Etala Rajendar :ఈటల రాజేందర్ పై మావోయిస్టు పార్టీ ఆగ్రహం
16-06-2021
ఆర్ఎస్ఎస్ RSS నుండి ఆర్ఎస్యూRSU వరకు కలిసి పోరాడాతారని మాజీ మంత్రి, తాజా బీజేపీ నేత ఈటల రాజేందర్ చేసిన ప్రకటన పై సీపీఐ మావోయిస్టు CPI Maoist ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసీఆర్కు, ఈటలకు మధ్య కలహం ప్రజలకు సంబంధించిన విషయం కాదని, వారిద్దరూ ఒకే గూటి పక్షులని ఆ పార్టీ తెలంగాణ అధికార ప్రతినిధి జగన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
జగన్ ప్రకటన పూర్తి పాఠం.....
ఈటల రాజేందర్ తన అసెంబ్లీ స్థానానికి రాజీనామా చేస్తూ, కేసీఆర్ ప్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం కోసం పోరాడుతానని, అందుకోసం ఆర్ఎస్ఎస్ నుండి ఆర్ఎస్యూ వరకు కలిసి పోరాడాతారని ప్రకటన చేసాడు. ఆ వెనువెంటనే హిందూ ఫాసిస్టు పార్టీ అయిన బీజేపీ తీర్థం పుచ్చుకున్నాడు. కేసీఆర్కు, ఈటలకు మధ్య కలహం ఏమాత్రం ప్రజలకు సంబంధించిన విషయం కాదు. వారు ఒకే గూటి పక్షులు..
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. కేసీఆర్, ఈటలలు అధికారంలోకి రాగానే తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడిచారు. వీరి పాలన ప్రజావ్యతిరేకమైనది. సామ్రాజ్యవాద, దళారీ నిరంకుశ పెట్టుబడిదారీ విధానికి, బడా భూస్వామ్య వర్గాలకు అనుకూలంగా వారు తెలంగాణ ప్రజల ఆకాంక్షల పునర్నిర్మాణ ఎజెండాను మార్చారు. తెలంగాణ ఉద్యమంలో ప్రజల నుండి లేవనెత్తబడిన సమస్యలను పక్కన పెట్టి, వాటికోసం పోరాడుతున్న ప్రజలపై, ప్రజాస్వామికవాదులపై తీవ్ర దమనకాండ కొనసాగిస్తూ వచ్చారు.
మొన్నటి వరకు కేసీఆర్ ప్రక్కన అధికారాన్ని అనుభవించిన ఈటల తన ఆస్తుల పెంపుదలకు ప్రయత్నించాడు. అందులో భాగంగా పేదల అసైన్డ్ భూములను అక్రమంగా అక్రమించాడు. కేసీఆర్ బర్రెలు తినే వాడైతే, ఈటల గొర్రెలను తినే ఆచరణ కొనసాగించాడు. తెలంగాణలో ప్యూడల్ పెత్తనానికి వ్యతిరేకంగా ఆత్మగౌరవ పోరాటం చేస్తానని ఈటల ప్రకటిస్తూ తన ఆస్థుల రక్షణ కోసం నేడు బీజేపీలో చేరాడు. నరేంద్రమోడీ నాయకత్వంలో బీజేపీ-హిందుత్వ ఫాసిజంతో దేశాన్ని సామ్రాజ్యవాదులకు అమ్మకానికి పెట్టింది. అది విశాల ప్రజారాశులను, వివిధ సెక్షన్ల ప్రజలను అణచివేస్తున్నది.
బీజేపీ హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో విశాల ప్రజలు ఐక్యమై పోరాడుతున్నారు. అలాగే కేసీఆర్ నియంతృత్వ, కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు పోరాడుతున్నారు. ఈ సమయంలో ఈటల రాజేందర్ రాష్ట్ర ప్రజలను మోసపుచ్చి మళ్ళీ హుజురాబాద్ నుండి అసెంబ్లీ స్థానాన్ని గెలుచుకోవడం కోసం తెలంగాణ ఆత్మగౌరవం కోసం పోరాడుతానని చెబుతున్నాడు. టీఆర్ఎస్ పార్టీలో ప్రధాన భూమిక వహించిన ఈటల రాజేందర్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఏనాడో తుంగలో తొక్కాడు. అంతేకాక ప్రజల్లో మా పార్టీ గల పేరు ప్రతిష్టలను సొమ్ము చేసుకోవడానికి ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్యూ శక్తులు కలిసి కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడుతాయని ఈ రెండు శక్తులను ఒక గాట గడుతున్నాడు.
