రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
రాజద్రోహానికి పాల్పడకపోతే ప్రజా ద్రోహం చేసినట్లే
తితిలీ తుపాను బాధితులకు సంఘీభావంగా ప్రచురించిన ʹరాజద్రోహʹ కరపత్రాన్ని ఓన్ చేసుకుందాం
ఈ కింద ఉన్న కరపత్రాన్ని చూడండి. ఉత్తరాంధ్రలో తితిలీ తుపాను బాధితుల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని విమర్శిస్తూ దీన్ని ఆంధ్రప్రదేశ్లోని ప్రజాసంఘాలు ప్రచురించాయి. మానవతా దృష్టితో బాధితులకు ప్రజలు అందించిన బియ్యం పంచేందుకు వెళ్లిన ప్రజా సంఘాల నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. బియ్యం పంచి ప్రజలను ప్రలోభాలకు లోను చేస్తున్నారని వాళ్లపై పబ్లిక్ సెక్యూరిటీ యాక్ట్ కింద కేసు పెట్టారు. అంతటితో ఆగక ఈ కరపత్రంలో ప్రభుత్వ వ్యతిరేక భావాలు ఉన్నాయని రాజద్రోహ నేరం కేసు కూడా పెట్టారు.
మిగతా విషయాలు మళ్లీ మాట్లాడుకుందాం.
తుపాను గోడు వినడానికి వెళ్లిన ప్రజా సంఘాల నాయకులు, కార్యకర్తలు బాధితులను ప్రలోభాలకు గురి చేస్తారని పోలీసులు ఇంత నిస్సిగ్గుగా ఎలా అనగలుగున్నారు? బాధితులకు న్యాయమైన పరిహారం ఇవ్వమని అనడమే ప్రజా భద్రతకు ముప్పు ఎట్లా వాటిల్లింది? ఒక కరపత్రం అచ్చేసి ప్రచారం చేయడమే రాజద్రోహం ఎలా అయింది? సర్వం కోల్పోయిన వాళ్లకు కాసిని బియ్యం ఇవ్వబోవడం రాజద్రోహం ఎలా అయింది?
ఇలా కావడం కూడా మంచిదే.
ఈ రాజ్యం నిత్యం ఎంత భయంతో బతుకీడుస్తున్నదో బట్టబయలైంది. తుపాను బాధితులకు సాయం చేయమని కోరడం కూడా ఈ నేరమయ రాజ్యంలో రాజద్రోహమైంది. ఆ పని మీరు చేయలేకుంటే మా శక్తి మేరకు మేం బాధితులకు సాయం చేస్తామని ప్రజాసంఘాలు ముందుకు రావడం ప్రమాదకరంగా మారిపోయింది. దీనికి సాక్ష్యం ఈ ʹరాజద్రోహʹ కరపత్రం. దీన్ని అచ్చేసి పంచిన సోదర ప్రజాసంఘాల నాయకులు, కార్యకర్తలే కాదు, మనమందరం ఈ కరపత్రాన్ని ప్రజలకు పంచిపెడదాం. దీన్ని రాయడం, అచ్చేయడం, పంచిపెట్టడమే నేరమయ్యేటట్లయ్యేయితే ఆ రాజద్రోహానికి వ్యక్తిగతంగా మనమందరం సిద్ధమవుతాం. అందులోని భావాలు మా అందరివీ అని చాటిచెబుదాం. ఆలోచనలే నేరమయ్యేట్లయితే రాజద్రోహపూరిత ఆలోచనలే చేస్తామని ప్రకటిద్దాం. అక్రమ కేసుల్లో జెయిలులో ఉన్న ప్రజాసంఘాల కార్యకర్తలకు సంఘీభావంగా మనమంతా బాహాటంగా రాజద్రోహానికి పాల్పడదాం.
