పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ మెజార్టీ మార్కు చేరుకోలేకపోయినప్పటికీ మోడీ మాత్రం జూన్ 4 న ఢిల్లీలోని భారతీయ జనతా పార్టీ ప్రధాన కార్యాలయం నుండి తన ప్రసంగంలో, తమ అభివృద్ది కార్యక్రమాలవల్లనే తాము మళ్ళీ గెలిచాలని చెప్పారు. తమ ప్రభుత్వం, మంత్రులు ప్రజల కోసం చేసిన పనులకు ఈ ఫలితాలే నిదర్శమని గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు విరుద్దంగా ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కనీసం 20 మంది బీజేపీకి చెందిన కేంద్ర మంత్రులు ఓటమిపాలయ్యారు. కొందరు అతితక్కువ ఓట్లతో మాత్రమే చావు తప్పి కన్ను లొట్టపోయినట్టు గెలిచామనిపించారు.
ఓడిపోయిన కేంద్ర మంత్రుల జాబితా ఇది
- రాజీవ్ చంద్రశేఖర్
ఎన్నికలు జరిగినప్పుడు చంద్రశేఖర్ కేంద్ర జలశక్తి మంత్రిగా, స్కిల్ డెవలప్మెంట్ , ఎంటర్ప్రెన్యూర్షిప్ శాఖ, ఎలక్ట్రానిక్స్ ,ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. కేరళలోని తిరువనంతపురం స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి శశిథరూర్ చేతిలో 16,077 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- స్మృతి ఇరానీ
కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రిగా పనిచేసిన ఇరానీ, అమేథీ స్థానం నుంచి గాంధీ కుటుంబానికి దగ్గరి వ్యక్తి అయిన కాంగ్రెస్ అభ్యర్థి కిశోరీ లాల్ శర్మ చేతిలో 1,67,196 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- అజయ్ కుమార్ మిశ్రా
లఖింపూర్ ఖేరీలో నిరసన తెలుపుతున్న రైతులపై వాహనం నడిపించి ఐదుగురు మరణాలకు దారితీసిన అతని కుమారుడి వ్యవహారంలో వివాదాస్పదమైన మాజీ కేంద్ర హోం వ్యవహారాల సహాయ మంత్రి అజయ్ కుమార్ మిశ్రా సమాజ్వాదీ పార్టీకి చెందిన ఉత్కర్ష్ వర్మ మధుర్పై 34,329 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- సుభాష్ సర్కార్
కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రిగా పనిచేసిన సర్కార్ బంకురా స్థానం నుంచి తృణమూల్ కాంగ్రెస్ అభ్యర్థి అరుప్ చక్రవర్తి చేతిలో 32,778 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- అర్జున్ ముండా
జార్ఖండ్ లోని ఖుంతీ సీటులో అర్జున్ కాంగ్రెస్ అభ్యర్థి కాళీ చరణ్ ముండా చేతిలో 1,49,675 ఓట్ల తేడాతో ఓడిపోయారు. అర్జున్ వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రిగా ఉన్నారు.
- కైలాష్ చౌదరి
కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రిగా ఉన్న చౌదరి, రాజస్థాన్లోని బార్మర్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు చెందిన ఉమ్మెద రామ్ బెనివాల్ చేతిలో 4,17,943 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడ స్వతంత్ర అభ్యర్థి రవీంద్ర సింగ్ రెండవ స్థానంలో ఉండగా చౌదరి మూడవ స్థానంలో నిలిచారు.
- ఎల్.మురుగన్
మురుగన్ తమిళనాడులోని నీలగిరి (రిజర్వ్డ్ ఎస్సీ) సీటులో డీఎంకేకు చెందిన ఎ. రాజా చేతిలో 2,40,585 ఓట్ల తేడాతో ఓడిపోయారు. మురుగన్ కేంద్ర సమాచార మరియు ప్రసార శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు.
