నరేంద్రమోడీ విదేశీ పర్యటనల ఖర్చెంత ?
(వీక్షణం డిసెంబర్ 2015 సంచికలో ప్రచురించబడింది)
భారతదేశపు ప్రధానమంత్రి భారతదేశంలో ఉండి పాలించాలని, పాలిస్తారని ఎవరైనా అనుకుంటారు. కాని నరేంద్ర మోడీ భారతదేశానికి అప్పుడప్పుడు వచ్చిపోతూ పాలిస్తున్నారని ఆయన మీద పరిహాసాలు వస్తున్నాయి. ఈ పరిహాసాలకు పరాకాష్టగా ఒక పత్రిక ఇటీవల ఒక కార్టూన్ ప్రచురించింది: అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామా నరేంద్ర మోడీకి దీపావళి శుభాకాంక్షలు చెప్పడానికి ఫోన్ చేశారట. దానికి ప్రతిగా మోడీ ʹథాంక్యూʹ అన్నారట. ఇంగ్లిషులో థాంక్యూ అంటే వెల్ కమ్ అనడం సంప్రదాయం గనుక ఒబామా ʹవెల్ కమ్ʹ అన్నారట. వెల్ కమ్ అంటే రమ్మని కూడ అర్థం గనుక మోడీ తాను ఎప్పుడు బయల్దేరుతున్నానో చెప్పడం మొదలు పెట్టారట.
నరేంద్ర మోడీ అధికారానికి వచ్చి ఇంకా పద్దెనిమిది నెలలు నిండకుండానే, 20 విదేశీ పర్యటనలు చేసి 88 రోజులు విదేశాల్లో గడిపారు. ముప్పై దేశాలు పర్యటించారు. వాటిలో మూడు దేశాలకు రెండుసార్లు కూడ వెళ్లారు. ఈ పర్యటనలలో తొమ్మిది అంతర్జాతీయ సమావేశాలు, సదస్సులు కాగా మిగిలిన పర్యటనలు దౌత్య, వ్యాపార సంబంధాల కోసమో, మర్యాదపూర్వకంగానో జరిగినవే. అంతర్జాతీయ సంబంధాలలో భాగంగా రాజకీయ, ఆర్థిక, దౌత్యపరమైన వ్యవహారాలు నిర్వహించడానికి ఒక దేశపు నాయకులు మరొక దేశానికి వెళ్లడం సాధారణంగా జరిగేదే. ఆ పని కోసమే విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంటుంది. విదేశీ ప్రయాణాల కోసం బడ్జెట్ కేటాయింపు ఉంటుంది. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు 2015-16 బడ్జెట్ లో మొత్తం కెటాయింపు రు. 14,966 కోట్లు కాగా అందులో వేరువేరు ఖాతాల కింద విదేశీ పర్యటనలకు ఖర్చు చేస్తారు. ʹప్రత్యేక దౌత్య వ్యయంʹగా కెటాయించిన రు. 1,650 కోట్లు పూర్తిగా పర్యటనలకు పెట్టే ఖర్చే. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల శాఖ మంత్రిగా ఉన్న సుష్మా స్వరాజ్ కూడ ఈ పద్దెనిమిది నెలల్లో 20 దేశాలు పర్యటించారు. అంటే విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కన్న ప్రధానమంత్రే ఎక్కువ పర్యటించారు.
గతంలో ప్రధానులుగా పనిచేసిన అటల్ బిహారీ వాజపాయి 1999-2004 ఐదు సంవత్సరాల కాలంలో 31 దేశాలు పర్యటించగా, డా. మన్మోహన్ సింగ్ మొదటి విడత 2004-2009 కాలంలో 35 దేశాలు, రెండో విడత 2009-2014 కాలంలో 38 దేశాలు పర్యటించారు. ఆ ఇద్దరు ప్రధానులు ఐదు సంవత్సరాలలో తిరిగినన్ని దేశాలు నరేంద్ర మోడీ ఏడాదిన్నరలోనే తిరిగారు. ఇలాగే తిరిగితే ఐదు సంవత్సరాల పాలనలో వందదేశాలు తిరిగే అవకాశం ఉంది. ఎప్పుడైనా తప్పనిసరి అవసరం అయితే, విదేశాల నుంచి ఆహ్వానం వస్తే, ఏ దేశ ప్రధానికైనా తమ దేశం తరఫున లాంఛనంగా, మర్యాదపూర్వకంగా విదేశాలకు వెళ్లవలసిన అవసరం వస్తుంది. దాన్ని ఎవరూ కాదనలేరు. కాని నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన అతి తక్కువ కాలంలోనే ఇంత ఎక్కువగా విదేశాలకు వెళ్లడం పరిశీలకులను ఆశ్చర్యపరుస్తున్నది. పర్యటనల సంఖ్య, ఉరవడి కన్న ముఖ్యంగా ఈ పర్యటనల ఫలితాలు ఏమిటనీ, ఎంత ఖర్చు జరుగుతున్నదో రహస్యంగా ఉంచడం ఏమిటనీ ప్రశ్నలు రేకెత్తుతున్నాయి.