వరుస తుపానులుగా కనిపించే ప్రకృతి విపత్తు పాలకుల విధ్వంసకర రాజకీయార్థిక విధానాల పర్యవసానం. లాభాల వేటలో మానవ శ్రమను, భూమండలాన్ని, ప్రకృతిని కొల్లగొడుతున్న పెట్టుబడి దుర్మార్గాల పర్యవసానమే తుఫానులు వగైరా. ఈ రాజ్యం ప్రజా శతృవే కాదు, పర్యావరణానికీ శతృవే. పైగా తుఫానులొస్తే మేమేం చేస్తామని నిస్సిగ్గుగా ఈ ప్రభుత్వం తప్పించుకుంది. సర్వం కోల్పోయిన ప్రజలను నిర్లక్ష్యంగా వాళ్ల చావుకు వాళ్లను వదిలేసింది. ప్రజాద్రోహానికి పాల్పడింది. మనం ప్రజల పక్షాన నిలబడదాం. ఇదే రాజద్రోహమయ్యేటట్లయితే అభ్యంతరమెందుకు..? రండి రాజద్రోహం చేద్దాం.
- పాణి
కింద.. తితిలీ బాధితుల సంఘీభావ కరపత్రం
తితిలీ తుఫాను ఉద్దానం ప్రజల పాలిట పెనువిషాధం
గోరుచుట్టుపై రోకలిపోటులా ప్రభుత్వ విధానాలు
ప్రియమైన ప్రజలారా!
శ్రీకాకుళం జిల్లాలో తూర్పు తీరాన ఉన్న ఉద్దానం ఒకనాటి ఉద్యానవనం. ʹసిరులు కురిపించే సింగారవనంగా... బ్రతుకు పోరులోన బంగారు వనంగా పచ్చని జీడి, మామిడి, ముని, మునగ, అరటి వంటి ఫలసాయమైన తోటలతో కళకళలాడేది. పశు పక్షాదులతో రమణీయమైన ప్రకృతి సంపదతో విరాజిల్లేది. ఇలాంటి ఉద్దానం అక్టోబర్ 11వ తేదీన వచ్చిన తితిలీ తుఫాను ఫలితంగా కనీ, వినీ ఎరుగని రీతిలో విధ్వంసమైంది. 13 మండలాలలో ప్రకృతి విలయతాండం చేయడంతో ఒక్కసారిగా ఉద్దానం మరుభూమిగా మారిపోయింది.
మన పూర్వీకులు, తాతలు, తండ్రులు కష్టించి, పెంచి మన జీవితానికి భరోసాగా అందించిన జీడి, మామిడి, కొబ్బరి, పనస, మునగ వంటి పంటలు నేలకొరిగి మన జీవితాలను అంథకారంలోకి నెట్టివేసింది. సమస్త వృక్ష సంపద నేలమట్టమై ఎండిన కొమ్మలతో ఇరిగిన మొదళ్లతో కుప్పకూలిపోయింది. పశు పక్షాదులకు సైతం నిలువనీడలేక పల్లెలన్నీ ఇసుక దిబ్బలుగా మిగిలిపోయాయి. మన జీవనాధారమైన ఈ పంటలు కోల్పోవడంతో సుమారు 20 సంవత్సరాల భవిష్యత్తును కోల్పోయాం. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వ సహాయం కంటి తుడుపు చర్యగా కనిపిస్తోంది. ప్రభుత్వం హెక్టారుకు 30 వేలు నష్టపరిహారం అందిస్తామని చెప్పడం అత్యంత దారుణం. కొబ్బరిచెట్టుకు 1500 ప్రకటించడం రైతన్నను అవమానించడమే. ఈ నష్టపరిహారంతో చెట్లను తొలిగించి చదును చెయ్యడానికి కూడా సరిపోదు.
రెండు పశువుల షెడ్ నిర్మాణానికి ప్రభుత్వ లెక్కల ప్రకారం ఒక లక్ష ఖర్చవుతుంది. మరి ప్రభుత్వం ప్రకటించిన కేవలం రూ.10,000/-లతో ఎలాంటి నిర్మాణం జరుగుతుంది? ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రైతులకు స్పష్టమైన హామీని ఇవ్వకుండా ఈ ఉద్దానంలో జెట్టి కడతాం. రెడీమేడ్ దుస్తుల కంపెనీ పెడతాం అని చెప్పడం అంటే మన భూములను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టడానికి కుట్ర పన్నుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే కోస్టల్ కారిడార్ పేరుతో తీర ప్రాంత భూములన్నీ బహుళజాతి కంపెనీలకు దారాదత్తం చేస్తున్నారు. ఈ పరిస్థితులంతా చూస్తుంటే ఈ తుఫానుకు మించిన మరో పెను తుఫాన్ నిశ్శబ్దంగా ముంచుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి.
