హిట్లర్ నిజంగానే తిరిగొచ్చాడు!!
తన శిష్యులు అన్ని రకాలుగానూ తనను మించిపోతున్నందుకు గురువు అడాల్ఫ్ హిట్లర్ సమాధిలో చాల సంతోషిస్తూ ఉండి ఉంటాడు!!
నిజంగానే హిట్లర్ శిష్యులు నిస్సిగ్గుగా హంతకుల మీద, నేరస్తుల మీద కేసులు ఉపసంహరించుకుంటున్నారు. మూడువందల యాబై సంవత్సరాల కింది దళిత నాయకుడి సమాధిని నేలమట్టం చేయడం, జనవరి 1న భీమా కోరేగాం ఉత్సవాలకు వెళుతున్న ఊరేగింపు మీద దాడి చేసి ఒక దళితుడిని చంపడం వంటి దాడి, దొమ్మీ, విధ్వంసం, హత్య నేరాలపై విచారణను ఎదుర్కొంటున్న నేరస్తుల మీద కేసులు ఉపసంహరించుకున్నారు. అలా తమ సొంత నేరాల మీద ముసుగు కప్పడం చాలనట్టుగా, హిట్లర్ శిష్యులు మరొక అడుగు ముందుకు వేసి, భీమా కోరేగాం యాత్రకు ముందు జరిగిన సభలో పాటల మీద, ఉపన్యాసాల మీద మొత్తం నెపం నెడుతున్నారు. రోజురోజూ మరింత మసాలా దట్టించడానికి అబద్ధపు ఉత్తరాలూ కథలూ సృష్టిస్తున్నారు.
అయితే విచిత్రమేమంటే, ఆ సభలో ఏ పాట మీద వాళ్లు అభ్యంతరం చెపుతున్నారో, ఏ పాటను నేరంగా అభివర్ణిస్తున్నారో, వాస్తవంగా ఆ పాట సరిగ్గా హిట్లర్ పాలనాకాలంలో నాటక రచయిత బెర్టోల్ట్ బ్రెహ్ట్ రాసిన ʹది గుడ్ ఉమన్ ఆఫ్ సెజువాన్ʹ అనే నాటకంలోని ఒక సంభాషణా శకలమైన కవితకు మరాఠీ అనువాదం!
భీమా కోరేగాం కేసులో ప్రాసిక్యూషన్ వారు ఉటంకించిన ఆ మరాఠీ అనువాదం ఇలా ఉంది:
జబ్ జుల్మ్ హో తో బగావత్ హోనీ చాహియే షహర్ మే
జబ్ జుల్మ్ హో తో బగావత్ హోనీ చాహియే షహర్ మే,
ఔర్ అగర్ బగావత్ న హో తో, బెహతర్ హై కీ, రాత్ ఢలానే సె పెహలే
యే షహర్ జల్ కె రాఖ్ హో జాయే, యే షహర్ జల్ కె రాఖ్ హో జాయే...
శనివార్ వాడ సభలో సుధీర్ ధావ్లె పాడాడని ప్రాసిక్యూషన్ ఆరోపిస్తున్న ఈ పాటను, 1942లో జర్మన్ లో బ్రెహ్ట్ రాసిన, ఆ తర్వాత ఇంగ్లిష్ లోకి అనువాదమైన కవితాపాదాలతో పోల్చి చూడండి.
**
షెన్ టె: .... అంటే మీరెవరూ ఏ జరిగిందో చెప్పదలచుకోలేదా? పట్టపగలు ఆయన చెయ్యి విరగ్గొట్టారు, మీరందరూ కళ్లారా చూస్తున్నారు, కాని ఒక్కరూ మాట్లాడడానికి ముందుకు రావడం లేదు! (కోపంగా)
విచారం నిండిన మనుషుల్లారా!
ఇక్కడ మీ తోబుట్టువు మీద దాడి జరిగింది,
మీరు కళ్లు మూసుకుని ఉన్నారు!
ఆయనను కొట్టారు, ఆయన గగ్గోలు పెట్టి ఏడుస్తున్నాడు,
మీరేమో పెదవి విప్పడం లేదు?
ఒక్కొక్క ఎరనూ వెతుక్కుంటూ రాక్షసి తిరుగాడుతున్నది,
మీరేమో రాక్షసి మమ్మల్ని పట్టుకోదులే,
మేం మా అసమ్మతి తెలపలేదుగా అంటున్నారు.
ఏమి నగరమిది, ఏమి లోకమిది, ఏమి మనుషులు మీరు?
అన్యాయం జరిగినప్పుడు లోకం ఒక్కటై లేచి తిరగబడాలి
అలా తిరుగుబాటు జరగలేదా,
రాత్రి ముసిరేలోపల ఈ నగరం తగలబడిపోవడం మేలు...
**
ʹపది అంకాల నీతికథʹ అనే పేరుతో బెర్టోల్ట్ బ్రెహ్ట్ రాసిన ఈ డర్ గుటె మెంష్ వా సెజువాన్ అనే నాటకం 1943లో రూపొంది, 1953లో తొలిసారి ప్రచురణ అయింది. ఈ నాటకానికి ది గుడ్ పర్సన్ ఆఫ్ సెజువాన్ అనీ, ది గుడ్ సోల్ ఆఫ్ సెజువాన్ అనీ, ది గుడ్ వుమన్ ఆఫ్ సెజువాన్ అనీ వేరువేరు ఇంగ్లిష్ అనువాదాలున్నాయి.
హిట్లర్ కాలం నాటి నిర్బంధాలను, ఆంక్షలను తప్పించుకోవడానికి ఈ నాటకంలోని కథాస్థలం చైనా అనీ, కాలం రెండు ప్రపంచ యుద్ధాల మధ్య కాలం అనీ చెప్పుకున్నారు గాని అది హిట్లర్ కాలం నాటి జర్మన్ సమాజ విలువలను చిత్రించింది. నిరుపేదరాలైనా, మంచి మనసున్న వేశ్య షెన్ టె ఈ నాటకపు కథానాయిక. ముగ్గురు దేవతలకు ఆశ్రయ6 ఇచ్చి వాళ్ల నుంచి డబ్బు కానుక పొందుతుంది. ఒక పొగాకు దుకాణం పెడుతుంది గాని ఆమె మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఆమెను అందరూ మోసం చేస్తుంటారు. వ్యాపారాన్ని రక్షించుకోవడానికి ఆమె షుయి టా అనే పురుష అవతారం ఎత్తి, తన దగ్గర కొనుగోలుదారుల నుంచి రావలసినది రాబట్టుకుంటుంది. దానితో కోపం వచ్చిన కొనుగోలుదారులు షెన్ టె ను షుయి టా చంపి, ఆమె వ్యాపారం కొల్లగొట్టాడని న్యాయస్థానానికి వెళ్తారు. చివరికి న్యాయస్థానంలో షెన్ టె తానే షుయి టా నని చెపుతుంది.
- ఎన్. వేణుగోపాల్ (ఎడిటర్, వీక్షణం)
Keywords : సుధీర్ ధావ్లె, బెర్టోల్ బ్రెహ్ట్, జర్మన్, ది గుడ్ ఉపన్ ఆఫ్ సెజువాన్, భీమా కోరేగావ్, పూణే పోలీసులు, రిమాండ్ డైరీ, sudheer dhavle, bhima koregaon, song,
(2024-04-24 19:16:16)
No. of visitors : 1228
Suggested Posts
0 results