మోడీ వెళ్లిన ప్రతి దేశంలోనూ ఆయా ప్రభుత్వాలతోనో, అక్కడి కార్పొరేట్ సంస్థలతోనో ఏవో ఒప్పందాలు కుదుర్చుకుని వచ్చారని ప్రభుత్వ ప్రకటనలు వచ్చాయి. ఆ ఒప్పందాల మీద సంతకాలు చేసేది ప్రధాని కాదు, ఆయా శాఖలకు బాధ్యత వహించే మంత్రులు, అధికారులు మాత్రమే. కనుక అవి ప్రధాని సమక్షంలో సంతకాలు జరిగాయన్న గొప్పలు చెప్పుకోవడానికే గాని ప్రధాని ఉన్నా లేకపోయినా తేడా ఏమీ లేదు. ఇంతకూ ఇలా ప్రధానమంత్రులు, మంత్రులు ఆయా దేశాలకు వెళ్లినప్పుడు, ఆయా దేశాధినేతలు భారతదేశానికి వచ్చినప్పుడు చేసే ప్రకటనలలో, సంతకాలలో, ఒప్పందాలలో సగమో పావో కూడ వాస్తవరూపం ధరించవనేది ఒక వాస్తవం. ఇటువంటి ఒప్పందాలు సాధారణంగా పెట్టుబడులు, విస్తరణలు వంటి వ్యాపార ఒప్పందాలై ఉంటాయి. అటువంటి ఒప్పందాలను ఆ వ్యాపార సంస్థలు ఒకేసారి నాలుగైదు దేశాల ప్రభుత్వాలతో చేసుకుంటాయి. అది కేవలం ఆసక్తి ప్రకటన. ఆ ప్రకటన ప్రాతిపదికగా ఆ దేశాల ప్రభుత్వాలు ఇవ్వజూపే రాయితీలను, తమ వ్యాపార అవకాశాలను, ఆ దేశంలో శ్రమశక్తి ఖరీదును, ఇతర సౌకర్యాల లభ్యతను అంచనా వేసుకుని, తమ లాభాల రేటు ఎక్కడ ఎక్కువ ఉంటుందో చూసి, చివరికి ఏ దేశంలో తమ వ్యాపారం ప్రారంభించాలో నిర్ణయిస్తాయి. అందువల్ల ఇల్లలకగానే పండుగకాదు, ఎంఒయు మీద సంతకాలు కాగానే ఆ పథకాలో, పెట్టుబడులో వచ్చినట్టు కాదు.
