రాజ్య నిర్భందంలో ʹనిజ నిర్దారణʹ - వరవరరావు
ఛత్తీస్గడ్ బీజాపూర్ జిల్లా, మెటపల్ గ్రామస్తుడు ఆదివాసి కుమ్మా పొట్టం తన పదమూడేళ్ల కొడుకు సోమారు పొట్టంను పోలీసులు డిసెంబర్ 16న పట్టుకొని చంపేసి, మావోయిస్టుగా ముద్రవేశారని బిలాస్పూర్ హైకోర్టులో ఒక పిటిషన్ వేశాడు. తన కొడుకును భద్రతా దళాలు పట్టుకొని ఒక చెట్టుకు కట్టేసి చిత్రహింసలు పెట్టారని, ప్రశ్నలతో వేధిస్తూ తుపాకి మొనలతో శరీరం అంతా పొడిచారని ఆరోపించాడు. ఈ వేధింపులు, చిత్రహింస అంతా ముగిసిన తరువాత గ్రామస్తులు అందరూ చూస్తుండగా ఐదు అడుగుల దగ్గర నుంచి అతన్ని కాల్చి చంపారని వాపోయాడు. అప్పుడు అతని మృతదేహాన్ని చెట్టు నుంచి విప్పి ఒంటి మీది బట్టలు విప్పేసి మావోయిస్టులు వేసుకునే దుస్తుల వలె కనిపించడానికి ఒక నల్ల ప్యాంటు, నల్ల షర్టు వేశారని కూడా ఆరోపించాడు. ఆ మృతదేహం పక్కన ఒక 12-బోర్గన్ పెట్టి ఫొటో తీసుకున్నారని కూడా పేర్కొన్నాడు. గ్రామస్తులు గనుక అతని హత్య గురించి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని పోలిసులు బెదిరించారని కూడా అందులో రాశాడు. డిసెంబర్ 25న బిలాస్పూర్ హైకోర్టు సోమారు మృతదేహాన్ని బయటికి తీసి పరీక్షించాలని ఉత్తర్వులు ఇచ్చింది.
హైకోర్టులో ఒక ఆదివాసి ఒక ఫిర్యాదు చేశాడు గనుక, దాన్ని హైకోర్డు స్వీకరించి మృతదేహాన్ని పరీక్షించాలనే ఉత్తర్వులు ఇచ్చింది గనుక ఇది వార్త అయింది గాని, ఇటువంటి సంఘటనలు ఛత్తీస్గడ్లో, ముఖ్యంగా బస్తర్లో నిత్యకృత్యాలు అయిపోయాయని సుప్రసిద్ధ జర్నలిస్ట్ మాలినీ సుబ్రహ్మణ్యం, కొందరైనా స్థానిక పత్రికా రచయితలు, బేలా భాటియా, జాగ్లాగ్ అనే సంస్థకు చెందిన న్యాయవాదులు ప్రపంచ దృష్టికి తీసుకొస్తున్నప్పటికీ ఛత్తీస్గడ్ ప్రభుత్వానికి మాత్రం చీమకుట్టినట్టయినా లేదు.
మడావి హిడే అనే ఒక ఆదివాసీ మహిళను అర్థసైనిక బలగాలు, ఛత్తీస్ఘడ్ భద్రతా దళాలు గ్రామంలోకి ప్రవేశించి, ఎత్తుకొని వెళ్లి అడవిలో సామూహిక అత్యాచారం చేసి, మావోయిస్టు యూనిఫాం తొడిగి కిష్టారం దళ సభ్యురాలని, ఎన్కౌంటర్లో చనిపోయిందని ప్రకటించారు. ఆమెను తీసుకెళ్లడం గ్రామస్తుల మధ్య నుంచే జరిగింది. గ్రామస్తులు వెంబడిస్తే వాళ్లను ఎన్కౌంటర్ చేస్తాం అనడంతో ఆగిపోయారు. కొంత వ్యవధి ఇచ్చి వెళ్లిన తరువాత వెళ్లి చూస్తే తన ఆదివాసీ దుస్తుల్లో అర్థసైనిక బలగాలు తీసుకెళ్లిన హిడే మావోయిస్టు ఆహార్యంలో ఉండడం, ఆమె పక్కన తుపాకి ఉండడం గ్రామస్తులు చూసి సోనీ సోరీకి సమాచారం ఇచ్చారు. ఆమె వచ్చి ఆందోళన చేసి హైకోర్టులో పిటిషన్ వేస్తే పోలీసులు ఆమె తల్లిదండ్రులు ఆమె తల్లిదండ్రులు కాదని, ఆ హిడ్మే తల్లిదండ్రులు మరెవరో అని కౌంటర్ వేశారు. ఆ కేసు ఇప్పటికీ తేలలేదు.
