హరిభూషణ్ తో ఒకరోజు....
2015 ఆగస్టు నెలలో ఓ రోజు ఓ పిలుపు వచ్చింది మావోయిస్టు పార్టీ నాయకులతో ఇంటర్వ్యూ ఉంటుంది వస్తావా అని. వెంటనే రెడీ అయిపోయిన. పిలుపు వచ్చిన రెండో రోజనుకుంటా బయలు దేరాము. నాతో పాటు మరో రెండు పత్రికలు, రెండు టీవీ ఛానల్స్ ప్రతినిధులకు కూడా పిలుపు అందింది. అందరం కలిసి బయలు దేరాం. ఇంటర్వ్యూ ఇచ్చేది తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్ కావచ్చు అని మేమనుకున్నాం. అనుకున్నట్టే ఆయనే మాకు ఇంటర్వూ ఇచ్చారు. ఉత్కంటభరితంగా సాగిన మా ప్రయాణం, హరిభూషణ్ ఇంటర్వ్యూలు.... అప్పుడే వరసకథనాలు ʹఅవని న్యూస్ʹ లో పోస్ట్ చేశాం. మిగతా పత్రికలు, ఛానళ్ళు కూడా కథనాలు ఇచ్చాయి. అయితే అప్పడు మాకిచ్చిన ఇంటర్వ్యూలో అనేక రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ విషయాలపై మంచి అవగాహనతో మాట్లాడిన , మా మీద అద్భుత ప్రభావం చూపిన హరిభూషణ్ కరోనాతో చనిపోయాడన్న వార్త మళ్ళీ ఆయనను నా కళ్ళ ముందు నిలబెట్టింది. మావోయిస్టు పార్టీలో కేంద్రకమిటీలో సభ్యుడుగా, తెలంగాణ రాష్ట్రానికి కార్యదర్శిగా ఎదిగిన ఓ ఆదివాసీ బిడ్డ మరణం ఆ పార్టీకే కాదు పీడిత వర్గానికే తీరని లోటు.
ఆయనను కలిసింది ఒక్కసారే కానీ ఇంటర్వ్యూకు వెళ్ళిన జర్నలిస్టులందరిపై చాలా ప్రభావం చూయించారు. ఆ రోజటి మా అనుభవాలను జర్నలిస్టు ఎస్. మల్లా రెడ్డి ʹఅవని న్యూస్ʹ కోసం రాసిన కొంత భాగాన్ని మళ్ళీ ఇక్కడ మీతో పంచుకుంటాను.
ʹʹజర్నలిస్టు మిత్రులమంతా.. మావోయిస్టు పార్టీ ముఖ్యనేతలున్న టెంట్ కు చేరుకోగానే.. అక్కడున్న ఇద్దరు ముగ్గురు మావోయిస్ట్ నేతలు, వారికి రక్షణగా ఉన్న ఇతర గెరిల్లాలు.. అందరూ లేచి నిలబడి.. మమ్ములను సాదరంగా టెంటులోకి ఆహ్వానించారు. పరిచయాలు.. కుశల ప్రశ్నలు.. అయిన తర్వాత.. అప్పటి దాకా మాకున్న అనేక అనుమానాలు, అపోహలు పటాపంచలయ్యాయి. నక్సలైట్ నేతలంతా తమదైన పద్ధతిలో తమ సిద్ధాంతపదజాలంతో తాము చెప్పదలుచుకున్నది చెపుతూ.. పోతారని, ఏవైనా అనుమానాలు, వివరణలు ఉంటే ఇస్తారని, మిగతా విషయాలను అనవసర విషయాలుగా భావిస్తారని విన్నాను, అనుకున్నాను.
