జీఎన్ సాయిబాబా పరిస్థితిపై సీపీఎం మౌనాన్ని ప్రశ్నిస్తూ ఏచూరికి మాజీ సహచరుడి బహిరంగ లేఖ
(జైల్లో అమానవీయ పరిస్థితుల్లో జీవిస్తున్న ప్రొఫెసర్ జీఎన్.సాయిబాబా గురించి కనీసం మాట్లాడకపోవడాన్ని ప్రశ్నిస్తూ సీపీఐఎం ప్రధానకార్యదర్శి సీతారాం ఏచూరికి ఆయన ఒకప్పటి సహచరుడు ఉదయ్ చే రాసిన లేఖ పూర్తి పాఠం. హిందీ నుండి తెలుగులోకి అనువాదం మహేష్ ధూలిపల్ల )
కామ్రేడ్ సీతారాం ఏచూరి
ప్రధాన కార్యదర్శి , సీపీఎం
మీరు ఆరోగ్యవంతులు కావాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే మీరు క్షణం తీరిక లేకుండా గడుపుతుంటారు. మీపైన ఉన్న బాధ్యతలు చిన్నా చితకావి కావు. అవి వ్యవస్థకు సంబంధించినవి. తెల్లవారినప్పటి నుంచి రాత్రి బాగా పొద్దుపోయేవరకు మీరు చాలా పని చేయాల్సి ఉంటుంది. మీటింగులు, సెమినార్లు, సమ్మేళనాలకు రాకపోకలు సాగించడానికి మీరు ఎంతో దూరం ప్రయాణించాల్సి ఉంటుంది. మీరు ఈ కష్టమంతా మీ కోసం కాకుండా సమాజం కోసం పడుతున్నారు. నేను నా జీవితంలో రాజకీయ, సామాజిక పోరాటాలను సి.పి.ఎం నుంచే నేర్చుకున్నాను. అనేక సెమినార్లు, ర్యాలీలు, సమ్మేళనాల్లో మీరు, మీ పార్టీ నేతల ప్రసంగాలు వింటూ వచ్చాను. యావత్ ప్రపంచంలో సామాజ్రవాదం ద్వారా పీడించబడుతున్న వియత్నాం, లిబియా, ఆఫ్ఘనిస్థాన్, ఇరాక్, ఆఫ్రికా దేశాలే కాకుండా లాటిన్ అమెరికా దేశాల కోసం మీ స్వరాన్ని ఎలుగెత్తి చాటుతూనే ఉన్నారు.
కానీ ప్రొఫెసర్ GN సాయిబాబా సమస్యలపై మీ మౌనాన్ని చూస్తున్న నాకు మీ విశ్వసనీయత పట్ల సందేహం కలుగుతున్నది. ఏం కారణం చేత మీరు GN పైన జరుగుతున్న అమానవీయ హింసపై మాట్లాడటం లేదు. ఆయన్ను అన్యాయంగా అరెస్టు చేయడాన్ని వ్యతిరేకిస్తూ యావత్ ప్రపంచంలో మేధావులు నిరసన గళం విప్పారు. అప్పట్లో బ్రెజిల్లో ఫుట్బాల్ ప్రపంచ కప్ పోటీలు జరుగుతుండగా ఆటగాళ్ళలో అధికులు, ప్రేక్షకులు ఎలుగెత్తి వారి నిరసన గళం చాటారు. కానీ భారతదేశంలో మార్క్స్వాదానికి అతిపెద్ద పట్టుగొమ్మ అయిన పార్టీ నిమ్మకు నీరెత్తినట్టుగా మౌనం వహించింది. యావత్ దేశంలో గ్రామాల దాకా మీ పార్టీ విస్తరించి ఉంది. కానీ ఒక్క చోట కూడా ధర్నా కానీ ప్రదర్శన కానీ చేపట్టింది లేదు.