తాడిమెట్ల గ్రామాన్ని పోలీసులు ఇప్పటికి మూడుసార్లు కాలబెట్టారు. ఇటువంటి గ్రామ దహనాలలో ముఖ్యంగా తాడిమెట్ల గ్రామ దహనంలో పోలీసులే ఉన్నారని నందినీ సుందర్ సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్ సిబిఐ విచారిస్తున్నది. ఇందులో సిబిఐ ఇది స్వయంగా ఐజీ కలూరి షడ్యంత్రం అనే విషయాన్ని బయటపెట్టే అవకాశాలు కనిపించాయి. దాంతో ఆయన కోర్డు సమన్లు స్వీకరించకుండా విశాఖపట్నం ఆసుపత్రిలో చేరాడు. మరొకవైపు నందినీ సుందర్తో పాటు సిపిఐ, సిపిఎం నాయకులను, మరొక జెఎన్య ప్రొఫెసర్ను హత్యానేరంలో ఛత్తీస్ఘడ్ పోలీసులు ఇరికించారు.
ఇవేవీ విడివిడి సంఘటనలు కావు. ఇవి దండకారణ్యంలో నిత్యం జరుగుతున్న ఉదంతాలు. అట్లాగే విడిగా ఒకరు ఇద్దరి విషయంలో జరుగుతున్నవి కావు. వందల సంఖ్యలో ఆదివాసుల మీద జరుగుతున్నవి.
ఇంక సాయన్న వంటి మావోయిస్తు రక్షణ దళంలో పనిచేసే ఒక సీనియర్ నాయకుడు ఎన్కౌంటర్లో చనిపోయాడంటే అది వార్త కూడా కాజాలదు. కాకపోతే మావోయిస్తు దళం మీద కాల్పులు జరిపినపుడు ఒక్కరే ఎట్ల చనిపోతారు, సామాన్యంగా దండకారణ్యంలో మావోయిస్తు దళాలు ఉన్న చోట ఎన్కౌంటర్లు ఎదురెదురుగానే జరుగుతాయి. కనుక ఇది పట్టుకొని చంపిన ఉదంతమే అయి ఉంటుంది.
గ్రీన్హంట్ ఆపరేషన్ మూడో దశలో దండకారణ్యంలో జరిగిన ఎన్కౌంటర్లు, గృహదహనాలు, మహిళలపై లైంగిక అత్యాచారాల గురించి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక 2016 మే నెలలో వరంగల్లో పెద్ద సభ నిర్వహించింది. ఆ సభకు అనుమతి ఇవ్వడానికి హైకోర్టు చాలా ఆంక్షలు విధించింది. అనుమతి కోసం హైకోర్టులో పిటిషన్ వేసిన హైకోర్టు న్యాయవాది చిక్కుడు ప్రభాకర్ ఆ సభలో మాట్లాడడానికి వీళ్లేదని ఆంక్షవిధించింది. రెండు గంటల్లో సభ ముగించాలని, వక్తలనే కాదు, ప్రజలను కూడా మెటల్ డిటెక్టర్ల ద్వారా తప్ప అనుమతించలేదు. అయినా సరే రెండు వేల మంది ప్రజలు, ముఖ్యంగా ఆదివాసులు ఆ సభకు హాజరయ్యారు. అప్పటివరకు ఛత్తీస్ఘడ్లో జరిగిన ఎన్కొంటర్లు, గృహదహనాలు, లైంగిక అత్యాచారాలు, రాజ్యహింస గురించి సిడిఆర్ఒ ఫొటోలతో సహా నిజనిర్ధారణ నివేదిక పుస్తకాన్ని ప్రచురించింది. జనవరి నుంచి ఏప్రిల్ వరకు రాజ్యహింస గురించిన వివరాలతో కూడిన వికల్స్ రచనను శ్రామికవర్గ ప్రచురణలు వెలువరించింది.