ఆ పథకాలో, పెట్టుబడులో వచ్చినా కూడ అవి ఆ పెట్టుబడిదారులకు లాభాలు సంపాదించిపెడతాయి. ఇక్కడి వనరులను దోచుకుపోతాయి. ఇక్కడి మార్కెట్లను ముంచెత్తి స్థానిక జీవన విధానాన్ని, సరుకుల వినియోగాన్ని, విలువలను మారుస్తాయి. అవి పెట్టుబడిదారుల కోసమే తప్ప ఇక్కడి ప్రజల కోసం కాదు. పెరుగుతున్న యాంత్రీకరణ వల్ల ఆ పథకాలతో, పెట్టుబడులతో వచ్చే ఉద్యోగాలూ ఉండవు. ప్రభుత్వాలు ఇస్తున్న రాయితీల వల్ల ప్రభుత్వ ఖజానాకు కూడ ఒరిగేదేమీ ఉండదు. ఆ పెట్టుబడులు జాతీయాదాయ లెక్కలలో చేరి ఆర్థికవ్యవస్థలో వాపు కనబడుతుంది. ఆ జాతీయాదాయాన్ని జనాభాతో భాగహారం చేసి తలసరి ఆదాయం పెరిగిందనీ, దేశం ప్రగతిపథంలో మున్ముందుకు దూసుకుపోతున్నదనీ ప్రభుత్వాలు ప్రజలను, ముఖ్యంగా మధ్యతరగతిని భ్రమల్లో ముంచగలుగుతాయి. ప్రజలను ఎంత పెద్ద ఎత్తున భ్రమల్లో ముంచాలంటే ప్రభుత్వాధినేతలు అంతగా విదేశాలు పర్యటించాలి. లేదా విదేశీ ప్రభుత్వాధినేతలను, కార్పొరేట్ సంస్థల అధిపతులను దేశానికి ఆహ్వానించాలి. అందుకే మోడీ 30 దేశాలకు వెళ్లడం మాత్రమే కాదు, ఈ పద్దెనిమిది నెలల్లో 25 దేశాల ప్రభుత్వాధినేతలు భారత పర్యటనకు వచ్చారు. అన్ని సందర్భాలలోను ప్రభుత్వ పక్షాన భారీ ప్రకటనలు వెలువడ్డాయి. వాటిలో ఎన్ని వాస్తవ రూపం ధరించాయో, వాటివల్ల దేశ ప్రజలకు ఏ ప్రయోజనం చేకూరిందో వివరమైన పరిశోధన జరపవలసిందే.
భారత ప్రభుత్వాధినేతలు విదేశాలకు వెళ్లినప్పుడు వారి ప్రయాణ ఖర్చులు (సాధారణంగా ప్రత్యేక విమానంలో వెళతారు), అక్కడ స్థానిక ప్రభుత్వం కొంతవరకు స్థానిక ప్రయాణ, వసతి సౌకర్యాలు చూసినప్పటికీ, ఇతర ఖర్చులు భారత ప్రజాధనం నుంచే పెట్టవలసి ఉంటుంది. అలాగే ఇతర దేశాల ప్రభుత్వాధినేతలు భారత పర్యటనలో ఉన్నప్పుడు వారి ప్రయాణ, వసతి సౌకర్యాలతోపాటు వారికి ఇచ్చే కానుకలపై కూడ భారత ప్రజాధనాన్నే ఖర్చు పెట్టవలసి ఉంటుంది. ఐతే ఈ ప్రజాధనం ఎంత ఖర్చవుతున్నది, ఖర్చుగా లెక్కలు చూపుతున్నదంతా సక్రమమైనదేనా అని ప్రజలు తెలుసుకునే అవకాశమే లేదు. బడ్జెట్ లో ఒక పెద్ద మొత్తాన్ని చూపడం, దాని ఖర్చు నిర్ణయాధికారాన్ని అధికారులకు అప్పగించడం, బడ్జెట్ గడిచిపోయినతర్వాత, బడ్జెట్ లో అంచనా వేసినదానికన్న ఎక్కువ ఖర్చు అయిందని సవరించడం అలవాటయిపోయింది.
ఈ నేపథ్యంలో మోడీ విదేశీ ప్రయాణాలకు గాని, అసలు మొత్తంగా విదేశీవ్యవహారాల శాఖ తరఫున జరిగిన విదేశీ పర్యటనల ఖర్చు గాని తెలుసుకోవడానికి బడ్జెట్ అంకెలు ఒక సూచన మాత్రమే. అవి పూర్తి చిత్రాన్ని తెలియజేయవు. 2015-16 బడ్జెట్ ప్రకారం మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత గడిచిన ఆర్థిక సంవత్సరంలో అధికారిక విదేశీ పర్యటనలకు రు. 316.76 కోట్లు ఖర్చయింది. అందులో రు. 39.70 కోట్లు ప్రధానమంత్రి విదేశీ పర్యటనలకు ఖర్చయింది. 2015-16 కు మొత్తం ఖర్చు రు. 269 కోట్లు అని, ప్రధానమంత్రికి రు. 39.26 కోట్లు అని బడ్జెట్ అంకెలు చెపుతున్నాయి గాని కచ్చితంగా ఈ అంకె కన్న ఎంతో ఎక్కువ ఖర్చయిందని వచ్చే సంవత్సరం బడ్జెట్ లో సవరించిన అంచనాలు ప్రకటిస్తారు.
