidst State Repression

The CPI(Maoist) leaders in Bihar are trying to consolidate their cadre base and moving places to meet their supporters. Central intelligence agencies have alerted the state police on the movement of top Maoist leaders like Vijay Yadav alias Sandeep ji, Nanadlal Yadav alias Nitesh ji, Indal Bhokta and a few others....

మావోయిస్టు అగ్రనేత సందీప్ యాదవ్ @ రూపేష్ జీ అంతిమ యాత్రకు హాజరైన వేలాది ప్రజలు

బుధవారం సాయంత్రం 8 గంటల సమయంలో, బాంకే బజార్ బ్లాక్ పరిధిలోని లుతువా తోలా బాబు రామ్‌దిహ్ గ్రామంలోని పెద్ద మర్రి చెట్టు కింద కట్టిన గట్టుపైన ఆజ్ఞాత వ్యక్తులు ఒక మృతదేహాన్ని ఉంచి వెళ్ళిపోయారు.

భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నం,భూమిపుత్రుడు అరవింద్‌ - రవి నర్ల

భారతదేశంలోని విప్లవశ్రేణులకూ, బీహార్‌లోని రైతులకూ, రైతు కూలీలకూ, పీడిత ప్రజలకూ, ముఖ్యంగా మగధ్‌ ప్రాంతంలోని పీడిత ప్రజానీకానికందరికీ అత్యంత ప్రియమైన విప్లవ నాయకుడు. బ్రహ్మర్షిసేన, భూమిసేన మొదలుకొని రణవీర్‌ సేన వరకు భూస్వామ్య సేనల పాలిట సింహ స్వప్నంగా నిలిచి వాటిని భూస్థానితం చేసిన ఎర్రసైన్యపు సేనాని.

బాలకపై సామూహిక అత్యాచారం చేసిన దుర్మార్గులు... బాధితురాలికి గుండుగీయించి ఊరేగించిన గ్రామ పెద్దలు

బీహార్ గయ జిల్లాలో జరిగిన ఈ నెల 14న జరిగిన ఈ సంఘటన‌ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 14వతేదీన ఇంటి నుండి బైటికి వెళ్ళిన ఈ బాలికను అదే గ్రామానికి చెందిన కొందరు బలిసిన కుటుంభాలకు చెందిన దుర్మార్గులు కిడ్నాప్ చేసి పంచాయితీ భవనంపైకి తీసుకెళ్ళి ఒకరి తర్వాత ఒకరు అత్యాచారం చేశారు. స్పృహతప్పిన ఆ బాలికను అక్కడె వదిలేసి వెళ్ళి పోయారు.

ఓ ముస్లింను హత్య చేసిన కేసులో మరణ శిక్ష పడి బెయిల్ పై వచ్చిన వారికి సన్మానం చేసిన కేంధ్ర మంత్రి

జార్ఖండ్లో గో మాంసం అమ్ముతున్నాడనే నెపంతో గతేడాది జూన్‌ 29న జార్ఖండ్‌ రాంఘడ్‌కు చెందిన అలిముద్దిన్‌ అన్సారీ అనే 40 ఏళ్ళ వ్యక్తిపై 12 మంది దాడి చేసి తీవ్రంగా కొట్టడంతో అతను అక్కిడిక్కడే మృతి చెందాడు. ఈ దాడిలో పాల్గొన్న వారిలో 11 మందికి ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టు మరణశిక్ష విధించింది.

బీహార్ లో మహా కూటమిదే గెలుపు ?

బిహార్ లో నితీష్, లాలూల జోడీ గెలిచే అవకాశం ఉందని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. బీహార్ వాసులు మహాకూటమికే పట్టం కడతారని ఎగ్జిట్ పోల్స్ అంచనాలు చెబుతున్నాయి.....

పిల్లవాడిని మోసుకొని రోదిస్తూ పరిగెడుతున్న ఆ తల్లి కష్టానికి కారణమెవరు ?

బీహార్ రాష్ట్రం జెహనాబాద్ జిల్లా లోని షాహోపూర్ గ్రామానికి చెందిన గీరెజ్ కుమార్ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఒక అమ్మాయి,ఒక కొడుకు కొడుకుకు మూడేళ్ళు. కొద్ది రోజులుగా కొడుకు రిషుకి ఆరోగ్యం బాగాలేకపోవడంతో స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకెళ్ళారు.

This TV reporter is winning praise for relentlessly questioning an errant BJP leader

The internet canʹt stop admiring TV9 Bharatvarsh reporter Rupesh Kumarʹs questioning of a self-proclaimed Bharatiya Janta Party leader who broke ICU rules in a Muzaffarpur hospital.