గ్రీన్హంట్ ఆపరేషన్ మూడో దశను ఈ 2016 ఆఖరు వరకు ముగించి దండకారణ్యం నుంచి ప్రతిఘటనను రూపుమాపాలని మోడీ, రమణ్ సింగ్ ప్రభుత్వాలు తలపెట్టిన మిషన్-2016 ఈ డిసెంబర్తో పూర్తికావస్తుందని, కనుక ఏప్రిల్ నుంచి డిసెంబర్ దాకా జరిగిన రాజ్యహింస గురించిన నిజనిర్ధారణ చేయడానికి తెలంగాణ ప్రజాస్వామిక వేదిక ఏడుగురుతో కూడిన ఒక బృందాన్నిసుకుమా జిల్లాకు పంపే మార్గంలో వాళ్లను తెలంగాణ పోలీసులు నిర్బంధించి, కుంటా పోలీసులకు అప్పగించారు. ఈ కుంటా పోలీసులు తెలంగాణలో దుమ్ముగూడ దాకా చొచ్చుకొని వచ్చారు. అంటే రెండు ਹਉ੦ సరిహద్దుల్లో రాష్ట్రాల పరిధి లేకుండా కేంద్ర భద్రతా దళాలతో పాటు ఇరు రాష్ట్రాల మావోయిస్టు వ్యతిరేక పోలీసు దళాలు కూడా కలిసే ఇటువంటి చర్యలకు పూనుకుంటున్నాయన్నమాట. ఆ రాత్రి వాళ్లను కుంటా పోలీస్ స్టేషన్లో పెట్టి మరునాడు సుకుమా జైలుకు తరలించారు. వీరి దగ్గర విప్లవ సాహిత్యం, ఒక లక్ష రూపాయలు పాత నోట్ల దొరికాయని తప్పడు ఆరోపణలతో ఈ కేసు పెట్టారు.
ఆ బృందంలో టిడిఎఫ్ కన్వీనర్లు, హైకోర్టు న్యాయవాదులు చిక్కుడు ప్రభాకర్, బల్లా రవీంద్రనాథ్ (రాజకీయ ఖైదీల విడుదల కమిటీ రెండు తెలుగు రాష్ట్రాల కార్యదర్శి, అఖిలభారత కమిటీ కార్యవర్గ సభ్యుడు ), డి. దుర్గాప్రసాద్ (జర్నలిస్టు), రమడాల లక్ష్మయ్య (తుడుం దెబ్బ ఆదివాసీ సంఘం నాయకుడు)లతో పాటు నజీర్ (తెలంగాణ విద్యార్థి వేదిక ఉస్మానియా క్యాంపస్ బాద్యుడు), రాజేంద్రప్రసాద్ (తెలంగాణ విద్యార్థి వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షుడు), దుడు ప్రభాకర్ (కెఎన్పిఎస్ ఆంధ్రప్రదేశ్ కమిటీ అధ్యక్షుడు) మొత్తం ఏడుగురున్నారు. వీళ్లంతా దశాబ్దాలుగా వివిధ ప్రజాసంఘాల ద్వారా ప్రజా ఉద్యమాలలో పనిచేస్తున్నవాళ్లు న్యాయవాదులు, జర్నలిస్తులు, విద్యారంగంలోను, కులనిర్మూలన పోరాట రంగంలోను, ఆదివాసీ పోరాటాల్లోను పనిచేస్తున్న వాళ్లనేది వాళ్ల బాధ్యతలను బట్టి అర్థం చేసుకోవచ్చు
పియుసిఎల్ ప్రకటనలో పేర్కొన్నట్లు న్యాయవాదులు, జర్నలిస్తుల వంటి వాళ్ల విషయంలో ఒక తప్పడు ఆరోపణతో కేసు పెడితే అది హత్యానేరం వంటి తీవ్ర ఆరోపణ కానప్పడు సొంత పూచీపై వదిలిపెట్టాలనేది న్యాయసూత్రం. అటువంటిది వీళ్ల మీద ఛత్తీస్ఘడ్ పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టి, 25 గంటలు గడిచిన తరువాత సుకుమా జైలుకు పంపించారు.