కానీ నేనూహించిన దానికి పూర్తి భిన్నంగా.. వ్యవహరించారు. మావోయిస్టు పార్టీ తెలంగాణ కార్యదర్శి హరిభూషణ్ చాలా ఫ్రెండ్లీగా.. కూల్ గా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లలో ఏడాది పాలన గురించి వివరించారు. ఇరు రాష్ట్రాల్లో పాలకులు ప్రజాప్రయోజనాలను పణంగా పెట్టి బహుళజాతి కంపెనీలకు అనుకూలంగా విధాన నిర్ణయాలను చేస్తూ ప్రజలను దగా చేశారని అనేక ఉదాహరణలతో సోదాహరణంగా వివరించారు.
ఆ తరువాత.. ఆయన తాను మా దగ్గరినుంచే నేర్చుకోవడానికి కుతూహలంగా ఉన్నట్లు చెప్పారు. ప్రపంచీకరణ, నగరీకరణ ప్రభావాలు, ప్రజల జీవితాలపై అవి చూపిస్తున్న దుష్ఫలితాలు ఏవిధంగా ఉన్నాయో, వాటిని ఎదుర్కోవడానికి ప్రజలుగా ఏం చేయాలో జర్నలిస్టులుగా మేం ఏం అనుకుంటున్నామో అడిగి తెలుసుకున్నారు. పౌరసమాజం కూడా ఏడాది పాలనపై ఏం అనుకుంటున్నదో, ఎలా ఆలోచిస్తున్నదో అడిగి తెలుసుకున్నారు.
చాలా సందర్భాల్లో .. తమదైన పరిధి, పరిమితిని వివరిస్తూ నిరంతరం బయటి ప్రపంచంలోని రచయితలు, మేధావుల నుంచి, పౌర సమాజాల నుంచి ఎల్లప్పుడు నేర్చుకోవడానికి ప్రయత్నిస్తుంటామని, ఆ విధంగానే తాము విషయ పరిజ్ఞాన పరంగా.. అప్ డేట్ కావడానికి ప్రయత్నిస్తామని సవినయంగా తెలపారు. ʹమేం చెబుతాం మీరు వినండిʹ అన్న పద్ధతిలో గాక.., మేం తెలుసుకొనే దశలోనే ఉన్నాం.., నిత్య విద్యార్థులుగానే ఉంటాం.. ప్రజలనుంచి నేర్చుకుని ప్రజలకోసం పనిచేస్తామని చెప్పినప్పుడు .. మాకు నాయకత్వంపై ఎనలేని గౌరవం ఏర్పడింది.
బయటి ప్రపంచంలోని ప్రజాస్వామిక వాదులూ, మేధావులు, రచయితలు, హక్కుల సంఘాల నేతలు ఒక్కరేంటి సమస్తరంగాల్లో సామాజిక బాధ్యతగా అనేక రంగాల్లో పనిచేస్తున్న వారందరి యోగ క్షేమాలు, కుటుంబ పరిస్థితులు అడిగి తెలుసుకుంటున్న తీరు.. మమ్ములను కదిలించి వేసింది. బయటి ప్రపంచంలోని వారి గురించి మావోయిస్టు పార్టీ ఇంత సీరియస్ గా.., కన్సర్న్ గా ఉంటుందని, ఉన్నదని అర్థమైన తర్వాత, కళ్లారా చూసిన తర్వాత.. ప్రజలను ప్రేమించే వాళ్లుగా.., వారి కోసం ప్రాణాలు ఎందుకు త్యాగం చేశారో.., చేస్తున్నారో.. అర్థమయ్యింది.