ఈ బడ్జెట్ అంకెలతో సమస్యలు ఉన్నందువల్ల, వాస్తవ ఖర్చును తెలుసుకునేందుకు మరొక మార్గంగా సమాచార హక్కు చట్టం ఉపయోగించుకోవచ్చునని కొందరు భావిస్తున్నారు. సమాచారహక్కు చట్టం ఏదో సర్వ రోగ నివారిణి అన్నట్టు, సంజీవనీ మాత్ర అన్నట్టు జరుగుతున్న ప్రచారం ఎంత అబద్ధాల ఆర్ఘాటమో ఈ విషయంలో సమాచారహక్కు చట్టం వినియోగదారులు ప్రయత్నాలు చూపుతున్నాయి.
రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి పదవీకాలాలలో వైద్యచికిత్సలకూ ప్రయాణాలకూ ఎంత ఖర్చు అయిందో చెప్పాలని ముంబాయి పౌరుడు చేతన్ కొఠారి 2008 ఫిబ్రవరిలో రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి కార్యాలయాలలో సమాచారహక్కు అధికారులకు దరఖాస్తులు పంపించారు. ʹదరఖాస్తుదారు అడిగిన సమాచారం వేరువేరు చోట్లనుంచి సమీకరించవలసి ఉంటుంది. అందుకోసం ఈ ప్రభుత్వ సంస్థ వనరులను అనుచితంగా ఖర్చుపెట్టవలసి వస్తుంది. ఈ కార్యాలయపు సాధారణ పనికి భంగం వాటిల్లుతుందిʹ అనే కారణంతో ఆ సమాచారం ఇవ్వడానికి నిరాకరించారు. ఆయన సమాచారహక్కు చట్టం ప్రకారం పై అధికారులకు అప్పీలు చేశారు. ఆ పై అధికారులు కూడ దేశాధినేతల విదేశీ పర్యటనల ఖర్చు వివరాలు చెప్పాలంటే విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖనూ, రక్షణ మంత్రిత్వశాఖనూ అడగాలనీ, ఆ పని చేయడమంటే ఈ కార్యాలయాల వనరులను అనుచితంగా ఖర్చుపెట్టడమేననీ, సాధారణ పనిని పక్కన పెట్టడమేననీ అన్నారు. దానిమీద చేతన్ కొఠారీ కేంద్ర సమాచార కమిషనర్ కు ఫిర్యాదు చేశారు. కేంద్ర సమాచార కమిషనర్ కూడ ఈ సమాచారం నిరాకరించడం సక్రమమేనని తీర్పు చెప్పారు. ఆ చివరి తీర్పు 2009 సెప్టెంబర్ లో వెలువడింది. అంటే, ప్రజాధనాన్ని ప్రజాప్రతినిధులనబడేవారు ఎలా ఖర్చు పెట్టారు అనే న్యాయబద్ధమైన ప్రశ్నకు అడిగిన సమాచారం రాలేదు సరిగదా పందొమ్మిది నెలల సమయం పట్టింది.
ఇక లోకేష్ బత్రా అనే మాజీ సైనికోద్యోగి జూన్ 2014 నుంచి జూన్ 2015 వరకు నరేంద్ర మోడీ పర్యటించిన ఇరవై దేశాలలోని దౌత్యకార్యాలయాలు ఒక్కొక్క దానికీ ఒక సమాచారహక్కు దరఖాస్తు సమర్పించి ప్రయత్నించారు. 16 దేశాల కార్యాలయాలు ఆ సమాచారం ఇచ్చాయి. దాని ప్రకారం ప్రధాని విదేశీ పర్యటనల ఖర్చు రు. 47.42 కోట్లు అని తేలింది. ఇంకా ఫ్రాన్స్, జపాన్, శ్రీలంక, దక్షిణ కొరియాలలోని భారత దౌత్యకార్యాలయాలు తమ లెక్కలు పూర్తి కాలేదని, అందువల్ల ఇవ్వలేమని చెప్పాయి గనుక ఈ అంకె ఇంకా పెరగవచ్చు. అంటే బడ్జెట్ పత్రాలలో చెప్పినది నిజం కాదన్నమాట. వీటిలో ఆస్ట్రేలియా పర్యటనలో, కాన్ బెర్రాలో హోటళ్లకు రు. 5.65 కోట్లు, కార్లు అద్దెకు తీసుకున్నందుకు రు. 2.48 కోట్లతో సహా మొత్తం రు. 13 కోట్లు అతి ఎక్కువ ఖర్చయిందట. తక్కువలో తక్కువ భూటాన్ పర్యటనలో రు. 41.33 లక్షలు ఖర్చయిందట.