రెండు మూడు దశాబ్దాలుగా తుడుం దెబ్బ నాయకుడుగా ఆదివాసుల్లో పనిచేస్తున్న రమడాల లక్ష్మయ్య దగ్గర లక్ష రూపాయలు పాత నోట్లు దొరికాయని, ఆయన దగ్గర బలవంతంగా తెల్లవారుజాము రెండు గంటలకు తెల్ల కాగితంపై సంతకం తీసుకొని ఈ ఆరోపణ చేశారు. హైదరాబాద్, వరంగల్, భద్రాచలంల మీదుగా సుకుమా జిల్లా అడవి గ్రామాలకు డిసెంబర్ ఆఖరి వారంలో వెళ్లే ప్రజా సంఘాల నాయకులు, విద్యావంతులు పాత నోట్లు తీసుకుపోతున్నారనేది వినడానికైనా సమంజమైన ఆరోపణగా కనిపించదు. అడవి లోపలి నుంచి పాత నోట్ల బయటికి మార్పించడానికి వచ్చాయనే ఆరోపణ చేస్తే కాబోలు అనుకోవడానికి అవకాశం ఉంటుంది. అట్లని ఈ పోలీసులు ఇటువంటి ఆరోపణలు చేయలేని వాళ్లేమీ కాదు.
సరిగ్గా ఇటువంటి ఆరోపణయే సుప్రసిద్ధ న్యాయవాది జగదల్పూర్, దంతేవాడ, సుకుమా మొదలైన బస్తర్ జిల్లాల్లో ఆదివాసీ ఖైదీల కేసులు చేపట్టిన జాగ్లాగ్ అనే సంస్థకు చెందిన శాలినీ గేర్ మీద చేశారు. ఇదే డిసెంబర్ ఆఖరి వారంలో ఆమె జగదల్పూర్లో పోలీసు కమిషనర్కు సమాచారం ఇచ్చి ఆయన సహాయంతోనే ఒక గెస్ట్హౌస్లో దిగింది. ఆమె దిగిన రాత్రి ఇద్దరు ముసుగు వ్యక్తులు వచ్చి ఐతు అనే మావోయిస్టు నాయకుడు మార్పించడానికి ఇచ్చిన పది లక్షల రూపాయలు తీసుకొని రాయ్పూర్ పోతున్నదని ఒక సంఘ్ పరివార్కు చెందిన వ్యక్తితో ఫిర్యాదు రాయించుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేసి కేసు పెట్టారు.
ఇటువంటి విషయాలలో మీడియా కొన్ని కథనాలు రాస్తుంది. ఛత్తీస్ఘడ్కు చెందిన ఒక హిందీ పత్రిక బొగ్గు స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్నది. అది దేశంలో అత్యంత ఎక్కువ ప్రచారంలో ఉన్న పత్రిక. ఎన్నో హిందీ రాష్ట్రాల్లో దానికి ఎడిషన్స్ ఉన్నాయి. ఇటువంటి పత్రికల్లో మావోయిస్తుల గురించి గాని, మావోయిస్టులుగా ఆరోపించబడిన ఆదివాసుల గురించి గాని ఎవరైనా అనుకూలంగా మాడ్డాడితే వాళ్ల గురించి ప్రతికూల కథనాలు వస్తుంటాయి. సాధారణంగా ఇటువంటివి పోలీసులే రాయిస్తుంటారు. ముఖ్యంగా ఐజికలూరి రాయిస్తుంటాడు. ఫిర్యాదు చేసినపుడు కేసు పెట్టకుండా ఎట్లా ఉంటామని పోలీసులు కేసులు నమోదు చేస్తుంటారు.
డా. బినాయక్ సేన్, అసిత్ సేన్ గుప్తా ప్రొ. జి.ఎన్. సాయిబాబా ఇటువంటి తప్పడు నేరారోపణలతో సంవత్సరాల తరబడి జైళ్ళలో మగ్గారు. డా. బినాయక్ సేన్కయితే సెషన్స్ కోర్టు జీవితశిక్ష విధించింది. నందినీ సుందర్తో పాటు మరో నలుగురు సుప్రసిద్ధ ప్రజాస్వామ్యవాదులపై హత్యకేసు ఇప్పటికే కుఖ్యాతి వహించింది.
ఇప్పడిక ఏకకాలంలో ఇటు తెలంగాణ ప్రజాస్వామిక వేదిక నిజనిర్ధారణ బృందం ఏడుగు సభ్యులను అరెస్టు చేసి జైలుకు పంపడం, అటు శాలినీ గేర్ పై తప్పుడు కేసు నమోదు చేయడం కల్లూరి షడ్యంత్రంలో తాజా చేర్చు
ఈ వ్యాసం రాసే సమయనికి, అంటే డిసెంబర్ 2న ఈ ఏడుగురు టిడిఎఫ్ నాయకుల బెయిల్ గురించి వేసిన పిటిషన్ దంతెవాడ సెషన్స్ కోరుకు విచారణకు వచ్చింది. వీళ్ల దగ్గర పట్టుబడిన విప్లవ సాహిత్యమేమిటో, పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ పెట్టడానికి సరియైన చట్టబద్ధమైన విధానం అవలంబించారా లేదా? తెలపమని సెషన్స్ కోర్టు ప్రాసిక్యూషన్ను కోరింది.