నిజంగా.. వారు మనల్ని గురించి పట్టించుకున్న, ప్రేమించిన దాంట్లో... మనం నూరో వంతైనా.. ప్రజలకోసం పోరాటం చేస్తున్న వారి గురించి ఆలోచిస్తున్నామా..? ఎందుకో.. అప్రయత్నంగానే... కళ్లలో.. కన్నీళ్లు నిండాయి. ఎక్కడో.. గిల్టీ ఫీలింగ్... ఆ ఆలోచనా సుడిగుండంలోనే చాలా సేపు.. ఉద్యమకారులు చేస్తున్న త్యాగాలు.., సమాజం పట్ల వారి నిబద్దత, ప్రజల పట్ల ప్రేమలో..., ఆవగింజంత అయినా బయటి ప్రపంచం నుంచి ఉన్నదా..., ప్రజాస్వామిక ప్రేమికులుగా, విలువల ప్రేమికులుగా.. మనం మనదైన బాధ్యతను ఎంత మేరకు నిర్వర్తిస్తున్నాం.. ఇలా.. అనేక ప్రశ్నలు.., జవాబు లేని, ఇవ్వలేని ప్రశ్నలు.. మనస్సంతా అతలా కుతలం.. నిశ్చలంగా ఉన్న తేనె తుట్టెను తట్టిన స్థితి...
--------
ఇంటర్వ్యూ ముగిసింది.. మద్యాహ్నం ఉత్సహాంగా ఉరకలేస్తూ...వడి వడిగా..పెద్ద పెద్ద అంగలేస్తూ.. ముఖ్యనేతలను చేరుకున్న మేం.. దిగులుగా... సాయంత్రం అయిదున్నర ఆరు గంటల ప్రాంతంలో.. వీడ్కోలు తీసుకున్నాం. భారంగా.. అడుగులేస్తూ... మేం విడిది చేసిన టెంటుకు చేరుకున్నాం.
ఇక్కడే.. మరో విషయం చెప్పుకోవాలి. ప్రజలు తమను తాము అనన్య త్యాగాలతో విముక్తి చేసుకుంటారని విప్లవకారులు చెబుతుంటారు. దాని అర్థం , దానిలోని అంతస్సారం మాకు మావోయిస్టు నాయకత్వాన్ని చూసిన తర్వాత తెలిసి వచ్చింది.. ఏంటంటే.. మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి హరిభూషణ్, కేకే డబ్ల్యూ కార్యదర్శి దామోదర్ ఇద్దరూ ఆదివాసులే నని తెలిసి ఆశ్చర్య మేసింది. మొదట నమ్మలేక పోయాం.
విషయాలు తెలిసిన తర్వాత.. నమ్మక తప్పని పరిస్థితి. అయితే గిరిజనులు, ఆదివాసులు అనగానే.. ఏదో మైదాన ప్రాంతానికి చెందిన గిరిజనులు కాదు. అచ్చంగా నట్టడివి నివాసులైన కోయ, చెంచు ఆదివాసీ తెగలకు చెందిన ఇద్దరు మావోయిస్టు పార్టీ నాయకత్వ స్థానంలోకి ఎదిగి విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారంటే.. ఇంతకన్నా విప్లవానికి హామీ ఏం కావాలని మాలో ఓ మిత్రుడు అంటే.. నిజమేననిపించింది.
మరో నిజమేమంటే.. మాకు కనిపించిన యాభై అరవై మంది మావోయిస్టు గెరిల్లాల్లో అత్యధికులు ఆదివాసీలే. మొత్తం అరవై మందిలో ముగ్గురు నలుగురు మాత్రమే మైదాన ప్రాంతంనుంచి కొత్తగా దళాల్లోకి వచ్చిన వారు కనిపించారు. ఒక్క మాటలో చెప్పాలంటే.. ఇవ్వాళ.. దండకారణ్యంలో ఆదివాసులు తమ విముక్తి కోసం వారు పోరాటం చేస్తున్నారు. ఈ సందర్భంగానే ఎప్పుడో ఎవరో అన్న మాట గుర్తుకు వస్తున్నది. ఎవరో మేధావి.. పోలీసులు-మావోయిస్టుల మధ్య ఆదివాసులు నలిగిపోతున్నారని అన్నారట. ఆ మాట విన్న తర్వాత.. ఓ ఆదివాసీ అన్నాడట.. పోలీసులు-మావోయిస్టుల మధ్య ఆదివాసులు నలగిపోవడమేమిటి? మేమంతా మావోయిస్టులమే కదా.. అని. సరిగ్గా ఇదే పరిస్థతి కనిపించింది. దండకారణ్యంలో.. చిన్న పిల్లలు మొదలు పండు ముసలి అయిన వృద్దురాలి దాకా.. అందరూ మావోయిస్టులే. ఉద్యమంలో.. అందరూ ఏదో రూపంలో.. ఏదో స్థాయిలో విప్లవోద్యమంలో భాగస్వాములవుతున్న వారేనని అర్థమైన తర్వాత.. ప్రజలు తమను తాము విముక్తి చేసుకుంటారన్నది నిజమేనని అర్థమైంది.