ఒక పక్కు కిడ్నీ జబ్బులతో, మరోపక్క అప్పులతో కుదేలైన మన పల్లెలు తితిలీ తుఫాను మిగిల్చిన పెను విషాదంతో అప్పుడే ఆత్మహత్యలు మొదలయ్యాయి. పొట్టచేత పట్టుకుని సమస్త పల్లెలు వలసలకు సిద్ధమైన పరిస్థితి కనిపిస్తోంది. తీర ప్రాంతంలో ఆస్తి నష్టం విపరీతంగా జరిగింది. వలలు చిద్రమయ్యాయి. తెప్పలు, పడవలు విరిగి ముకలయ్యాయి, ఇల్లులు కూలిపోయి మత్స్యకారులు నిరాశ్రయులై శోకసముద్రంలో మునిగిపోయారు. సముద్రాన్ని నమ్ముకొని బతుకుతున్న ఆ గంగపుత్రులకు వేటకు వెళ్లే కాశం లేక పస్తులతో గడిపే పరిస్థితి దాపురించింది. కనీస అవసరాలైన ఆహారం, నీరు, నీడ కరువై బిక్కుబిక్కుమంటూ చీకటిలో ఉండిపోయారు. ఇలాంటి పరిస్థితులలో మనమంతా సంఘటితమై పోరాటం చేయకపోతే జీవించే హక్కును కోల్పోతాం. మనకోసం, మన భవిష్యత్ తరాలకోసం ప్రజలు, ప్రజాస్వామికవాదులు, బుద్ధిజీవులు, కవులు, కళాకారులు కలసి తితిలీ తుఫాను బాధితుల సంఘీభావ కమిటీగా మీ ముందుకు వచ్చింది. వారితో కలసి ప్రయాణిద్దాం. మన న్యాయమైన డిమాండ్లకోసం పోరాటం చేద్దాం. మన బతుకుల భరోసాకోసం పాలకులను ప్రశ్నిద్దాం, ప్రతిఘటిద్దాం!!
డిమాండ్స్
1.ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు ప్రభుత్వమే నిర్మించి ఇవ్వాలి.
2. తక్షణమే ప్రతి కుటుంబానికి ఒక లక్ష రూపాయలు పరిహారం చెల్లించాలి. దళిత, ఆదివాసీలకు తక్షణమే 2లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలి.
3. జీడి, కొబ్బరి ఎకరాకు సంనకు ఒక లక్ష రూపాయలు చొప్పన 10 సంవత్సరాలపాటు నష్టపరిహారం చెల్లించాలి.
రైతు, డ్వాక్రా మహిళల రుణాలను వెంటనే రద్దుచేయాలి.
4. భూమిలేని రైతు కూలీలకు ఒక లక్ష రూపాయలు సహాయం అందించాలి.
5. అన్ని కుల వృత్తులు వారికి 60 వేల రూపాయలు సహాయమందించాలి.
6. యాభై సంవత్సరాలు దాటిని ప్రతి రైతుకు 5 వేలు రూపాయలు నెలవారీ పెన్సన్ అందించాలి.
7. తీరప్రాంత భూములకు నష్టపరిహారం చెల్లించాలి. సాగుచేస్తున్న రైతులకు వెంటనే పట్టాలు ఇవ్వాలి.
8. ప్రతి రైతుకు బీమా కల్పించాలి.
9. ఉచిత బోరు బావులు వేయించి, మొక్కలు పెంపకం బాధ్యతను ప్రభుత్వమే తీసుకోవాలి.
10. నష్టపోయిన వలలు, బోట్లుగల మత్స్యకార కుటుంబాలకు వెంటనే పలలు, బోట్లు మంజూరు చెయ్యాలి.
11. సంవత్సరం పాటు ప్రతి కుటుంబానికి విద్యుత్, గ్యాస్ ఉచితంగా సరఫరా చేయాలి.