ఈ సందర్భంలో ఈ కేసునే ఎత్తివేసుకోవాలని ఆమ్నెస్టి ఇంటర్నేషనల్ మొదలు, పియుసిఎల్, సిడిఆర్ఒ వంటి హక్కుల సంఘాలు మాత్రమే కాకుండా, నేషనల్ అలియన్స్ ఆఫ్ పీపుల్స్ మూవ్ మెంట్ కూడా కోరింది.
మేధాపాట్కర్, అరుణా రాయ్, నిఖిల్ డే, సందీప్ పాండే, బినాయక్ సేన్, ప్రఫుల్లా సమంతర, సునీలమ్ మొదలైన ప్రముఖులు ఎన్ఎపిఎం పక్షాన జాతీయ మానవ హక్కుల కమిషన్ ముందు పెట్టిన నిర్దిష్టమైన డిమాండ్లతో దేశంలోని ప్రజాస్వామ్యవాదులందరు గొంతు కలిపి ఒక దేశవ్యాప్తమైన ఉద్యమం చేస్తే తప్ప ఇటువంటి ఫాసిస్టు చర్యలను నివారించలేం.
ఆ డిమాండ్లు ఇవి -
1) తెలంగాణ ప్రజాస్వామ్య వేదిక ఏడుగురితో కూడిన నిజనిర్ధారణ నాయకులపై ఛత్తీస్ఘడ్ పోలీసులు ఛత్తీస్ఘడ్ పబ్లిక్ సెక్యూరిటీస్ యాక్ట్ కింద పెట్టిన నేరారోపణలన్నిటినీ వెంటనే వెనక్కి తీసుకొని వాళ్లను బేషరతుగా విడుదల చేయాలి.
2) టిడిఎఫ్ నిజనిర్ధారణ బృందాన్ని బస్తర్లో స్వేచ్ఛగా తిరగనివ్వాలి.
8) చట్టాన్ని దుర్వినియోగం చేసి ఈ బృందాన్ని నిర్బంధించిన పోలీసు అధికారులు చట్టానికి అతీతంగా వ్యవహరించడమే కాకుండా, సుకుమా కోర్టును కూడా తప్పదారి పట్టించారు. కనుక ఈ పోలీసు అధికారులకు వ్యతిరేకంగా చట్ట ఉల్లంఘన కేసు నమోదు చేయాలి.
4) ఛత్తీస్ఘడ్లో మానవ హక్కుల ఉల్లంఘనలకు పాల్పడుతున్న బస్తర్ ఐజి కలూరి, ఎస్పి ఆర్.ఎం. దాస్లకు ఎన్ఎచ్ఆర్సి ముందు వ్యక్తిగతంగా హాజరై, సంజాయిషీ చెప్పకోవలసిందిగా ఉత్తర్వులు ఇవ్వాలి.
5) ఎన్ఎచ్ఆర్సి స్వయంగా స్వతంత్రమైన న్యాయవాదులు, విద్యావేత్తలు, పత్రికా రచయితలతో కూడిన ఒక ఉన్నత స్థాయి నిజనిర్ధారణ బృందాన్ని బస్తర్ ప్రాంతానికి పంపించి, అక్కడ జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనల గురించి ఒక సమగ్రమైన నివేదికను ప్రత్యక్షంగా తెప్పించుకోవాలి.
6) పోలీసు యంత్రాంగం మానవ హక్కుల ఉల్లంఘనల విషయంలో బస్తర్లో చేస్తున్న ఈ నేరపూరిత చర్యల గురించి ఎఫ్ఐఆర్లు నమోదు అయ్యేలా ఎన్ఎచ్ఆర్సి చర్యలు తీసుకోవాలని కూడా ఎన్ఎపిఎం కోరింది.
ఈ న్యాయమైన డిమాండ్లతో ప్రజాస్వామ్యవాదులందరూ ఏకీభవిస్తారని ఆశిద్దాం.