ఇంతకన్నా విచిత్రమైన విషయం భారత పర్యటనకు వచ్చే విదేశీ ప్రభుత్వాధినేతలకు భారత ప్రభుత్వం ఇచ్చే కానుకలకు సంబంధించినది. 2015 జనవరిలో రిపబ్లిక్ డే ఉత్సవాల సందర్భంగా భారత పర్యటనకు వచ్చిన సందర్భంగా జరిగిన ఖర్చు గురించీ, అమెరికా అధ్యక్షుడు బారక్ ఒబామాకు, ఆయన కుటుంబ సభ్యులకు ఇచ్చిన కానుకల విలువ గురించీ దేశంలో వేరు వేరు చోట్ల నుంచి 13 సమాచార హక్కు దరఖాస్తులు వచ్చాయి. అన్నిటికీ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఇచ్చిన జవాబు ఒకటే: ʹʹఅమెరికా అధ్యక్షుడికీ, ఆయన కుటుంబానికీ భారత ప్రధాని ఇచ్చిన కానుకల గురించి సమాచారం వెల్లడించడం ఆ దేశంతో భారత దేశానికి ఉన్న సంబంధాల మీద ప్రతికూల ప్రభావం వేస్తుంది. సమాచార హక్కు చట్టం నిబంధన 8 (1)(ఎ) కింద ఆ సమాచారం ఇవ్వనక్కరలేదని మినహాయింపు కోరుతున్నాం.ʹʹ నిజానికి అమెరికా విదేశాంగ శాఖ కార్యాలయం తమ అధ్యక్షుడికి ఏయే దేశంలో ఎంతెంత విలువైన కానుకలు ఇచ్చారో తన వెబ్ సైట్ మీద వివరాలన్నీ పెడుతుంది. ఇదీ మన ప్రజాప్రతినిధులు ప్రజాధనాన్ని ఖర్చు పెడుతున్న తీరు!!!
Keywords : Narendra Modi, Prime Minister, foreign Visits,
(2024-03-21 23:04:02)
No. of visitors : 2608
Suggested Posts
| ఫోటోకు ఫోజు కోసం జుకర్ బర్గ్ ను లాగేసిన మోడీ !అమెరికా పర్యటనలో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కెమెరాలో కనిపించడం కోసం చేసిన ఓ పని ... ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ వీడియో హల్ చల్ చేస్తోంది.... |
| ఈ అనంతపు గగ్గోలు ఎవరికోసం?దారుణాన్ని దారుణం అన్నవాడిపైననే
అన్యాయాన్ని అన్యాయం అన్నవాడిపైనన ఈయనగారి వ్యంగం.
