ʹసావిత్రి బాయి పుట్టినరోజునే టీచర్స్ డే గా ప్రకటించాలిʹ
03-01-2022
మార్గనిర్దేశకురాలు సావిత్రిబాయి ఫూలే
-బి.జ్యోతి
1831 జనవరి 3 న పూణే సతారా ప్రాంతానికి 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న నాయిగావ్ లో సావిత్రి బాయి జన్మించింది. తల్లిదండ్రులు లక్ష్మీబాయి, పాటిల్. వీరు మాలి కులాని కి చెందిన వారు. సావిత్రిబాయి చిన్నతనం నుండే చాలా చురుకుగా ధైర్యంగా ఉండేది. ఆమెకు మొక్కలు, ప్రకృతి చాలా ప్రాణం. ఆరేళ్ళ వయసులో ఒకసారి ఒక పాము చెట్టు పై ఉన్న పక్షి గుడ్లు తినడానికి వెళుతుండగా, ఆమె ఒక్కతే కట్టెతో ఆ పామును చంపి గుడ్లు తినకుండా చేసింది. ఒక బాలిక గా ఆ కాలంలోనే ఈత నేర్చుకున్నది. ఆమె నిరంతరం బలహీనులుగా ఉన్న పిల్లలను బలవంతులైన పిల్లలు కొడితే, బలహీనుల వైపు ఉండి, ఎదిరించి నిలిచేది. ఆమెలో ఉన్న ఈ సహజ లక్షణంతో పాటు, ఆమె చేసిన నిరంతర, కఠోర కృషి వల్లనే, ఆమె చరిత్రలో నిలిచిపోయింది.
1840లో పదేళ్ల ఏళ్ల వయస్సు ఉన్న సావిత్రిబాయికి 13 ఏళ్ల వయస్సు ఉన్న జ్యోతిరావు ఫూలేతో వివాహం జరిగింది. జ్యోతిబా చిన్నప్పటినుంచి పుస్తకాలు బాగా చదివేవారు. మహారాష్ట్రలో హింసాయుతమైన, కులాధిపత్య బ్రాహ్మణ పీష్వాల పాలన ముగిసి, 1818లో ఈస్ట్ ఇండియా కంపెనీ పాలన మొదలైంది. దీని వల్ల ఇంగ్లీష్ విద్య అందరికీ అందుబాటులోకి వచ్చింది. ఈ భాష నేర్చుకొని ఎన్నో పుస్తకాలను అధ్యయనం చేశారు జ్యోతిబా.. విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుందని సానుభవం ద్వారా నేర్చుకున్న జ్యోతిరావు చదువు అందరికీ అందుబాటులోకి తేవాలని భావించారు. ప్రధానంగా యేండ్ల తరబడి చదువుకు దూరం అయిన స్త్రీలు, శుద్ర, అతి శూద్రులకు విద్యను అందుబాటులోకి తెచ్చి, వీరిని విద్యావంతులుగా తీర్చిదిద్దాలని గట్టి నిర్ణయానికి వచ్చారు. 1941లో తన భార్య సావిత్రికి కూడా చదువు చెప్పడం మొదలు పెట్టాడు. అహ్మదాబాద్ నగరంలోని మేడం సింధియా ఫెరారే మిషనరీ పాఠశాలలో సావిత్రి బాయి టీచర్ ట్రైనింగ్ శిక్షణ కూడా పొందింది..
పాఠశాలలు స్థాపించే చారిత్రకమైన పనిని జ్యోతిరావు తన 21వ ఏట ప్రారంభించాడు. 18 యేండ్ల సావిత్రి బాయి ఆయనకు పూర్తి అండగా ఉండి, అదే తన జీవితాశయంగా ఎంచుకున్నది. ఆనాడు సమాజంలో పెద్దల ముందు భర్తతో భార్య మాట్లాడకూడదు, చెప్పులు వేసుకోకూడదు, ఇంటి నుండి బయటకు రాకూడదు. ఇలాంటి సంప్రదాయాలకు పూర్తి మద్దతు ఉన్న సనాతన బ్రాహ్మనులు, కొడుకు ఎలా పోయినా కనీసం కోడలు బయటికి రాకుండా చూడాలని జ్యోతి రావు తండ్రి గోవింద రావు ఫూలే పై ఒత్తిడి తెచ్చినారు. కొడుకు కోడలిని అదుపులో పెట్టుకోకపోతే సమాజం నుండివెలి వేస్తామని బెదిరించినందుకు, ఇద్దరినీ గోవింద రావు ఇంటి నుంచి గెంటి వేశాడు.