ఈ మౌనం వెనుక అంతరార్థం తెలుసుకోవడానికి నేను ప్రయత్నించినప్పుడు ఈ మౌనం అత్యంత భీతిగొలిపేది మరియు లౌక్యంతో కూడుకున్నది. గతంలో సైతం అనేక సందర్భాల్లో మీరు కానీ మీ పార్టీ కానీ ఒక్క మాట మాట్లాడింది లేదు. నక్సల్బరీ యోధుడు చారూ మజుందార్ను అరెస్టు చేసి హత్య చేసినప్పుడు కానీ ఆ తర్వాత అధికారాలను ఉపయోగించి జరిపిన నిర్బంధాల్లో హత్యలు చోటు చేసుకున్నప్పుడు కానీ బూటకపు ఎన్కౌంటర్లలో హత్యలు జరిగినప్పుడు కానీ మీ పార్టీ కేవలం మౌనంగా ఉండిపోయింది. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మావోయిస్టు నేత ఆజాద్ మరియు కేంద్ర హోమ్ మంత్రి పి.చిదంబరం మధ్య శాంతి నెలకొల్పే దిశగా చర్చలు జరిగాయి. ఈ చర్చలు జరగడానికి కొందరు మేధావులు మధ్యవర్తిత్వం వహించారు. చర్చల అనంతరం కామ్రేడ్ ఆజాద్ బూటకపు ఎన్కౌంటర్లో హత్యగావించబడ్డారు. దీంతో శాంతి చర్చలు నిలచిపోయాయి. అంటే ప్రభుత్వం వంచనకు పాల్పడిందా? ప్రభుత్వం శాంతిని కోరుకోవడం లేదా? కానీ దీనిపై పార్లమెంట్లో మీ పార్టీ నుంచి ఏ ఒక్కరూ మాట్లాడింది లేదు. కస్టడీలో ఉన్న సోనీ సోరీపై అమానవీయంగా వ్యవహరించారు. ఆమె మర్మాంగాన్ని రాళ్ళతో నింపారు. ఆమె భర్తను జైల్లో గుండాలతో పాటుగా ఉంచారు. కాళ్ళూ చేతులూ విరగ్గొట్టించారు. అనంతరం ఆయన మరణించారు. సోనీ సోరీ మేనల్లుడు లింగా మలద్వారంలో లాఠీ చొప్పించారు. అయినా కానీ మీరు మౌనంగా ఉండిపోయారు. అరాచకాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న పోలీసుల్లో అత్యధికులకు మీ మద్దతుతో కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం శౌర్య పురస్కరాలతో సన్మానించింది. ఎప్పటిలాగానే మీరు మిన్నకుండిపోయారు. లెక్కలేనంత మంది గిరిజన మహిళలపై అత్యాచారాలు జరిగాయి. దారుణంగా హత్యలు చోటు చేసుకున్నాయి. అయినప్పటికీ సి.పి.ఎం చెవులకు వినపడ్డం కోసం వీధి నుంచి పార్లమెంట్ దాకా గళమెత్తుతాం.
ఈ బాధితులంతా మీ పార్టీకి మరియు రాజ్యానికి వ్యతిరేకులనే తప్పుడు ముద్ర పడిన కారణంగా మీరు మౌనంగా ఉండిపోయారా? వీరు నందిగ్రామ్ లేకుంటే సింగూరులో రాజ్యం చేపట్టిన దమనకాండకు వ్యతిరేకించి ఉంటారు లేకుంటే కొందరు విప్లవకారులు మీ కార్యక్రమంతో విభేదించి ఉంటారు. కేవలం దీని వల్లనే మీరు పెదవి విప్పడంలేదా? కేవలం అందుకోసమే ఈ మౌనం కొనసాగుతున్న పక్షంలో అది ఒక ప్రమాదకరమైన మౌనం.