పావులాకు, బేడాకు ఆడవాళ్ల శరీరాలపై పచ్చబొట్ల పాటలు రాసేవారి నుండి శాంతిని, మానవతావాద స్పందనను ఆశించడం మన బుద్దితక్కువతనమే అవుతుందనకుంటా |
| ప్రధాని మోడీ పీజీ చదువు అబద్దమేనా ?ప్రధానమంత్రి నరేంద్రమోడీ ఎమ్.ఏ డిగ్రీ చేశాడన్నది అబద్దమేనా ? మోడీ అఫీషియల్ వెబ్ సైట్ లో ఈ సంవత్సరం మే వరకు ఉన్న డిగ్రీ వివరాలు జూన్ నెలలో ఎందుకు లేవు ? ఢిల్లీ లా మంత్రి జితేందర్ సింగ్ తోమర్ నకిలీ డిగ్రీ కేసులో..... |
| బాలికా విద్య పై గుజరాత్ గొప్పలన్నీ ట్రాష్బాలికల సంక్షేమం, బాలికల విద్యపై గుజరాత్ ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటున్నది. వాస్తవంగా వారి విద్య విషయంలో ఆ రాష్ట్రం అట్టడుగున నిలిచింది.బాలికల బంగారు భవిష్యత్తు కోసం అంటూ *కన్యా కెలవనీ* పథకం అమలు చేస్తున్నామని.... |
| కేంధ్ర ప్రభుత్వ విధానాలకు నిరసనగా రచయిత్రి సంచలన నిర్ణయంప్రముఖ రచయిత్రి కేంధ్ర సాహిత్య అకాడమీ అవార్డును తిరిగి వెనక్కి పంపింది. నరేంద్ర మోడీ ప్రభుత్వం దేశంలో ప్రజాస్వామిక వాతావరణం చెడగొడుతూ, సాంస్కృతిక వైవిధ్యానికి తూట్లుపొడిచేవిధంగా పరిపాలిస్తోందని ఆరోపిస్తూ.... |
| జైశ్రీరాం పదం కొందరు నేరస్థులకు ఆయుధమైంది...ఇకనైనా మూక దాడులు ఆపండి...మోడీకి లేఖ రాసిన 49 మంది ప్రముఖులు
మీరు పార్లమెంట్లో మూకదాడుల్ని ఖండించారు. కానీ అవి ఆగిపోలేదు. అయితే మీరు వాటిపై తీసుకున్న చర్యలేంటి? ఈ దేశంలో ఒక్క పౌరుడు కూడా భయంతో బతకాడినికి వీళ్లేదు. ʹజై శ్రీరామ్ʹ అనే పదం వింటేనే ప్రజలు వణికిపోతున్నారు. ఇప్పుడది కొందరు ఆకతాయిలు, నేరస్థులకు ఆయుధమైంది. |
| రిజర్వు బ్యాంకు తేల్చిన సత్యం...నోట్ల రద్దుతో బ్లాక్ మనీ పోలేదు... వైటై పోయింది !
గతేడాది నవంబర్ 8వ తేదీ నుండి రిజర్వ్ బ్యాంకుకు తిరిగి వచ్చిన 1000, 500 రూపాయలు ఎన్ని అనేది ఇప్పటికి లెక్కలు తేల్చింది రిజర్వ్ బ్యాంక్. ఇప్పటి వరకు ఎవ్వరు ఎన్ని సార్లు అడిగినా నోరుమెదపని రిజర్వ్ బ్యాంక్ ఎట్టకేలకు బుధవారం విడుదల చేసిన వార్షిక రిపోర్టులో ఆ వివరాలు బయటపెట్టింది. 99 శాతం పెద్ద నోట్లు తమ వద్ద డిపాజిట్ .... |
| ʹప్రతిపక్షాల చేతబడి వల్లే బీజేపీ నేతలు చనిపోతున్నారుʹబీజేపీ నేతలపై ప్రతిపక్షాలు చేతబడి చేస్తున్నాయని బీజేపీ ఎంపీ సాధ్వి ప్రఙ్ఞాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ సీనియర్ నేతలు బాబూలాల్ గౌర్, అరుణ్ జైట్లీలకు నివాళులర్పించేందుకు ఏర్పాటు చేసిన సంతాప సభలో ప్రఙ్ఞా ఈ విధమైన వ్యాఖ్యలు చేశారు. |
| మోడీ రాజ్యం: మోసాన్ని బహిర్గతం చేసినందుకు ఉద్యోగాలు పోగొట్టుకున్నజర్నలిస్టులు !ఏబీపీ న్యూస్ నెట్వర్క్ మేనేజింగ్ ఎడిటర్ మిలిండ్ ఖండేకర్ తోటి జర్నలిస్ట్ పుణ్య ప్రసూన్ బాజ్పేయి ఏబీపీ టీవీ ఛానెల్లో రాత్రి 9 గంటలకు ʹమాస్టర్ స్ట్రోక్ʹ పేరిట షోను నిర్వహిస్తుంటారు. ఆయన సాధారణంగా ఈ షో ద్వారా ప్రభుత్వ విధానాల్లో ఉన్న తప్పొప్పుల గురించి సమీక్షింస్తుంటారు. |
| Is the Real Reason why Narendra Modiʹs Helicopter did not Land at Bahraich, the Absentee Crowd ?Was this, the poor response from his party and the people, then, the real reason why Modiʹs chopper did not land, not the weather but the absence of an enthusiastic cheering crowd?....
|