ఇంటి నుండి బయటకు వచ్చిన తర్వాత వీరికి ఆశ్రయం ఇచ్చింది జ్యోతిబా మిత్రుడు ఉస్మాన్ షేక్, అతని సోదరి ఫాతిమా షేక్. ఆశ్రయంతో పాటు ఆయన తన ఇంటిని కూడా పాఠశాలకు వినియోగించుకునేందుకు ఇచ్చినాడు. వీరు మొదటి పాఠశాలను బాలికల కోసం 1 జనవరి 1848 నాడు ప్రారంభించినారు. మొదట 7 మంది బాలికలు మాత్రమే వచ్చారు. 1849 లో ఒక మిషనరీ పాఠశాలలో టీచర్ గా పని చేసినారు. పాఠశాల నుండి వచ్చిన తర్వాత సావిత్రి బాయి నిర్వహిస్తున్న పాఠశాలల్లో కూడా పాఠాలు చెప్పేవాడు. ఎలాంటి జీతం తీసుకోకుండా నిస్వార్థంగా పనిచేసేది సావిత్రి బాయి. ఆనాటి పత్రికలు "చాలాసార్లు వీళ్ళిద్దరికీ తినడానికి కూడా సమయం దొరికేది కాదు" అని వారి సేవలను కొనియాడినాయి.
ఆనాటి పరిస్థితుల్లో కులవివక్ష కారణంగా మహర్లు, మంగ్ లు (మాలా మాదిగలు) ఎక్కువ అన్యాయానికి దోపిడీకి గురవుతున్నారు. వీళ్ళు చైతన్యవంతం అయితేనే వారికి జరిగే అన్యాయాలను ఎదుర్కోగలరు. అందుకే మొట్టమొదట దళిత వాడలలో చదువు అవసరం అన్న ఉద్దేశంతో దళితుల నివాస ప్రాంతాల్లో ఉంటూ వారి పిల్లలను పాఠశాలకు పంపించెలా వీరిద్దరు కృషి చేశారు.
1848 - 1852 మధ్యకాలంలో వీరిద్దరు పూణే చుట్టుపక్కల మొత్తం 18 పాఠశాలలను స్థాపించారు. రాను రాను సావిత్రి బాయి నిర్వహించే పాఠశాలలో బాలికల సంఖ్య పెరగడానికి కారణం వారిని ఆమె తన కన్న బిడ్డల వలె చూసుకోవడమే. ఎప్పుడైనా, ఏ బాలిక ఐనా బడికి రాకపోతే వారి ఇంటికి వెళ్లి, ఎందుకు రాలేదని బుజ్జగించి అడిగి తెలుసుకునేది. ఒకవేళ ఒంట్లో బాగాలేక స్కూలుకు రాలేదు అని తెలిస్తే, వారిని ఆస్పత్రికి తీసుకుని వెళ్ళేది. డ్రాపౌట్స్ విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ పెట్టేది. వీటితోపాటు పాఠశాలలు ఆర్థికంగా నిలదొక్కుకోవడానికి ఎంతో కృషి చేసేది. ఈ విధమైన నిర్విరామమైన కృషి వల్ల అనతికాలంలోనే సావిత్రిబాయి బహుజనుల మనస్సు దోచుకున్నది.
చదువుతోపాటు సంస్కరణ కార్యకలాపాలు కూడా సావిత్రి బాయి చేపట్టింది. 1852లో మహిళా సేవా మండలిని స్థాపించి, దళిత బహుజన మహిళల సభలు సమావేశాలు నిర్వహించింది. బ్రాహ్మణ వితంతువులు , అవాంచనీయ గర్భాన్ని పొందినప్పుడు, వారికి పురుడు పోసేందుకు ఒక గృహాన్ని నిర్వహించింది. రెండుపూటలా తిండి లేని వారి సమస్యలను ప్రభుత్వాలకు తెలియజేస్తూ వచ్చింది. బాల్య వివాహాలను అడ్డుకున్నది. వితంతు వివాహాలను ప్రోత్సహించింది. వీరి హక్కులు, సామాజిక సమస్యలపై అవగాహన కలిగించింది. అగ్రకుల ఆధిపత్యానికి, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేసింది .1855 లో రాత్రి పాఠశాలను ఏర్పాటు చేసింది.. బ్రాహ్మణ వితంతువులకు శిరోముండనం చేయరాదంటూ మంగలి వాళ్ళను కూడగట్టి వారికి బోధించింది. నాయీబ్రాహ్మణులు శిరోమూండనానికి వ్యతిరేకంగా ధర్నా నిర్వహిస్తే దానికి నాయకత్వం వహించింది. ఈ మంగలివాళ్ళు చేసిన సమ్మె గురించి ఆనాటి పత్రికలు ప్రముఖంగా ప్రచురించాయి. ఈ వార్తను చూసి ఇంగ్లాండ్ నుండి సావిత్రి బాయిని అభినందిస్తూ ఎన్నో లేఖలు వచ్చాయి. ముంబైలో కూడా ఈ పోరాటానికి మద్దతు లభించింది. అప్పటినుండి బ్రాహ్మణులు నాయీబ్రాహ్మణులగా మారి ఇంట్లోనే ఆడవాళ్లకు గుండు గీసినారు.
