అబిడ్స్లో వేల మంది ధర్నా.. ప్రపంచానికి చూపించని మీడియా
అబిడ్స్ అనగానే గుర్తుకు వచ్చేది జీపీవో. హైదరాబాద్ నడిబొడ్డున్న ఉన్న ఈ ప్రాంతంలో ఈ రోజు వేలాది మంది గ్రామీణ్ డాక్ సేవక్లు తమ హక్కుల కోసం ధర్నా చేసి నగరాన్ని స్తంభింప చేసినా ఒక్క టీవీ ఛానల్ చూపించలేదు. ఆన్లైన్ పేజీలు కూడా నడిపే ఏ మెయిన్ స్ట్రీమ్ పత్రిక కూడా ఒక్క ముక్క రాయలేదు. డాక్ సేవక్లు అడిగిన న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని కోరుతూ గత 14 రోజులుగా దేశ వ్యాప్తంగా ఆందోళనలు జరుగుతున్నా ఒక్క లైను బ్రేకింగ్ న్యూస్కు కూడా నోచుకోలేదు. అరకొర వేతనాలతో పని చేస్తున్న ఈ గ్రామీణ డాక్ సేవకులు అడిగింది పెద్ద భారమేం కాదు. వారు అందించే సేవలకు.. తీసుకునే జీతాలకు పొంతనే ఉండదు. పేరుకే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి.. కాని వేతనం మాత్రం నైట్ వాచ్మ్యాన్ కన్నా తక్కువే. వాళ్ల న్యాయమైన డిమాండ్లు తీర్చమని గత 14 రోజులుగా ఆందోళనలు చేసి.. ఈ రోజు హైదరాబాద్ నగరాన్ని స్తంభింపచేసినా.. కేంద్ర ప్రభుత్వానికి, మోడీకి భయపడే మీడియా కళ్లు మూసుకుంది. అయితే ఈ ఆందోళనలు చూసిన వీక్షణం పత్రిక ఎడిటర్ ఎన్ వేణుగోపాల్ తన ఫేస్బుక్ పేజీలో పూర్తి సమాచారాన్ని ఇచ్చారు. అసలు గ్రామీణ డాక్ సేవక్లు అడిగిన డిమాండ్లు ఏంటి.. ప్రభుత్వం ఎలా స్పందిస్తోంది.. పోస్టల్ అధికారులు వీళ్ల నిరసనలకు స్పందించారా లేదా అనే విషయాన్ని వివరించారు. ఆ పోస్టు యధాతథంగా..
---------------------------------------
సమరశీల కార్మికుల మధ్య...
మిత్రులారా, నిజంగా కార్మికవర్గం తలచుకుంటే ఏమి సాధించగలదో, కార్మికవర్గపు శక్తి ఎంత అప్రతిహతమైనదో నాకు ఇవాళ మరొకసారి తెలిసివచ్చింది. ఆ అనుభవం మీతో పంచుకోవడానికి...
భారత తపాలా శాఖకు చెందిన మూడు లక్షల మంది గ్రామీణ్ డాక్ సేవక్ లు దేశవ్యాప్తంగా గత పద్నాలుగు రోజులుగా సమ్మె చేస్తున్నారు. దేశంలోని లక్షా యాబై ఐదు వేల పోస్టాఫీసుల్లో లక్షా ముప్పై వేల పోస్టాఫీసులు మూతపడి ఉన్నాయి. నాలుగు కేంద్ర కార్మిక సంఘాలు ఈ సమ్మె నిర్వహిస్తున్నాయి. ఇంకా సరిగ్గా చెప్పాలంటే ఆ మూడు లక్షల మంది కార్మికుల చైతన్యమే ఆ కార్మిక సంఘాల నాయకత్వం ఈ సమ్మెను నిర్వహించేలా ఒత్తిడి చేస్తున్నది. వాళ్లు మిగిలిన పోస్టల్ సిబ్బంది కన్న ఎక్కువగానో, సమానంగానో పని చేస్తున్నప్పటికీ కనీసం ʹసమాన పనికి సమాన వేతనంʹ అనే సహజ హక్కు, రాజ్యాంగబద్ధమైన హక్కు వారికి దక్కడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అత్యవసరమైన సమాచార విధులు నిర్వహిస్తున్న వారిగా ప్రావిడెంట్ ఫండ్, సెలవులు, ఇ ఎస్ ఐ వంటి ఇతర ఉద్యోగులు అనుభవిస్తున్న సౌకర్యాలేవీ వారికి అందడం లేదు. వారి కోరిక ఎంత చిన్నదో, కనీసమైనదో, న్యాయమైనదో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. మిగిలిన కేంద్ర ప్రభుత్వోద్యోగులందరికీ ఉన్నట్టుగా వారికి వేతన సవరణ సంఘాల (పే రివిజన్ కమిషన్) ఏర్పాటు లేదు. మిగిలిన కేంద్ర ప్రభుత్వోద్యోగులందరికీ ప్రస్తుతం ఏడో పి ఆర్ సి సిఫారసులు అమలవుతుండగా, ఈ గ్రామీణ్ డాక్ సేవక్ లకు మాత్రం ప్రతి పి ఆర్ సి తర్వాత ఒక ప్రత్యేక కమిటీని నియమించి, ఆ కమిటీ సిఫారసు చేసిన అతి తక్కువ వేతన పెరుగుదలలు అమలు చేస్తున్నారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం ఏడో పి ఆర్ సి కి సమాంతరంగా కమలేష్ చంద్ర కమిటీని నియమించింది. మిగిలిన కేంద్ర ప్రభుత్వోద్యోగులందరికీ ఏడో పిఆర్ సి సిఫారసులు 2016 జనవరి 1 నుంచే అమలు చేస్తున్నప్పటికీ, కమలేష్ చంద్ర కమిటీ తన నివేదికను 2016 నవంబర్ లోనే ఇచ్చినప్పటికీ, కేంద్ర ప్రభుత్వం ఆ నివేదికలో ఏమున్నదో కూడ బైటపెట్టలేదు. ఆ సిఫారసులను అమలు చేయడం ప్రారంభించలేదు. గ్రామీణ ప్రాంతాలలో కేవలం తపాలా సేవలు మాత్రమే కాక, ఎన్నో పథకాల బాధ్యతను కూడ ఈ గ్రామీణ్ డాక్ సేవక్ ల మీద పెడుతూ, వారి పనిగంటలను ఇతర ఉద్యోగుల పనిగంటల కన్న ఎక్కువగా పెంచిన ప్రభుత్వం, వారి వేతనాలను మాత్రం బిచ్చం వేసినట్టుగా పదివేల రూపాయలు దాటనివ్వడం లేదు. ఒకరకంగా వెట్టి చాకిరీ చేయించుకుంటున్నది.