భారత విప్లవకారుడు భగత్ సింగ్ను నేను ఆదర్శంగా తీసుకుంటాను. మీ పార్టీ మీరూ అదే ఆదర్శాన్ని పాటిస్తారు. అలాంటప్పుడు భగత్ సింగ్ మరియు ఆయన సహచరుల నుంచి మనం నేర్చుకున్నదేమీ లేదా? కేవలం పేరు తెచ్చుకోవడానికి లేకుంటే విగ్రహానికి వందనం చేయడానికే భగత్ సింగ్ను కార్యక్రమాల్లో స్మరించుకోవడమనే రివాజును అనుసరిస్తున్నామా? సైమన్ కమిషన్ను వ్యతిరేకించిన లాలా లజపతిరాయ్ను అప్పటి బ్రిటీష్ ప్రభుత్వం లాఠీలతో కుళ్ళబొడిచి హత్య చేసింది. ఆ సమయంలో లాలాజీ మరియు భగత్ సింగ్ వేర్వేరు సైద్ధాంతిక భావజాలాలతో కార్యోన్ముఖులై ఉన్నారు. లాలా జీ దక్షిణ పథాన్ని చేపట్టగా అదే ఆయన సహచరుడైన భగత్ సింగ్ కమ్యూనిస్టు ఆందోళన దిశగా సాగిపోసాగారు. ఇదే విషయమై లాలా జీ మరియు భగత్ సింగ్ల మధ్య అనేక పర్యాయాలు వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. నా దగ్గరకు మరెప్పుడూ రావద్దని లాలాజీ ముఖం మీదనే చెప్పేశారు. నా ఇంటి తలుపులు మీకెప్పుడూ తెరిచి ఉండవని తేల్చి చెప్పేశారు. అయినా కానీ సామ్రాజ్యవాద సర్కారు చేతిలో లాలాజీ మరణించారు. సైద్ధాంతిక భావజాలం విషయంలో తేడాలున్నప్పటికీ లాలాజీ మృతికి బదులు తీర్చుకోవాలని భగత్ సింగ్ ప్రతినబూనారు. ఆ విధంగా బదులు తీర్చుకున్నారు.
90% వికలాంగుడైన ప్రొఫెసర్ దళిత కుటుంబానికి చెందినవారు. ఆయనకు ఫ్రాంకియాస్ వచ్చింది. గాల్ బ్లాడర్ రాళ్ళు ఉన్నాయి. ఆయనకు బీపీ మరియు హృద్రోగం తీవ్ర స్థాయిలో ఉంది. వీటికి తోడు ఒక చేయి మాత్రమే పనిచేస్తోంది. అంతేకాక శరీరంలో అనేక అంగాలు పనిచేయడం మానేశాయి.
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నప్పటికీ భారత ప్రభుత్వం ఆయనకు ఔషధాలు ఇవ్వడం లేదు సరికదా ఏ ఆసుపత్రికీ ఆయన్ను తీసుకెళ్ళలేదు. 90% వికలాంగుడైన కారణంగా ప్రొఫెసర్ సాయిబాబాకు సహాయకుడి అవసరం ఎంతగానో ఉంది. కానీ అలాంటి ఏర్పాటు చేయలేదు. ఆయన్ను మానసికంగా వేధిస్తున్నారు. అనేక సార్లు ఆయన కళ్ళు తిరిగి పడిపోయారు. ఆయన తన భార్యకు ఒక లేఖ రాశారు. వెంటనే ఉపశమనం లభించని పక్షంలో ఈ వేదన తొలగిపోదని ఆయన అందులో పేర్కొన్నారు. ఇప్పుడిక ఆయనకు తాత్కాలిక ఉపశమనం లభించని పక్షంలో నోరులేని వారి కోసం పోరాడుతున్న ఒక యోధున్ని మనం కోల్పోతాము.