1877లో మహారాష్ట్ర అంతటా కరువు వచ్చింది. ఈ కరువు సమయంలో ఎవరూ తమ దగ్గరున్న దాన్ని పంచుకోవడానికి ఇష్టపడలేదు. దీంతో ఎంతోమంది పేదవాళ్ళు ఆకలికి అలమటించి చనిపోయారు. ప్రజల దగ్గర నుండి ఈ దంపతులు కొంతమంది కలిసి ధాన్యం, విరాళాలు సేకరించారు. విక్టోరియా ఆశ్రమం స్థాపించి ఆ ఆశ్రమంలో రోజుకు వెయ్యి మందికి అన్నం పెట్టేవారు. వీరికి చేసే వంటలన్ని సావిత్రిబాయి దగ్గరుండి చేసిందంటే ఆమెకు పేదలంటే యంత ప్రేమో తేటతెల్లమవుతుంది.
సావిత్రిబాయి సంఘసంస్కర్త కాక రచయిత కూడా. ఆమె కవితా సంపుటి "కావ్య ఫూలే" జ్యోతిబా రచనలకన్నా ముందే అచ్చయింది. సావిత్రిబాయి రచనలన్నింటినీ సంకలనం చేసిన ఎం.జి.మాలి ఆమె రచనలు భారత సామాజిక వాస్తవికత చరిత్రకు అద్దం పట్టడమే కాక, అణగారిన, దళిత బహుజనుల వెతలను, మరాఠీ సాహిత్యాన్ని చిరస్థాయిగా రికార్డు చేసాయని తెలిపారు. "కష్టపడి పనిచేయండి, లోతుగా అధ్యయనం చేయండి, సరైన మార్గంలో నడవండి" అని పిలుపునిస్తూ, విద్య, శ్రమ రెండు అత్యవసరమైనవని ఆమె అభిప్రాయపడింది. స్వావలంబన, బ్రాహ్మణాధిపత్యం గురించి కూడా ఆమె వ్యాసాలు రాసింది.
సావిత్రిబాయి ఎంతో తెలివిగలది కాబట్టే సావిత్రి వద్దన్న పని జ్యోతిబా యప్పుడూ చేయలేదు. ఆమె అంటే అతనికి అంత గురి. సావిత్రి బాయి మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయులుగా భారతదేశ చరిత్రలో నిలిచిపోయింది. సావిత్రిబాయి తన పని చేస్తూ ఎంతో మంది స్త్రీలపై తన ప్రభావాన్ని వేసింది. తను పని చేసింది దళిత, బహుజన మహిళల కొరకే అయినా, బ్రాహ్మణ స్త్రీలను కూడా ప్రభావితం చేసింది. బాల్య వివాహాలకు బలైంది, వితంతువుగా మారింది ఎక్కువగా బ్రాహ్మణ స్త్రీలే. అందుకే వారినికి అండగా నిలబడింది. సావిత్రిబాయితో కలిసి నడిచిన వారిలో ముఖ్యులు సరస్వతి బాయి, సుగుణ బాయి, ఫాతిమా షేక్, తారాబాయి షిండే, పండిత సరస్వతీ రమాబాయి, ఆనంది బాయి జోషి, రమాబాయి రణడే, ముక్తా బాయి సాల్యే తో పాటు ఇంకా ఎంతో మంది పేర్లు చరిత్రలో రికార్డు కాలేదు.