అలాగే.. కొందరు మేథావులు, విప్లవ వ్యతిరేకులు మావోయిస్టు ఉద్యమంలో అగ్రకుల ఆధిపత్యం ఉన్నదని, కుల అణచివేత వివక్ష ఉన్నదని అంటున్న వారు, అగ్రకులస్తులే మావోయిస్టు ఉద్యమంలో నాయకత్వ స్థానంలోకి ఎదగరని, ఎదగనివ్వరని విమర్శిస్తున్న వారికి ఈ విషయం, నిజం తెలియదేమోనని అనిపించింది. మరో ఆశ్చర్య కరమైన విషయమేమంటే.. పురుషాధిక్య ప్రపంచలో స్త్రీలు గడప దాటి రావడం చాలా కష్టమని అంటూ ఉద్యమాల్లో మహిళల భాగస్వామ్యం ఉండటం లేదన్నది మరో అభిప్రాయం. కానీ.. మేం చూసిన యాభై అరవై మందిలో సింహభాగం ఆదివాసీ అమ్మాయిలే. మహిళా గెరిల్లాలుగా పోరాటంలో ఉన్నారు. ఆలివ్ గ్రీన్ దుస్తుల్లో చేతిలో తుపాకీతో ఈ దేశ విముక్తికీ, నిజమైన అర్థంలో మహిళల విముక్తికోసం పోరాటం చేస్తున్నారు. తమవైన త్యాగాలతో ఎర్రముగ్గులేస్తున్నారు.ʹʹ
ఈ సమాజం తయారుచేసుకున్న ఓ గొప్పనాయకుడు హరిభూషణ్.... కార్మికవర్గ నాయకత్వానికి అర్దం హరిభూషణ్... హరిభూషణ్, భారతక్క వంటి వేల మంది ప్రజా నాయకులను కోల్పోయినా ఉద్యమం ఇంకా సాగుతూనే ఉండటానికి ఇలాంటి నాయకుల త్యాగాలే, వాళ్ళు నడిచిన బాటే కారణం.
కామ్రేడ్ హరిభూషణ్ అమర్ రహే !
హరి భూషణ్ తో ఇంటర్వ్యూ సందర్భంగా అవని న్యూస్ లో వచ్చిన వరస కథనాల కోసం కిందికి స్క్రోల్ చేయండి
Keywords : cpi maoist, haribhushan, yapa narayana, corona, covid19, death
(2024-04-12 05:08:13)
No. of visitors : 3904
Suggested Posts
| దండకారణ్యంలో ఐదు రోజులు...
ఉత్కంఠ భరిత అనుభవాలు...
మావోయిస్టు నేతతో ఇంటర్వ్యూ....
చుట్టూ దట్టమైన అడవి.... బోరున వర్షం...జర్రుమని జారుతున్న కాలి బాటలో... జానెడు వెడల్పు కూడా లేని పొలం గట్ల పైనుంచి.... నడుముకు పైదాక ఎత్తుతో ఉరకలెత్తే వాగులలోనుంచి....బైక్ మీద ముగ్గురు కూర్చొని ఆకాశంలో తీగ మీద నడిచినట్టు.... |
| తెలంగాణ ను విఫలం చేయడానికి బాబు కుట్రలు చేస్తున్నాడు - మావోయిస్టు నేత హరిభూషణ్ప్రజలు పోరాడి సాధించికున్న తెలంగాణ రాష్ట్రాన్ని విఫల ప్రయోగంగా నిరూపించడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్రలు చేస్తున్నారని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి.... |
| కేసీఆర్ ను చిన జీయర్, రామేశ్వర్ రావులు నడిపిస్తున్నారు...తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావును నడిపిస్తున్నది చినజీయర్ స్వామి, పెట్టుబడిదారుడైన రామేశ్వర్ రావు లాంటి వాళ్ళేనని సీపీఐ మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి ..... |
| జనతన సర్కార్ లో ప్రయాణం...