- నిసిత్ ప్రమాణిక్
గతంలో కేంద్ర క్రీడలు, యువజన వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన ప్రామాణిక్ పశ్చిమ బెంగాల్లోని కూచ్ బెహార్ స్థానం నుండి టిఎంసికి చెందిన జగదీష్ చంద్ర బర్మా బసునియా చేతిలో 39,250 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- సంజీవ్ బల్యాన్
బల్యాన్ కేంద్ర ఫిషరీస్, పశుసంవర్ధక,పాడిపరిశ్రమ శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. ముజఫర్నగర్లో ఆయన సమాజ్వాదీ పార్టీకి చెందిన హరేంద్ర సింగ్ మాలిక్పై 24,672 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- కపిల్ పాటిల్
కేంద్ర పంచాయతీరాజ్ శాఖ మాజీ మంత్రి, మహారాష్ట్రలోని భివాండి స్థానం నుంచి ఎన్సీపీ (శరద్ పవార్)కి చెందిన బాల్య మామా-సురేష్ గోపీనాథ్ మ్హత్రే చేతిలో 66,121 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- రావ్ సాహెబ్ దాన్వే
కేంద్ర రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేసిన దాన్వే మహారాష్ట్రలోని జల్నా స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కళ్యాణ్ వైజినాథరావు కాలే చేతిలో 1,09,958 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- భారతి పవార్ కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిగా పనిచేసిన భారతి పవార్ ఎన్సీపీ (శరద్ పవార్)కి చెందిన భాస్కర్ మురళీధర్ భగరే చేతిలో మహారాష్ట్రలోని డిండోరి (రిజర్వ్డ్ ఎస్టీ) స్థానంలో 1,13,199 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- కౌశల్ కిషోర్
కిషోర్ కేంద్ర హౌసింగ్ , పట్టణ వ్యవహారాల శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు,ఉత్తరప్రదేశ్లోని మోహన్లాల్గంజ్ (రిజర్వ్డ్ ఎస్సీ) సీటులో ఆయన సమాజ్వాదీ పార్టీకి చెందిన ఆర్.కె. చౌదరి చేతిలో 70,292 ఓట్లతో ఓడిపోయాడు.
- భగవంత్ ఖుబా
కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రిగా ఉన్న ఖుబా కర్ణాటకలోని బీదర్లో కాంగ్రెస్ అభ్యర్థి సాగర్ ఈశ్వర్ ఖండ్రే చేతిలో 1,28,875 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- వి. మురళీధరన్
మురళీధరన్ కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి, ఈయన కేరళలోని అట్టింగల్ నియోజకవర్గంలో కాంగ్రెస్కు చెందిన అదూర్ ప్రకాష్ చేతిలో 16,272 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- మహేంద్రనాథ్ పాండే
కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి పాండే ఉత్తరప్రదేశ్లోని చందౌలీ స్థానంలో సమాజ్వాదీ పార్టీకి చెందిన వీరేంద్ర సింగ్పై 21,565 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- సాధ్వి నిరంజన్ జ్యోతి
కేంద్ర ఉక్కు , గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి అయిన జ్యోతి, యుపిలోని ఫతేపూర్లో సమాజ్వాదీ పార్టీకి చెందిన నరేష్ ఉత్తమ్ పటేల్ చేతిలో 33,199 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- భాను ప్రతాప్ సింగ్
సింగ్ MSMEల కేంద్ర సహాయ మంత్రిగా పనిచేశారు. యుపిలోని జలౌన్లో (రిజర్వ్డ్ ఎస్సీ) సమాజ్వాదీ పార్టీకి చెందిన నారాయణ్ దాస్ అహ్రివార్ చేతిలో 53,898 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- రాజ్ కుమార్ సింగ్
సింగ్, కేంద్ర విద్యుత్ మరియు పునరుత్పాదక ఇంధన మంత్రిగా ఉన్నారు, బీహార్లోని అర్రాలో సీపీఐ (ఎంఎల్)-లిబరేషన్కు చెందిన సుదామ ప్రసాద్ చేతిలో 59,808 ఓట్ల తేడాతో ఓడిపోయారు.
- దేబశ్రీ చౌధురి
చౌధురి కేంద్ర మహిళా, శిశు అభివృద్ధి శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఆమె దక్షిణ కోల్కతా స్థానంలో 1,87,231 ఓట్ల తేడాతో TMC అభ్యర్థి మాలా రాయ్ చేతిలో ఓడిపోయారు.

తెలంగాణలో ఉద్యమకారులకు NIA నోటీసులు
బీజేపీ బాటలో ఆప్… దళితులకు భూమి కోసం పోరాడుతున్న ముకేశ్ మలౌద్ అక్రమ అరెస్ట్
నక్సల్స్ ఓడిపోయారు సరే, మరి గెలిచినదెవరు? – హిమాంశు కుమార్
బీసీ రిజర్వేషన్ కోసం ఈ నెల 18న జరగబోవు బంద్ కు మావోయిస్టు పార్టీ మద్దతు
కగార్లో భాగమే ఈ క్రూరమైన నవ్వు – సంఘర్ష్
5 రాష్ట్రాల బంద్ – మావోయిస్టు పార్టీ పిలుపు 