ఇందులో ఫాతిమా షేక్ మొట్టమొదటి ముస్లిం ఉపాధ్యాయురాలు. ఆమె సేవలను గుర్తిస్తూ ఇటీవల మహారాష్ట్ర ప్రభుత్వం పాఠశాల విద్యార్థులకు ఆమె జీవితాన్ని పాఠ్యాంశంగా నిర్ణయించారు. ఇందులో ఆనంది బాయి ఆధునిక పద్ధతుల్లో వైద్య విద్యను అభ్యసించిన మొట్టమొదటి మహిళ. కొల్లాపూర్ లో డాక్టర్ గా మొదట ఉద్యోగం చేసింది. దేశంలోనే మొట్టమొదటి స్త్రీవాదిగా తార బాయి షిండేను పేర్కొనవచ్చు. ఆమె రాసిన "స్త్రీ పురుషు తులనా" అనే వ్యాసం 1982 లో ప్రచురితమయ్యింది. ఇందులో అగ్రకుల, పితృస్వామ్య భావజాలాన్ని తప్పు బట్టింది. పదకొండేళ్ళ ముక్తాబాయి సాల్వే సావిత్రి బాయికి ప్రియమైన శిష్యురాలు. ఈ వయసులోనే ఈ దళిత బాలిక, గతంలో దళితులను బ్రాహ్మణులు ఎంత హీనంగా చూసేవారో ఒక లేఖ ద్వారా వివరిస్తూ మొట్టమొదట దళిత మహిళా రచయిత్రిగా చరిత్రకెక్కింది. ఆమె తన లేఖలో ఓ పండితులారా! ఇకనైనా మీ నక్క వినయాలు, మీ పిచ్చి మాటలు ఆపండి మీ జ్ఞానంలోని డొల్లతనం తెలిసి పోయింది. ఇప్పుడు నేను చెప్పేది మీరు వినండి" అని ధిక్కారంతో ఒక సుదీర్ఘ లేఖ రాసింది.
ఇప్పటి సమాజం కూడా సావిత్రిబాయి వ్యక్తిత్వం గురించి ఎంతో నేర్చుకోవాలి. ఆమె చదువు చెప్పినా జీతం తీసుకోకుండా ఇంట్లో అవసరాల కొరకు బొంతలు కుట్టింది. ఆమె స్వయంగా తన దుస్తులు తానే నేసికుట్టుకునేది. ఇన్ని పనులు చేస్తూ 1873లో సత్యశోధక్ సమాజ్ ఏర్పడిన తర్వాత ఆమె ఏమాత్రం తీరిక లేకుండా సమాజ కార్యక్రమాలు చుసుకునేది. సమాజ్ పద్ధతిలో తక్కువ ఖర్చుతో ఎలాంటి కట్నం లేకుండా, పురోహితులు లేకుండా ఎన్నో పెళ్ళిళ్ళు చేసింది.
1887లో జ్యోతిరావు ఫూలేకు గుండెపోటు వచ్చి కుడివైపు భాగం పూర్తిగా పక్షవాతంతో పడిపోయింది. అయినా మొక్కవోని ధైర్యంతో గుండె నిబ్బరంతో ఆ సమయంలో ఎన్నో ఆర్థిక ఇబ్బందులు వచ్చినా ధైర్యంతో ఎదుర్కొన్నది. చివరిగా జ్యోతిబా మరణిస్తే ఆ శవ యాత్రలో ముందుండి నడవడమే కాకుండా, తనకు ఎంతో ప్రియ మైన జ్యోతిబా చితికి తానే నిప్పు పెట్టీ, భర్తకు దహన సంస్కారాలు చేసిన మొట్టమొదటి మహిళగా చరిత్రకెక్కింది.
జ్యోతిబా మరణాంతరం కూడా సత్యశోధక్ సమాజ్ కార్యకలాపాల్లో సావిత్రిబాయి ముందు పడి పని చేయడమే కాక ఎన్నో కొత్త ప్రదేశాలలో జరిగే సభలు సమావేశాల్లో పాల్గొని తన ఉపన్యాసాలతో స్పూర్తినిచ్చేది. 1896లో కరువు వచ్చినప్పుడు గ్రామాల్లో ఉంటూ వారిని ఆదుకున్నది .