మూడవ రోజు...మహిళా గెరిల్లాలు మా అందరికి రక్షణగా తుపాకులు పట్టుకొని కాపలా కాస్తున్నారు. పురుష గెరిల్లాలు వంట వండుతున్నారు.విప్లవంలో స్త్రీలు ఆకాశంలో సగమని మావో చెప్పిన సూక్తి గుర్తుకు వచ్చింది. దండకారణ్యంలో మావోయిస్టు గెరిల్లాల్లో మహిళా గెరిల్లాలు ఆకాశంలో సగం కన్నా ఎక్కువ అని అక్కడ జరుగుతున్న కార్యక్రమాలను, గెరిల్లాల దైనందిన కార్యక్రమాలను చూసిన తర్వాత అర్థమైంది..... |
| జనతన సర్కార్ లో ప్రయాణం... నాల్గవ రోజు....అచ్చంగా నట్టడివి నివాసులైన కోయ, చెంచు ఆదివాసీ తెగలకు చెందిన ఇద్దరు మావోయిస్టు పార్టీ నాయకత్వ స్థానంలోకి ఎదిగి విప్లవోద్యమానికి నాయకత్వం వహిస్తున్నారంటే.. ఇంతకన్నా విప్లవానికి హామీ ఏం కావాలని మాలో ఓ మిత్రుడు అంటే.. నిజమేననిపించింది.... |
| జనతన సర్కార్ లో ప్రయాణం....
రెండవ రోజుఒక కర్రతో పామును ఒత్తి పట్టి మరో కర్రతో దానిని కొట్టి చంపాడు. ఆ తర్వత చెప్పాడతను అది తెల్ల కట్ల పామని అది కరిస్తే రెండు నిమిషాల్లో ప్రాణం పోతుందని. పామును చూసినప్పుడు దాన్ని చంపుతున్నప్పుడు వేయని భయం దాని గురించి విన్న తర్వాత అనిపించింది. కొద్ది సేపు నిద్ర పట్టలేదు..... |
| ʹజనతన సర్కార్ʹలో ప్రయాణం -
ఉత్కంఠ భరిత అనుభవాలుమేం జనతన సర్కార్ పరిదిలోకి వచ్చామని. మా పై ఇక్కడి ప్రజలకు ఏమాత్రం అనుమానం కలిగినా మమ్మల్ని అరెస్టు చేస్తారనే విషయం మాకర్దమైంది. కృష్ణకు కూడా ఏం చేయాలో అర్దం కావడం లేదు. వాళ్ళకు నచ్చ చెప్పడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు..... |
| జనతన సర్కార్ లో ఉత్కంఠభరిత ప్రయాణం... చివరి రోజు ʹపోలీసులుంటే ఏమైతది డైరెక్ట్ వెళ్దాం. మావోయిస్టుల ఇంటర్వ్యూ కోసం పోయొస్తున్నం అని నిజం చెబుదాంʹ అని ఓ జర్నలిస్టు మితృడు అన్నాడు. ʹమనను ఏం చేయరు కానీ మనం ఇంటర్వ్యూ చేసిన వీడియోలు డిలీట్ చేస్తే ఎట్లా ʹ అని మరో జర్నలిస్టు మితృడు అనుమానం వెలిబుచ్చాడు. ఇలా మేం మాట్లాడుకుంటుండగానేఎత్తు ప్రాంతానికి..... |