Menu

చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం…. సత్యం చావడు, సత్యం చావదు

anadmin 8 months ago 0 294

సరిగ్గా యాబై సంవత్సరాల కింద ఈ రోజున శ్రీకాకుళ విప్లవోద్యమ నిర్మాతలు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) కేంద్ర కమిటీ సభ్యులు వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసంలను పోలీసులు కాల్చిచంపారు. పోలీసుల కథనం ప్రకారం శ్రీకాకుళం జిల్లా పార్వతీపురం తాలూకా లోని కురుపాం అటవీ ప్రాంతంలో బోరి కొండలలో జూలై 10 సాయంత్రం నాలుగు గంటలకు జరిగిన ఎదురుకాల్పులలో వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసం మరణించారు.
బొబ్బిలి తాలూకా బూర్జవలస గ్రామంలో ఒక పేద రైతు కుటుంబంలో పుట్టిన వెంపటాపు సత్యనారాయణ ఎనిమిదో తరగతి దాకా చదివి, ఉపాధ్యాయ శిక్షణ పొంది, 1956-57ల్లో ఉపాధ్యాయుడుగా ఉద్యోగం ప్రారంభించారు. (అంటే అప్పటికే 18-20 సంవత్సరాల వయసు ఉండి ఉంటుంది. పుట్టిన సంవత్సరం 1938-39 కావచ్చు). 1958లో కొండబారిడిలో తానే ఒక పాఠశాల తెరిచారని కూడ సమాచారం ఉంది. అప్పటికే ఆ ప్రాంతంలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ గిరిజనుల్లో చైతన్యం కోసం కృషి చేస్తున్న పల్లె రాములు తో కలిసి సత్యం గిరిజన సంఘాల నిర్మాణం ప్రారంభించారు. ఆ సమయానికే మార్క్సిజం ప్రభావంలోకి, కమ్యూనిస్టు పార్టీ లోకి వచ్చారు. అలా 1950ల చివరిలో గిరిజన సంఘాల నిర్మాణం, భూస్వాముల, షావుకార్ల దోపిడీ దౌర్జన్యాలను ఎదిరించే కృషి ప్రారంభించిన సత్యం 1960ల చివరికి ఆ ఉద్యమాన్ని క్రియాశీలంగా అభివృద్ధి చేసి సుప్రసిద్ధమైన మహత్తర శ్రీకాకుళ సాయుధ పోరాటంగా మార్చారు. వ్యక్తిగతంగా సత్యం మాస్టారు 1950ల చివరి నుంచి భారత కమ్యూనిస్టు పార్టీలో ఉండి, 1964 విభజనలో భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు) లోకి వెళ్లారు. 1967 నక్సల్బరీ వసంత మేఘ గర్జనతో అఖిలభారత కమ్యూనిస్టు విప్లవకారుల సమన్వయ సమితి ఏర్పడినప్పుడు దానిలో చేరారు. అది 1969 ఏప్రిల్ 22న భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) గా మారినప్పుడు దాని స్థాపక సభ్యులయ్యారు. ఎం ఎల్ పార్టీ ఏర్పడిన తర్వాత 1970 మే 15-16ల్లో జరిగిన మొదటి మహాసభలో ఎన్నికైన 20 మంది కేంద్ర కమిటీ సభ్యులలో ఆయన ఒకరు (అప్పటికి ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనతో పాటు కేంద్ర కమిటీ సభ్యులుగా ఎన్నికైన మరో ఇద్దరు ఆదిభట్ల కైలాసం, మామిడి అప్పలసూరి. ఆదిభట్ల కైలాసం ఉపాధ్యాయుడుగా పనిచేస్తూ, కమ్యూనిస్టు ఉద్యమంలోకి వచ్చారు. భూస్వామ్య కుటుంబంలో పుట్టి, తండ్రికి వ్యతిరేకంగా జరిగిన రైతాంగ ఉద్యమానికి నాయకత్వం వహించారు. భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు లెనినిస్టు) 1970 మహాసభలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర కమిటీ కార్యదర్శిగా ఎన్నికయ్యారు). తర్వాత రెండు నెలలు కూడ తిరగకుండానే బోరి కొండల్లో పోలీసులు సత్యం, కైలాసంలను కాల్చి చంపారు.
సత్యం, కైలాసంల హత్య మర్నాడు సాయంత్రం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో హోం మంత్రి జలగం వెంగళరావు, నక్సలైట్ ఉద్యమం ఇంతటితో అంతమైనట్టేనని అన్నాడు. “ఇరువురు ప్రధాన నాయకులు మరణించడంతో ఆంధ్రప్రదేశ్ లో నక్సలైట్ల ఉద్యమాన్ని జయప్రదంగా తాము అణచివేసినట్లే భావిస్తున్నామని”, “రాష్ట్రంలో ఇక కొద్ది మంది మాత్రమే నక్సలైట్లు ఉండగలరని, బహుశా వీరిని సులభంగా వశపరచుకోవచ్చునని ఆశిస్తున్నానని” వెంగళరావు అన్నాడని ఆంధ్రప్రభ రాసింది. “ఇప్పుడు ఈ ప్రముఖులిద్దరు కాల్చివేయబడటంతో, అసలే నడుము విరిగి ఉన్న నక్సలైట్ ఉద్యమం ఇప్పుడిక పూర్తిగా అతరించిపోవచ్చునని అభిప్రాయపడుతున్నారు” అని ఆంధ్ర పత్రిక రాసింది. సత్యం, కైలాసంల హత్య తర్వాత అప్పటి ఆంధ్రభూమి సంపాదకుడు గోరాశాస్త్రి ‘నరకాసుర వధ’ అని సంపాదకీయం రాశాడనీ, సత్యం, కైలాసాలనే నరకాసురుల వధతో వెంగళరావు అనే శ్రీకృష్ణుడు సమాజానికి శాంతి భద్రతలనిచ్చాడని వ్యాఖ్యానించాడనీ విన్నాను గాని, ఆ సంపాదకీయం దొరకలేదు.
పోలీసు మంత్రి, పాలకవర్గాలు, ప్రధానస్రవంతి పత్రికలు ఏమి ఆశించినప్పటికీ, ఎంత పొంగిపోయినప్పటికీ సత్యం 1970 జూలై 10న చావలేదు. సత్యానికి చావు లేదు. కురుపాం కొండల్లో ఒరిగిపోయిన సత్యం దేశమంతా పునర్జీవిస్తూనే ఉన్నాడు. ఈ ఐదు దశాబ్దాలలో తిరిగి తిరిగి పునర్జీవితం సాధిస్తూనే ఉన్నాడు. సత్యం ఫీనిక్స్ పక్షిలా చితాభస్మంలోంచి పదే పదే రెక్క విప్పుతూనే ఉంది. యాబై ఏళ్ల కిందటి పాలకులు మాత్రమే కాదు, ఈ యాబై ఏళ్లలో అనేక మంది పోలీసు అధికారులు, మంత్రులు, హోం మంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు, ప్రచారసాధనాల వ్యాఖ్యాతలు సత్యం మరణించాడని, సత్యం ఇక రాడని, మరణశాసనాలు రాస్తూనే ఉన్నారు. కాని సత్యం చావలేదు, సత్యానికి చావు లేదు. దోపిడీ పీడనలు ఉన్నంతవరకూ ఆ దోపిడీ పీడనల మీద ప్రజాపోరాట సత్యం నిత్య చిరంజీవి.

-ఎన్.వేణు గోపాల్
10‍ – 07‍ – 2020

Written By

Leave a Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Daytro Designer Brands Cartier Reviews
– Advertisement – BuzzMag Ad