12. ఉపాధి హామీ పథకం క్రింద సంవత్సరం పాటు ఉపాది పని కల్పించాలి.
తితిలీ బాధితుల సంఘీభావ కమిటీ, శ్రీకాకుళం జిల్లా
Keywords : tithli, srikakulam, andhrapradesh, police case
(2024-04-24 18:56:25)
No. of visitors : 1363
Suggested Posts
| 50 వసంతాలు పూర్తి చేసుకున్న శ్రీకాకుళ రైతాంగ సాయుధ పోరాటానికి విప్లవ జేజేలు!1969, మే 27న మొట్టమొదటి బూటకపు ఎన్ కౌంటర్ జరిగింది. ఆ ఎన్కౌంటర్ లో ఆరుగురు కామ్రేడ్స్ పంచాది కృష్ణ మూర్తి, తామాడ చినబాబు, బైనపల్లి పాపారావు, దున్న గోపాల్ రావు, రామచంద్ర ప్రధానో, నిరంజన్ సాహు, శృంగవరపు నర్సింహ మూర్తి అమరులయ్యారు.
|
| చితాభస్మంలోంచి రెక్కవిప్పే విప్లవ విహంగం...సత్యం చావడు, సత్యం చావదుసరిగ్గా యాబై సంవత్సరాల కింద ఈ రోజున శ్రీకాకుళ విప్లవోద్యమ నిర్మాతలు, భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు – లెనినిస్టు) కేంద్ర కమిటీ సభ్యులు వెంపటాపు సత్యనారాయణ, ఆదిభట్ల కైలాసంలను పోలీసులు కాల్చిచంపారు. |
| శ్రీకాకుళం జిల్లా జైలు - వెట్టిచాకిరీకి నిలయంఖైదీల కిచెన్ హాల్, అధికారుల కిచెన్ హాల్ వేరు వేరుగా ఉండడం వల్ల అధికారులకు రోజు విందు భోజనాలు, ఖైదీలకు మాత్రం పశువులు కూడా తినని ఆహారం పెడుతున్నారు. ఇంటర్య్వూ సమయంలో బంధువులు తెచ్చిన తినే వస్తువులు కూడా అడ్డగిస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే లాఠీదెబ్బలే కాక, సింగిల్ లాకాప్లో మాగ్గాల్సిందే. జైళ్లో పేషెంట్లు సైతం స్వెట్టర్లు, చెప్పులు వేసుకోవడానికి అనుమ |
| సీనియర్ విప్లవ కమ్యూనిస్టు నాయకురాలు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మకు విప్లవ జోహార్లు!సీనియర్ విప్లవ కమ్యూనిస్టు, శ్రీకాకుళోద్యమ యోధురాలు కామ్రేడ్ పైలా చందమ్మ గారు ఈరోజు (23-9-2020) రాత్రి 7 గం. కు విశాఖలో అమరులయ్యారు. ఆమె గత కొద్ది రోజులుగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. |
| సూదికొండను కాపాడుకుందాం - ప్రజల జీవించే హక్కుకై పోరాడదాంశ్రీకాకుళం జిల్లా పలాస, కాశిబుగ్గ జంటనగరాల జీవన సమతుల్యన్నీకాపాడుతున్న చారిత్రాత్మక భూభాగం సూదికొండ (నెమలికొండ) ను నాశనం చేస్తున్నారు పాలకులు. కొందరు పెద్దల లాభాల కోసం పర్యావరణాన్ని, |
| చెదరని విశ్వాసం... సడలని ఆచరణ... శ్రీకాకుళ పోరాట పంథాలో కా. చంద్రమ్మ యాభై ఏళ్లుగా మడమ తిప్పని విప్లవాచరణకు ప్రతిరూపం కా. చంద్రమ్మ. విప్లవంలో ఆమె నిండు జీవితాన్ని గడపడం గర్వకారణం. కరోనా బారిన పడి అమరురాలు కావడం విషాదం. శ్రీకాకుళ పోరాట పంథాలో చంద్రమ్మ వెనుతిరిగి చూడలేదు. |