దేశ, రాష్ట్ర చరిత్రలో చూస్తే ఆర్ఎస్ఎస్, ఆర్ఎస్యూలు ఎప్పుడూ బద్ద శత్రువులుగానే ఉన్నాయి. ఆర్ఎస్ఎస్ సైద్ధాంతిక విధానాలను ఆర్ఎస్యూ ఎప్పుడూ వ్యతిరేకిస్తూనే వచ్చింది. దాని అనుబంధ రాజకీయ పార్టీ అయిన బీజేపీ దళారీ నిరంకుశ పాలక వర్గాల్లో ఒక దూకుడు స్వభావం కల్గిన పార్టీ - ఈ పార్టీనీ ఆర్ఎస్యూ, మావోయిస్టు పార్టీ ఎప్పుడూ టార్గెట్ చేస్తూనే వస్తున్నాయి. అలాంటి ప్రతిఘాతుక పార్టీలో ఈటల చేరి తెలంగాణ ఆత్మగౌరవ పోరాటాన్ని చేపడతాననీ చెప్పడం ప్రజలను మోసగించడమే అవుతుంది.
ఆర్ఎస్యూ, మావోయిస్టులు కూడా తనకు మద్దతునిస్తారని ఈటల చెప్పుకోవడం పచ్చిమోసంగా మా పార్టీ ప్రజలకు తెలియజేస్తున్నది. ఈటల తీసుకొన్న ఈ నిర్ణయాన్ని తెలంగాణలోని ప్రజలు, ప్రజాస్వామిక వాదులు వ్యతిరేస్తున్నారు. బీజేపీలో చేరవద్దని ప్రజాస్వామిక శక్తులతో కలిసి కేసీఆర్కు వ్యతిరేకంగా పోరాడాలని పలుమార్లు చేసిన విజ్ఞప్తులను ఈటల తొసిపుచ్చి, నిస్సిగ్గుగా బీజేపీలో చేరాడు.
ఈటల రాజేందర్ అవకాశవాదాన్నీ, కేసీఆర్ నిరంకుశత్వాన్ని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలి.
బీ.జే.పీ హిందూత్వ ఫాసిజానికి వ్యతిరేకంగా దేశంలో విశాల ప్రజలు, ప్రజాస్వామికవాదులు, సెక్యులరిస్టులు, సామాజిక బృందాలు, యమ్ యల్ గ్రూపులు ఐక్యమై పోరాడాల్సి ఉంది. ఈ రోజు ప్రజాస్వామిక వాదులు, మేధావులు, వివిధ సెక్షన్ల నాయకులు కళాకారులు, జర్నలిస్టులు, ఉద్యోగులు, విశాల ప్రజారాశులు టీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకిస్తూ నిజమైన తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ పోరాటానికి మరో మారు సిద్ధం కావాలని మా పార్టీ విజ్ఞప్తి చేస్తున్నది.
విప్లవాభినందనలతో...
జగన్ ,
అధికార ప్రతినిధి,
తెలంగాణ రాష్ట్ర కమిటి,
భారత కమ్యూనిస్టు పార్టీ (మావోయిస్టు),
Keywords : maoists, etela rajendar, kcr, trs, bjp,
(2024-04-25 00:11:35)
No. of visitors : 2126
Suggested Posts
| హరిభూషణ్, భారతక్కలు కరోనాతో మృతి -మావోయిస్టు పార్టీ ప్రకటన తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి, కేంద్ర కమిటీ సభ్యులు కా|| హరిభూషణ్ (యాప నారాయణ), దండకారణ్యంలోని మాడ్ డివిజన్, ఇంద్రావతి ఏరియా కమిటీ సభ్యురాలు కా|| సిద్ధబోయిన సారక్క ( భారతక్క) ఇరువురు కరోనా లక్షణాలతో భాదపడుతూ తుదిశ్వాస విడిచారు. |
| మావోయిస్టు లింకులంటూ ప్రచారాలు...ప్రజా సంఘాలపై దాడులు...ఖండించిన పౌరహక్కుల సంఘం
ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ తెలంగాణ ప్రభుత్వం తన అప్రజాస్వామిక రూపాన్ని ,రాజ్యహింస ను తీవ్రంగా అమలు చేయడంలో భాగంగా మేధావులకు,ప్రతిపక్ష పార్టీలకు మావోయిస్టులకు సంబందం ఉందనే అసత్య ప్రచారం చేస్తూ ... |
| ఈ నెల 30న కామ్రేడ్ బండ్రు నర్సింహులు సంస్మరణ సభ
మహత్తర తెలంగాణ సాయుధ పోరాటంలో దళ కమాండర్ గా పనిచేసిన స్ఫూర్తిని నేటి దాకా కొనసాగిస్తూ, సి.పి.ఐ (ఎం-ఎల్) జనశక్తి నాయకుడిగా, ప్రజా విమోచన సంపాదకునిగా వ్యవహరిస్తున్న కామ్రేడ్ బండ్రు నర్సింహులు |