ఈ నేపథ్యంలో తమ ఉద్యోగ భద్రత కోసమో, పని పరిస్థితుల మెరుగుదల కోసమో, సమాన పనికి సమాన వేతనం కోరుతూనో కూడ కాదు, కేవలం కమలేష్ చంద్ర కమిటీ నివేదికను పద్దెనిమిది నెలల తర్వాతనైనా బైటపెట్టమని, ఆ కమిటీ సిఫారసు చేసినట్టుగా తమ వేతనాలలో పదో పాతికో పెంచమని గ్రామీణ్ డాక్ సేవక్ లు కోరుతూ సమ్మె చేస్తున్నారు. నిజానికి సమాజానికి అత్యవసరమైన సేవలు అందిస్తున్న అట్టడుగు గ్రామీణ స్థాయి కార్మికుల ఈ దుస్థితి చూసి పాలకులు, బుద్ధిజీవులు, సంఘటిత రంగంలోని కార్మికులు సిగ్గుపడాలి.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లకు చెందిన గ్రామీణ్ డాక్ సేవక్ లు ఇవాళ తమ సమ్మె పద్నాలుగో రోజు సందర్భంగా హైదరాబాద్ లోని పోస్ట్ మాస్టర్ జనరల్ (పిఎంజి) కార్యాలయానికి వచ్చి తమ సమస్య సత్వరమే పరిష్కరించాలని ఒక మెమొరాండం ఇవ్వదలిచారు. వారికి సంఘీభావం తెలపడానికి, మాట్లాడడానికి నేనక్కడికి వెళ్లాను. మొదట అధికారులు ఈ కార్మికులను పిఎంజి కార్యాలయ ఆవరణలోకి ప్రవేశించడానికి అనుమతించబోమన్నారు. తమ కార్యాలయంలోకి తాము వెళ్లడానికి కార్మికులకు అనుమతి లేని మహత్తర ప్రజాస్వామ్యం మనది! ఆ ప్రవేశానుమతి దొరకని మూడు నాలుగు వేల మంది కార్మికులను నాయకత్వం గాంధీ భవన్ లోకి తీసుకువెళ్లింది. సమ్మెకు పిలుపు ఇచ్చిన యూనియన్లలో కాంగ్రెస్ అనుబంధ ఐ ఎన్ టి యు సి కూడ ఉంది గనుక గాంధీ భవన్ ఆవరణలో వాళ్లను అనుమతించారు.
కాని అక్కడికి చేరినాక, నాయకత్వాలు ఏమన్నా సరే, అధికారుల అనుమతి నిరాకరణలను నాయకత్వాలు అంగీకరించినా సరే, పి ఎం జి కార్యాలయాన్ని ముట్టడించవలసిందే అని అక్కడ చేరిన కార్మికుల సమరశీల నినాదం పెల్లుబికింది. మర్యాదలు గుర్తు చేస్తున్న నాయకులను, అడ్డుకుంటున్న పోలీసులను ప్రతిఘటిస్తూ కడుపు కాలిన గ్రామీణ్ డాక్ సేవక్ లు రోడ్డున పడ్డారు. గాంధీ భవన్ నుంచి ఆబిడ్స్ దాకా కదం తొక్కారు. మోడీ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు, న్యాయం కావాలనే నినాదాలు మిన్ను ముట్టాయి. మొదట కొన్ని వందల మంది లోపలికి ప్రవేశించాక, ఇంకా వస్తున్న కార్మిక ప్రభంజనాన్ని చూసి అధికారులు పి ఎం జి కార్యాలయ గేట్లు మూసేశారు. గేటు ముందే కొద్దిసేపు ప్రదర్శన జరిపిన కార్మికులు అధికారుల, ప్రభుత్వాల కళ్లు తెరిపించడానికన్నట్టు మొజంజాహి మార్కెట్ – ఆబిడ్స్ ప్రధాన రహదారిని అడ్డుకున్నారు. అటూఇటూ రోడ్డుకు అడ్డం పడ్డారు. దాదాపు గంట సేపు ట్రాఫిక్ జాం అయిన తర్వాత పిఎంజి కార్యాలయ గేట్లు తెరుచుకున్నాయి. కార్మికులందరినీ లోపలికి అనుమతించడం మాత్రమే కాదు, అధికారులు తమ చాంబర్ల నుంచి బైటికి వచ్చి కార్మికుల మెమొరాండం స్వీకరించారు....
Keywords : పోస్టాఫీసు, గ్రామీణ్ డాక్ సేవక్, అబిడ్స్, ధర్నా, హైదరాబాద్, postoffice, GPO, grameen dak sevak, agitation, abids, hyderabad
(2024-04-24 20:25:58)
No. of visitors : 1210
Suggested Posts
0 results