- వరవరరావు
Keywords : tdf, varavararao, chattisgarh, maoists, police, kalluri
(2024-03-11 05:59:27)
No. of visitors : 1754
Suggested Posts
| సుక్మా అటాక్ పై మావోయిస్టు నేత వికల్ప్ ఆడియో ప్రకటన ఛత్తీస్గఢ్లోని సుక్మా జిల్లాలో సీఆర్పీఎఫ్ జవాన్లపై తాము జరిపిన దాడి ప్రజా ఉద్యమాలను కాపాడుకోవడానికేనని సీపీఐ మావోయిస్టు పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ అధికార ప్రతినిధి వికల్ప్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఆయన విడుదల చేసిన ఆడియో ప్రకటనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసులపై... |
| A week after Sukma encounter, Maoists release photographs of modern weapons Possessed from CRPFA week after the Sukma encounter, which killed 12 personnel of Central Reserve Police Force (CRPF), the Maoist Party released a press statement carrying an image of assembled modern weapons they looted from the dead CRPF personnel.... |
| బాలికల బట్టలిప్పించి.. కరెంటు షాక్ ఇచ్చారు.. అది బయటపెట్టిన అధికారిణిని మాయం చేశారు !14 నుంచి 16 సంవత్సరాల వయసున్న గిరిజన బాలికలను పోలీసు స్టేషన్లో వివస్త్రలను చేసి హింసించడం నేను కళ్లారా చూశాను. వారి శరీర భాగాలకు కరెంటు షాక్ ఇస్తూ పోలీసులు క్రూరంగా ప్రవర్తించారు. మైనర్లపై వాళ్లు థర్డ్ డిగ్రీని ఎందుకు ప్రయోగించారు?. ఆ బాలికలను తక్షణ వైద్యం చేయించాలని నేను ఆదేశాలు ఇచ్చాను.... |
| అది ఎన్ కౌంటర్ కాదు, మావాళ్లను వెంటాడి చంపేశారు: బోరుమన్న ఆదివాసీలుసుకుమా జిల్లా కుంటా బ్లాక్ కన్నాయి గూడెంపై ఆరవ తేది తెల్లవారుజామున వందలాది మంది పోలీసులు విరుచుకుపడి దొరికిన వారిని దొరికినట్టు ఊచకోత కోశారు. ఆదివాసీలను దుర్మార్గంగా పిట్టల్ని కాల్చినట్టు కాల్చేశారు. |
|
I wrote on Facebook what I witnessed in Bastar: suspended jailer Varsha Dongre
varsha Dongre, the suspended assistant jail superintendent of the Raipur Central Jail in Chhattisgarh, has sent a 376-page reply to a show cause notice from her superior, deputy jail superintendent RR Rai... |
| छत्तीसगढ़ के वन कर्मियों का कारनामा : 46 बैगा आदिवासी परिवारों को किया बेघर मुख्यमंत्री के गृहजिला कवर्धा में वन अमले, राजस्व, पुलिस ने बैगा आदिवासियों के आशियाने को उझाड दिया, समान घरो के बाहर फेंक दिए गए, बैगा आदिवासी महिला,बच्चो, बुढो को पिकप में भरकर अन्यंत्र जगह छोड़ दिया गया यहाँ तक उनके साथ जानवरों जैसा मारपीट भी किया गया. |
| Sukma Police offers reward for Naxal attack perpetratorsSukma District Police on Friday released posters declaring they would reward anyone who could provide information on the Naxalites who were behind the recent attack on a platoon of... |
| Anti-Naxal forces stab 13-year old boy to death with bayonets after branding him as Maoist A 13-year-old Somaru Pottam was allegedly stabbed to death by security forces engaged in anti-Naxalite operations in Bastar region of Chhattisgarh.
Father of the Adivasi boy, Kumma Pottam, has filed a petition in the Chhattisgarh High Court seeking justice..... |
| పాలకుల గ్రీన్ హంట్... ఎదిరిస్తూ పోరాడుతున్న ఆదివాసులు.. డాక్యుమెంటరీపోలీసులు, అర్ద మిలటరీ బలగాలు మరో దేశం మీద దాడి చేసిన విధంగా ఈ దేశ ప్రజలపై దాడి చేస్తున్నారు. ముఖ్యంగా ఈ పదిహేనేళ్ళుగా కొనసాగుతున్న దాడి అత్యంత తీవ్రమైనదే కాక దుర్మార్గమైనది. గ్రీన్ హంట్ పేరుతో పాలకులు చేస్తున్న దాడిని ప్రజల సహకారంతో విప్లవకారులు ఎప్పటికప్పుడు తిప్పికొడుతూనే ఉన్నారు. |
| The Maoists are extend their movement to new areasThe Maoists are trying to extend their "movement" to new areas and they stepped up their activities along the shared borders of.... |