టైగర్ రిజర్వ్ కు, పోలీసుల దుర్మార్గాలకు నిరసనగా ఎన్నికల బహిష్కరణ -108 గ్రామాల నిర్ణయం

బీహార్‌లోని కైమూర్ ప్రాంతంలోని నూట ఎనిమిది గిరిజన గ్రామాలు ఈ నెల చివర్లో ప్రారంభమయ్యే రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించాయి. గత నెలలో బీహార్ పోలీసులు ఈ ప్రాంతంలోని గిరిజన గ్రామాలపై విరుచుకుపడి గ్రామస్తులను దారుణంగా కొట్టి అనేక మందిని అరెస్టులు చేసినందుకు నిరసనగా, తమ ప్రాంతాన్ని టైగర్ రిజర్వుడు ఫారెస్టుగా ప్రకటించడానికి వ్యతిరేకంగా, మ

ఊరు మునుగుతుంది ఇసుక తవ్వకండి అన్నందుకు... లాఠీచార్జ్, టియర్ గ్యాస్,సంకెళ్ళు, జైలు....

ఇసుక తవ్వకాలు జరిపితే వర్షాకాలంలో తమ గ్రామం మునిగిపోతుందని, తవ్వకాలు జరపొద్దన్నందుకు అనేక మంది మహిళలు, పురుషలు, పిల్లలు, వృద్దుల‌పై పోలీసులు లాఠీచార్జ్ చేశారు

Search Engine

??????? ?????
కేసీఆర్ కుటుంబానికి చెందిన‌ అక్రమ ఆస్తులపై విచారణ జరపాలి...మావోయిస్టు పార్టీ డిమాండ్
రైతుబంధు పేద, మధ్యతరగతి, కౌలు రైతులకుమాత్రమే ఇవ్వాలి -మావోయిస్టు పార్టీ డిమాండ్
నిజాలు బైటపెట్టినందుకు జర్నలిస్టుపై సీపీఎం నాయకుల దాడి, జర్నలిస్టునే అరెస్టు చేసిన పోలీసులు
24 వసంతాల నెత్తిటి ఙాపకం... కామ్రేడ్స్ ఆదిరెడ్డి, సంతోష్, నరేష్ అమర్ రహే !
డిసెంబర్ 2 నుండి 8 వరకు PLGA 23వ వార్షికోత్సవాలను విజయవంతం చేయండి....మావోయిస్టు పార్టీ పిలుపు
ఐదురాష్ట్రాల్లో జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలో మావోయిస్టు నేత జగన్ ఇంటర్వ్యూ
హుస్నాబాద్ స్తూపం స్థ‌లాన్ని అమ్మినా, కొన్నా శిక్ష తప్పదని మావోయిస్టు పార్టీ హెచ్చరిక‌
కంటి ఆపరేషన్ కోసం విప్లవ కవి వరవరరావుకు హైదరాబాద్ రావడానికి అనుమతి ఇచ్చిన బోంబే హైకోర్టు
5 రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలపై మావోయిస్టు పార్టీ ప్రకటన‌
ప్రమాదం లో న్యాయవాదవృత్తి: కేసులు చేయడం నేరమా?
తెలంగాణ, ఏపీల్లో 62 మంది ప్రజా సంఘాల నేతల ఇళ్ళపై ఎన్ ఐ ఏ దాడులు... మండిపడ్డ వివిధ సంఘాలు
అజ్ఞాత రచయిత్రుల కథలు:ʹవియ్యుక్కʹ ఆవిష్కరణ సభ
పార్టీ 19వ వార్షికోత్సవాలను విప్లవోత్సాహంతో నిర్వహిద్దాం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part 2)
వర్గపోరాట చరిత్రలో గద్దర్ ఆలాపన - అల్లం రాజయ్య (part1)
విమోచన అంటే చరిత్ర నవ్వదా - ఎన్. వేణుగోపాల్
హైదరాబాద్ లో మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్
అనారోగ్యంతో ఉన్న‌ మావోయిస్టు అగ్రనేత అశోక్ రెడ్డి, అతని సహచరి ఉఫయ్ కుమారిని ఆస్పత్రిలో అరెస్ట్ చేసిన పోలీసులు
మల్లా రాజిరెడ్డి, కట్టా రామచంద్రా రెడ్డిలు క్షేమం -మావోయిస్టు పార్టీ ప్రకటన‌
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు అరెస్ట్ !
సియాసత్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతికి కేసీఆరే బాధ్యత వహించాలి - మావోయిస్ట్ పార్టీ
తెలంగాణ, చత్తీస్ గడ్ బార్డర్ లో మావోయిస్టుల భారీ బహిరంగసభ, కటకం సుదర్శ‌న్ స్తూపావిష్కరణ‌
గద్దర్ మరణం తీవ్ర భాదకు గురి చేసింది‍ -మావోయిస్టు పార్టీ
గద్దర్ అంటే రాబోయే తరాలకు కూడా సాయుధ విప్లవమే గుర్తుకు వస్తుంది -విరసం
more..


జైల్లో