1887 లో పూణేలో ప్లేగు వ్యాధి వచ్చినప్పుడు ఒక్కరోజులోనే కొన్ని వందల మంది చనిపోయారు. ఈ పరిస్థితిని గమనించి వేరే ప్రాంతంలో పనిచేస్తున్న తన కొడుకు (బ్రాహ్మణ వితంతువుకు పుట్టినవాడు) యశ్వత రావుకు ఒక డాక్టర్ గా తన అవసరం చాలా ఉందని ఉత్తరం రాసి అతని పిలిపించింది. అనారోగ్యంతో ఉన్న రోగులకు సేవలు చేసింది.
ముందావ గ్రామం బయట ఉన్న మహర్ (మాల) బస్తీలో పాండురంగ గయా కొడుక్కి సుస్తిగా ఉదంటే సహాయం అందించేందుకు సావిత్రిబాయి వెళ్ళింది. అనారోగ్యంతో ఉన్న బాలుడిని తన భుజంపై వేసుకొని ఆస్పత్రికి తరలించింది. దీంతో ఆమెకు కూడా వ్యాధి సోకి 10 మార్చ్ 1897 నాడు మరణించింది. ఆమె మరణం ఎంతో మంది ప్రజలకు తీరని లోటు. ఆమె ఆశయ బాటలో మనమంతా కొంత వరకు ప్రయాణం చేసినా ఆమెకు నిజమైన నివాళి ఇచ్చిన వారం అవుతాము.
కేంద్ర ప్రభుత్వానికి సావిత్రిబాయి పూలే పట్ల ఏ మాత్రం గౌరవం ఉన్నా ఆమె పుట్టిన రోజు జనవరి 3 నాడు టీచర్స్ డే జరుపుకోవాలని జీవో తీసుకొని రావాలి. ఎందుకంటే ఆమె మొట్టమొదటి మహిళా దళిత ఉపాధ్యాయురాలు. ఎంతో మంది మహిళలు విద్యావంతులు అయ్యారు అంటే ఆమె చలువే. కులాలు లేవంటూనే అగ్రకులాలకు ప్రాధాన్యత ఇస్తూ, యంతో మంది డిమాండ్ ను కావాలనే విస్మరించింది కేంద్ర ప్రభుతం. ఆమెను స్మరించుకోవాలంటే ఆమె పుట్టిన రోజును ఉపాధ్యాయ దినంగా జరపాలి. ఇంతటి ఘనమైన చరిత ఉంది కాబట్టి, ఆమెను ప్రతి సంవత్సరం స్మరించుకోవాలి. ఆమె గురించి కరపత్రాలు ముద్రించి వాడవాడలా పంచాలి. ఆమె జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకొని పోస్టర్ల ద్వారా ప్రచారం చేయాలి.
ఆనాడు బ్రిటిష్ వారు ఆమె సేవలను ప్రశంసిస్తూ లేఖలు రాయగా, ఈనాడు మన దేశ పాలకులు ఆమె సేవలను గుర్తించక పోవడం బాధాకరం. ఓట్ల కొరకు కింది కులాలను ఎత్తి పట్టే రాజకీయ పార్టీలు, ఆచరణలో లేకపోవడాన్ని నగ్నంగా చూస్తున్నాము. చరిత్రను తమకు అనుకూలంగా మార్చుకునే హిందుత్వ వాదులకు బుద్ది చెప్పే రోజు అతి దగ్గరలోనే ఉందని, వారు గుర్తించాలి.
బి.జ్యోతి, కన్వీనర్
చైతన్య మహిళా సంఘం.
Keywords : savitri bai pule, teachers day, CMS, Chaitanya Mahila Sangham
(2024-03-24 12:08:36)
No. of visitors : 977
Suggested Posts
| మహిళా కార్యకర్తలపై అక్రమకేసులకు వ్యతిరేకంగా పోరాడుదాం !సుశృత అనే మహిళ దారుణ హత్యపై న్యాయం చేయమని సిఎంఎస్ ఉద్యమిస్తే సిఎంఎస్ కార్యకర్తలైన పది మందిపై కేసులు పెట్టి ఇప్పటివరకు కూడా కోర్టుల చుట్టు తిప్పుతున్నారు. గద్వాల కుట్ర కేసులో శిల్ప, రేణులను కూడా ఇరికించింది. ప్రజల మధ్య తిరుగుతున్న కూడా పరారీలో ఉన్నారని ఎఫ్ఐఆర్ లో రాశారు. ఇటీవల అక్టోబరు 20న చర్లలో మరో అక్రమ అరెస్టులో దేవేంద్ర, స్వప్న, అన్నపూర్ణ అనితలపై కూడ |