భావి విప్లవకారులు GN గురించి చదివిన పక్షంలో క్రూరమైన రాజ్యాన్ని దూషిస్తారు. ఒక గొప్ప విప్లవకారుడు, మానవతావాది, ప్రగతిశీల మేధావిని క్రూరమైన రాజ్యం వేధించి వేధించి మరీ ఎలా హతమార్చిందని మండిపడతారు. అంతేకాక మీపైన మరియు మౌనంపైన వారు విరుచుకుపడతారు. భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్లకు విధించిన ఉరిశిక్ష నిలుపదలకు ప్రయత్నించని కారణంగా మహాత్మా గాంధీని నేటి తరం ఎలా దూషిస్తున్నారో అలాగే భావితరం మండిపడతారు.
GN సాయిబాబా రాజ్యం నుంచి ఎలాంటి మన్నింపు లేదా బిచ్చం కోరడంలేదు. ఆయన కేవలం న్యాయానికి లోబడి ఉపశమనాన్ని కోరుతున్నారు. అది ఆయనకు న్యాయపరంగా సంక్రమించినదే. న్యాయం కోసం భగత్ సింగ్ 81 రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు. ఆయన సహచరులు సైతం ఈ నిరాహార దీక్షలో పాలుపంచుకున్నారు. 63వ రోజుల నిరాహార దీక్ష అనంతరం జతిన్ వీరమరణం పొందారు. కనుక జైలు నియమ నిబంధనలను అనుసరించి ప్రొఫెసర్ GN కు తాత్కాలిక ఉపశమనం లభించాలి. అందుకోసం మనం పోరాడాల్సిన అవసరం ఉంది.
ఆయన అనారోగ్యం, 90% వైకల్యాన్ని చూసినప్పటికీ ప్రభుత్వం ఆయనకు ఎలాంటి ఆసరా అందించడంలేదు. ఆయన ఆరోగ్యం కుదుటపడేంతవరకు ఆయనకు జైలులో..
* ఆయనకు ఒక సహాయకుని ఏర్పాటు చేయాలి.
* ఆయనకు వైద్య చికిత్స మరియు ఔషధాలు అందించాలి, మంచి ఆసుపత్రిలో ఆయనకు చికిత్స చేయించాలి.
* ఆయనకు రాయడానికి, చదవడానికి అవసరమైన సామాగ్రిని అందుబాటులో ఉంచాలి.
* ఆయన అనారోగ్యం, పడని వాతావరణాన్ని అనుసరించి వస్త్రాలు, దుప్పట్లు, గది ఏర్పాటు చేయాలి.
మీ పార్టీ అమెరికాలోని గ్వాంటినామో జైల్లో అమానవీయ కార్యాలకు వ్యతిరేకంగా గళం విప్పుతుంది. కానీ మన దేశంలోని జైళ్ళలో నరక యాతన అనుభవిస్తున్న వారి తరఫున గళం విప్పకూడదా?
నేను భారతదేశపు ప్రగతిశీల పౌరుడిని మాత్రమే కాదు మీ పార్టీలో ఒకప్పటి మీ సహచరునిగా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. వెంటనే ఈ పత్రంపై సంతకం చేయండి. పార్లమెంట్ మరియు సిపిఎం అగ్రస్థాయి సమావేశం జరుగుతున్న కారణంగా సరైన వేదికపై ప్రభుత్వంతో మాట్లాడండి. దీనికి తోడు మీ పార్టీకి అనుబంధంగా ఉన్న కార్మికులు, రైతులు, విద్యార్థులు, యువకులు, మహిళా సంఘాలతో నిరసన ప్రదర్శనలకు నిర్ణయం తీసుకోండి.
దీనిపై మీరు మాట్లాడుతారని అలాగే పోరాడుతారని ఆశిస్తున్నాను.
ఒకప్పటి మీ సహచరుడు
ఉదయ్ చే
UDay Che
హిందీ నుండి తెలుగులోకి అనువాదం మహేష్ ధూలిపల్ల
Keywords : gn saibaba, delhi university, seetharam echuri, cpm, maoists
(2024-04-24 20:01:05)
No. of visitors : 1841
Suggested Posts
0 results